లైసెన్సు లేకుండా నడిపితే.. 5వేల ఫైన్!
మోటారు వాహనాల చట్టం వసరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. దీని ప్రకారం ఇప్పటివరకు ఉన్న జరిమానాలన్నీ భారీగా పెరిగిపోనున్నాయి. లైసెన్సు లేకుండా వాహనాలు నడిపేవారికి ఇంతకుముందు రూ. 500 జరిమానా విధిస్తుండగా అది 5 వేలకు చేరుకుంది. అలాగే డ్రంకెన్ డ్రైవింగ్కు గతంలో రూ. 2వేల జరిమానా విధిస్తే, ఇప్పుడది రూ. 10 వేలకు పెరిగింది. హెల్మెట్ లేకపోతే గతంలో వంద రూపాయలు కడితే సరిపోయేది. ఇప్పుడు వెయ్యి కట్టడంతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ కూడా సస్పెండవుతుంది. ప్రయాణికులను ఓవర్లోడింగ్ చేస్తే, ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున కట్టాలి. మైనర్లు వాహనం నడిపినప్పుడు ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే, వాళ్ల తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. అలాగే బాధితుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పదిరెట్లు పెంచారు.
థర్డ్ పార్టీ బీమా, టాక్సీ సంస్థల నియంత్రణ, రహదారి భద్రత లాంటి పలు అంశాలపై కూడా ఈ కొత్త బిల్లు స్పష్టతనిస్తుంది. కొత్త చట్టం ప్రకారం మోటారు వాహన ప్రమాదాల్లో థర్డ్ పార్టీ బాధ్యత అపరిమితం అవుతుంది. ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 5 లక్షల చొప్పున చెల్లించాలి. రోడ్డు మీద నడిచే అన్ని వాహనాలకు తప్పనిసరిగా బీమా ఉండాలని నిర్దేశిస్తోంది. పిల్లలు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులు, గార్డియన్లను బాధ్యులుగా చేస్తోంది. దాంతోపాటు.. వాహనం రిజిస్ట్రేషన్ను కూడా రద్దు చేస్తున్నారు.