అందరికీ నాణ్యమైన విద్య అందాలి
అమీర్పేట: ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరముందని ప్రముఖ క్రికెటర్, ప్రాజెక్ట్ 511 బ్రాండ్ అంబాసిడర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. అమీర్పేట్ మ్యారీగోల్డ్ హోటల్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ రౌండ్ టేబుల్–8 (హెచ్ఆర్టీ) సంస్థ ప్రాజెక్ట్ 511 పేరుతో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో సామగ్రి అందజేశామని చెప్పారు.
పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించినప్పుడే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. నిర్మాత డి.సురేష్బాబు మాట్లాడుతూ... దాన్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో అక్టోబర్ 9న నిర్వహించనున్న ‘ఫుడ్ ఫర్ ఛేంజ్’ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే నిధులను ప్రాజెక్ట్ 511కు వెచ్చించనున్నట్లు చెప్పారు. ‘ఫుడ్ ఫర్ ఛేంజ్’ కోసం 64 డిషెస్, 242 వంటకాలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెచ్ఆర్టీ–8 సంస్థ చైర్మన్లు నామాల శ్రీనివాసన్, హతిక్గుప్తా తదితరులు పాల్గొన్నారు.