breaking news
EAMCET engineering counseling
-
ప్రశాంతంగా ఎంసెట్ కౌన్సెలింగ్
నెల్లూరు(టౌన్): ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. దర్గామిట్టలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 291మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. 100 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 284 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. 52 మంది విద్యార్థులు ఆప్షన్లను ఎంపిక చేసుకున్నారు. శుక్రవారం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 50,001 నుంచి 57,500 ర్యాంకు వరకు, ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 57,501 నుంచి 65000 ర్యాంకు వరకు సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్లుగా కళాశాలల ప్రిన్సిపళ్లు నారాయణ, రామమోహన్ వ్యవహరించారు. -
సాక్షి - ఎస్.వి.సి.ఈ.టి. మాక్ ఎంసెట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఇంజినీరింగ్, మెడిసిన్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో త్వరలో మాక్ ఎంసెట్ జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12న ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సాక్షి మాక్ ఎంసెట్ నిర్వహించనుంది. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) చిత్తూరు.. ఈ మాక్ ఎంసెట్కు ప్రధాన స్పాన్సర్గా, సెంట్రల్ ఆంధ్రా రీజినల్ స్పాన్సర్గా నలందా ఇన్స్టిట్యూట్ ఆ్ఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (గుంటూరు) వ్యవహరిస్తుంది. మే నెలలో జరుగనున్న ఎంసెట్కు సరిగ్గా నెల రోజు ముందు సాక్షి నిర్వహించనున్న ఈ మాక్ ఎంసెట్ ద్వారా విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవడమే కాకుండా.. తమ ప్రతిభను పెంపొందించుకోవచ్చని ప్రశ్న పత్రాలను తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ప్రిపరేషన్ను మరింత మెరుగు పరుచుకునేందుకు వీలవుతుంది. దీంతో పాటు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మెరుగైన ప్రతిభ చూపిన మొదటి 10 ర్యాంకర్లకు నగదు బహుమతులుంటాయి. సాక్షి మాక్ ఎంసెట్కు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 2లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను మార్చి 12 నుండి ఎంపిక చేసిన సాక్షి కార్యాలయాల్లో స్వీకరిస్తున్నారు. దరఖాస్తు వెల రూ.75 తో పాటు రెండు పాస్పోర్టు సైజు ఫోటోలు తీసుకుని వస్తే వెంటనే హాల్ టిక్కెట్ పొందొచ్చు. -
తప్పెవరిది..శిక్ష ఎవరికి?
ఇంజినీరింగ్ కౌన్సిల్పై నేడు ‘సాక్షి’ చర్చావేదిక వేదిక: సెనేట్హాల్, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ సమయం: ఉదయం 11 గంటలు యూనివర్సిటీ క్యాంపస్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలిం గ్లో భారీగా సీట్లు మిగిలిపోవడం, రెండో విడత కౌన్సెలింగ్కు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఎంసెట్ ఉత్తీర్ణత సాధించి, సీటు వచ్చే అవకాశం ఉన్నా తాజా పరిణామాలతో బెంబేలెత్తుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బాసటగా నిలిచేందుకు ‘సాక్షి’ ముందుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితులకు దారితీసిన కారణాలు-పరిష్కారాలపై, ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు అనుసరించాల్సిన విధానాలపై ‘సాక్షి’ చర్చా వేదికలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్లో గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించే సదస్సులో ప్రముఖ విద్యావేత్తలు విద్యార్థులకు తగు సూచనలు, సలహాలు ఇస్తారు. వక్తలు: ప్రొఫెసర్ ఉదయగిరి రాజేంద్ర - వైస్చాన్సలర్ ఎస్వీయూనివర్సిటీ, ప్రొఫెసర్ సి.ఈశ్వరరెడ్డి- శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ డెరైక్టర్, ప్రొఫెసర్ ఆర్వీఎస్.సత్యనారాయణ- ఎస్వీయూ ప్లేస్మెంట్ ఆఫీసర్, ప్రొఫెసర్ జీఎన్.ప్రదీప్కుమార్-ఎస్వీయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం, డాక్టర్ హుమేరాఖాన్-ఎస్వీయూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం, ఎస్.రవీంద్రనాథ్ - పరిపాలనాధికారి, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల (సి.గొల్లపల్లె). -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్పై నేడు ‘సాక్షి’ సదస్సు
సాక్షి,హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో భారీగా మిగిలిన సీట్లు.. రెండో విడత కౌన్సెలింగ్కు అనుమతించని సుప్రీంకోర్టు... దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎంసెట్లో ఉత్తీర్ణత సాధించి, సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బాసటగా నిలిచేందుకు ‘సాక్షి’ ముందుకొస్తోంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో ప్రస్తుత పరిస్థితులకు దారి తీసిన కారణాలు, విద్యార్థుల భవిష్యత్తు కోణంలో చేపట్టదగిన చర్యలపై సోమవారం నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు ప్రముఖ విద్యావేత్తలు హాజరు కానున్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సమస్యలు - ప్రత్యామ్నాయాలతో పాటు, ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. సాక్షి సదస్సు వివరాలు.. తేదీ: సెప్టెంబర్ 22 (సోమవారం) సమయం: ఉదయం పదకొండు గంటల నుంచి.. వేదిక: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియం వక్తలు: ప్రొఫెసర్ తిరుపతి రావు, ఉస్మానియా విశ్వ విద్యాలయం మాజీ వైస్ చాన్స్లర్, చుక్కా రామయ్య - ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్- ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ హరగోపాల్ - ప్రముఖ విద్యావేత్త. -
సరైన బ్రాంచ్.. కాలేజీ ఎంపికకు మార్గదర్శకాలు..
ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆగస్టు 31లోగా కౌన్సెలింగ్ పూర్తిచేయాలంటూ సుప్రీంకోర్టు ఆగస్టు 4న ఆదేశాలు జారీచేసింది. మొత్తంమీద పరిస్థితులు ఎలా ఉన్నా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం వీలైనంత త్వరగా కౌన్సెలింగ్ పూర్తి కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరైన కాలేజీ, బ్రాంచ్ ఎంపికకు విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై స్పెషల్ ఫోకస్.. బ్రాంచ్ ఎంపికకు సూచికలు! అభిరుచి (Aptitude)ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంపికలో ప్రధానమైంది అభిరుచి. తుది నిర్ణయం విద్యార్థి ఆసక్తి, వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగానే తీసుకోవాలి. ఇంజనీరింగ్లో నాలుగేళ్ల కోర్సును పూర్తిచేశాక, వృత్తిగత జీవితం మొత్తం దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇంతటి కీలకమైన బ్రాంచ్ ఎంపిక చేసుకోవడంలో అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆసక్తి లేకుండా తల్లిదండ్రులు, స్నేహితులు చెప్పారనో లేదంటే ఉద్యోగావకావకాశాలు బాగుంటాయనో ఏదో ఒక బ్రాంచ్లో చేరితే కెరీర్లో తుది ఫలితం నిరాశాజనకంగా ఉంటుంది. సరైన కాలేజీ ఎంపికకు సూచికలు: మౌలిక వసతులు: విద్యార్థులు ప్రాక్టికల్స్ చేసేందుకు అవసరమైన లేబొరేటరీలు, గ్రంథాలయం, ఇంటర్నెట్ సౌకర్యం, ఆట స్థలం ముఖ్యమైనవి. వీటికి సంబంధించి ఇంజనీరింగ్ విద్యకు గుర్తింపునిచ్చే ఆలిండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటికి అనుగుణంగా ఆయా కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించాలి. బోధనా సిబ్బంది: విద్యార్థి భావి జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల్లో బోధనా సిబ్బంది (ఫ్యాకల్టీ) పాత్ర కీలకమైంది. బోధానా సిబ్బందిలో పీహెచ్డీ చేసిన వారు ఉన్నారా? వారి అనుభవం? ప్రస్తుతం ఎంత మంది పీహెచ్డీ చేస్తున్నారు? ట్రాక్ రికార్డు? వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశ్రమలతో అనుసంధానం: ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలుగా కాలేజీకి పరిశ్రమతో అనుసంధానం ముఖ్యం. ఇలాంటి అనుసంధానం ఉన్న కాలేజీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాంగణ నియామకాలు: చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరడానికి కారణం.. చదువు పూర్తయ్యేసరికి తమకు ఉద్యోగ ఆఫర్ లభిస్తుందనే. కాబట్టి కేవలం కోర్సు బోధనకే పరిమితం కాకుండా... ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణతోపాటు ప్లేస్మెంట్ సెల్ ఉన్న కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం మూడేళ్ల కాలంలో ఆ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది ప్రాంగణ నియామకాల్లో ఎంపిక అయ్యారు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని కాలేజీలు కేవలం ఒక్కరిద్దరు విద్యార్థులకు వచ్చిన అవకాశాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటాయి. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వివరాలను ఆ కాలేజీలో చదివిన సీనియర్ విద్యార్థుల ద్వారా తెలుసుకోవచ్చు. కో-కరిక్యులర్ - ఎక్స్ట్రా కరిక్యులర్ కార్యక్రమాలు: కాలేజీలు విద్యార్థి సమగ్రాభివృద్ధి కోసం దోహదపడేలా క్విజ్, ఎస్సే రైటింగ్, పేపర్ ప్రెజంటేషన్ వంటి కో-కరిక్యులర్ యాక్టివిటీస్తోపాటు గేమ్స్, కల్చరల్ ప్రోగ్రామ్లు, ఎన్ఎస్ఎస్ తరహా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కు కూడా ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసంతోపాటు ప్రెజంటేషన్ స్కిల్స్, ఆర్గనైజ్డ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషలైజేషన్ స్కిల్స్ వంటి ప్రస్తుత జాబ్ మార్కెట్కు అవసరమైన స్కిల్స్ మెరుగవుతాయి. కాబట్టి కాలేజీ ఎంపికకు సంబంధించి ఈ అంశానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఉన్నత విద్య: గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నచ్చిన స్పెషలైజేషన్లో పీజీ చేయడానికి ఉన్న అవకాశాలను విశ్లేషించుకోవాలి. కొన్ని బ్రాంచ్లకు సంబంధించిన స్పెషలైజేషన్లతో పీజీ చేసేందుకు తక్కువ అవకాశాలు అందుబాటులో ఉంటాయి.పరిశోధనల దిశగా వెళ్లాలనుకుంటే ఆ కోణంలోనూ ఉన్న అవకాశాలను బేరీజు ేసుకోవాలి.ఒకవేళ విదేశాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకుంటే అందుకు వివిధ దేశాల్లో ఉన్న అవకాశాలు, ఉపకారవేతనాలు తదితరాల గురించి తెలుసుకోవాలి. ఉద్యోగాలు: గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చేరినా, చివరకు కోరుకున్న కొలువును దక్కించుకోవడమే ప్రధానం. అందువల్ల బ్రాంచ్ ఎంపికలో అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఏ రంగాల్లో ఉద్యోగావకాశాలు బాగున్నాయో పరిశీలించడంతో పాటు భవిష్యత్లో ఆయా రంగాల పరిస్థితి ఎలా ఉంటుందన్నది కూడా విశ్లేషించుకోవాలి. దీనికోసం నాస్కామ్, సీఐఐ వంటి సంస్థల నివేదికలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు మౌలిక వసతుల రంగంలో ఉజ్వల భవిష్యత్తుకు అవకాశమున్న నేపథ్యంలో కోర్ బ్రాంచ్లైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్ల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వేతనాలు: ఉద్యోగానికి సంబంధించిన వేతనాలు వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయే తప్ప బ్రాంచ్పై కాదన్నది గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్లుకు మాత్రమే రూ.లక్షల ప్యాకేజీలతో వేతనాలు అందుతున్నాయనే భావన ఉంది. ఇది వాస్తవం కాదు. ఐటీ రంగంలో అందరికీ ఎక్కువ వేతనాలు ఉండవు. కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. అవకాశాలు అందిపుచ్చుకోవాలేగానీ మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జికల్ ఇలా వివిధ విభాగాల ఇంజనీర్లకు ఆకర్షణీయ వేతనాలు వచ్చే ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఏ బ్రాంచ్ వారైనప్పటికీ సంబంధిత రంగంలో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకొని, వ్యక్తిగత ప్రతిభ, శ్రమించే తత్వం ఉంటే మంచి వేతనాలు అందుతాయని కచ్చితంగా చెప్పొచ్చు. బ్రాంచ్ ఎంపికకు ఆసక్తి ప్రధానం.. కాలేజీ ఎంపికకు బోధనా సిబ్బంది, లేబొరేటరీలు కీలకం. మంచి నైపుణ్యాలున్న బోధనా సిబ్బంది, ప్రాక్టికల్ పరిజ్ఞానం సముపార్జనకు వీలుకల్పించే అధునాతన లేబొరేటరీలు ఉన్న కళాశాలలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి భవంతి ఉండి, అందులో సరైన బోధనా సిబ్బంది లేకపోతే అలాంటి కాలేజీ వల్ల ప్రయోజనం శూన్యం. కాలేజీ ఎంపికకు ప్రాంగణ నియామకాల తీరుతెన్నులను పరిశీలించడం కూడా ముఖ్యం. అవకాశాల పరంగా చూస్తే ఫలానా బ్రాంచ్ మంచిది? ఫలానా బ్రాంచ్ మంచిది కాదు? అని కచ్చితంగా చెప్పలేం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా ఉద్యోగావకాశాలకు కొదవలేదు. అయితే సంబంధిత రంగానికి సంబంధించి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. నైపుణ్యాల పరంగా సరిగా ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, ముందుకు సాగాలంటే బ్రాంచ్ను ఎంపిక చేసుకునేటప్పుడు ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. డాక్టర్ జె.సురేశ్కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, జేఎన్టీయూహెచ్.