breaking news
FDF funds
-
రక్షణ ‘ఫిక్స్డ్’.. రాబడి కాదు!
ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతో సురక్షితం. ఎక్కువ మంది ఇలానే భావిస్తుంటారు. రాబడి తక్కువే అయినా, భద్రత పాళ్లు ఎక్కువ కదా అన్న భరోసా వారిది. అందుకే ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గతంలో మాదిరి ఇప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లి డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా తప్పింది. ఉన్నచోట నుంచే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లోనూ డిపాజిట్ చేసుకోవడం, ఆన్లైన్లోనే రద్దు చేసుకోవడం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎఫ్డీ మరింత సౌకర్యవంతంగా మారిందని చెప్పుకోవాలి. ఒకవేళ బ్యాంకు సంక్షోభం పాలైనా.. రూ.5 లక్షల వరకు తిరిగి చెల్లించే ఆర్బీఐ ‘డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్’ ఉంది. కానీ, ఇవన్నీ నాణేనికి అనుకూల ముఖమే. రెండో వైపు తిప్పి చూస్తే.. అసలు ఫిక్స్డ్ డిపాజిట్లో రాబడి వస్తుందా..? ద్రవ్యోల్బణం, పన్ను పోను మిగిలేది ఎంత? అసలు ఇది మెరుగైన పెట్టుబడి సాధనమేనా..? ఈ అంశాలన్నీ చర్చించే కథనమే ఇది. ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) నుంచి తమ పెట్టుబడులను ఇతర సాధనాల వైపు మళ్లిస్తుండడాన్ని పరిశీలించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ వైపు వారు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలను గమనించాలి. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్లకు దూరంగా వెళ్లడానికి కారణాలను చూస్తే.. ఒకటి వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, రెండోది ఇన్వెస్టర్లలో వివిధ సాధనాలు, వాటిల్లోని రిస్క్, రాబడుల పట్ల పెరుగుతున్న అవగాహనే. ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్నో తరాల నుంచి నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఉంటూ వస్తోంది. కానీ, టెక్నాలజీ అందుబాటు, పెట్టుబడులకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచుతున్నాయి. దీంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లను మ్యూచువల్ ఫండ్స్ రాబడులతో పోల్చి చూసుకునే వారు పెరుగుతున్నారు. అందుకే ఇతర సాధనాలతో పోలిస్తే నేడు ఎఫ్డీలు అంత ఆకర్షణీయమైనవిగా ఇన్వెస్టర్లకు అనిపించడం లేదు. నికర రాబడి సున్నా.. ఏ రాబడికి అయినా ముందు చూడాల్సింది ద్రవ్యోల్బణమే. ఇది పోను మిగులు రాబడి ఎంత అన్నదే ఇన్వెస్టర్కు ప్రామాణికం అవుతుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వివిధ కాల వ్యవధుల ఆధారంగా 2.50 శాతం నుంచి గరిష్టంగా 7 శాతం వరకు ఉన్నాయి. కానీ, సెప్టెంబర్ నెలకు సంబంధించి వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్) 7.3 శాతంగా ఉంది. అంటే ఇంతకుమించి వడ్డీ రేటు ఉంటేనే అసలు రాబడి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. అంతెందుకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇలా చూసినా 7 శాతం వడ్డీనిచ్చే ఎఫ్డీపై నికర రాబడి 0.3 శాతమే అవుతుంది. మరింత వివరంగా చూస్తే.. ఏడాది ఎఫ్డీపై ఎస్బీఐ ఆఫర్ చేస్తున్న రేటు 5.65 శాతమే. అంటే ద్రవ్యోల్బణం కంటే ఒక శాతం తక్కువ. కెనరా బ్యాంకు, పీఎన్బీ బ్యాంకులు సైతం 5.5 శాతం రేటును ఇస్తున్నాయి. ప్రైవేటు రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులోనూ ఏడాది కాల ఎఫ్డీపై రేటు 5.75 శాతానికి మించి లేదు. రెండేళ్ల కాల వ్యవధికి చూసినా.. కెనరా బ్యాంకు 5.60 శాతం, యూనియన్ బ్యాంకు 5.45 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 6.50 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. మూడేళ్ల ఎఫ్డీలపై ఎస్బీఐ ఇస్తున్న రేటు 5.60 శాతం. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 6.50 శాతం, యాక్సిస్ బ్యాంకు 5.70 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఐదేళ్ల కాల ఎఫ్డీలపై ఎస్బీఐలో రేటు 5.65 శాతం ఉంటే, యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకులో 5.75 శాతం చొప్పున ఉంది. అంటే ఐదేళ్ల వరకు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు, ఆర్బీఐ అంచనా వేస్తున్న ద్రవ్యోల్బణ రేటు 6.7 శాతం కంటే తక్కువే ఉన్నాయి. అంటే ఈ మేరకు ఎఫ్డీపై నష్టపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇక పన్ను పరిధిలో ఉన్న వారికి ఎఫ్డీలతో మరింత నష్టమే అని చెప్పుకోవాలి. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే 7 శాతం ఎఫ్డీ రేటు రాబడి నుంచి పన్ను చెల్లించగా మిగిలే నికర రాబడి 4.9 శాతమే. ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉండడంతో నికరంగా 2 శాతం నష్టాన్ని ఎఫ్డీ రూపంలో తెచ్చుకున్నట్టు అవుతుంది. రక్షణ ఒక్కటే కాదు.. నిజానికి పెట్టుబడి ఏదైనా రక్షణ పాళ్లు ఎంతన్నది చూడాలి. కానీ, అదే సమయంలో రాబడి కూడా చూడాలి. అసలు రాబడి లేకుండా, రక్షణ ఉన్న సాధనం వల్ల ఒరిగేదేమి ఉంటుంది? ఎఫ్డీలు లిక్విడ్ సాధనం. అవసరమైనప్పుడు వేగంగా రద్దు చేసుకుని నగదుగా మార్చుకోవచ్చు. స్వల్పకాల అవసరం ఏర్పడితే అదే ఎఫ్డీపై రుణం (లోన్ ఎగైనెస్ట్ డిపాజిట్/ఓవర్డ్రాఫ్ట్) తీసుకోవచ్చు. అదే సమయంలో ఎఫ్డీలు ఒక్కటే లిక్విడ్ సాధనం అనుకోవడానికి లేదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా లిక్విడ్ సాధనాలే. మూడు రోజుల వ్యవధిలో నగదుగా మార్చుకోవచ్చు. డెట్ సాధనా ల్లో ద్రవ్యోల్బణం మించి రాబడి అందుకోవచ్చు. మూడేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణ ప్రభావం పోను మిగిలిన రాబడిపైనే పన్ను పడుతుంది. ఫండ్స్లో వైవిధ్యానికి చోటు కల్పించుకోవచ్చు. లక్ష్యానికి అనుగుణంగానే.. కాల వ్యవధికి అనుకూలమైన సాధనం ఎంపిక చేసుకోవడం పెట్టుబడికి కీలకం అవుతుంది. వ్యవధి మూడేళ్లకు మించి లేనప్పుడు ఈక్విటీలను ఎంపిక చేసుకోకపోవడమే సరైనది. 3–5 ఏళ్ల కాలానికి హైబ్రిడ్ పథకాలు, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ పథకాలు అనుకూలం. 5–10 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి లార్జ్క్యాప్, మిడ్క్యాప్ పథకాలు, ఈటీఎఫ్లు, ఈఎల్ఎస్ఎస్లు, 10 ఏళ్లకు మించిన దీర్ఘకాలం కోసం స్మాల్క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. మూడేళ్లలోపు అయితే రాబడి పెద్దగా లేకపోయినా డెట్ సాధనాలకే పరిమితం కావాలి. ఇక అత్యవసర నిధి అయితే ఎఫ్డీలు, లిక్విడ్ ఫండ్స్, లో డ్యురేషన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయాలు ఎఫ్డీలకు ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి. దీనికంటే ముందు ఎఫ్డీల్లో పెడుతున్న మొత్తం దేనికి ఉద్దేశించినది? అని ప్రశ్నించుకోవాలి. అత్యవసర నిధి అయితే ఎఫ్డీలలో పెట్టుకోవడం సరైనదే అవుతుంది. అత్యవసరం చెప్పి రాదు. ఏ సమయంలో అయినా వెంటనే వెనక్కి తీసుకోవడానికి వెసులుబాటుతో ఉండాలి. ఇక్కడ రాబడి ప్రామాణికం కాదు. కనుక ఎమర్జెన్సీ ఫండ్ను ఎఫ్డీలలో పెట్టుకోవచ్చు. అలాగే, ఏడాది కాలం కోసం కూడా ఎఫ్డీలను పరిశీలించొచ్చు. ఏడాదికి మించిన కాలవ్యవధి కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు.. భిన్న కాలాలతో కూడిన వైవిధ్యమైన డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఈక్విటీ కలగలిసిన హైబ్రిడ్ ఫండ్స్, ఈటీఎఫ్లు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఇవి ఏడాది నుంచి మూడేళ్ల కాల మనీ మార్కెట్, డెట్ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో సగటు వార్షిక రాబడి 7 శాతం స్థాయిలో ఉంటుందని ఆశించొచ్చు. ఇంతకంటే మెరుగైన రాబడులు, తక్కువ రాబడులకు అవకాశం లేకపోలేదు. ఎంపిక చేసుకునే పథకాల పనితీరు ఆధారంగా రాబడి ఉంటుందని మర్చిపోవద్దు. రెండు నుంచి మూడేళ్ల కాలానికి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. మీడియం టు లాంగ్ డ్యురేషన్ నాలుగు నుంచి ఏడేళ్ల కాల వ్యవధి కలిగి సాధనాల్లో పెట్టుబడులు పెడతాయి. వీటిల్లోనూ రాబడులు ఇంచుమించుగా మీడియం డ్యురేషన్ ఫండ్స్ స్థాయిలోనే ఉంటాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ ఏడేళ్లకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. చారిత్రక రాబడులు 6 శాతం నుంచి 18 శాతం మధ్య ఉన్నాయి. ఇవి గుర్తు పెట్టుకోవాలి.. డెట్ ఫండ్స్లో పెట్టుబడి, రాబడికి గ్యారంటీ ఉండదు. దీన్నే క్రెడిట్ రిస్క్ అంటారు. అంటే ఫండ్స్ తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయగా, ఆయా పత్రాలకు సంబంధించి తిరిగి చెల్లింపులు జరగకపోవడం. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, అస్థితరల్లో వడ్డీ రేట్ల రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లిక్విడిటీ రిస్క్ కూడా ఎదురుకావచ్చు. నాణ్యమైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో లిక్విడిటీ రిస్క్ దాదాపుగా ఉండదనే చెప్పుకోవచ్చు. కానీ, రాబడి కోసం రిస్క్ తీసుకుని డెట్లో పెట్టుబడులు పెట్టడం కంటే.. ఈక్విటీలను ఆశ్రయించడం మెరుగైన మార్గం అవుతుంది. ఎందుకంటే ఎలానూ రిస్క్కు సిద్ధ పడ్డాం కనుక, ఈక్విటీల్లో మెరుగైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. ఆయా విషయాల్లో నిపుణుల సలహాలను తీసుకొని నడచుకోవడం వల్ల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కార్పొరేట్/ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు కార్పొరేట్, ఎన్బీఎఫ్సీ సంస్థల డిపాజిట్లను కూడా పరిశీలించొచ్చు. కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. వీటిపై 7.5–8.5% మధ్య రాబడులు ఆశించొచ్చు. ఏఏఏ రేటెడ్ కలిగిన బాండ్లనే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రాబడి మాటేమో కానీ, పెట్టుబడి కూడా సంక్షోభంలో పడిపోతుంది. మీడియం డ్యురేషన్ ఫండ్స్ ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాల వ్యవధితో ఉండే డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఎంపిక చేసుకునే పథకాల ఆధారంగా ఈ విభాగంలో మూడేళ్ల కాలానికి వార్షిక సగటు కనిష్ట రాబడి 3 శాతంగాను, గరిష్ట రాబడి 17 శాతం వరకు ఉంది. కనుక ఎంపిక చేసుకునే పథకం ఇక్కడ ప్రామాణికం అవుతుంది. ఏడు శాతానికి పైనే రాబడి ఆశించొచ్చు. పీపీఎఫ్ అసంఘటిత రంగంలోని వారు, 15–20 ఏళ్ల కాల లక్ష్యాలకు పీపీఎఫ్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో చేసే పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చే రాబడులపైనా పన్ను ఉండదు. అన్ని విధాలుగా పన్ను ప్రయో జనం కలిగిన సాధనం. ప్రస్తుతం వడ్డీ రేటు 7.1%గా ఉంది. వీపీఎఫ్ ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్వో కింద భవిష్యనిధి స్కీమ్ ఉంటుంది. దీనికి అదనంగా స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) పేరుతో అదనపు పెట్టుబడి చేసుకోవచ్చు. పీఎఫ్కు అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్ పెట్టబడులకూ వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి పీపీఎఫ్ బ్యాలన్స్పై 8.10 శాతం వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. కాకపోతే వీపీఎఫ్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాతే ఉపసంహరించుకోగలరు. ఒకవేళ ఉద్యోగానికి రాజీనామా చేసినా, రిటైర్ అయినా అటువంటి సందర్భాల్లో ఈపీఎఫ్తోపాటు వీపీఎఫ్ కూడా తీసేసుకోవచ్చు. డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్తో ఒక సానుకూలత ఉంది. మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు డెట్ నుంచి ఈక్విటీకి, ఈక్విటీ నుంచి డెట్కు పెట్టుబడులను బదలాయిస్తుంటాయి. తద్వారా రిస్క్ తగ్గించి, అధిక రాబడులను ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. 9–18 శాతం మధ్య దీర్ఘకాలంలో వార్షిక రాబడులను వీటి నుంచి ఆశించొచ్చు. హైబ్రిడ్ ఫండ్స్ ఐదేళ్లు అంతకుమించిన కాలానికి హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ మెరుగైనవి. ద్రవ్యోల్బణం, పన్ను బాధ్యతలు తీసేసి చూసినా.. ఈక్విటీ ఫండ్స్లో రాబడి మెరుగ్గానే ఉంటుందని అందుబాటులోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కన్జర్వేటివ్ హబ్రిడ్ ఫండ్స్, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అని రెండు రకాలు ఉన్నాయి. ఈక్విటీల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకు ఇన్వెస్ట్ చేసేవి అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాలు. నూరు శాతం ఈక్విటీ రిస్క్ వద్దనుకునే వారు, ఈక్విటీ డెట్ కలయిక కోరుకునే వారికి ఇవి అనుకూలం. వీటిల్లో వార్షిక రాబడి దీర్ఘకాలంలో 12–18 శాతం మధ్య ఆశించొచ్చు. వీటికి ఈక్విటీ పథకాలకు మాదిరే పన్ను విధానం వర్తిస్తుంది. లాభాలు స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తాయి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీలకు 10–25% మధ్య కేటాయింపులు చేస్తాయి. వీటిల్లో రాబడులకు డెట్ ఫండ్స్ పన్ను విధానం వర్తిస్తుంది. రిస్క్ తక్కువ తీసుకునే వారికి ఇవి అనుకూలం. కొంత భాగం ఈక్విటీలకు కేటాయించడం వల్ల దీర్ఘకాలంలో వార్షిక రాబడి 9–12% మధ్య ఉంటుంది. ఇక బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీలు, డెట్కు సమానంగా కేటాయింపులు చేస్తుంటాయి. లార్జ్క్యాప్/మిడ్క్యాప్/స్మాల్క్యాప్ లార్జ్క్యాప్ కంపెనీలు ఎలాంటి మార్కెట్ పరిస్థితులను అయినా, ఆర్థిక సంక్షోభాలను అయినా తట్టుకోగలవు. ఎందుకంటే ఆయా రంగాల్లో అవి పెద్ద స్థాయికి చేరినవి కనుక. రిస్క్ తక్కువగా ఉండాలని భావించే వారు ఐదేళ్లు అంతకుమించిన కాలానికి లార్జ్క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. సగటు వార్షిక రాబడులు 12–18 శాతం మధ్య ఉంటాయి. మోస్తరు రిస్క్ తీసుకునే వారు మిడ్క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో రాబడులు 12–22 శాతం మధ్య ఉంటాయి. స్మాల్క్యాప్ పథకాలను పదేళ్లు అంతకుమించిన కాలానికి, అధిక రిస్క్ ఉన్నా ఫర్వాలేదు అధిక రాబడులు కోరుకునే వారు పరిశీలించొచ్చు. వీటిల్లో రాబడులను 18 శాతానికి పైన ఆశించొచ్చు. -
విదేశీ చేతుల్లోకి ఎల్ఐసీ! కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో వాటా విక్రయానికి వీలుగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. తాజాగా వాణిజ్యం, పరిశ్రమల శాఖ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐలు) విధానాల సవరణకు నడుం బిగించింది. ఆర్థిక శాఖ నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న తదుపరి ఇందుకు తగిన మార్పులను చేపట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. డిజిన్వెస్ట్మెంట్కి అనుకూలం కాదని బీమా రంగానికి చెందిన ప్రస్తుత విధానాలు ఎల్ఐసీ డిజిన్వెస్ట్మెంట్కు అనుమతించవని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ తెలియజేశారు. దీంతో మార్గదర్శకాలను సవరించవలసి ఉన్నదని వివరించారు. వెరసి ఎఫ్డీఐ విధానాలు మరింత సరళీకరిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా సవరించిన విధానాలను ప్రకటించనున్నట్లు తెలియజేశారు. ఈ అంశాలపై ఆర్థిక సర్వీసుల విభాగం, దీపమ్ చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. డీపీఐఐటీ, డీఎఫ్ఎస్, దీపమ్ మధ్య చర్చలతో అవసరమైన సవరణలను రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. తదుపరి క్యాబినెట్ అనుమతికి నివేదించనున్నట్లు వెల్లడించారు. 74 శాతం ప్రస్తుత ఎఫ్డీఐ విధానాలు బీమా రంగంలో ఆటోమాటిక్ మార్గం ద్వారా 74% విదేశీ పెట్టుబడులను అనుమతిస్తాయి. అయితే ప్రత్యేక చట్టంలో భాగమైన ఎల్ఐసీకి ఇవి వర్తించవు. సెబీ నిబంధనల ప్రకారం ఎఫ్పీఐ, ఎఫ్డీఐలను పబ్లిక్ ఆఫర్ ద్వారా అనుమతిస్తారు. ఎల్ఐసీ ప్రత్యేక చట్టంలో విదేశీ పెట్టుబడులకు అవకాశంలేదు. దీంతో విధానాలలో మార్పులు చేపట్టవలసి ఉన్నట్లు అధికారిక వర్గాలు వివరించాయి. గతేడాది జులైలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదించడం తెలిసిందే. మార్చిలోగా ఐపీవోను పూర్తిచేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక. -
బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ పే యూజర్లు బ్యాంక్ ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయవచ్చు. ఈ విధమైన సేవలను పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నట్టు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్డీలపై 6.35 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చని వెల్లడించింది. రూ.5 లక్షల వరకు డిపాజిట్ గ్యారంటీ ఉంటుందని వివరించింది. వినియోగదార్లు గూగుల్ పే యాప్లో బిజినెస్ అండ్ బిల్స్ విభాగంలో ఈక్విటాస్ బ్యాంక్ను ఎంచుకోవాలి. డిపాజిట్ చేయదలచిన మొత్తం, కాల పరిమితి నిర్ధేశిస్తూ వ్యక్తిగత, కేవైసీ వివరాలను సమర్పించాలి. కాల పరిమితి ముగియక ముందే ఎఫ్డీని రద్దు చేసుకుంటే అదే రోజు వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఈక్విటాస్ వెల్లడిం చింది. చదవండి: పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు -
పొదుపు పట్ల మహిళల్లో అప్రమత్తత
న్యూఢిల్లీ: పొదుపు విషయమై మహిళల్లో అధిక అప్రమత్తత ఉంటున్నట్టు ఓ సర్వే ఫలితాల ఆధారంగా తెలుస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) లేదా పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడానికే 58 శాతం మంది మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నారు. లేదంటే బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఉంచేస్తున్నారు. ఆన్లైన్ వేదికగా ఆర్థిక సేవలు అందించే స్క్రిప్బాక్స్ అక్టోబర్ నెల మొదటి రెండు వారాల్లో నిర్వహించిన సర్వే ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఇక మరో 6 శాతం మంది మహిళలు బంగారం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం గమనార్హం. అదనపు ఆదాయాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా పెడతామని 15 శాతం మగువలు చెప్పారు. ప్రముఖ ఫేస్బుక్ కమ్యూనిటీల ఆధారంగా 400 మంది మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించి స్క్రిప్బాక్స్ ఈ వివరాలు వెల్లడించింది. వీరిలో 54 శాతం మంది మిలీనియల్స్ (1980–2000 మధ్య జన్మించిన వారు) ఉన్నారు. ► సర్వేలో పాలు పంచుకున్న మిలీనియల్స్లో మూడొంతులు మంది పొదుపు పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. ► ప్రతీ ఆరుగురు మిలీనియల్స్లో ఒకరు విహార యాత్రల కోసం డబ్బును పక్కన పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ► నాన్ మిలీనియల్స్ మహిళల్లో సగం మంది రిటైర్మెంట్ నిధి, పిల్లల విద్య కోసం కొంత మేర పక్కన పెడతామని వెల్లడించారు. ► ఈ వయసు గ్రూపులోని వారికి పన్ను ఆదా చేసే పీపీఎఫ్, ఎల్ఐసీ పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రాముఖ్యంగా ఉన్నాయి. నాన్ మిలీనియల్స్లో 33% మంది వీటికే ఓటేశారు. 26% మంది మాత్రం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు మ్యూచువల్ ఫండ్స్ సాయపడతాయని చెప్పారు. ► అవసరమైన సందర్భాల్లో తమ కష్టార్జితాన్ని సులభంగా, వెంటనే పొందే వెసులుబాటు ఉండాలని సర్వేలో పాల్గొన్న మహిళల్లో 44 శాతం మంది పేర్కొన్నారు. ► అత్యవసర నిధికి ఎక్కువ మంది మొగ్గు చూపించారు. 36 శాతం మంది అజెండాలో దీనికే అగ్ర ప్రాధాన్యం ఉంది. తర్వాత పిల్లల విద్య కోసం 28 శాతం మంది, రిటైర్మెంట్ కోసం నిధి ఏర్పాటుకు 26 శాతం మంది మొగ్గు చూపించారు. ► తమకు ఎటువంటి ఆర్థిక లక్ష్యం లేదని 25 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆర్థిక ప్రణాళిక ఏర్పాటు, ఆర్థిక లక్ష్యాల సాధన విషయంలో 28 శాతం మంది నమ్మకంగా ఉన్నారు. పొదుపు, మదుపు వేర్వేరు.. పొదుపు చేయడం, పెట్టుబడి(మదుపు) పెట్టడం అనేవి నాణేనికి రెండు ముఖాలు. కానీ వీటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసమే ఉంది. అత్యవసరాల కోసం డబ్బులను పక్కన పెట్టుకోవడం పొదుపు అవుతుంది. దీనిపై రాబడులు నామమాత్రంగాను లేదా అసలు లేకపోవచ్చు. కానీ పెట్టుబడులు అనేవి సంపదను సృష్టించుకునేందుకు క్రమబద్ధమైన విధానం. ద్రవ్యోల్బణాన్ని మించి నికర విలువ వృద్ధి చెందేందుకు, పిల్లల విద్య, రిటైర్మెంట్ అవరాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు మార్కెట్ ఆధారిత (ఈక్విటీ) ఇన్వెస్ట్మెంట్ సాధనాలు తోడ్పడతాయి’’అని స్క్రిప్బాక్స్ సీఈవో ఆశిష్ కుమార్ తెలిపారు. -
బాబూ.. నీది నిరంకుశత్వం
-
బాబూ.. నీది నిరంకుశత్వం
►సీఎంను నిలదీసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ► ఓడిపోయిన వారికి ఎస్డీఎఫ్ నిధులెలా ఇస్తారు? ► నియోజకవర్గాల్లో సమాంతర పాలన జరుగుతోంది ► కమిటీల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం ►రెండున్నరేళ్లలో చంద్రగిరిలో ఒక్క శంకుస్థాపన, ► ఒక్క ప్రారంభోత్సవమైనా జరిగిందా? సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న తమకు నిధులెందుకు ఇవ్వడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజలెన్నుకున్న తమకు కనీస గౌరవం ఇవ్వకుండా, ఓడిపోయి న వారికి ఎస్డీఎఫ్ నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ... ఇది నిరంకుశత్వమని నేరుగా విమర్శించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో 34 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిశారు. అనంతరం ఆయనతో జరిగిన సమావేశ వివరాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. తామెన్ని సమస్యలు చెప్పినా ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్లు వ్యవహరించారని తెలిపారు. ఇంతమంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిస్తే కనీస గౌరవం కూడా ఇవ్వలేదన్నారు. కనీసం సానుకూలంగా కూడా మాట్లాడకుండా, కక్ష సాధింపు ధోరణిలోనే మాట్లాడారని చెప్పారు. నిధులివ్వకపోవడం దారుణం: పెద్దిరెడ్డి నియోజకవర్గాల అభివృద్ధికి రెండున్నరేళ్ల నుంచి నిధులు రాక తమ ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రికి చెప్పామని రామచంద్రారెడ్డి తెలిపారు. ‘‘ఇంతవరకూ ఒక్క వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకుగానీ, జెడ్పీటీసీ సభ్యుడికిగానీ ప్రభుత్వం ఒక్క రూపారుు నిధి కూడా ఇవ్వని విషయాన్ని గుర్తు చేశాం. ఎన్నికై న మమ్మల్ని పక్కనపెట్టి మాపై ఓడిపోరుున వారికి ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) కింద ప్రత్యేక జీఓలు విడుదల చేసి నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించాం. మా పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం అప్రజాస్వామికమని చెబుతూ... అలా చేరిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్రెడ్డికి రూ.11 కోట్ల పనులు, 3,200 పెన్షన్లు మంజూరు చేశారని చెప్పాం. ఇది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం కాదా? ఇది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశాం. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ నియోజకవర్గ అభివృద్ధి నిధులను అక్కడి ఎమ్మెల్యేల పేరుతోనే ఇస్తున్నారని తెలిపాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ టీడీపీ ఎమ్మెల్యేలకు నిధులిచ్చామని, కానీ ఇప్పుడు పూర్తిగా తమకు నిధులివ్వకపోవడం దారుణమని చెప్పాం. పలు పథకాలు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి మా పార్టీ ఎమ్మెల్యేలు వారి లెటర్ హెడ్సపై సంతకాలు చేసి పంపితే నిధులు రావడంలేదని, సంతకం చేయకుండా దరఖాస్తులు పంపితే వెంటనే నిధులిస్తున్న విషయాన్ని చెప్పాం. పెన్షన్లు బాగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పగా... మంజూరైన పెన్షన్లు కూడా వైఎస్సార్సీపీకి చెందిన వారివనే పేరుతో తొలగించడం దారుణమని చెప్పాం. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా చెప్పాం. ప్రజలు చెల్లించాల్సిన బిల్లులను వారుుదా వేయాలని, రైతులకు మంజూరు చేసిన రుణాల సొమ్మును వారు ఖర్చు చేసుకునేవిధంగా రూ. 100 నోట్లు ఇప్పించాలని కోరాం. రబీలో కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలిప్పించాలని కోరాం’’ అని ఆయన వివరించారు. ఈ రెండు అంశాలకు సంబంధించి ఒక వినతిపత్రాన్ని ఆయనకు ఇచ్చినట్లు చెప్పారు. తామెన్ని సమస్యలు వివరించినా సీఎం నుంచి స్పందన లేదని, సమావేశం నిరాశాజనకంగా ముగిసిందని తెలిపారు. సమస్యలు వినే ఓపికలేని సీఎం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పే సమస్యలు వినే ఓపిక కూడా ముఖ్యమంత్రికి లేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పేదలకివ్వా ల్సిన రేషన్ బియ్యం దారిమళ్లుతున్నాయని, స్వయంగా తాను దొంగ బియ్యం లారీని పట్టించిన విషయాన్ని చెప్పినా అలాంటివేం జరగడంలేదని చెప్పడం దారుణమన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను శత్రువులుగా చూస్తున్నారని చెప్పారు. తమకిచ్చిన ఎంపీ నిధులకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మ్యాచింగ్ గ్రాంట్ను కూడా కలెక్టర్లు ఇవ్వకపోవడాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఉప్పులేటి కల్పన చెప్పారు. గతంలో ఎమ్మెల్యేలతో ఆస్పత్రి సలహా సంఘాలు, ఎసైన్మెంట్ కమిటీలు వేసేవారని కానీ ఇప్పుడు వాటిలోనూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని చెప్పినట్లు తెలిపారు. నియోజకవర్గానికి 1250 ఇళ్లు ఇచ్చామని చెబుతున్నా ఓడిపోరుున టీడీపీ నేతలు చెప్పిన వారికే వాటిని ఇస్తున్న విషయాన్ని చెప్పామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు. చంద్రబాబుది, తనది చంద్రగిరి నియోజకవర్గం కాబట్టి ఇద్దరం అక్కడికెళదామని, రెండున్నరేళ్లలో అక్కడ ఒక్క శంకుస్థాపన, ఒక్క ప్రారంభోత్సవమైనా జరిగిందేమో చూపాలన్నా సీఎం స్పందించలేదన్నారు. ఆయన దోమలపై దండయాత్ర అంటున్నారని కానీ ఆయన కార్యాలయం నిండా దోమలు ఉన్నాయని రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఎద్దేవా చేశారు.