fisher
-
చదువుకున్న సముద్రపు చేప
బావుల్లో ఉండిపోతారు కొందరు. తెలిసిన కుంటల్లోనే మునకలేస్తారు కొందరు.మహా అయితే చెరువు గురించి ఆలోచిస్తారు కొందరు.కాని అతి కొందరు మాత్రమేసముద్రాన్ని జయించాలనుకుంటారు. వృత్తిరీత్యా బెస్త కుటుంబంలో పుట్టిన సుభిక్ష ఇంగ్లిష్ లిటరేచర్ చదివి నగరంలో ఉద్యోగం చేసినాఎందుకు తన వృత్తిలోనే రాణించకూడదు అని ఆలోచించింది. అంతే... తానే చేపల వేటలో దిగి ‘సీఫుడ్ అంట్రప్రెన్యూర్’గా దేశాన్ని ఆకర్షిస్తోంది.సముద్రానికి కెరటాలతో అదిలించడం తెలుసు. వలల కొద్ధి చేపల్ని నింపి సిరులను అందించడం కూడా తెలుసు. ‘సముద్రం తల్లిలాంటిదే. మమకారం, కోపం రెండూ ఉంటాయి. భయభక్తులతో ఉంటే ఏది అడిగినా కాదనకుండా ఇస్తుంది’ అంటుంది సుభిక్ష. ఈ 23 ఏళ్ల అమ్మాయి తమిళనాడులోని తూత్తుకూడి సమీపంలో ఉన్న పెరియతలై అనే బెస్తపల్లె నుంచి ఇవాళ దేశాన్ని ఆకర్షిస్తోంది. మగవాళ్లకే పరిమితమైన చేపలు పట్టే విద్యలో ఆ అమ్మాయి రాణించడమే కాదు తన చదువును ఆ విద్యకు జత చేసి ఆదాయ మార్గాలను నిర్మిస్తోంది.ఒడ్డు నుంచి సముద్రానికి...మగవాళ్లు చేపలు పడతారు. వాటిని స్త్రీలు గట్టున కూచుని అమ్ముతారు. ఇదే ఆనవాయితీ. తరాలుగా ఇదే సాగుతోంది. సుభిక్ష తండ్రి కుమార్, అన్న లియాండర్ కూడా వాళ్లింట్లో సముద్రం మీద వేటకు వెళ్లి చేపలు తెస్తారు. తల్లి వాటి అమ్మకంలో సాయం చేస్తుంది. ‘నేనెందుకు చేపలు పట్టడానికి మీతో రాకూడదు?’ అని అడిగింది సుభిక్ష ఒకరోజు తండ్రిని. తండ్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సుభిక్ష ఇంగ్లిష్ లిటరేచర్ చదివింది. ప్రయివేట్ బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తోంది. ఆడపిల్ల సౌకర్యంగా బతకాలంటే ఆమెలాంటి మార్గమే అందరూ సూచిస్తారు. ‘సముద్రంలో ఎంతో ఉంది. టెన్ టు ఫైవ్ జాబ్లో ఏముంది? నన్నొక ప్రయత్నం చేయనివ్వు నాన్నా’ అంది సుభిక్ష. అప్పటికే ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. మత్స్యకారుల జీవనాన్ని సరదాగా వీడియోల్లో చూపేది సుభిక్ష. ఇప్పుడు ఆ అమ్మాయి సిసలైన బెస్త జీవనంలోకి దిగింది.సముద్రంతో చెలగాటం...‘కోరమాండల్ తీరంలో సముద్రంతో దిగడం అంటేప్రాణాలతో చెలగాటమే’ అన్నాడు సుభిక్ష తండ్రి చివరకు ఒప్పుకుంటూ. మొదటిసారి తండ్రి, అన్నతో కలిసి ఫైబర్ బోట్లో చేపల వేటకు సుభిక్ష వెళ్లిన అనుభవం గగుర్పాటుకు గురి చేసేదే. ‘ఆకాశంలో చుక్కలు తప్ప వేరే ఏమీ కనిపించని చీకటి. పడవను కుదురుగా ఉంచకుండా ఎత్తెత్తి వేసే సముద్రం. మేము దాదాపు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్లాం. అక్కడ ఏమైనా జరగొచ్చు. కాని ఆ సమయంలో చేపల వేటకు వెళ్లి వల విసరడం గొప్ప అనుభవం’ అంది సుభిక్ష. ఆ రోజు నుంచి నేటి వరకు అనేకసార్లు రాత్రి 1 గంటకు వేటకు వెళ్లి ఉదయం 10 గంటలకు తిరిగి రావడం సుభిక్షకు అలవాటుగా మారింది. ‘చేపలు పట్టడానికి ఏయే వలలు వాడాలి... ఏ వల వేస్తే ఏ రకం చేపలు పడతాయనేది తెలుసుకున్నాను. ఇంకా పల్లెపల్లెకు తిరిగి చేపల వేటలో మా పూర్వికుల అనుభవం తెలుసుకుంటున్నాను’ అంటుంది సుభిక్ష. ఆమె తన వేటను మొదలెట్టాక అదంతా వీడియోలు చేసేసరికి ప్రపంచానికి తెలిసిపోయింది.పెరిగిన వ్యాపారంచేపలు పడితే టోకున ఎక్స్పోర్టర్లకు అమ్మడం లేదా లోకల్గా అమ్మడం లేదా ఎండబెట్టి అమ్మడం తెలిసిన సంప్రదాయ పద్ధతికి భిన్నంగా సుభిక్ష తమ చేపలను ఊరగాయలుగా, పచ్చళ్లు, ఎండు చేపలుగా మార్చి వాటిని తన లేబుల్ కింద అమ్మకానికి పెట్టింది. సోషల్ మీడియా వల్ల వాటిని దేశ విదేశాల్లో కొంటున్నారు. అలా మెల్లగా సుభిక్ష ‘సీఫుడ్ అంట్రప్రెన్యుర్’గా మారింది. తండ్రి, అన్న ఈ పరిణామాలను స్వాగతిస్తున్నారు. ఊళ్లో అందరూ సుభిక్షను మెచ్చుకోలుతో చూస్తున్నారు. ‘చేపలంటేప్రొటీన్తో నిండిన రిచ్ఫుడ్. ప్రజలకు ఆ ఫుడ్ను అందించడానికి బెస్తలు ఎంత కష్టం చేస్తారో... ప్రమాదంలోకి వెళతారో లోకానికి చూపడమే నా లక్ష్యం. అలాగే మత్స్యకార స్త్రీలను మరింత ముందుకు తీసుకు వెళ్లడం కూడా’ అంటోంది సుభిక్ష. ఒకవైపు ఈ పని చేస్తూనే మరోవైపు మోడల్గా కూడా పని చేస్తోంది. సంప్రదాయ విద్యలని గౌరవిస్తూ ఆధునిక ధోరణులను పుణికి పుచ్చుకుంటూ ముందుకు సాగితే విజయం తథ్యం అని నిరూపించింది సుభిక్ష. -
లైఫ్ సైన్సెస్ హబ్గా తెలంగాణ
గచ్చిబౌలి: భారత్లోనే కాకుండా యావత్ ఆసియా ఖండంలోనే లైఫ్ సైన్సెస్ రంగానికి కీలక హబ్గా తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పెట్టుబడులు, సంస్థల విస్తరణకు ఈ ప్రాంతం గమ్యస్థానంగా మారిందని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాద్లోని నాలెడ్జి సిటీలో మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ «థర్మో ఫిషర్ ఆర్ అండ్ డీ కేంద్రం కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందన్నారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూనీటి వనరులపై పరిశోధన చేస్తోందని చెప్పారు. గత నెల తాను చేపట్టిన అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్లో థర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను కలిసినట్లు కేటీఆర్ వివరించారు. నగరంలో ఇప్పటికే ఐడీపీఎల్, ఇక్రిశాట్, సీఎస్ఐఆర్ వంటి ఎన్నో ముఖ్యమైన పరిశోధనా కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కూడా హైదరాబాద్ మంచి ప్రదేశమని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణలో నైపుణ్యంగల వర్క్ఫోర్స్ అందుబాటులో ఉండటంతోపాటు ప్రభుత్వ సానుకూల విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలికవసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, థర్మోఫిషర్ సైంటిఫిక్ ఏసియా పసిఫిక్ అండ్ జపాన్ అధ్యక్షుడు టోని అసియారిటో, థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఇండియా సౌత్ ఏసియా ఎండీ అమిత్ మిశ్రా, థర్మో ఫిషర్ ఆపరేషన్స్ లేబొరేటరీ ఎక్విప్మెంట్ ఉపాధ్యక్షుడు మైఖేల్ మెగుయర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మత్స్యకారులు క్షేమం
తప్పిపోయిన వారి ఆచూకీ పరదీప్ లో లభ్యం కాకినాడ తీసుకొచ్చేందుకు ముగ్గురు సిబ్బంది ఒడిశా పయనం కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివరాలు వెల్లడి కాకినాడ క్రైం: కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడిశా పరదీప్లో ఉన్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేటకెళ్లి కనిపించకుండా పోయిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ విషయం తమకు గురువారం ఉదయం 10.30 గంటలకు తెలిసిందన్నారు. ఈ నెల 31న వేట నిషేద కాలంలో కాకినాడ పర్లోపేటకు చెందిన కొందు లక్ష్మణరావు ఐఎన్డీ– ఏపీ–ఈ3–ఎండీ–1260 నెంబర్ ఫైబర్ బోటుపై పొట్టి తాతారావు, చింతపల్లి అగ్గిపెటి, వాడమొదుల జగదీష్, చింతపల్లి రాజు, దుమ్ములపేటకు చెందిన సూరాడ రాజు, తిరిది అప్పారావు, మేడ శ్రీనులు చేపల వేట కోసం సముద్రంలో కెళ్లినట్లు తెలిపారు. సముద్రంలో రోజున్నర ప్రయాణం చేసిన ఇంజన్ మరమ్మతుకు గురైందన్నారు. ఇంజన్కి మరమ్మతులు నిర్వహించిన తర్వాత చేపలవేట కొనసాగించేందుకు ముందుకెళ్లగా మరొకసారి ఇంజన్ మరమ్మతుకు గురైందన్నారు. ఈ లోగా వాతావరణంలో సంభవించిన మార్పులతో సముద్ర కెరటాల ఉధృతి, వడి పెరగడంతో గాలికి ఫైబర్ బోటు ఉత్తర తీరం వైపు డీప్ సీలోకి వెళ్లిపోయిందన్నారు. బోట్ మరమ్మతుకు గురైందన సమాచారం తెలిపేలోగా డీప్సీలోకి వెళ్లిపోవడం, అక్కడ సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో సమాచారాన్ని చేరవేయలేకపోయినట్టు తెలిపారు. బోటు ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్ పోర్టు వద్ద డీప్ సీ లోనుంచి పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లిపోతుండగా, ఒడిశాకు చెందిన వేటగాళ్లకు గల్లంతైన బోటు, వేటగాళ్లు కనిపించడం, తెలుగు మాట్లాడే వేటగాడు అక్కడ ఉండటంతో మత్స్యకారుల ఆచూకీ లభించినట్లు తెలిపారు. బోటును పరదీప్ పోర్టుకి తీసుకొచ్చేందుకు వీలుగా ఒడిశాకు చెందిన బోటు సిబ్బంది 10 లీటర్ల డీసెల్, ఆహారాన్ని అందించినట్టు తెలిపారు. ఫైబర్బోటు తప్పిపోయినట్లు 12న తనకు యజమాని నుంచి ఫిర్యాదు వచ్చిన తక్షణమే కోస్ట్గార్డు, హెలికాప్టర్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. వేటగాళ్ల గాలింపు కోసం కాకినాడ తీరం నుంచి మూడు, విశాఖపట్నం నుంచి నాలుగు ఓడలు, చెన్నై నుంచి ప్రత్యేక విమానం 13 నుంచి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. విశాఖపట్నం నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పలుసార్లు హెలికాప్టర్ రెక్కీ నిర్వహించామన్నారు. వేటగాళ్ల ఆచూకీ కోసం రిలయన్స్, ఓఎన్జీసీ సహకారం తీసుకున్నట్టు తెలిపారు. వేటగాళ్ల గాలింపునకు సీఎం చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు తనతో సంప్రదింపులు చేసి మత్స్యకారులను సురక్షితంగా తీసుకు రావాలని ఆదేశించినట్టు తెలిపారు. బోటులో ఉన్న ఆహార పదార్థాలు 12వ తేదీ రాత్రితో అయిపోయినట్టు తెలిపారు. పరదీప్కు చేరుకున్న ఏడుగురు మత్స్యకారులు సుక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. వీరికి మెరుగైన వైద్య చికిత్స, ఆహారం అందించేలా ఒడిశా మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి సమకూర్చామన్నారు. మత్స్యకారులతో స్వయంగా మాట్లాడానని అందరూ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. ఒడిశా నుంచి కాకినాడ తీసుకొచ్చేందుకు రెవెన్యూ నుంచి ఒకరు, మత్స్యశాఖ నుంచి ఇద్దరు అధికారులను పంపినట్టు తెలిపారు. వీరు గురువారం రాత్రి, శుక్రవారం ఉదయానికి కాకినాడ చేరుకునేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.కోటేశ్వరరావు, అమలాపురం డీడీ పి.జయరావు పాల్గొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాలి సముద్రంలోకెళ్లే వేటగాళ్లు విధిగా భద్రత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా కోరారు. మోటరైజ్డ్, మెకనైజ్డ్, కంట్రీ క్రాఫ్ట్స్ బోట్లు, పడవలపై చేపల వేటలకు వెళ్లే వారు బోట్లలో లైఫ్ సేవింగ్, నేవిగేషన్ ఎక్విప్మెంట్, డాట్ మిషన్, లైఫ్ జాకెట్లు, లైఫ్ప్లోట్స్ వంటి ఎక్విప్మెంట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎంఎఫ్బీ బోట్లు, 471, మోటరైజ్డ్ బోట్లు 2,888, సీసీ–1.సీసీ–2 బోట్లు 253 బోట్లు ఉన్నట్లు తెలిపారు. వీటికి తప్పకుండా డాట్ మిషన్, నేవిగేషన్, సీసేఫిటీ ఎక్విప్మెంట్లు, రిజిస్ట్రేషన్ ఉండాలన్నారు. వీటితో పాటూ మిగతా అన్ని రకాల బోట్లకు సీసేఫిటీ ఎక్విప్మెంట్, రిజిస్ట్రేషన్ విధిగా ఉండాలన్నారు. రెండు వారాల వ్యవధిలో బోట్ల రిజిస్ట్రేషన్, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ఎక్విప్మెంట్పై మత్స్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో ఉన్న 28 ప్రధాన లేండింగ్ సెంటర్ల వద్ద మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లలో డాట్ మిషన్ల ఏర్పాట్లు, బోట్ల రిజిస్ట్రేషన్పై వారం పది రోజుల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.