gifts delivery
-
తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?
అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ వారం విషయంలోకి వెళ్తే.. తాళి కట్టు శుభవేళ.. అంతా మంచే జరగాలని కోరుకుంటాం. వధూవరులను ఆశీర్వదిస్తాం. అంతా మంగళప్రదంగా జరగాలని.. కలకాలం కొత్త జంట చల్లగా ఉండాలని కోరుకుంటాం. పెళ్లి సందర్భంలో వధూవరులకు వచ్చే బహుమతులపై పన్ను భారం లేదు. అటువంటి వాటిని ఆదాయంగా పరిగణించరు. ఇప్పుడు ముందు రిసెప్షన్.. తర్వాత పెళ్లి... కాబోయే జంట పందిరిలో నిలబడటం.. మిగతా అందరూ లైన్లో వెళ్లి, వారికి బహుమతులివ్వడం.. తాళి కట్టిన తర్వాత కూడా కొందరు ఇస్తారు. ఏది ఏమైనా సందర్భం ‘పెళ్లి’ ఒక రోజు అటూ ఇటూ.. పెళ్లి పేరు చెప్పి ఎప్పుడు ఇచ్చినా ఏ ఇబ్బందీ లేదు.ఎటువంటి బహుమతులు ఇవ్వొచ్చు..నగదు ఇవ్వొచ్చు. దగ్గరి బంధువైతే ఎటువంటి ఆంక్షలు లేవు. బీరకాయ .. బెండకాయ సంబంధం కాదండి. బాదరాయణ సంబంధమూ కాదు. చట్టంలో పొందుపర్చిన నిర్వచనాన్ని గుర్తు పెట్టుకోండి. అలా అని రూ.2,00,000 దాటకండి. పేటీఎంలు, గూగుల్ పేమెంట్లు, చెక్కులు, డీడీలు, ఆర్టీజీఎస్, బదిలీలు, నగ, నట్రా, వెండి, బంగారం, ఆభరణాలు, కుక్కర్లు, వంట సామగ్రి, టీవీలు, ఫ్రిజ్జులు, భూములు, ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, స్థిరాస్తి, షేర్లు, బాండ్లు.. ఎలాగైనా మీ ప్రేమ, అభిమానాన్ని ప్రకటించుకోండి. పుచ్చుకున్న వారికి ఆదాయంగా పరిగణించరు. పన్నుభారం పడదు. పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే, కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.వధూవరులకు వచ్చే వాటిని ఆదాయంగా పరిగణించరు.అత్తగారి లాంఛనం, ఆడపడుచు కట్నం మొదలైన వాటి మీద ఎటువంటి మినహాయింపు లేదు. కొన్ని పెళ్లిళ్లలో ఈ లాంఛనాలు భారీగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త.పూర్వకాలంలో పురోహితుడు నలుగురికి వినపడేలా అరిచేవారు. ఫలానా వారింత కట్నం అని.. కొంత మంది తమ పేరు నలుగురికి వినబడేలా చదివించుకునే వారు.ఇప్పుడు బాహాటంగా చదివింపులు లేవు. కవర్లో ఎంతో కొంత పెట్టి.. అది వారి చేతిలో పెట్టి, ఫొటోగ్రాఫర్ వైపు మొగం చూపెట్టి.. భోజనం దిశగా అడుగెట్టి.. ఇంటి దారి పట్టి.. వెళ్లిపోతున్నారు.ఇవి చిన్న మొత్తాలయితేనేం.. అధిక విలువగలవైతేనేం.. పంతులు గారికి ఒక వెయ్యి నూటపదహార్లు ఇచ్చి ఒక పుస్తకం.. పెళ్లి పుస్తకం తెరిపించండి.ఆ పుస్తకానికి పసుపు, కుంకుమ బాగా దట్టించండి. తారీఖు, టైం వేసి.. అందరి పేర్లూ రాయండి. పింకీ, సుబ్బు, పక్కింటి ఆంటీ అని కాకుండా వీలైతే పూర్తి పేరు రాయండి. అలాగే ఫోన్ పేమెంట్లు, గూగుల్ పేమెంట్లు, బ్యాంకులో జమలు, ప్రత్యేక జాబితా రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లో ఈ ‘జవాబు’ను హైలైట్ చేయండి. మీరు మీ పెళ్లి పుస్తకంలో వారి పేరు, వీలైతే, సెల్ నంబరు రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లు భద్రపరచండి.ఇదీ చదవండి: ‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదననగదు చదివింపులను వీలైతే బ్యాంకులో జమ చేయండి. ఆ పేయింగ్ స్లిప్ను మీ పుస్తకంలో అతికించండి.ఇలా రాయటం వల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి మున్ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ వారికి ‘సోర్స్’ వివరణ రెడీగా ఉంటుంది. రెండోది మీరు అటువంటి వారికి కట్నం ఇచ్చేటప్పుడు ఇదొక కొలబద్దగా ఉంటుంది.నగదు ఖర్చుపెట్టే అవసరం అయితే.. దేని నిమిత్తం ఖర్చు పెట్టారో రాయండి.భారీ కంచాలు, ప్లేట్లు, సీనరీలు, దేవుడి బొమ్మలు మొదలైనవి రాయకపోయినా ‘విలువైనవి’ అనిపించిన వస్తువుల జాబితా రాయండి.స్థిరాస్తులు మొదలైన అన్ని కాగితాలు తీసుకోండి. బదిలీ పత్రాలు తీసుకోండి. మరీ చాదస్తం అని కొట్టిపడేయకండి. దేనికైనా దస్త్రం కావాలి. అదీ మనమే సమకూర్చుకోవాలి. సకాలంలో సర్దుకోండి.-కే.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి-కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
ఆ జంటకు బహుమతుల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : మే 8న వివాహ బంధంతో ఒక్కటవుతున్న సోనం కపూర్, ఆనంద్ అహుజాలకు సెలెబ్రిటీ స్నేహితులు, సన్నిహితుల నుంచి పుష్పగుచ్ఛాలు, విలువైన బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి పత్రికపై బహుమతులు వద్దని వినతిని జోడించినా కపూర్ మాన్షన్కు గిఫ్ట్లు తరలివస్తున్నాయి. సోనంకు సన్నిహితంగా మెరిగే చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఆమెకు కాంచీపురం చీర, అమ్రపాలి జుంకాలు, చెవిరింగులను బహుమతిగా ఇవ్వనున్నారు. మే 8న వివాహ వేడుకతో పాటు అదే రోజు సాయంత్రం సోనం, ఆనంద్ అహుజాల వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇక సోనంకు సన్నిహితంగా మెలిగే సహనటీనటులు సంగీత్లో సందడి చేసేందుకు డ్యాన్స్ రిహార్సల్స్తో హోరెత్తిస్తున్నారు. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న సోనం, ఆనంద్లు ఎన్నడూ తమ అనుబంధంపై ఎక్కడా నోరుమెదపలేదు. పార్టీలు, ఈవెంట్లకు సైతం ఇద్దరూ కలిసే హాజరైనా వదంతులపై మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఇక మే 8న వీరి వివాహం జరుగుతుందని ఇరు కుటుంబాలు అధికారికంగా నిర్ధారించడంతో వివాహ వేడులకపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు సోనం నటించిన వీరే ది వెడ్డింగ్ జూన్ 1న విడుదలకు ముస్తాబవుతోంది. -
హైకోర్టు నోటీసులు
• ఎన్నికల కమిషన్, అభ్యర్థులకు జారీ • వివాదాస్పద అభ్యర్థులపై 9లోగా వివరణ • పీఎంకే అభ్యర్థుల జాబితా వెల్లడి • బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారు గడిచిన ఎన్నికల్లో నగదు, బహుమతులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని ఎన్నికల రద్దుకుకార కులైన సెంథిల్ బాలాజీ (అన్నాడీఎంకే), కేసీ పళనిస్వామి (డీఎంకే) లను ఉప ఎన్నికల్లో అభ్యర్థులుగా అనుమతించడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, ఇద్దరు అభ్యర్థులకు మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. కరూరు జిల్లా అయ్యంపాళయంకు చెందిన ఎస్ రాజేంద్రన్ అనే వ్యక్తి ఇటీవల దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించి నోటీసులు పంపింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో ఓటర్లకు నగదు బట్వాడాతో అక్కడి ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. దీంతో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 232 చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ రెండు నియోజకవర్గాలకు వచ్చేనెల 19వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే తరఫున సెంథిల్ బాలాజీ, డీఎంకే తరఫున కేసీ పళనిస్వామి పోటీపడుతున్నారు. వీరిద్దరూ గడిచిన ఎన్నికల్లో ఓటర్లకు నగదు, పంచెలు, చీరలు, బహుమతులు పంపిణీ చేసిన ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే డీఎంకే అభ్యర్థి కుమారుడి ఇంటిపైనా, కరూరులోని అన్నాడీఎంకే అభ్యర్థి అనుచరుడు అన్బునాథన్ ఇంటిపైనా అదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించి భారీ ఎత్తున నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక అభ్యర్థుల అనుచరుల ఇళ్లలో మద్యం బాటిళ్లు, చీరలు, పంచెలు పట్టుపడ్డాయి. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్న కారణంగానే అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దయ్యాయి. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఎన్నికల రద్దుకు కారకులైన అదే అభ్యర్థులను ఉప ఎన్నికల్లో మరలా పోటీకి పెట్టడం సరైన నిర్ణయం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్టే అవుతుంది. కాబట్టి వీరిద్దరిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి. వారి నామినేషన్లను తిరస్కరించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని, ఒక వేళ వీరు పోటీ చేస్తే వీరిద్దరికీ పడిన ఓట్లను లెక్కించరాదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. ఎన్నికల పనులు ప్రారంభమైనందున న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని చట్టంలో పేర్కొని ఉన్నా ఇది ఎంతో ముఖ్యమైన కేసుగా పరిగణిస్తున్నామని వారు అన్నారు. అరవకురిచ్చిలో ఇప్పటికే 15 రోజులపాటూ ప్రభుత్వ ధనం, అభ్యర్థుల ధనం ఖర్చయిందని చెప్పారు. డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థుల నుంచి ఖర్చయిన సొమ్మును రాబట్టాలని పీఎంకే అభ్యర్థి భాస్కరన్ వేసిన పిటిషన్ను కూడా తాము విచారిస్తున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. భాస్కరన్ వేసిన పిటిషన్ వచ్చే నెల 9వ తేదీ విచారణకు వస్తున్నందున ఈ పిటిషన్ను సైతం 9వ తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపారు. పిటిషన్ దారులు చేసిన ఆరోపణలపై డీఎంకే, అన్నాడీఎంకే, ఎన్నికల కమిషన్ సవివరమైన నివేదికను 9వ తేదీ దాఖలు చేయాలని ఆదేశిస్తూ సోమవారం నోటీసు జారీ చేశారు. హైకోర్టులో పిటిషన్లపై విచారణలు కొనసాగుతుండగా ఈ నెల 28న తంజావూరు, అరవకురిచ్చి డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు తమ నామినేషన్ను దాఖలు చేయనున్నారు. పీఎంకే నుంచి పోటీ చేయబోతున్న అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించారు. అరవకురిచ్చి నుంచి పీఎంకే భాస్కరన్, తంజావూరు నుంచి కుంజితపాదం, తిరుప్పరగుండ్రం నుంచి టీ సెల్వం ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు పీఎంకే ప్రధాన కార్యదర్శి జీకే మణి సోమవారం మీడియాకు తెలియజేశారు. బీజేపీ అభ్యర్థులు ఖరారు: కేంద్ర మంత్రి పొన్ రాష్ట్రంలో అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పరగుండ్రం నియోజకవర్గాల్లో వచ్చేనెల 19 తేదీన జరుగనున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ తెలిపారు. తంజావూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర శాఖ ముగ్గురి పేర్లను ఖరారు చేసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిందని, ఢిల్లీ నుంచే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని ఆయన తెలిపారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఓటర్లకు నగదు బట్వాడా, బహుమతుల పంపిణీ వంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.