govt revenue
-
‘మందు’ సొమ్మే ఇంధనం
సాక్షి, హైదరాబాద్: ‘మందు’ సొమ్మే సర్కారు బండికి ఇంధనం కాబోతోంది! నిధుల సమీకరణకు ప్రభుత్వం మందు సీసానే ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకుంది. ఈ ఏడాది మద్యం వ్యాపారం ద్వారా రూ.11 వేల కోట్లు, స్పిరిట్ ఆధారిత ఉత్పత్తుల అనుమతి, ఇతర రశీదుల ద్వారా రూ.3,500 కోట్లు.. వెరసి కనీసం రూ.14.5 వేల కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎలైట్ బార్లు.. ఎన్నైనా.. దుకాణాలకు దరఖాస్తులు, లైసెన్స్ ఫీజుతోపాటు మద్యం విక్రయాలతో భారీగా ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సాధారణ బార్లకు అనుమతులు తగ్గించి వాటి స్థానంలో అదనపు లైసెన్స్ ఫీజు వచ్చే ఎలైట్ బార్లకు ఎక్కువ సంఖ్యలో లైసెన్స్లు కేటాయించాలని నిర్ణయించింది. నగరాలు, పట్టణాల్లో కోరినంత మందికి ఎలైట్ బార్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు అమల్లో ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2,215 మద్యం దుకాణాలకు లైసెన్స్లు విక్రయించటం ద్వారా రూ.1,675 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో రూ.401 కోట్లు దరఖాస్తుల ద్వారా, రూ.1,274 కోట్లు లైసెన్సుల ద్వారా వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 820 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా గతేడాది రూ 356.90 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది కొత్తగా ఎలైట్ బార్ల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో సాధారణ బార్ల లైసెన్స్ ఫీజుపై అదనంగా 25 శాతం కట్టి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎలైట్ బార్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. మొత్తానికి బార్ల ద్వారా రూ.421 కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్ణయించారు. వీటి ద్వారా ఏడాదికి కనీసం 633 లక్షల కేసుల మద్యం విక్రయించాలని, ఇందులో 283.20 లక్షల కేసుల బ్రాందీ, విస్కీ, 349.42 లక్షల కేసుల బీరు, 82 వేల కేసుల విదేశీ మద్యం విక్రయించడం ద్వారా రూ.15,836 కోట్ల విలువైన మద్యం వ్యాపారం చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో వ్యాపారులకు ట్రేడ్ మార్జిన్, ఉత్పత్తి సంస్థలకు బేసిక్ ధర, ఇతర ఖర్చులుపోను నికరంగా రూ.9,020 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. స్పిరిట్ ఆధారిత ఉత్పత్తులకు అనుమతుల ద్వారా రూ.3,500 కోట్ల ఆర్జన లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆ దుకాణాల బదిలీతో 30 కోట్లు! 2011 ఎక్సైజ్ పాలసీలో జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే అన్ని మద్యం దుకాణాలకు లైసెన్స్ ఫీజు రూ.1.04 కోట్లుగా నిర్ధారించారు. ఈ ఫీజు భారంతో జీహెచ్ఎంసీ పరిధిలో 72 మద్యం దుకాణాలకు గత ఏదేళ్ల నుంచి ఒక్క దరఖాస్తు రాలేదు. దీంతో తాజా పాలసీలో ఈ మద్యం దుకాణాలను వేర్వేరు జిల్లాలకు కేటాయించారు. వీటిలో 50 శాతం దుకాణాలను మేడ్చల్, వికారాబాద్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలకు కేటాయించారు. మిగిలిన 50 శాతం దుకాణాలను జిల్లాకు ఒకటి రెండు చొప్పున ఇచ్చారు. వీటి ద్వారా కనీసం రూ.30 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్టు ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. గతంలో మిగిలిపోయిన దుకాణాల్లో కొన్నింటిని టీఎస్బీసీఎల్ నిర్వహించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో ఎమ్మార్పీ ఉల్లంఘన, అక్రమ మద్యాన్ని నివారించేందుకు టీఎస్బీసీఎల్ 22 ఔట్లెట్లను తెరిచి రిటైల్ ధరకే మద్యం విక్రయించింది. కానీ ఇందులో పెద్దగా లాభాలు రాకపోవటంతో ఈ ఏడాది ప్రభుత్వం ఔట్లెట్లను ఎత్తేసింది. 2017–18లో మద్యం విక్రయాల అంచనా ఇదీ.. మద్యం రకం లక్షల కేసులు సాధారణం 37.56 మీడియం 125.19 ప్రీమియం 120.46 విదేశీ 0.82 బీరు 349.42 మొత్తం వ్యాపారం 15,836 (రూ.కోట్లు) ఆదాయం అంచనాలు (రూ.కోట్లలో) ఎక్సైజ్ వ్యాట్ 8,021 ప్రివిలేజ్ ఫీజు 780 క్రీడల ప్రమోషన్ ఫీజు 9.56 సీఎంఆర్ఎఫ్ 210 దరఖాస్తులతో 401 వైన్షాప్ లైసెన్స్లు 1,274 బార్ల లైసెన్స్ 421 స్పిరిట్ ఆధారిత ఉత్పత్తులకు అనుమతులు, ఇతర రశీదులు 3,500 మొత్తం 14,616.56 -
‘మీ ఇంటికి..’ వచ్చినా ఫలితం లేదు!
‘మీ ఇంటికి మీ భూమి’లో రైతులకు ఇవ్వని వన్బీ పత్రాలు తప్పొప్పులు సవరించని గ్రామ సభలెందుకంటూ రైతుల మండిపాటు రెండో విడత ఇంకా అప్లోడ్ కాని వైనం ప్రత్యేక కార్యక్రమాల్లోనూ తాజా పర్చని రికార్డులు విజయనగరం కంటోన్మెంట్:గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన వర్రి మల్లయ్య.. చనిపోయిన తన తండ్రి పాపునాయుడి పేరిట ఉన్న నాలుగున్నర ఎకరాల భూముల బదులు వన్బీలో 2.64 ఎకరాలు మాత్రమే కనిపిస్తున్నాయని, సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నాడు. అలాగే భూములను వారి ఇద్దరి అన్నదమ్ముల పేరున నమోదు చేయాలని పలుమార్లు రెవెన్యూ సిబ్బందికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రెండో విడత ‘మీ ఇంటికి మీ భూమి’ కార్యక్రమంలో మరోసారి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ‘మీ సేవ’కు వెళ్లాలని అధికారులు తాపీగా సూచించారు. ఇదే గ్రామానికి చెందిన బర్ల జగన్నాథం, శ్రీరాములు, చంద్రుడు అనే అన్నదమ్ములు వారసత్వ భూములను పంచుకున్నారు. అయితే వారు చెప్పినట్లు కాకుండా రెవెన్యూ అధికారులు తమకు తోచిన విధంగా ప్రతి సర్వే నెంబర్నూ మూడు భాగాలు చేసి పట్టా పుస్తకాలు ఇచ్చేశారు. ‘మేం పంచుకున్నదొకలా...మీరు పంచినదొకలా’ఉందని, సమస్య పరిష్కరించాలని వారు దరఖాస్తు చేసుకున్నారు. ఇదీ జరగలేదు. గ్రామ రెవెన్యూ అధికారి అంటే ఆ గ్రామంలోని భూ రికార్డులను ఏటా తాజా పర్చడం, కొత్తగా వచ్చిన విధానాలకు రైతుల రికార్డులు అన్వయించడం చేయాలి. ప్రస్తుతం ఆన్లైన్ చేయడానికి రైతుల వద్ద పేరుకుపోయిన సమస్యలను తీర్చాలి. వీఆర్వో కాకుంటే ఆర్ఐ, తహశీల్దార్.. ఇలా మండల రెవెన్యూ అధికారులంతా భూ రికార్డులను తాజా పర్చడానికి కృషి చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో దశాబ్దాల నాటి రికార్డులు తప్పొప్పులతో నిండి ఉన్నాయి. వాటిని అధికారులు ఎప్పుడూ పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ‘మీ ఇంటికి..’ తీసుకొచ్చినా..! ప్రభుత్వం కొత్తగా ‘మీ ఇంటికి మీ భూమి’ అనే కార్యక్రమాన్ని తీసుకురావడమే కాకుండా దానికి ప్రత్యేక యాప్ను కూడా రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా రైతుల రెవెన్యూపరమైన సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాదే మొదటి విడత ‘మీ ఇంటికి-మీ భూమి’ గ్రామ సభలను నిర్వహించింది. ముందుగా రైతులందరికీ ప్రస్తుతమున్న రికార్డుల పరంగా ప్రింట్లు తీసి ఇస్తాం.. అందులో తప్పొప్పులను గుర్తించి అదే ఫారంలో పొందుపరిచి సంతకం చేసి ఇవ్వాలని, వాటిని ఆన్లైన్లో సవరించి రెండో విడతలో ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో రైతులంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు ఇన్నాళ్లకు పరిష్కారమవుతున్నాయనుకున్నారు. కానీ ఇదంతా ఒట్టిదేనని కొద్దిరోజులకే తేలిపోయింది. అధికారులు చెప్పిన విధంగానే రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో 1,11,538 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు వాటిని తీసుకువెళ్లిపోయారు. ఇక తమ పని ముగిసినట్టేనని భావించారు. మొదటికే దిక్కు లేదు.. రెండో విడత మీ ఇంటికి మీ భూమి కార్యక్రమానికి అధికారులు వచ్చి సరిదిద్దిన వన్బీలు ఇస్తారని భావించిన రైతులకు అడియాసే అయింది. ఇప్పటికీ మొదటి విడత సభల్లో దరఖాస్తు చేసుకున్న సమస్యలు పరిష్కారం కాలేదు. ఆన్లైన్లో కూడా మార్పు చేర్పులు చోటు చేసుకోలేదు. మళ్లీ రెండో విడతలో కూడా దరఖాస్తులే స్వీకరిస్తామన్నారు. దీంతో రైతులు అవాక్కయ్యారు. మొదట వచ్చి వన్బీ ఫారాలు ఇచ్చి తప్పొప్పులను సరిదిద్దేందుకు అవకాశం ఇస్తామని చెప్పిన అధికారులు అలా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి నిత్యం రెవెన్యూ అధికారులు చేయాల్సిన విధులు చేయకపోగా ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎందుకని రైతాంగం ప్రశ్నిస్తోంది.