greevens day
-
సమస్యలు పరిష్కరించండి సారూ..
ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు దరఖాస్తులు స్వీకరించిన డీఆర్వో భాస్కర్ ఈవారం మొత్తం వినతులు, ఫిర్యాదులు 209 మహబూబ్నగర్ న్యూటౌన్: ‘తిరిగి తిరిగి అలిసిపోతున్నాం... మా గోడును జర పట్టించుకోండి. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మేము ఇక్కడికి వస్తుంటే.. మీరు మళ్లీ అక్కడికే రాస్తున్నారు.. వారేమో పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేయండి సారూ’ అని పలువురు పింఛన్దారులు, భూములకు సంబంధించిన వివాదాలపై ప్రజలు అధికారులను వేడుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు, వినతులు వెల్లువెత్తాయి. జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్, డీఆర్డీఏ పీడీ మధుసూదన్నాయక్, మెప్మా పీడీ లింగ్యానాయక్, తదితరులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా జిల్లాల పునర్విభజనలో తమ గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయాలని, భూముల సమస్యలు, కబ్జాలు, స్కాలర్షిప్లు, రుణాల సమస్యను పరిష్కరించాలని, ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని చాలా వినతులు వచ్చాయి. ఈ వారం ‘పరిష్కారం’ ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పది, ప్రజావాణికి 199, మొత్తం 209 వినతులు, ఫిర్యాదులు అందాయి. ఎవరూ పట్టించుకోరెందుకయ్యా.. ఐదు నెలలుగా స్థానిక అధికారుల వద్దకు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇదివరకే ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశాం. ఎవరూ పట్టించుకోరెందుకయ్యా.. ఆధారం లేక బతకలేకపోతున్నాం. ఇప్పుడైనా పింఛన్ మంజూరు చేయించి, మాకు న్యాయం చేయండి సారూ.. అని చిన్నచింతకుంట మండలం దూపల్లికి చెందిన శాంతమ్మ, మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిరకి చెందిన ఉప్పరి కాలమ్మ అధికారులను వేడుకున్నారు. చదివించలేకపోతున్నాం .. మా అబ్బాయి మహేశ్కుమార్కు వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మేము ఎంబీబీఎస్ చదివించలేకపోతున్నాం. మా అబ్బాయి చదువు పూర్తయ్యే వరకు ప్రభుత్వపరంగా ఆర్థికసాయం చేసి, ఆదుకోండి’ అని మానవపాడు మండలం పుల్లూరుకు చెందిన ఎం.శారద అధికారులను కోరారు. పంటలు మునిగాయి.. ఆదుకోండి మక్తల్ మండలం అంకెన్పల్లి చెరువు వెనుకభాగంలో తాము వేసిన పంటలు ముంపునకు గురయ్యాయి. తమకు ప్రత్యామ్నాయం చూపి ఆదుకోవాలని అనుగొండ రైతులు మునిగిన కంది పంటను తీసుకొచ్చి ప్రజావాణిలో అధికారులకు చూపించి సమస్యను వివరించారు. వరి, కంది పంటలు పూర్తిగా నీటిలో మునిగాయని, తమ సొంత భూముల్లో వేసుకున్న పంటలు మునిగి తీవ్ర నష్టం వస్తుందని వాపోయారు. నష్ట పరిహారం ఇప్పించండి ‘సాగుచేసుకుని బతికేందుకు ప్రభుత్వం గతంలో భూమిలిచ్చింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్కు ఆ భూములను తీసుకున్నారు. ఒక్కొక్కరికి 3ఎకరాల చొప్పున మొత్తం 39ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది. మేము ఇంతకాలం ఆ భూములనే సాగు చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఆధారం కోల్పోతున్నాం. మాకు తగిన పరిహారం ఇప్పించి ఆదుకోవాలి.’ అని భూత్పూర్ మండలం కర్వెన కు చెందిన 13మంది రైతులు వేడుకున్నారు. -
ప్రజావాణికి 178 ఫిర్యాదులు
వినతులు స్వీకరించిన డీఆర్వో భాస్కర్ సమస్యలు పరిష్కరించాలని వేడుకోలు మహబూబ్నగర్ న్యూటౌన్: కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో ప్రజలు తరలివచ్చారు. ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఫిర్యాదుదారులు తమ గోడువెళ్లబోసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్, డీఆర్డీఏ పీడీ మధుసూదన్నాయక్, మెప్మా పీడీ లింగ్యానాయక్ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా జిల్లాల పునర్విభజనలో తమ గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయాలని, భూముల సమస్యలు, కబ్జాలు, స్కాలర్షిప్లు, రుణాలు, ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని వినతులు వచ్చాయి. ఈ వారం ప్రజావాణికి మొత్తం 178 ఫిర్యాదులు, వినతులు అందాయి. అందులో ఆన్లైన్ పరిష్కారం కార్యక్రమానికి 5, ప్రజావాణికి 173 ఫిర్యాదులు వచ్చాయి. ఇంగ్లిష్ టీచర్ను కేటాయించాలి స్కూళ్లు ప్రారంభమై మూడు నెలలు గడిచినా తమకు ఇంగ్లిష్ పాఠాలు ప్రారంభం కాలేదని, ఇంగ్లిష్ టీచర్ను నియమించాలని కోరుతూ కోయిలకొండ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు వేడుకున్నారు. తమ పాఠశాలలో పని చేస్తున్న ఇంగ్లిష్ టీచర్ సరితను జిల్లాకేంద్రంలో బీఈడీ కళాశాలకు డిప్యూటేషన్ ఇచ్చారని, ఆమె డిప్యూటేషన్ రద్దు చేసి, ఇంగ్లిష్ టీచర్ను కేటాయించాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఇప్పించండి మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్పల్లి శివారులో ఆదర్శనగర్ కాలనీ వద్ద సర్వే నెం.523లో 2012లో ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హౌసింగ్ అధికారులు ఒరిజినల్ పట్టా సర్టిఫికెట్లు తీసుకున్నారు. తమకు ఇళ్ల పట్టాలు తిరిగి ఇప్పించి డబుల్బెడ్రూం ఇళ్లను మంజూరు చేయాలి. ఈ విషయంపై హౌసింగ్ పీడీని అడిగితే స్పందించలేదని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ.. కోర్టు పరిధిలో భూమిపై కేసు ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు తమ భూమిని కబ్జా చేస్తూ ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని నాగర్కర్నూల్ మండలం నల్లవెల్లికి చెందిన నాగలక్ష్మి, కవిత ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 248లో నాలుగు ఎకరాల భూమిని తమ నుంచి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విధుల్లోకి తీసుకోవాలి నాలుగేళ్లుగా మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్న తమను అకారణంగా తొలగించారు, తమను విధుల్లోకి తీసుకోవాలని 30 మంది కార్మికులు వేడుకున్నారు. రెగ్యూలర్ చేస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. తమను తొలగించడంతో రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. చెరువు భూమిని ప్లాట్లు చేస్తున్నారు మక్తల్ మండలం పులిమామిడి వద్ద సర్వే నం.455లో చెరువు భూమిని ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన బి.జయరాజు కోరారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వనపర్తిలోనే కొనసాగించాలి జిల్లాల పునర్విభజనలో బాగంగా పెబ్బేరు మండలాన్ని వనపర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టులోనే కొనసాగించాలని పెబ్బేరు మండలానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు విన్నవించారు. ఆత్మకూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులో కలుపుతున్నట్లు తెలుస్తోందని, తమకు ఆత్మకూర్ చాలా దూరమవుతుందని పేర్కొన్నారు. -
ఫిర్యాదుల వెల్లువ
ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించాలని వినతి ఫిర్యాదులు స్వీకరించిన జేసీ రాంకిషన్ ఈ వారం మొత్తం ఫిర్యాదులు 176 మహబూబ్నగర్ న్యూటౌన్: కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో ప్రజలు తరలివచ్చారు. కృష్ణా పుష్కరాలు నేపథ్యంలో నాలుగు వారాలుగా ప్రజావాణిని రద్దు చేశారు. దీంతో ప్రజలు తమ పిర్యాదులు, వినతులు సమర్పించేందుకు సోమవారం కలెక్టరేట్కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఫిర్యాదుదారులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. జేసీ ఎం.రాంకిషన్, డీఆర్వో భాస్కర్, మెప్మా పీడీ లింగ్యానాయక్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూముల సమస్యలు, కబ్జాలు, రుణాలు, ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ వినతులు వచ్చాయి. ఈ వారం ప్రజావాణికి వినతులు, ఫిర్యాదులు 170, ఆన్లైన్ పరిష్కారం కార్యక్రమానికి ఆరు ఫిర్యాదులు వచ్చాయి. నా పింఛన్ వేరే వాళ్లు తీసుకుంటున్నారు ‘మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ వర్కర్గా పనిచేస్తున్న నా భర్త ఎ.చిన్ననర్సయ్య అనారోగ్యం మృతి చెందాడు. ప్రభుత్వం నుంచి వచ్చిన బెనిఫిట్లన్నింటిని వీరన్నపేటకు చెందిన లక్ష్మయ్య, సిద్ధయ్య కాజేశారు. నాకు రావాల్సిన పింఛన్ కూడా వాళ్లే తీసుకుంటున్నారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాను. పెద్దదిక్కు కోల్పోయిన నాకు సాయం చేయండి.’ – ఎ.నాగమ్మ, మహబూబ్నగర్ సారాయి మానేశాం.. ఉపాధి చూపండి ‘సారాయి తయారు చేసి అమ్ముకుని ఇంతకాలం జీవనం సాగించాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మేము పూర్తిగా సారాయి వృత్తిని మానేశాం. ఇప్పుడు మాకు ఉపాధి లేదు. బ్యాంక్ నుంచి రుణాలిచ్చి, ఆర్థిక సహాయం చేస్తే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని బతుకుతాం. దయ చూపండి సారూ’ అని తిమ్మాజిపేట మండలం పుల్లగిరికి చెందిన ముడావత్ మారు, ముడావత్ నీల, జయమ్మ, బన్నీబాయి వేడుకున్నారు. లీజును రద్దు చేయాలి పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ శివారులో సర్వే నం.521లో ఎస్వీఆర్ మినరల్స్ కంపెనీకి ఇచ్చిన 39ఎకరాల సున్నపురాయి లీజును రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎంపీటీసీ సత్యంసాగర్, రాజు, దామోదరచారి విన్నవించారు. లీజును రద్దు చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కొందరు వ్యక్తుల ప్రోత్సాహంతో అక్రమంగా బ్లాస్టింగులు చేస్తూ దొంగచాటున సున్నపురాయిని తీసుకెళుతున్నారని ఆరోపించారు. పేపర్మిల్లును తొలగించాలని.. కొత్తూరు మండలం సోదాపూర్ గ్రామ శివారులో ఉన్న పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పంటలు నష్టపోతున్నామని, పేపర్ మిల్లును తొలగించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన జైపాల్రెడ్డి, జంగారెడ్డి, రవీందర్, మరో పదిమంది జేసీకి విన్నవించారు. గుంపు మేస్త్రీపై చర్య తీసుకోవాలి గుంపు మేస్త్రీల చెర నుంచి వలస కార్మికులను విడిపించాలని, చట్టవిరుద్ధంగా వలసలు తీసుకెళ్తున్న అమరచింతకు చెందిన గొల్లరాములు, కొంకనోనిపల్లికి చెందిన బోయ చెన్నప్పలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న రాత్రి ఒక వాహనంలో కూలీలను తరలిస్తుండగా చిన్నచింతకుంట తహసీల్దార్కు సమాచారమిచ్చినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు.