IGPC
-
బంగారానికి భవిష్యత్లో మరింత ఆదరణ
న్యూఢిల్లీ: పెట్టుబడులకు కీలకమైన వైవిధ్య సాధనంగా బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతనాగేశ్వరన్ అన్నారు. బంగారం విలువను కాపాడుకునే సాధనంగానే (స్టోర్ ఆఫ్ వ్యాల్యూ) కాకుండా, ఆభరణంగా, పోర్ట్ఫోలియోకి వైవిధ్యంగా నిలస్తుందన్నారు. అప్పటికి యావ్ ప్రపంచం అంతర్జాతీయంగా ఒకే మానిటరీ వ్యవస్థకు చేరుకుంటుందన్నారు. ఐజీపీసీ–ఐఐఎంఏ బంగారం మార్కెట్ల వార్షిక సదస్సులో భాగంగా నాగేశ్వరన్ మాట్లాడారు. బంగారం ధర గతేడాది 27 శాతం మేర పెరగ్గా, ఈ ఏడాది ఇప్పటికే 12 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విలువను కాపాడుకునే సాధనంగా బంగారం పాత్రను పలుచన చేయకుండానే, బంగారం నిల్వలను ఉత్పాదకత పెంపునకు వినియోగించడానికి మార్గాలను భారత్ కొనుగొనాల్సి ఉందన్నారు. ఇక్కడే విధానపరమైన సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు. గతంలో మాదిరి బంగారం మానిటైజేషన్ (నగదుగా మార్చుకోవడం) తరహా చర్యలను పరిశీలించాలన్నారు. 2015లో బంగారం మానిటైజేషన్ పథకాన్ని కేంద్రం ప్రకటించడం గమనార్హం. బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా దానిపై వడ్డీని పొందే పథకం అది. దిగుమతులను తగ్గించే లక్ష్యంతో కేంద్ర నాడు దీన్ని తీసుకొచి్చంది. ఆ తర్వాత కొన్నాళ్లకే మరుగునపడింది. రుణ భారం మరింత పెరిగితే కష్టమే.. నేడు ప్రపంచ రుణ భారం జీడీపీతో పోల్చితే ఎన్నో రెట్లకు పెరిగిందని అనంతనాగేశ్వరన్ తెలిపారు. ‘‘ఆ స్థాయి అధిక రుణ భారం తలనొప్పిగా మారుతుంది. భవిష్యత్ ఆదాయం వడ్డీ చెల్లింపులకే వెళుతుంది. అభివృద్ధికి పెద్దగా మిగిలేది ఉండదు. అధిక రుణ భారం నేపథ్యంలో దేశాలు ద్రవ్యోల్బణాన్ని ఉపయోగించుకుని రుణం విలువను తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు’’అని నాగేశ్వరన్ పేర్కొన్నారు. -
విజయవంతంకాని పసిడి పథకాలు!: సర్వే
అహ్మదాబాద్: పసిడి డిపాజిట్ స్కీమ్సహా బంగారానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన పలు పథకాలు విజయవంతం కావట్లేదని ఒక అధ్యయనం తేల్చింది. ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (ఐజీపీసీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం–ఏ) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం– ఆయా పథకాలు అంతగా విజయవంతం కాకపోవడానికి ప్రజల్లో అవగాహనా రాహిత్యమే ఒక కారణం. సర్వేకు సంబంధించి మరిన్ని వివరాలు చూస్తే– మహారాష్ట్రలోని కొల్హాపూర్, తమిళనాడులోని కోయంబత్తూర్, పశ్చిమబెంగాల్లోని హూగ్లీ, ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్లలో దాదాపు 1,000 మంది అభిప్రాయాలను సర్వేకు ప్రాతిపదికగా తీసుకున్నారు. వెయ్యి మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే పసిడి డిపాజిట్ పథకం, గోల్డ్ బాండ్ పథకం, గోల్డ్ కాయిన్ స్కీమ్ వంటి వాటి గురించి అవగాహన ఉంది. ఈ మూడు స్కీములను రెండేళ్ల క్రితమే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తక్షణ గృహ అవసరాలు, రుణ చెల్లింపులకు పసిడి రుణాలను ప్రధానంగా వినియోగించుకుంటున్నట్లు సర్వే పేర్కొందనీ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. తాము పసిడిపై రుణాలను వ్యాపారానికి, విద్యకు, గృహ మరమత్తులకు వినియోగించుకుంటున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది తెలిపారు.