Imrul Kayes
-
'భారత జట్టులో అతడు లేడు.. మీకు ఇదే మంచి ఛాన్స్'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్లో పటిష్టమైన టీమిండియాను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఎలాగైనా భారత్ను ఓడించాలని బంగ్లా టైగర్స్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే దుబాయ్కు చేరుకున్న బంగ్లా జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. బంగ్లా క్రికెట్ జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది.ఈ టోర్నీకి ముందు వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. అదేజోరును ఈ మినీ వరల్డ్కప్లోనూ కనబరచాలని బంగ్లా జట్టు భావిస్తోంది. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ గాయం నుంచి కోలుకుని తిరిగి రావడం బంగ్లాకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ ఓపెనర్ ఇమ్రాల్ కైస్ తమ జట్టుకు పలు సూచనలు చేశాడు. భారత జట్టులో బుమ్రాలేని లోటును బంగ్లా సొమ్ముచేసుకోవాలని కైస్ అభిప్రాయపడ్డాడు."భారత్ బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ను కలిగి ఉంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. అయితే జట్టులో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం మా జట్టుకు కలిసొచ్చే ఆంశం. బుమ్రా గత రెండేళ్లలో భారత జట్టుకు ఎటువంటి విజయాలను అందించాడో మనకు మనందరికీ తెలిసిందే. అతడి గైర్హాజరును బంగ్లాదేశ్ సద్వినియోగం చేసుకోవాలి. బుమ్రా లేనప్పటికి మహ్మద్ షమీ వంటి స్పీడ్ స్టార్ జట్టులోకి వచ్చాడు. అయితే అతడు ప్రస్తుతం ఫిట్నెస్తో కొంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ అతడు తన రిథమ్ను తిరిగి పొందితే, బంగ్లాదేశ్కు పెనుముప్పులా మారుతాడని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైస్ పేర్కొన్నాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బంగ్లాదేశ్ జట్టునజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్ ఎమాన్, నాసుమ్ అహ్మద్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా.చదవండి: మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ -
రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ ఓపెనర్
బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాటర్ ఇమ్రుల్ కయేస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల కయేస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్తో పాటు టెస్ట్లకు కూడా వీడ్కోలు పలికాడు. కయేస్ నవంబర్ 16న తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనున్నట్లు వెల్లడించాడు. కయేస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వీడియో మెసేజ్ ద్వారా షేర్ చేశాడు. కయేస్ రెడ్ బాల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా వైట్ బాల్ క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. కయేస్ తన చివరి మ్యాచ్ను బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్లో ఆడనున్నాడు. ఈ టోర్నీలో ఖుల్నా డివిజన్కు ప్రాతినిథ్యం వహించే కయేస్.. ఢాకా డివిజన్తో తన ఆఖరి మ్యాచ్ ఆడతాడు. నేషనల్ క్రికెట్ లీగ్ అనేది బంగ్లాదేశ్లో సంప్రదాయ దేశవాలీ టోర్నీ. కయేస్ 2019లో తన చివరి టెస్ట్ మ్యాచ్ను ఆడాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్ భారత్తో తలపడింది. కయేస్ తన టెస్ట్ కెరీర్లో 39 మ్యాచ్లు ఆడి 24.28 సగటున 1797 పరుగులు చేశాడు. కయేస్.. తమీమ్ ఇక్బాల్తో కలిసి తొలి వికెట్ను నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. కయేస్-తమీమ్ జోడీ తొలి వికెట్కు 53 ఇన్నింగ్స్ల్లో 2336 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ తరఫున తొలి వికెట్కు ఇవి అత్యుత్తమ గణాంకాలు. కయేస్ తన చివరి మ్యాచ్లో కనీసం 70 పరుగులు చేస్తే తన కెరీర్లో 8000 పరుగుల మార్కును దాటతాడు. కయేస్కు వన్డే క్రికెట్లో ఓ మోస్తరు రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో అతను 78 మ్యాచ్లు ఆడి 32 సగటున 2434 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
సబ్స్టిట్యూట్ గా వరల్డ్ రికార్డు..
వెల్లింగ్టన్:అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాదు.. ఏకంగా వరల్డ్ రికార్డే నెలకొల్పాడు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ ఇమ్రూల్ కేయిస్. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ రెగ్యులర్ వికెట్ కీపర్ ముష్కిఫికర్ రహీమ్ గాయపడటంతో సబ్స్టిట్యూట్గా ఇమ్రూల్ ఫీల్డ్ లోకి వచ్చాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా నాల్గోరోజు ఆటలో ఐదు క్యాచ్లతో ఇమ్రూల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ చరిత్రలో సబ్స్టిట్యూట్గా వచ్చిన వికెట్ కీపర్ ఐదు అంతకంటే ఎక్కువ క్యాచ్లను పట్టిన దాఖలాలు లేవు. దాంతో ఆ ఘనత సాధించిన తొలి సబ్స్టిట్యూట్ వికెట్ కీపర్ గా ఇమ్రూల్ గుర్తింపు సాధించాడు. ఇదిలా ఉంచితే, బంగ్లాదేశ్ తరపున అత్యధిక వికెట్ కీపింగ్ అవుట్లు సాధించిన రెండో వికెట్ కీపర్గా ఇమ్రూల్ నిలిచాడు. అంతకుముందు ముష్కిఫికర్ ఆ ఘనతను రెండు సార్లు సాధించాడు. -
పరుగుల వరద
కుల్నా: పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో పరుగుల వరద కొనసాగుతోంది. రెండు టీమ్ లు పరుగుల వేటలో పోటీ పడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో పాక్ భారీ స్కోరు చేయగా, బంగ్లా టీమ్ దీటుగా జవాబిచ్చింది. 537/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పాక్ 628 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్(224) డబుల్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. వికెట్ నష్టపోకుండా 273 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, ఇమ్రుల్ కేయస్ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 267 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లాదేశ్ తరపున ఏ వికెట్ కైనా ఇతే అత్యధిక భాగస్వామ్యం. ఇక్బాల్(183 బంతుల్లో 138; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇమ్రుల్(185 బంతుల్లో 132; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీలతో కదం తొక్కారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు లేవు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 332 పరుగులు చేసింది. పాక్ కంటే బంగ్లా ఇంకా 23 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు కలిసి 1233 పరుగులు చేశాయి. ఇందులో ఆరు అర్ధసెంచరీలు, 2 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉంది. మొదటి 4 రోజుల ఆటలో 20 వికెట్లు మాత్రమే పడ్డాయి.