15 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 15 నుంచి 23 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 872 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 4,78,270 మంది అభ్యర్థులు హాజరుకానుండగా... వీరిలో మొదటి సంవత్సరానికి సంబంధించి 3,26,632 మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 1,51,648 మంది ఉన్నారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు...
విద్యార్థులను 15 నిమిషాల ముందే పరీక్ష హాలులోకి అనుమతిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ శనివారం మీడియాకు వివరించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని చెప్పారు. హైటెక్ కాపీయింగ్ను అరికట్టేందుకు జీపీఆర్ఎస్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రశ్నపత్రాన్ని సీసీ కెమెరాల ముందే తీసి పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు.