ISI terrorist organization
-
కశ్మీర్పై డ్రోన్లతో దాడికి పాక్ కుట్ర
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి తన దుర్బుద్ధిని ప్రదర్శించడానికి సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ లక్ష్యంగా డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించడానికి కుట్రలు పన్నుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) లష్కరే తోయిబా, కొందరు ఉగ్రవాదులకు శిక్షణనిస్తోంది ఇరాక్, సిరియాలౖపై దాడుల కోసం వాడుతున్న డ్రోన్లు, బాంబులు వెదజల్లే ఫ్లయింగ్ మిషన్లతో ఉగ్రవాద సంస్థలకి శిక్షణ నిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. తొలుత పాకిస్తాన్ నాసిరకమైన డ్రోన్లు వాడి వాటి వీడియోలను ప్రచారం కోసం వాడుకోవాలని అనుకుంది. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని డబ్బులు వెదజల్లుతూ అంతర్జాతీయ విపణిలో లభించే డ్రోన్లు, ఫ్లయింగ్ మిషన్లను తీసుకుంది. వాటితో జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ నిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 3 కి.మీ. వరకు బాంబుల వర్షం పాకిస్తాన్ ఐఎస్ఐ కొనుగోలు చేసిన డ్రోన్లు, ఫ్లయింగ్ మిషన్లు అయిదు కేజీల పేలుడు పదార్థాలను మోసుకుపోగలవు. వాటి ద్వారా మూడు కి.మీ. పరిధి వరకు విధ్వంసం సృష్టించవచ్చు. ఇస్లామిక్ స్టేట్ ఫైటర్స్ ఈ డ్రోన్లను కొనుగోలు చేసి మొట్టమొదటి గురి కశ్మీర్పైనే పెట్టినట్టుగా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఉగ్రవాదంపై పోరాటం కోసం ఏర్పాటైన యునైటెడ్ స్టేట్స్ మిలటరీ అకాడమీ సెంటర్కి చెందిన డాన్ రస్లార్ అనే ప్రొఫెసర్ చెప్పిన వివరాల ప్రకారం తొలుత పాకిస్తాన్ డూప్లికేట్ డ్రోన్లపైనే దృష్టి సారించింది. కానీ ఆ తర్వాత భారీగా నగదు వెచ్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్లను తీసుకుంది. ఎలాంటి దాడినైనా తిప్పి కొడతాం: భారత్ పాక్ వైపు నుంచి వచ్చిన ఏ ముప్పునైనా తిప్పికొట్టడానికి భారత్ సిద్ధంగా ఉంది. సరిహద్దు ఆవల నుంచి డ్రోన్లు, ఫ్లయింగ్ మిషన్లు ఏవీ వచ్చినా వెంటనే వాటిని కూల్చేందుకు సమాయత్తమవుతున్నట్టుగా సరిహద్దు భద్రతా దళానికి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. -
‘దేశద్రోహానికి’ నల్లగొండలో కుట్ర!
-
‘దేశద్రోహానికి’ నల్లగొండలో కుట్ర!
♦ అక్కడి ఫంక్షన్లోనే శ్రీనగర్ పారిపోవాలని స్కెచ్ ♦ ఆ మరుసటి రోజే ఉడాయించిన ‘ఐసిస్ త్రయం’ ♦ ఓ డాక్యుమెంటరీ ఎక్కువగా ప్రేరణ ఇచ్చింది: బాసిత్ ♦ మిగిలిన ఇరువురినీ ప్రేరేపించింది ఇతగాడే సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరేందుకు ఇళ్లు వదిలి వెళ్లిపోవాలనే పథకానికి ‘ఐసిస్ త్రయం’ నల్లగొండలో అంకురార్పణ చేసింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ విమానాశ్రయంలో చిక్కిన అబ్దుల్ బాసిత్, మాజ్ హసన్ ఫారూఖ్, ఫారూఖ్ హుస్సేనీలపై దేశద్రోహం, కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం విదితమే. బాసిత్, హసన్లు మొదటిసారి కోల్కతాలో పట్టుబడినప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసిన పోలీసులు కేసు లేకుండా అప్పగించారు. అయినప్పటికీ ఐసిస్లో చేరే బలమైన కోరిక ఉండటంతో బాసిత్ మిగిలిన ఇద్దరినీ తన దారిలోని వచ్చేలా ప్రేరేపించాడు. నల్లగొండ ఫంక్షన్లో నిర్ణయం... ఈ నెల 24న నల్లగొండలో జరిగిన ఓ ఫంక్షన్కు కుటుంబీకులతో ఈ ముగ్గురూ హాజరయ్యారు. అక్కడే శ్రీనగర్ వెళ్లిపోవాలని కుట్ర పన్నారు. నిందితుల నుంచి ట్యాబ్ను రికవరీ చేసిన పోలీసులు అందులో చాలా సమాచారం డెలిట్ అయినట్లు గుర్తించారు. బాసిత్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఆ సమాచారాన్ని కూడా రిట్రీవ్ చేసి, పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే వీరితో సంబంధాలు కొనసాగించిన, ప్రేరేపించిన వారికి సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దీనికోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపాలని నిర్ణయించారు. మరోపక్క ఆదిలాబాద్లో వదిలి వెళ్లిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఇంటికి పంపి మళ్లీ పిలిపించారు... రాష్ట్ర పోలీసుల వెంట ఉన్న సిట్ పోలీసులు అదే రోజు రాత్రి 11.30 గంటలకు ముగ్గురినీ హైదరాబాద్కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. మరుసటి రోజు ఉదయం (27వ తేదీ) సిట్ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాం డ్లో ఉన్న ఈ ముగ్గురు నిందితుల్ని 15 రోజుల కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగ్పూర్లో విమానాశ్రయంలో ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్న సమయంలో మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులూ విచారించారు. ఈ నేపథ్యంలోనే ఐసిస్కు సంబంధించి ఆన్లైన్లో అనేక రకాలైన వీడియోలు, ఫొటోలు తమను ఆకర్షించాయని ఈ త్రయం వెల్లడించింది. అన్నింటినీ మించి యూ ట్యూబ్లో అందుబాటులో ఉన్న ‘...కశ్మీ రీ’ డాక్యుమెంటరీ తమపై తీవ్ర ప్రభావాన్ని చూపి, ప్రోద్బలాన్ని ఇచ్చిందని బయటపెట్టారు. జిహాదీలుగా మారి ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనకు కృషి చేయడమే తమ ఆలోచన అని, అందుకోసం ఐసిస్ ద్వారా పోరాడుతున్న ఆ సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీని కలవాలన్నది అంతిమ లక్ష్యమని వీరు బయటపెట్టారని తెలిసింది. ఇలా చిక్కారు... నగరం నుంచి బయలుదేరి 25వ తేదీ ఉదయం 9 గంటలకు అదిలాబాద్ చేరుకున్న ఈ ముగ్గురూ అక్కడ రూ.3,500 బాడుగకు ఓ ట్యాక్సీ మాట్లాడుకున్నారు. అదేరోజు మధ్యాహ్నానికి నాగ్పూర్ చేరుకున్నారు. ఎక్కడా బస చేయకుండా తిరుగుతూ గడిపి తెల్లవారుజాము 3 గంటలకు నాగ్పూర్ విమానాశ్రయానికి చేరుకుని... విమాన సమయం వరకు విశ్రాంతి తీసుకోవడానికి లోపలకు అనుమతించమంటూ సెక్యూరిటీ సిబ్బందిని కోరుతున్న సందర్భంలోనే ఏటీఎస్, రాష్ట్ర పోలీసు సంయుక్త బృందానికి చిక్కారు. -
‘ఐసిస్ త్రయం’ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఐసిస్లో చేరేందుకు వెళ్తూ నాగ్పూర్ విమానాశ్రయంలో శనివారం చిక్కిన ముగ్గురు హైదరాబాదీలు అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్లను ఆదివా రం అరెస్టు చేసినట్లు సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ ప్రభాకర్రావు సోమవారం ప్రకటించారు. వీరిపై ఐపీసీ, ఐటీ యాక్ట్తో పాటు అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్(యూఎల్ఏపీఏ) కింద కేసు నమోదు చేశారు. సోదరుల వరుసయ్యే ఈ ముగ్గురూ నిషిద్ధ సిమీ జాతీయ మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్ సమీప బంధువులు. నాగ్పూర్ మీదుగా శ్రీనగర్ వెళ్లి దుక్త్రాన్-ఎ-మిల్లత్ సంస్థ నిర్వాహకురాలు ఆసియాన్ అంద్రబీని కలవాలని వీరు నిర్ణయించుకున్నారు. ప్రయాణ ఖర్చుల కోసం బాసిత్ తన ఇంట్లో రూ.90 వేలు చోరీ చేసి తీసుకువెళ్లాడు. సలావుద్దీన్ పేరు వినియోగించుకుని అంద్రబీ సాయం పొందాలని ముగ్గురు భావించారు. ఆమె సహకరించని పక్షంలో పాకిస్థాన్కు చేరుకుని ఐఎస్ఐ సహకారంతో లేదా అఫ్ఘనిస్తాన్ వెళ్లి అల్ఖైదాలో చేరడం ద్వారా ‘జిహాద్’ చేయాలని ఈ త్రయం కుట్ర పన్నిం ది. ఏదో ఒక రకంగా ఇరాక్, సిరియా, పాలస్తీనాలకూ వెళ్లి ఐసిస్ తరఫున పోరాడాలన్నది వీరి అంతిమ లక్ష్యంగా పోలీసులు గుర్తించారు. ఈ విధంగా రాడికలైజ్ కావడానికి ఇంటర్నెట్ను వినియోగించుకోవడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్తో పాటు కుట్ర, యూఎల్ఏపీఏ చట్టం కింద వీరిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ముగ్గురినీ తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కాగా వీరి వైఖరిలో స్పష్టత లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ‘ఓపక్క ఐసిస్ సంస్థ ఇస్లాం చట్టానికి (షరియత్)కు వ్యతిరేకంగా పని చేస్తోందని వారే చెప్తున్నారు. దాని పనితీరులో ఎన్నో లోపాలున్నాయనీ అంటున్నారు. మరోపక్క ఐసిస్లో చేరి యుద్ధం చేయాలని భావిస్తున్నామనీ వాంగ్మూలం ఇస్తున్నారు’ అని ఆయన చెప్పారు. పోలీసు కస్టడీకి తీసుకుని విచారించిన తరవాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ ముగ్గురు నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాబ్, ఫోన్లను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని నిర్ణయించుకున్నారు. నాగ్పూర్కు బైకులపై బయలుదేరారు... శ్రీనగర్ లక్ష్యంగా బయలుదేరిన ‘ఐసిస్ త్రయం’ నగరం నుంచి బైకుల పైనే నేరుగా నాగ్పూర్ చేరుకోవాలని భావించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు రెండు బైకులపై అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదిలాబాద్ వరకు వెళ్లేసరికి ఈ ముగ్గురూ చలిని తట్టుకోలేక, క్యాబ్ బుక్ చేసుకుని శుక్రవారం మధ్యాహ్నానికి నాగ్పూర్ చేరుకున్నారు. అక్కడి గురుముఖ్ ట్రావెల్స్లో శ్రీనగర్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కొన్నారు. శనివారం నాగ్పూర్ నుంచి బయలుదేరే ఇండిగో విమానంలో ప్రయాణించడానికి రూ.36 వేలకు మూడు టిక్కెట్లు ఖరీదు చేశారు. శుక్రవారం నాగ్పూర్లోనే సంచరించిన ఈ త్రయం రూ.3 వేలు వెచ్చించి షాపింగ్ చేయడంతో పాటు ‘దిల్వాలే’, ‘స్టార్వార్స్’ సినిమాలూ చూశారు. ఇంటి నుంచి బయటకు వస్తూ బాసిత్ ఓ లేఖ రాసి పెట్టాడు. అందులో తనను క్షమించాలని, తాను జిహాద్ చెయ్యడానికి వెళ్లిపోతున్నానని, తిరిగి జన్నత్(స్వర్గం)లో కలుద్దామంటూ పేర్కొన్నాడు. ఈ లేఖను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురినీ నగర పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఇదీ వారి చరిత్ర... అబ్దుల్లా బాసిత్ (20) చంద్రాయణగుట్టలోని నసీబ్నగర్కు చెం దిన ఇతడు డెక్కన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. గత ఏడాది సెప్టెంబర్లో కోల్కతాలో పట్టుబడటంతో యాజమాన్యం కళాశాల నుం చి పంపించేసింది. హిమాయత్నగర్లో ని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. సిట్ పోలీసులు ఇతడి నుంచి డెల్ట్యాబ్, నాగ్పూర్ టు శ్రీనగర్ విమాన టిక్కెట్లు, రూ.20 వేల నగదు (చోరీ చేసిన రూ.90 వేలు లోనివే) స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ రాసి ఇంట్లో ఉంచిన ఓ లేఖ సైతం పోలీసులకు చిక్కింది. మాజ్ హసన్ (22) హుమాయూన్నగర్లోని అజీజియా మసీదు సమీపంలో నివసించే ఇతడు ఓ కళాశాలలో ఇన్స్ట్రుమెంటల్ కోర్సులో బీఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అనేక బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇతడి నుంచి ఓ మొబైల్ ఫోన్, రూ.10,500 నగదు (చోరీ చేసిన రూ.90 వేలు లోనివే) స్వాధీనం చేసుకున్నారు. ఒమర్ ఫారూఖ్ (22) చంద్రాయణగుట్టలోని గుల్షన్ ఇక్బాల్ కాలనీకి చెందిన ఇతడు బర్కత్పురలోని ఓ కళాశాలలో బీఎస్సీ మైక్రోబయాలజీ పూర్తి చేశాడు. ఇతడికీ బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి. పోలీసులు ఇతడి నుంచి ఐఫోన్, రూ.11,300 నగదు (చోరీ చేసిన రూ.90 వేలు లోనివే) స్వాధీనం చేసుకున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగిస్తాం: మహేందర్రెడ్డి ఐసిస్ సహా ఇతర ఉగ్రవాద సంస్థల వైపు మొగ్గు చూపుతున్న యువతను గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కౌం టర్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇప్పటి వర కు హైదరాబాద్కు చెందిన 17 మంది రాడికలైజ్ అయిన వారిని గుర్తించామని, వీరికి స్పెషల్ బ్రాంచ్ ఆధీనంలోని డీ-రాడికలైజేషన్ కౌన్సెలింగ్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇచ్చామని ఆయన తెలిపారు. సోమవారం జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ‘ఐసిస్ త్రయం’లో ఇద్దరికి గతంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, అయినా వారిప్పుడు మళ్లీ ఐసిస్లో చేరేందుకు ప్రయత్నించడాన్ని విలేకరులు ప్రస్తావించగా... పైవిధంగా స్పందించారు. ‘ఆ ముగ్గురి’పై కఠినంగా ఉండండి: కేంద్ర హోంశాఖ న్యూఢిల్లీ: ఐసిస్లో చేరడానికి వెళుతూ నాగ్పూర్లో పట్టుబడిన మగ్గురు హైదరాబాదీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. గతంలోనూ ఉగ్రవాద సంస్థలో చేరడానికి వెళుతూ సెప్టెంబర్ 2014లోనూ వీరు చిక్కారు. అప్పుడు వీరిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు, అరెస్టు కూడా చేయలేదు. అయితే ప్రస్తుతం వీరిపై కఠిన నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే ఇదే తప్పు మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని కేంద్రం.. రాష్ట్రానికి సూచించింది. -
భారత్లో దాడులకు ఐఎస్ఐ కుట్ర
♦ లష్కరే, జైషే, హిజ్బుల్లతో పాటు సిక్కు ఉగ్రవాదులకూ శిక్షణ ♦ 15 నుంచి 20 మంది వరకూ ఉగ్రవాదుల సమీకరణ న్యూఢిల్లీ : పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ భారత్లో ఉగ్రదాడులు జరపటానికి.. లష్కరే తోయిబా, జైషేమొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలతో పాటు.. సిక్కు తీవ్రవాద సంస్థలైన బబ్బర్ఖల్సా, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రవాదులను సమీకరించి శిక్షణనిప్పిస్తోందని నిఘా సమాచారం తెలిసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాల కథనం ప్రకారం.. ఢిల్లీ, పంజాబ్, జమ్మూకశ్మీర్లలో దాడులు జరపటానికి.. 15 నుంచి 20 మంది ఉగ్రవాదులను ఐఎస్ఐ సమీకరించింది. ఆయా సంస్థల్లో పనిచేసే పాక్, ఆక్రమిత కశ్మీర్ వాసులను ఎంపిక చేసింది. పాక్ నుంచి ఎంపిక చేసిన సిక్కు ఉగ్రవాదులకు.. సిక్కు సంప్రదాయాలు, గుర్ముఖీ గ్రంథం గురించి పాక్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాలో తర్ఫీదునిచ్చింది. ఇందుకోసం ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ చీఫ్ రంజిత్సింగ్ సాయం తీసుకుంది. పంజాబ్ భౌగోళిక స్వరూపస్వభావాలను వివరించింది. ఈ ఉగ్రవాదులందరికీ భారత సరిహద్దు వెంట పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాక్లోని ఇతర శిబిరాల్లో.. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వినియోగించటంపై శిక్షణనిస్తోంది. శిక్షణ కార్యక్రమం లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సాయంతో సాగుతోంది. ఈ ఉగ్రవాదుల్లో కొందరు ఇప్పటికే దాడుల కోసం పంజాబ్కు వచ్చి ఉండొచ్చని, లేదా ప్రవేశించే క్రమంలో ఉండి ఉంటారని.. పంజాబ్, కశ్మీర్లలోని భద్రతా సంస్థలను భారత నిఘా విభాగం హెచ్చరించింది. ఈ దాడుల కోసం వాడే ఆయుధాలను జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్కు వచ్చే ట్రక్కుల చాసిస్లలో తొలిచిన పగుళ్లలో దాచిపెట్టి పంపించే అవకాశముందని పేర్కొంది. ఈ సమాచారాన్ని జమ్ముకశ్మీర్ ప్రభుత్వంతో పాటు.. అక్కడ ఉన్న సైన్యం, కేంద్ర బలగాలకు ఈ నెల 24వ తేదీన తెలియజేసింది. పంజాబ్ ప్రభుత్వంతో పాటు అక్కడున్న బీఎస్ఎఫ్, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్, సీఆర్పీఎఫ్ యూనిట్లకు ఈ నెల 26వ తేదీన తెలిపింది.