Justice Ramesh
-
రామ్సింగ్పై తదుపరి చర్యలు నిలుపుదల
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏఎస్పీ రామ్సింగ్పై కడప రిమ్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. రామ్సింగ్పై యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి ఉదయ్రెడ్డి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని మేజిస్ట్రేట్ను హైకోర్టు ఆదేశించింది. కడప రిమ్స్ పోలీస్ ఇన్స్పెక్టర్, ఫిర్యాదుదారు ఉదయ్రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ రామ్సింగ్ వేధిస్తున్నారంటూ ఉదయ్రెడ్డి కడప కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేయగా.. దానిని పరిశీలించిన మేజిస్ట్రేట్ నిబంధనల ప్రకారం దాన్ని పోలీసులకు పంపి విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు కడప రిమ్స్ పోలీసులు సీబీఐ అదనపు ఎస్పీ రామ్సింగ్పై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రామ్సింగ్ హైకోర్టులో బుధవారం అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రమేశ్ విచారణ జరిపారు. రామ్సింగ్ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో దర్యాప్తును అడ్డుకునేందుకే ఉదయ్రెడ్డి తప్పుడు ఆరోపణలతో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారని హరినాథ్ తెలిపారు. ఉదయ్రెడ్డి ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసులు నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకే రామ్సింగ్పై కేసు నమోదు చేశారని వివరించారు. కోర్టు ఆదేశాలిచ్చినప్పుడు వాటిని అమలు చేయడం మినహా పోలీసులకు మరో మార్గం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
ఇష్టానుసారంగా నియమిస్తారా?
కారెం శివాజీ నియామకంపై రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యే వ్యక్తి విశిష్టవ్యక్తి అరుు ఉండాలని చట్టం చెబుతున్నప్పుడు, అందుకు విరుద్ధంగా ఇష్టానుసారం కావాల్సిన వ్యక్తిని చైర్మన్గా నియమించడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఎవరిని చైర్మన్గా నియమించాలన్న విషయంలో ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉన్న మాట వాస్తవమే అరుునా, నియామకం మాత్రం ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని ప్రశ్నించింది. చైర్మన్ పదవికి ప్రసాద్బాబు అనే వ్యక్తి కూడా దరఖాస్తు చేసుకున్నప్పుడు అతని దరఖాస్తును పరిగణనలోకి తీసుకోకుండా, శివాజీనే చైర్మన్గా నియమించాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశిష్టవ్యక్తంటే సాధారణ వ్యక్తి కాదని సింగిల్ జడ్జి తన తీర్పులో పేర్కొన్నారని, ఇందులో ఎటువంటి దోషం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే విధంగా ప్రజా సంబంధిత పోస్టుల నియామకం సహేతుకంగా, పారదర్శకంగా ఉండాలని కూడా సింగిల్జడ్జి చెప్పారని, ఇది కూడా సబబుగానే ఉందంది. సింగిల్ జడ్జి చెప్పిన అంశాలు ఏ విధంగా సరికాదో వివరించాలని కూడా ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను గురువారానికి వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ చైర్మన్గా కారెం శివాజీని నియమిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 13న జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన న్యాయవాది జె.ప్రసాద్బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సుదీర్ఘ విచారణ చేపట్టిన జస్టిస్ రామచంద్రరావు గతవారం తీర్పునిస్తూ కారెం శివాజీ నియామకాన్ని రద్దు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అటు కారెం శివాజీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.