బాంబు పేలుడు: అయిదుగురు మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుడుతో దద్దరిల్లింది. మధ్య బాగ్దాద్లోని కర్దా జిల్లాలో నిత్యం జనసమర్థంగా ఉండే ప్రాంతంలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అయిదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు.
ఈ నేపథ్యంలో మృతల సంఖ్య మరింత పెరిగి అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇటీవల కాలంలో ఇరాక్లో కారు బాంబు పేలుళ్లు నిత్యకృత్యమైనాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 5576 మంది మరణించారు. 11666 మందికిపైగా గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.