Khammam MLA
-
ప్రతి డివిజన్లో సూచికలు ఏర్పాటు చేయండి
ఖమ్మం : మారుతున్న ఖమ్మం నగర ముఖ చిత్రానికి అనుగుణంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో రోడ్ సూచికలను ఏర్పాటు చేయాలని, దీంతో ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ కార్పొరేటర్లకు సూచించారు. ఆదివారం స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి ఆధ్వర్యంలో డివిజన్లో ఏర్పాటు చేసిన రోడ్ సూచికలను ప్రారంభించారు. డివిజన్లోని బోనకల్ రోడ్, శాంతినగర్రోడ్, పాకబండరోడ్లో 29 రోడ్ సూచికలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ తరహాలో ప్రతి ఒక్క కార్పొరేటర్ చొరవ చూపి నగర సుందరీకరణలో పాలుపంచుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల పూర్తి చేసిన సీసీ రోడ్ నిర్మాణంలో జరిగిన నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో తాజుద్దీన్, నాగరాజు, సురేష్, రెహమన్, మనోహర్, సాయి, నరేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు గుడ్ బై: టీఆర్ఎస్లోకి ఖమ్మం ఎమ్మెల్యే
ఖమ్మం: ఎన్నికల్లో ఒటమి తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులు, సమిష్టి నాయకత్వ లోపాలతో తీవ్రమైన చిక్కుల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో, మీడియా చర్చల్లో పార్టీ గొంతుకను బలంగా వినిపించే ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనమా చేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతానని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన తన రాజీనామాను ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నాయకులపై అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ పార్టీలో నన్ను అణగదొక్కే ప్రయత్నం చేశారు. అయినాసరే ఇన్నాళ్లూ మనసు చంపుకొని పార్టీ కోసం పాటుపడ్డా. నిజానికి సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం తీవ్రంగా పాటుపడుతున్నారు. కానీ ఆ విషయాలపై మా నాయకులు నాతో అబద్ధాలు చెప్పించారు' అని పువ్వాడ అజయ్ తాను పార్టీ మారబోతుండటాన్ని సంమర్థించుకున్నారు. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధితోపాటు జిల్లా వృద్ధిపథంలో ముందుండాలని కోరుకుంటున్నానన్న ఆయన.. సోమవారం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. సీపీఐ కురువృద్ధుడు పువ్వాడ నాగేశ్వర్ రావు తనయుడు, మమత వైద్య విద్యాసంస్థల అధినేత అయిన పువ్వాడ అజయ్ కుమార్ 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరీచేరగానే ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలో ఆయనతోపాటు హస్తం గుర్తుపై గెలిచిన భట్టి విక్రమార్క(మధిర) కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇప్పటికే కారెక్కగా, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి కొద్ది నెలల కిందట అనారోగ్యంతో చనిపోయారు. ఆయన మరణంతో అనివార్యమైన పాలేరు ఉప ఎన్నిక మరి కొద్ది రోజుల్లో జరుగుతుందనగా అజయ్ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించడం గమనార్హం. పువ్వాడ చేరికతో కాంగ్రెస్ నుంచి అధికారపార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. ఇక టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల చేరికను స్పీకర్ మధుసూదనాచారి అధికారిక విలీనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీసీ నుంచి గెలిచి, టీఆర్ ఎస్ లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే పువ్వాడ అజయ్
-
సదా మీ సేవలోనే..
పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే అజయ్కుమార్ : అమ్మా బాగున్నారా? ఏం సాహెబ్గారు..మీ కాలనీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చా..ఏమైనా ఉంటే చెప్పండి? అల్లం నర్సమ్మ : ఏమి బాగు బిడ్డా.. ముసలోళ్లం బతులు ఇలా అయ్యాయి. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పింఛన్ ఇచ్చేటోడు..నెలకు 200 వస్తే మందులు కొనుక్కునే దాన్ని.. గిప్పుడు గా పింఛన్ కూడా వస్తలేదు. ముసలోళ్లమైన మాకే పింఛన్ రాకుంటే ఎవరికిస్తరు బిడ్డా..జర నువ్వైనా ఇప్పించరాదే. అజయ్కుమార్ : ఏమి అవ్వా..నీ బాధేంటి? తిరుపతమ్మ : ఏం చేయాలి బిడ్డా..రోజంతా పనిచేసుకొని బతుకేటోళ్లం. మాకు ఉండటానికి ఇళ్లు లేవు. ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టిస్తమంటుంది. మా బతుకులకేసి చూసినోళ్లు లేరు. మీరైనా ఇంటిస్థలం ఇప్పించడయ్యా. అజయ్కుమార్ : బుచ్చమ్మా బాగున్నావా..? నీకు పింఛన్ వస్తుందా? బుచ్చమ్మ : లేదు దొరగారు.. మాకు పింఛన్ ఇవ్వట్లేదు. గిదిగో..నా ఆధార్కార్డు చూడండి..68 ఏళ్లు ఉన్నయ్..నాకు పింఛన్ ఇస్తలేరు. మీరు ధర్నా చేసిన కాడికి కూడా వచ్చిన. కాగితం ఇచ్చిన..జర పింఛన్ వచ్చేలా చూడండయ్యా. అజయ్కుమార్ : సలాం మాలేకోం..మీ బాధలు చెప్పండమ్మా.. మదార్బీ : వాలేకుం సలాం..గీ పార్శీబంధంలో 20 ఏళ్లుగా ఉంటున్నం. ఇరుకుదారులు, రోడ్లులేవు, వర్షాకాలంలో మోకాళ్లలోతు బురద, పొయినేడు రోడ్లు పోస్తమని కంకర పోసిండ్రు. రెండురోజుల తర్వాత దాన్ని తీసుకుపోయిం డ్రు..ఇప్పటి వరకు రోడ్లు వేస్తమని చెప్పినోళ్లు లేరు. అజయ్కుమార్ : అమ్మా..మున్సిపాలిటీ వాళ్లు వస్తున్నారా? రహీంబీ : ఎక్కడ మున్సిపాలిటోళ్లు సారు..ఇటువైపు వచ్చినోళ్లే లేరు. నెలల తరబడి కాల్వలు సాపు చేయరు. మురుగునీరు వాసన వస్తోంది..దోమలు విపరీతంగా ఉన్నాయి. పట్టించుకున్నోళ్లు లేరు. అజయ్కుమార్ : అంగన్వాడీ కేంద్రం ఎలా ఉండమ్మా? వన్ఫుల్ మీల్స్ పెడుతున్నారా? కృష్ణకుమారి (అంగన్వాడీ టీచర్): ఇక్కడున్న వాళ్లంతా పనిచేసుకునే వాళ్లే సార్. 40 మంది పిల్లలు రోజూ వస్తారు. సొంతభవనం లేక ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం ఇచ్చే కిరాయి చిన్నగదులకు మాత్రమే వస్తోంది. జనవరి 1 నుంచి గర్భిణులు, బాలింతలకు వన్ఫుల్ మీల్స్ పెడుతున్నాం సార్. అజయ్కుమార్ : ఏంటమ్మా..? బస్తాలు కట్టుకొని ఉంటున్నారు.. ? ఇల్లు లేదా.? సరిత : పేదోళ్లం సారు.. ఏం చేస్తాం.. పది సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని ప్రభుత్వ స్థలం కాల్వపై కట్టినమని కూటగొట్టిండ్రు. వేరేచోట ఇస్తమన్నరు..ఇంతవరకు జాడలేరు. ఏం చేస్తాం మా కర్మ. కిరాయి ఇంట్లో ఉండే స్తోమతలేక ఇదిగో ఇలా బస్తలు కట్టుకొని ఉంటున్నాం. అజయ్కుమార్ : ఏం తమ్ముడు.. ఏం చదువుతున్నావ్? వంశీ కృష్ణ : బీటెక్ ఫస్టియర్ చదువుతున్నా సార్..ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందని బీటెక్లో చేరా. గత సంవత్సరం డబ్బులే ఇప్పటికీ రాలేదట! రీయింబర్స్ రాకపోతే చదువు మధ్యలో ఆపేయాల్సి వస్తుందని భయంగా ఉంది సార్. అజయ్కుమార్ : మీరేరా ఈ స్కూల్ టీచర్? పిల్లలు స్కూల్కు బాగా వస్తున్నారా? భోజన పథకం మంచిగా అమలవుతోందా? రవికుమార్ : నేనే సార్. పిల్లలు బాగానే వస్తున్నార్సార్. మధ్యాహ్నభోజనం కూడా బాగానే వండిపెడుతున్నాం సార్. అంతాబాగానే ఉంది సార్. కానీ బడి చుట్టూ కాంపౌండ్వాల్ లేదు సార్. మంజూరయ్యేలా చూడండి. అజయ్కుమార్ : ఏం అమ్మా..ఏంటి నీ సమస్య? వంగాల లలిత : నాభర్త చనిపోయి ఐదేళ్లయిందయ్యా. ఇద్దరు పిల్లలు. ఆయన డెత్ సర్టిఫికెట్ ఇచ్చినా..ఆధారాలన్నీ సమర్పించినా నాకు పింఛన్ ఇవ్వట్లేదయ్యా. అజయ్కుమార్ : ఏంటమ్మా ఆ కాగితం.. ఎందుకు తెచ్చావు..? వాణి : మాకు ఇందిరమ్మ రెండో విడతలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని అధికారులు చెప్పారు. ఇదిగో సార్.. ఇంటిపట్టా కూడా ఇచ్చారు. ఆరేళ్లయినా స్థలం చూపించలేదు. ఇస్తరో..ఇవ్వరో కూడా చెప్పట్లేదు సార్. అజయ్కుమార్ : ఏం పెద్దాయనా..బాగున్నావా? హుస్సేన్ : ఏం బాగండి.. మా ముసలి దాని కాళ్లు పడిపోయినై..నెలనెలా వచ్చే పింఛన్ ఐదునెలల నుంచి రావట్లేదు. మీరైనా పింఛన్ ఇప్పించండయ్యా. అజయ్కుమార్ : ఏం అన్నపూర్ణమ్మ బాగున్నారా? మీ సమస్యలేమిటి? అన్నపూర్ణమ్మ : బాగున్నాం సార్..మంచినీరు రావట్లేదు. గీ పంపే అందరికీ దిక్కు. దీని పక్కనే మురుగునీరు చేరుతోంది. మంచినీళ్లు, మురికి నీళ్లు కలిసిపోతున్నాయి. మీరే చూడండి ఎలా ఉందో.. (పంపు చూసిన ఎమ్మెల్యే కార్పొరేషన్ కమిషనర్ వేణుమనోహర్కు ఫోన్ చేశారు. పార్శిబం ధం ప్రాంతంలో మురుగుకాల్వలు తీయాలని, పంపుల పరిసరాలు శుభం చేయాలని, ఉదయంకల్లా పనిపూర్తి చేయాలని ఆదేశించారు.) అజయ్కుమార్ : ఏం నాగేశ్వరరావు (మాజీ కౌన్సిలర్) బాగున్నారా? పాలకుర్తి నాగేశ్వరరావు : ఏం బాగు సారు. మా వార్డుల్లో అర్హులైన వారి పెన్షన్లు తీసివేశారు. ఏ వీధికి వెళ్ళినా ముసలోళ్ల గోడు వినాల్సి వస్తోంది. రోడ్లు వేస్తమని ప్రతిసారీ అంచనాలు వేస్తున్నారు. కానీ పనులు చేపట్టడం లేదు. వీధి దీపాలు సక్రమంగా వెలగవు..కాల్వలు తీయ రు. అర్హులకు పింఛన్ అందేలా చూడండి. -
ఎమ్మెల్యే తనయుడి ఖాతా నుంచి నగదు మాయం
ఖమ్మం అర్బన్: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ తనయుడు నరేన్ రాజు బ్యాంక్ ఖాతా నుంచి అతనికి తెలియకుండా 1.29లక్షల రూపాయలు మాయమైంది. అతని ఫిర్యాదుతో అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నరేన్ రాజుకు మమత ఆస్పత్రిలోగల ఆంధ్రా బ్యాంకులో ఖాతా ఉంది. ఇందులో నుంచి 1,29,173 రూపాయలు డ్రా అయినట్టుగా అతడు గుర్తించి శుక్రవారం అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన క్రెడిట్ కార్డుకు నకిలీది తయారుచేసి, దాని ద్వారా పై నగదును మూడు విడతలుగా మాయమైనట్టు పేర్కొన్నాడు. ఈ నెల 8న రూ.42వేలు, 9న రూ.42వేలు, 11న మిగిలిన మొత్తంతో ఎవరో ఆన్లైన్ షాపింగ్ చేసినట్టుగా తేలిందని తెలిపాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.