kohir mandal
-
సు‘జలం’.. సు‘ఫలం’!
ఒక ఆలోచన, సమష్టి కృషి ఆ గ్రామ రూపురేఖలను మార్చేసింది. తాగునీటి కోసం తండ్లాట, బీడువారిన పొలాలు, కరువు కాటకాలు, వలసలతో సతమతమైన ప్రాంతం.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పంటలతో కళకళలాడుతోంది. భూగర్భ జల మట్టాలు పెరగడంతో రైతులు ఏటా మూడు పంటలు పండిస్తున్నారు. నాడు కూలి పనులకు వలస వెళ్లినవారే.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలకు పనులు కల్పిస్తున్నారు. ఇక్కడ అవలంబించిన నీటి సంరక్షణ పద్ధతులను రాజస్తాన్ రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారంటే.. ఈ పథకం ఎంత విజయవంతం అయిందో అర్థమవుతుంది. ఇలా కరువును జయించిన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని గొట్టిగారిపల్లి (Gotigarpally) గ్రామంపై గ్రౌండ్ రిపోర్టు ఇది.సంగారెడ్డి జోన్: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో రైతులు వర్షాధారంగానే పంటలు పండించేవారు. వానలు సరిగా కురవకపోయినా, క్రమం తప్పినా పంటలు దెబ్బతిని నష్టపోయేవారు. నీళ్లులేక, పంటలు వేయలేక కూలి పనులకు వెళ్లేవారు. అయితే 2001లో చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు గ్రామ గతిని మార్చేశాయి. వాటర్ షెడ్ పథకం (watershed scheme) ఆరో దశ కింద గొట్టిగారిపల్లికి రూ.22 లక్షలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరుల నిపుణుడు టి.హనుమంతరావు తక్కువ వ్యయంతో చతుర్విద జల ప్రక్రియ పద్ధతిపై గ్రామస్తులకు అనేక సార్లు అవగాహన కల్పించారు. చైనాలోని హుబై రాష్ట్రంలో ఆ విధానంతో మంచి ఫలితాలు వచ్చాయని రైతులకు వివరించారు. వాన నీళ్లు వృథా పోకుండా ఎక్కడికక్కడ ఇంకిపోయేలా చర్యలు చేపట్టారు. సమీపంలోని గుట్టలపై నుంచి దిగువకు వచ్చే నీటిని పొలాల వైపు వచ్చేలా మట్టి కట్టలు నిర్మించారు. కందకాలు తవ్వారు, నీటి చెక్డ్యాంలు కట్టారు. ఆ నీరు చెక్ వాల్వ్లోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో కురిసిన వాన నీరు (Rain Water) ఊరు దాటడం లేదంటే ఎంత పకడ్బందీగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టారో అర్థమవుతుంది. తక్కువ లోతులోనే భూగర్భ జలాలు గతంలో ఇక్కడ 500 ఫీట్ల దాకా బోరు వేసినా చుక్క నీటి జాడ కనిపించకపోయేది. ఇప్పుడు 60 నుంచి 120 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరు లభిస్తోంది. గ్రామంలో 350కిపైగా బోరుబావులు, 50 వరకు బావులు ఉన్నాయి. వాటితో గ్రామంలోని సుమారు 1,600 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. పొలం గట్లు, పంటల చుట్టూ వేసిన ఫెన్సింగ్పై సైతం తీగ జాతికి చెందిన పంటలు సాగు చేస్తున్నారు. ఒక ఎకరా విస్తీర్ణంలో చుట్టూ ఫెన్సింగ్ వేసి కంది, పసుపు, ఆవాలు, కర్బూజా, మిరప, ఉల్లి, బెండకాయ, పలు ఇతర రకాల పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో మడులుగా ఏర్పాటు చేసి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. చెరుకు, మొక్కజొన్న, ఆలుగడ్డ తదితర పంటలు కూడా సాగు చేస్తున్నారు. ఏటా మూడు పంటలు వేసి మంచి ఆదాయం పొందుతున్నారు. జాతీయ స్థాయి అవార్డువాటర్ షెడ్తో పాటు 2010– 11లో ఇందిరా జలప్రభ పథకంలో భాగంగా వ్యవసాయ బో ర్లు తవ్వించి, విద్యుత్ కనెక్షన్ సౌకర్యం కల్పించారు. రూరల్ డె వలప్మెంట్లో భాగంగా అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేపట్టడంతో.. 2010 అక్టోబర్ 2న నిర్వహించిన ఉపాధి హామీ ఉత్సవాల్లో గ్రామానికి జాతీయస్థాయిలో అవార్డు దక్కింది. పంటలు సమృద్ధిగా పండుతుండటంతో జీవన ప్రమాణాలు మారాయి. తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు.ఎంబీఏ చదివి వ్యవసాయం చేస్తున్నా.. నేను ఎంబీఏ చదివిన. మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. చెరుకుతోపాటు అన్నిరకాల కూరగాయలు సాగు చేస్తున్నా. వాటర్ షెడ్ పథకంతో పుష్కలంగా నీరు ఉండటంతో ఏడాదికి మూడు పంటలు పండిస్తూ.. ఎకరాకు రూ.లక్షన్నర వరకు సంపాదిస్తున్నా. – కనకరాజు, యువ రైతు, గొట్టిగారిపల్లివలసలు ఆగిపోయాయి.. గతంలో గ్రామంలో పనులు లేకపోవటంతో ఉపాధి కోసం దుండిగల్, గోమారాం, మద్దికుంట తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లేవాళ్లం. వాటర్ షెడ్ పథకం చేపట్టిన సమయంలో చేసిన పనులకు కూలీ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు మారి పంటలను సాగు చేసుకుంటున్నాం. వలసలు ఆగిపోయాయి. – బాలప్ప, రైతు, గొట్టిగారిపల్లిరైతులకు అవగాహన కల్పించి పనులు చేపట్టాం వాటర్ షెడ్ పథకం ప్రారంభంలో రైతులు అంతగా ఆసక్తి చూపలేదు. అప్పటి నీటి వనరుల నిపుణుడు హనుమంతరావు గ్రామానికి వచ్చి ఆ పనులు చేయటంతో కలిగే ప్రయోజనాలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. అందరి కృషితో పథకాన్ని పూర్తి చేశాం. రెండేళ్ల తర్వాతి నుంచి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం నీటి సమస్య అనేది లేకుండా అన్ని సమయాల్లో అన్ని రకాల పంటలు సాగు చేయగలుగుతున్నాం. – రాచయ్య, మాజీ సర్పంచ్, గొట్టిగారిపల్లి -
కోహిర్@ 8.9
సాక్షి,నెట్వర్క్/హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. రాత్రివేళనేకాదు...పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రత 8.9 డిగ్రీలుగా నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ జిల్లా చౌదరిగూడెంలో 9.4 డిగ్రీలు, కుమ్రంభీం జిల్లా సిర్పూరు(యు)లో 9.7 డిగ్రీలు నమోదు కావటంతో వాతావరణశాఖ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. ఆయా జిల్లాల వారీగా చూస్తే... రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 30.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 12.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.8 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల పాటు ఇదే తరహాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. -
అప్పుల తిప్పలు
ఐదు నెలలుగా అందని బిల్లులు ఇబ్బందుల్లో ఏజెన్సీ మహిళలు నాణ్యత లోపిస్తున్న భోజనం పట్టించుకోని అధికారులు కోహీర్: ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోయి అవస్థలు పడుతున్నారు. సకాలంలో బిల్లులు అందక వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న నిర్వాహకుల కుటుంబాలు పస్తులు ఉండాల్సిన దయనీయస్థితి. మధ్యాహ్న భోజన ఏజనీలు మహిళలే నిర్వహిస్తుండటం గమనార్హం. సకాలంలో బిల్లులు చెల్లింకపోవడంతో మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత లోపిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో 33 ప్రాథమిక, 8 ప్రాథమికోన్నత, 8 ఉన్నత పాఠశాలల్లో సుమారు 5021 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అయితే ఏజెన్సీ నిర్వాహకులకు గత ఏప్రిల్ నుంచి దాదాపు రూ.12 లక్షల మేర చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. సకాలంలో బిల్లులు అందక పోవడంతో నిర్వాహకులు నానా ఇబ్బందులకు పడుతున్నారు. కిరాణా దుకాణాల్లో అప్పులు పేరుకుపోయి సొంత ఇంటికి సరుకులు కొనలేని పరిపస్థితి నెలకొందని మహిళలు వాపోతున్నారు. నిర్వహణ కష్టంగా ఉందని, అయితే మధ్యలో మానేస్తే బిల్లులు చెల్లించరని భయపడుతున్నామన్నారు. కనీసం కుటుంబ అవసరాలు కూడా వెదుక్కోవలసివస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా నిర్వహణ కోసం అప్పులు చేయడంతో అప్పులు ఇచ్చినవాళ్లు బకాయి తీర్చమని ఇంటికి పదేపదే వస్తుండటంతో తమ పరువుపోతోందని కన్నీళ్లపర్యంతమయ్యారు. అధికారులకు తమ వేదన విన్నివించుకున్నా ప్రయోజనం లేకుండాపోయిందని వాపోయారు. కనీసం వంటలు వండినందుకు చెల్లించే రూ. వెయ్యి గౌరవ వేతనం కూడా చెల్లించడం లేదని విచారం వ్యక్తం చేశారు. బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించకపోతే ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బిల్లులందక మండలంలోని ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 150 మంది మహిళల ఇక్కట్లు వర్ణనాతీతం. వెంటనే బిల్లులు, గౌరవ వేతనం చెల్లించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నరకం చూస్తున్నాం మధ్యాహ్న భోజనం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో నరకం చూస్తున్నాం. కిరాణా దుకాణ యజమానులు సరుకులు ఇవ్వడంలేదు. ఇప్పటి వరకు సరఫరా చేసిన సరుకుల బిల్లులు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. డుబ్బులేక దుకాణదారులకు ముఖం చూపించలేకపోతున్నాము. డబ్బుల కోసం ఇంటికి మనుషులను పంపిస్తున్నారు. అప్పుల వాళ్లు ఇళ్ల చుట్టూ తిరగడంతో నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. - సువర్ణ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు కుంటుంబసభ్యులు కష్టపడుతున్నారు మధ్యాహ్న భోజన బిల్లులు, గౌరవ వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం. చేయని నేరానికి కుటుంబ సభ్యులు సైతం కష్టాల పాలౌతున్నారు. వారి కనీస అవసరాలు తీర్చలేక పోతున్నాం. కొన్ని సార్లు పస్తులుండాల్సి వస్తోంది. అధికారులను ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. - రాజేశ్వరి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు బిల్లులు పెట్టాము మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరి నిమిత్తం పంపిస్తున్నాము. వెంటనే మంజూరు చేయాలని పలుమార్లు లెటర్లు కూడా పెట్టాం. అయినా మంజూరు చేయడం లేదు. మహిళలు కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. వారికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నాం. బిల్లులు అందకపోయినప్పటికీ భోజనాలు మెనూ ప్రకారం వడ్డించమని నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. - ఎన్. శంకర్, ఎంఈఓ, కోహీర్ మండలం -
మండలంలో ఇక సేంద్రియమే!
కోహీర్: ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం కింద సేంద్రియ సాగు కోసం మండలం ఎంపికైందని వ్యవసాయాధికారి వజల రత్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోహీర్ మండలంతో పాటు గజ్వేల్, వర్గల్, జగదేవ్పూర్ మండలాలు కూడా ఎంపికయ్యాయని పేర్కొన్నారు. ఎంపికైన ఒక్కో మండలంలో పది గ్రామాలు, అలాగే ఒక్కో గ్రామం నుంచి ఆసక్తి ఉన్న వంద మంది రైతులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. -
బైక్ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి
మెదక్ : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కోహిర్ మండలం కవేలి క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. 65వ నంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.