భారీ ఆఫర్ కొట్టేసిన ఎల్ అండ్ టి
లక్నో: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి భారీ ఆఫర్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థ మరో కీలక ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకుంది. బిహార్లో గంగానదిపై కొత్త వంతెన నిర్మాణం కోసం రూ 3,115 కోట్ల ఆర్డర్ దక్కించుకుంది.
కొరియన్ సంస్థ దేవూ (ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్) భాగస్వామ్యంలో ఈ జాయింట్ వెంచర్ ను ఎల్ అండ్ టి చేపట్టింది. గంగానదిపై ప్రతిష్ఠాత్మక బ్రిడ్జిని నిర్మించేందుకు రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చేపట్టిన ఈ ప్రాజెక్టును సంస్థ ఎగరేసుకుపోయింది.
బిహార్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (బిఎస్డీసిఎల్) నుంచి రూ 3,115 కోట్ల విలువైన ప్రాజెక్టును దక్కించుకున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ పౌర నిర్మాణ రంగలో ఇది తమకు దక్కిన భారీ ముఖ్యమైన విజయమని ఎల్ అండ్ టి డిప్యూటీ ఎండీ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులను ఆశిస్తున్నామని సంస్థ పేర్కొంది. గంగా నదిపై ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈ ఆర్డర్ చేపట్టినట్టు తెలిపారు.