breaking news
Life Guards
-
మృత్యు కెరటాలు! నాలుగేళ్లలో 233 మంది పర్యాటకులు బలి..
Unimaginable death rate in Vizag beach These are reasons బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే సుందర సాగర తీరం... ఒక్కోసారి వారిపైనే ఉగ్రరూపం చూపిస్తోంది. అనూహ్యంగా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడి కాటేస్తున్నాయి. మరోవైపు అత్యుత్సాహంతో కొందరు కెరటాలకు బలైపోతున్నారు. పోలీసులు, మెరైన్ పోలీసులు, లైఫ్గార్డ్స్ నిరంతరం పహారా కాస్తున్నప్పటికీ తీరంలో విషాద ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, ఒడిశా నుంచి నగరానికి వచ్చి తీరంలో సేద తీరుతున్న నలుగురిని రాకాసి కెరటాలు ఆదివారం కాటేసిన విషయం తెలిసిందే. 2018లో 55 మంది, 2019లో 51 మంది, 2020లో 64 మంది, 2021లో 63 మంది మృతిచెందారు. మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో 233 మంది కెరటాలకు బలైపోయారు. రిప్ కరెంట్తో భారీ కెరటాలు విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తేన్నేటి పార్క్, సాగరనగర్, రుషికొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో వాటిపై నిల్చుని సాగరం అందాలను వీక్షిస్తుంటారు. అయితే కొంత మంది సరదాగా స్నానాలు చేసేందుకు దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తీరం నుంచి ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లడంతో... అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు. విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండడంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్న వారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడడం అసాధ్యం. యువకుడి మృతదేహాన్ని బయటకు తీసుకొస్తున్న సిబ్బంది చదవండి: ఆర్కే బీచ్లో ఇద్దరి మృతి లైఫ్గార్డ్స్తో కొంత రక్షణ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న బీచ్లలో ఎవరైనా ప్రమాదాలకు గురైతే రక్షించేందుకు 38 మంది లైఫ్ గార్డ్స్ను జీవీఎంసీ నియమించింది. తీరంలో ఎవరైనా అలలకు చిక్కినప్పుడు వీరు సకాలంలో స్పందించడం వల్లే సుమారు 95 శాతం మంది సురక్షితంగా బయటపడుతున్నారు. ఆర్కే బీచ్లో 20 మంది, యారాడ, రుషికొండలో ఆరుగురేసి, తెన్నేటిపార్కు బీచ్, సాగర్నగర్, ఐటీ హిల్స్ బీచ్లలో ఇద్దరేసి చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. అయితే తీరంలో ప్రమాదానికి గురై సముద్రంలో కొద్ది మీటర్ల దూరంలో ఉన్న వారిని రక్షించగలుగుతున్నప్పటికీ... రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కే వారిని సరైన పరికరాలు లేకపోవడంతో రక్షించడం కష్టతరంగా మారుతోందని లైఫ్గార్డ్స్ అంటున్నారు. విదేశాల్లో లైఫ్గార్డ్స్కు తోడుగా స్పీడ్ బోట్లు అందుబాటులో ఉంటాయని... వాటి సాయంతో బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒడిశా యువతిని, హైదరాబాద్ అబ్బాయిని లైఫ్గార్డ్స్ పట్టుకున్నప్పటికీ... అప్పటికే కెరటంలో ఎక్కువ సేపు ఇరుక్కుపోవడం వల్ల మరణించారు. అదే స్పీడ్ బోట్లు అందుబాటులో ఉంటే వేగంగా వెళ్లి బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పండగల వేళ విషాదాలు సాధారణంగా బీచ్లో ఎక్కువగా అక్టోబర్ నుంచి జనవరి నెల మధ్యలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. దసరా, దీపావళి, కార్తీకమాసం, నూతన సంవత్సర వేడుకలకు ఎక్కువగా పర్యాటకులు రావడంతో తీరంలో రద్దీ ఉంటుంది. ఆ సమయాల్లో దేశ, విదేశాల నుంచి సందర్శకులు కూడా నగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్లో రోజూ సుమారు 20 మంది పోలీసులు, మరో 20 మంది లైఫ్గార్డ్స్ అందుబాటులో ఉంటూ పర్యాటకులను హెచ్చరిస్తుంటారు. మరోవైపు మెరైన్ పోలీసులు తీరం వెంబడి గాస్తీ కాస్తుంటారు. అయినప్పటికీ సందర్శకుల అత్యుత్సాహం, కొందరు యువకులు మద్యం మత్తులో స్నానాలకు దిగడంతో ప్రమాదాలకు గురవుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. నిరంతరం హెచ్చరిస్తుంటాం సముద్రంలోకి స్నానాలకు దిగవద్దని సందర్శకులను లైఫ్ గార్డ్స్, పోలీసులు నిరంతరం తీరంలో హెచ్చరిస్తుంటారు. అయినప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. చాలా ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు కాపాడిగలిగాం. పర్యాటకులు సముద్రం లోపలకు వెళ్తుంటే లైఫ్గార్డులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తున్నాం. అయినప్పటికీ ప్రమాదాలు జరగడం బాధాకరం. – జి.మురళీ కృష్ణ, మెరైన్ ఎస్ఐ క్షణాల్లో స్పందిస్తున్నాం కెరటాలకు సందర్శకులు చిక్కుకున్నారని తెలిసిన క్షణాల్లోనే స్పందిస్తున్నాం. బాధితులను రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. అయితే రిప్ కరెంట్ అలల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కష్టమవుతోంది. సరైన పరికరాలు సమకూరిస్తే బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అనేకసార్లు ఉన్నాతాధికారులకు చెప్పాం. మాకు 9 నెలలుగా జీతాలు చెల్లించకపోయినా పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. – దేవుడు, లైఫ్గార్డు చదవండి: కరకట్టపై పల్టీకొట్టిన ఆటో.. -
యువతిని రక్షించిన లైఫ్గార్డులు
విశాఖపట్నం, పెదవాల్తేరు(విశాఖ తూర్పు): సముద్రంలో కొట్టుకుపోతున్న ఒక యువతిని లైఫ్గార్డులు రక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన గొల్లపూడి జ్యోతి (20) సోమవారం ఆర్కేబీచ్కి వచ్చింది. తరువాత సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కరెటం ఉధృతికి కొట్టుకుపోయింది. ఇంతలో అప్రమత్తమైన లైఫ్గార్డులు ఎం.కృష్ణ, వి.పైడిరాజు, కె.రాజు గమనించి ఆ యువతిని రక్షించి ఒడ్డుకి సురక్షితంగా చేర్చారు. యువతికి ప్రాణాపాయం తప్పడంతో సందర్శకులు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ యువతి లైఫ్గార్డులకు కృతజ్ఞతలు తెలిపింది. -
దూసుకొస్తున్న‘మెకును’ పెను తుపాను..
పణాజి,గోవా : పెను తుపాను ‘మెకును’ గోవా వైపు దూసుకొస్తోంది. దాదాపు 3 నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో అలలు తీరంపై విరుచుకుపడతాయని భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మస్కట్లోని సలాల రీజియన్ సమీపంలో గల అరేబియా సముద్రంలో గురువారం రాత్రి మెకును తుపాను సంభవించింది. ఈ తుపాను గోవా వైపు కదులుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. వాతావరణంలో మార్పులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని తెలిపింది. తీరం వెంబడి సంరక్షణ కోసం గోవా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ద్రిష్టి మెరైన్ రంగంలోకి దిగింది. వీరితో పాటు వీలైనంత ఎక్కువ మంది లైఫ్ గార్డ్స్ కూడా సముద్ర తీరం వెంబడి రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. ప్రజలను ఎవరిని సముద్ర తీరం వైపు అనుమతించడం లేదని ద్రిష్టి మెరైన్ వెల్లడించింది. -
అలలకు బలి
ఉసురుతీసిన సముద్ర స్నానం ఇద్దరు యువకుల దుర్మరణం మరొకరు గల్లంతు ఇద్దర్ని రక్షించిన లైఫ్గార్డ్సు విశాఖపట్నం: కొబ్బరితోట ఎస్వీపీ నగర్కు చెందిన ఎనిమిది మంది స్నేహితులు ఆదివారం మధ్యాహ్నం ఆర్కే బీచ్లో స్నానానికి దిగారు. కొంతసేపు ఉల్లాసంగా గడిపారు. అక్కడి నుంచి నోవాటెల్ ఎదురుగా ఉన్న బీచ్కు వచ్చారు. వీరిలో ముగ్గురు బాలురు కూడా ఉన్నారు. వీరంతా స్నానానికి దిగగా అలల ఉధృతికి కాకర చంద్రమౌళి(18), కాకర మహేష్(19), అప్పలరాజు (24), రమేష్(19)లు లోపలికి కొట్టుకుపోయారు. లైఫ్గార్డులు వెంటనే స్పందించి చంద్రమౌళి, రమేష్లను రక్షించారు. మహేష్, అప్పలరాజును రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొద్ది సేపటికి అప్పలరాజు మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. గల్లంతయిన మహేష్ కోసం గాలిస్తున్నారు. వీరితో పాటు వచ్చిన రాజు, సాయి, చందు, పైడిరాజులు సురక్షితంగా బయటపడ్డారు. అప్పలరాజు మృతదేహాన్ని చూసి స్నేహితులు విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో.. అప్పలరాజు కష్టజీవి. మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉన్నాడు. అతని తండ్రి రామునాయుడు ఆటో డ్రైవర్. తల్లి నూకరత్నం కూలి పనులకు వెళ్తుంటుంది. అక్కకు పెళ్లి చేశాడు. తమ్ముడిని చదివిస్తున్నాడు. ఇల్లు కట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ విధంగానే ఇల్లు కట్టాడు. పెళ్లికి సిద్ధమైన తరుణంలో అలల రూపంలో మృత్యువు కబళించింది. చిన్నతనం నుంచే కుటుంబానికి అండగా.. అలల ఉధృతికి గల్లంతయిన మహేష్(19) నిర్మాణ రంగ సంస్థలో సూపర్ వైజర్గా పని చేసేవాడు. ఇటీవలే పాలిటెక్నిక్లో ప్రవేశం పొందాడు. తండ్రి పార్థసారథి అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో కుటుంబ పోషణ భారాన్ని మోస్తున్నాడు. తల్లి ఓ ప్రయివేట్ క్లినిక్లో పనిచేస్తోంది. తమ్ముడు చంద్రమౌళి ఇటీవలే పదో తరగతి పాసయ్యాడు. ఐటీఐలో ప్రవేశం పొందాడు. తమ్ముడు అనుకోలేదు గోపాలపట్నంలో ఉన్న బంధువులను బీచ్రోడ్డు విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్కు తీసుకొచ్చాను. చాలాసేపు బీచ్లోనే ఉన్నాను. అప్పటికే ఎవరో మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని అనుకున్నారు. కానీ తమ్ముడు(బంధువు) మృతదేహమని అనుకోలేదు. కొబ్బరితోట వెళ్లే సరికి ఫోన్ వచ్చింది. ఇలా బీచ్లో స్నానానికి దిగి చనిపోయాడని. వెంటనే బీచ్కు వచ్చా. - నూకరాజు, ఆటోడ్రైవర్, అప్పలరాజు బంధువు లైఫ్గార్డ్స్ వల్లే బతికి బయటపడ్డాం.. లైఫ్గార్డ్స్ లేకపోతే నాతో పాటు స్నేహితుడు రమేష్ కూడా లోపలికి వెళ్లిపోయేవాడు. సరదాగా స్నేహితులందరం స్నానానికి దిగాం. ఇంతలోనే పెద్ద కెరటం వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లిపోయింది. సమీపంలో ఉన్న లైఫ్గార్డ్స్ మమ్మల్ని రక్షించగలిగారు. -కాకర చంద్రమౌళి, లైఫ్గార్డ్స్ రక్షించిన యువకుడు