ఆ మందులు ఇక చౌక
సాక్షి,న్యూఢిల్లీ: గుండె జబ్బులు, హెపటైటిస్ సీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల అథారిటీ(ఎన్పీపీఏ) 51 మందుల ధరలను 53 శాతం వరకూ తగ్గిస్తూ తాజా మార్గదర్శకాలను వెలువరించింది.
ఫార్మా కంపెనీలు తాజా పరిమితికి మించి తమ ఉత్పత్తులను విక్రయిస్తుంటే వెంటనే వాటిని తగ్గించాలని ఎన్పీపీఏ ఆదేశించింది.నూతన పరిమితుల నేపథ్యంలో ఆయా మందుల ధరలు 6 నుంచి 53 శాతం వరకూ దిగివస్తాయని ఎన్పీపీఏ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఔషధ ధరలకు సంబంధించిన నూతన పరిమితులు, గరిష్ట చిల్లర ధరల(ఎంఆర్పీ)పై ఎన్పీపీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు వాడే ఔషధాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో వీటి ధరలపై నియంత్రణ విధించినట్టు అధికారులు తెలిపారు.