ఖాతా నుంచి రూ.48 వేలు గల్లంతు
గుత్తి : సైబర్ నేరగాళ్ల ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల అమాయకత్వాన్ని కొందరు సైబర్ నేరగాళ్లు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలతో జనం బెంబేలెత్తుతున్నారు. తాజాగా గుత్తి మున్సిపల్ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి దేవేంద్రగౌడ్ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కారు. బుధవారం ఆయనకు ఓ కాల్ వచ్చింది. ‘నేను ఎస్బీఐ ఆఫీసర్ని మాట్లాడుతున్నా. మీ ఏటీఎం బ్లాక్ అయింది. యాక్టివేట్ చేయాలంటే మేం అడిగిన వివరాలు చెప్పండి..అంటూ ఏటీఎం కార్డుపైన ఉండే నంబర్లతో పాటు సీక్రెట్ కోడ్ నంబర్ను అవతలి వ్యక్తి కోరాడు.
ఇదంతా నిజమేనని నమ్మిన దేవేంద్ర వెంటనే తన వివరాలు చెప్పారు. అంతే... ఖాతాలో రూ.లక్ష ఉండగా, దేవేంద్రగౌడ్ కుమారుడు శేఖర్ గౌడ్ గురువారం ఏటీఎంకు వెళ్లి కొంత డబ్బు డ్రా చేశారు. బ్యాలెన్స్ తక్కువగా ఉన్నట్లు గమనించి, ఆరా తీయగా బుధవారం ఇదే అకౌంట్ నంబర్ నుంచి పూనేలోని వివిధ ఏటీఎం కేంద్రాల్లో రూ.48 వేలు డ్రా అయినట్లు తెలుసుకుని ఇక్కడి ఎస్బీఐ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.