MLC Maka sesubabu
-
రాష్ట్రంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే
ఎమ్మెల్సీ శేషుబాబు విమర్శ పూలపల్లి (పాలకొల్లు అర్బన్) : ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ప్రధాన ముద్దాయిగా నిలిచారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ధ్వజమెత్తారు. పూలపల్లిలో శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాటారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడంతో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోగాని, విశాఖపట్టణానికి ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో గాని కేంద్రంపై ఒత్తిడి తేలేక రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు పాలనాకాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని, వాటిపై కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకుని విచారణ జరగకుండా నిలుపుదల చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నిజాయితీ పరుడైతే తనపై వచ్చిన విచారణకు సిద్ధం కావాలని, అలాకాకుండా కోర్టు కెళ్లి ఎందుకు స్టేలు తెచ్చుకున్నారని శేషుబాబు ప్రశ్నించారు. అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకుని విచారణలు నిలుపుదల చేయించుకున్న చంద్రబాబు స్టే వీరుడుగా ప్రసిద్ధి చెందారని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రిగా చంద్రబాబే ప్రజలముందు అసలు ముద్దాయిగా నిలబడ్డారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలపై అధికారపక్షాన్ని నిలదీయడాన్ని సహించలేక ఆయనపై అవాస్తవాలు, అభూత కల్పితాలతో ఆరోపణలు చేయడం అధికార పక్ష సభ్యులకు తగదన్నారు. జగన్ ఎదుర్కొంటున్నవి కేవలం ఆరోపణలే తప్ప నేరం రుజువు కాలేదన్నారు. నేరం రుజువు కాకుండానే జగన్ని ముద్దాయి అనడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. పార్టీ మండల కన్వీనర్ మైలాబత్తుల మైఖేల్రాజు, నడపన గోవిందరాజులనాయుడు, విన్స్టన్బాబు పాల్గొన్నారు. -
రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
- ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాలకొల్లు టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయల సబ్సిడీ అందిస్తున్నాయని, దేశానికి వెన్నుముక అయిన రైతులకు అందించే రాయితీల విషయంలో వెనుకంజ వేస్తున్నాయని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. పాలకొల్లు మార్కెట్యార్డులో గురువారం రైతులకు సబ్సిడీపై పవర్టిల్లర్లు పంపిణీ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సభకు ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు అధ్యక్షత వహించారు. పాలకొల్లు నియోజకవర్గంలో 878 మంది రైతులకు పవర్ టిల్లర్లు పంపిణీ చేయాల్సి వుండగా కొందరికే అందించారన్నారు. గ్రామాన్ని యూనిట్గా చేసి పంటల బీమా పథకాన్ని అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ప్రభుత్వవిప్ అంగర రామమోహన్, ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా సబ్సిడీపై 30 పవర్టిల్లర్లు, మూడు వరికోత యంత్రాలు, 20 ఆయిల్ ఇంజన్లు, వంద టార్పాలిన్లు పంపిణీ చేశారు. మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్చైర్మన్ కర్నేన రోజారమణి, జెడ్పీటీసీ కోడి విజయలక్ష్మి, యలమంచిలి ఎంపీపీ బొప్పన సుజాత, మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, ఆత్మ చైర్మన్లు అందే కోటి వీరభద్రం, ఆరిమిల్లి రామశ్రీనివాస్ (చిన్ని), వీఎస్టీ కంపెనీ ప్రతినిధి ప్రసాద్, శ్రీరామ ఆటోమొబైల్స్ అధినేత బలుసు శ్రీరామమూర్తి, ఏడీఏ పి మురళీకృష్ణ, ఏవో ఇడవలూరి సుజాత తదితరులు పాల్గొన్నారు.