Mokshitha
-
బాల గోవిందం
జూనియర్ యన్టీఆర్ ‘రామాయణం’ అనే బాలల చిత్రంలో రామునిగా కనిపించి కనువిందు చేశారు. అప్పుడు తారక్ వయసు 13 ఏళ్లు. పదమూడేళ్ల వయసులోపు పిల్లలే నటీనటులుగా గతంలో ‘దాన వీర శూర కర్ణ’ చిత్రాన్ని నందమూరి జానకిరామ్ తనయుడిని బాల నటుడిగా పరిచయం చేస్తూ ‘జగపతి’ వెంకటేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఇలా అప్పుడప్పుడు చిన్న పిల్లల పౌరాణిక సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ‘బాలగోవిందం’ పేరుతో ఓ పౌరాణిక చిత్రానికి శ్రీకారం జరిగింది. డా. ముళ్లపూడి హరిశ్చంద్ర దర్శకత్వంలో అరుణోదయ ఆర్ట్ క్రియేషన్స్పై తోలేటి వెంకట శిరీష నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల గిరులలో ఎందుకు వెలిశాడు? తిరుమలలో వెంకటేశుడు వెలవక ముందు జరిగిన సంఘటనలతో మా చిత్రం రూపుదిద్దుకోనుంది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తాం’’ అన్నారు. ‘‘వ్యక్తిత్వ వికాస కోణంలో మన పురాణాల్ని స్వీకరించాల్సిన ఆవశ్యకత ఉందని, ఆధ్యాత్మిక సారంతో ఈ సినిమా రూపకల్పన మొదలుపెట్టా’’మని పాటల రచయిత వెనిగళ్ల రాంబాబు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మీర్, మాటలు: యడవల్లి, సంగీతం: సాలూరి వాసూరావు. -
కన్నవాళ్లకు కన్నీళ్లే మిగిలాయి!
కూడేరు: వారిది ప్రేమ వివాహం..పెద్దలను ఒప్పించి ఏడేళ్ల కిందట ఏడడుగులు నడిచారు.. మొదటి సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. కూతురులోనే వారు కొడుకును చూసుకున్నారు.. అల్లారుముద్దుగా పెంచుతున్నారు..ముద్దుముద్దు మాటలతో.. చిలిపి చేష్టలతో మారాం చేస్తుంటే..మురిసిపోయారు.. కాళ్లకు పట్టీలు పెట్టుకొని ఆ ఇంట ఘల్లుఘల్లుమంటూ గెంతులేస్తుంటే గారాలపట్టీగా సంబరపడ్డారు. రెండో సంతానంలోనూ ఆడబిడ్డే అని ఆనందపడ్డారు..ఇక పిల్లలు చాలనుకున్నారు.. అంతలోనే ప్రమాదంలో పెద్ద కుమార్తె ఆయువు ఆగిందన్న విషయం తెలిసి..ఆ తల్లిదండ్రులకు గుండెలు పగిలినంత పని అయ్యింది.. గురువారం జరిగిన ఈ ఘటనతో అప్పటి వరకు కళకళలాడిన కళగళ్ల గ్రామంలో విషాదం అలుముకుంది. కూడేరు మండలం కలగళ్లలో గురువారం మోక్షిత (5) అనే విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు.. కలగళ్లకు చెందిన తపాలా ఉద్యోగి అమృతకళకు లోకేష్చౌదరితో ఏడేళ్ల కిందట ప్రేమవివాహం జరిగింది. అనంతపురంలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె మోక్షిత (5)ను అమ్మమ్మ ఊరు (కలగళ్ల)లో ఉంచి కూడేరులోని ప్రైవేట్ స్కూలులో చదివిస్తున్నారు. రెండు నెలల బాలింత అయిన అమృతకళ ప్రస్తుతం పుట్టింటిలో ఉంది. యూకేజీ చదువుతున్న మోక్షిత గురువారం బడికి వెళ్లనంటూ మొండికేసింది. మేనమామ నచ్చజెప్పి స్కూల్ ఆటో ఎక్కించాడు. అయితే ఆటో కదిలి కొంతదూరం వెళ్లాక మోక్షిత కిందకు దూకేసింది. రోడ్డుపై బలంగా పడటంతో తల భాగం, కుడిచెవివద్ద రక్తస్రావమైంది. వెంటనే 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. రక్తం గడ్డ కట్టుకుపోయిందని, వెంటనే బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మోక్షిత ప్రాణాలు విడిచింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పెద్ద కుమార్తె ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
విషజ్వరంతో విద్యార్థిని మృతి
గాలివీడు(వైఎస్సార్జిల్లా): విషజ్వరంతో విద్యార్థిని మృతిచెందిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా గాలివీడు మండలం నూలివీడులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోక్షిత(13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా విషజ్వరంతో బాధపడుతోంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందినట్టు సమాచారం.