బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు
రాయికోడ్: మండలంలోని రాయిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో స్థానిక ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వయంగా రంగురంగుల పూలను తీసుకువచ్చి ఐదు అడుగుల బతుకమ్మను తయారు చేశారు. తయారు చేసిన బతుకమ్మను స్థానిక మహిళలకు అందజేశారు. హిందువులతో పాటు పండుగ వేడుకల్లో పాల్గొని మతసామరస్యాన్ని చాటిన యాదుల్, నబీసాబ్, చాంద్పాష, ఖాసీంసాబ్ తదితరులను స్థానిక శాలివాహన సంఘం నాయకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
మసీదు అభివృద్ధి కోసం స్థానిక ఉపసర్పంచ్ చేతుల మీదుగా రూ.1100లను అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు కాశీ బస్వరాజ్ పాటిల్, శాలివాహన సంఘం నాయకులు, గ్రామపెద్దలు సాయిలు, అంజయ్య, మల్లయ్య, సంగయ్య, కాశీనాథ్, కృష్ణ, విఠల్, చెట్టయ్య తదితరులు పాల్గొన్నారు.