breaking news
National Fisheries Development Board
-
రొయ్యలకు ప్రత్యామ్నాయం ‘పాంపనో’!
పంట మార్పిడి చెయ్యటం అనేది పంట పొలాల్లో మాదిరిగానే ఆక్వా సాగులోనూ అత్యవసరమైన విషయమే. తీరప్రాంతాల్లోని ఉప్పునీటి చెరువుల్లో వనామీ తదితర ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి చేయటానికి అవకాశాలు చాలా తక్కువ. సముద్రంలో పెరిగే జలజీవులను ఉప్పు నీటి చెరువుల్లో పెంచడాన్ని మారికల్చర్ అంటారు. ఈ దిశగా కేంద్రీయ సముద్ర చేపల పరిశో«ధనా సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ), జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(ఎన్ఎఫ్డీబీ) వంటి సంస్థల శాస్త్రవేత్తలు, అధికారుల కృషి ఫలితంగా రెండు సముద్ర చేపలు ఏపీ తీరప్రాంత చెరువుల్లో సాగులోకి వచ్చాయి. ఈ కోవలో మొదటిది సీబాస్ (పండుగప్ప)కు తాజాగా సముద్ర చేప పాంపనో (చందువా పార)తోడైంది.‘చందువా జాతికి చెందినదే పాంపనో కూడా. ఒకే ముల్లు ఉంటుంది. అయితే, పాంపనో చేప ముల్లు మరింత గట్టిగా ఉంటుంది. అంతే తేడా’ అని సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మెగారాజన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 2016లో పాంపనో పిల్లల ఉత్పత్తి సాంకేతికతను రూపొందించటంతో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఆ నేపథ్యంలోనే పాంపనో సాగును కృష్ణా తదితర జిల్లాల్లో అనేక చోట్ల 2020 తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) తోడ్పాటుతో ప్రోత్సహించామని, వందెకరాల్లో సాగవుతోందన్నారు. పాంపనో చేపల రుచి హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో చేపల వినియోగదారులకు ఇప్పటికే తెలుసు. తద్వారా పాంపనో చేపలకు మంచి మార్కెట్ ఉందని డా. మెగారాజన్ అన్నారు. సముద్రంలో చందువాల సంఖ్య తగ్గిపోవటంతో పాంపనో చేపలను చెరువుల్లో పెంచటం ద్వారా ఆక్వా రైతులు ఆదాయం పొందవచ్చన్నారు. పాంపనో సీడ్ ఉత్పత్తి సాంకేతికతను ఆర్నెల్ల క్రితమే ఒక ప్రైవేటు హేచరీకి సీఎంఎఫ్ఆర్ఐ బదిలీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఏర్పాటైన ఈ హేచరీ ఇప్పటికే పాంపనో సీడ్ ఉత్పత్తి ప్రారంభించింది. ఉప్పునీటి రొయ్యల చెరువుల్లో వైట్స్పాట్ వంటి వ్యాధులు అదుపులో ఉండాలంటే పంట మార్పిడి చేయాలి. అందుకు అన్ని విధాలా అనువైనది పాంపనో చేప. ఇప్పుడు సీడ్ అందుబాటులోకి రావటంతో పాంపనో సాగు విస్తరించే అవకాశం ఉందని అన్నారాయన.మూల పొలంలో పాంపనో సాగు!శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపొలం గ్రామంలోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీ)కి చెందిన ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఆక్వాకల్చర్ ఫెసిలిటీలోని చెరువుల్లో తొలిసారి సముద్ర చేపలు పాంపనో (చందువా పార), సీబాస్ (పండుగప్ప) సాగును ప్రారంభించారు. రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి చేయడానికి 2008లో 97.45 ఎకరాల భూమిని ఎన్ఎఫ్డీబీకి ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్ల క్రితం వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించడంతో ప్రాజెక్టు తొలి దశకు అడుగు ముందుకు పడింది. నర్సరీ చెరువులు, కల్చరల్ చెరువులు, సముద్రపు నీటిని తీసుకురావడం, బయటకు పంపించడం, వడపోత వ్యవస్థలు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక చెరువులో తొలిసారి 2024 జూలైలో పాంపనో (చందువా పార) సాగు టెక్నికల్ కన్సల్టెంట్ ఆంజనేయులు ప్రారంభించారు. చేప పిల్లలను సీఎఫ్టీఆర్ఐ ద్వారా తెచ్చి, రెండు నెలలు సీడ్ ట్యాంకుల్లో పెంచి, తర్వాత పెంపకపు చెరువులోకి మార్చారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు అ«ధికారులు, శాస్త్రవేత్తల సలహాతో 25 సెంట్ల చెరువులో 3 వేల పిల్లలను విడిచి పెట్టారు. 8 నెలలు పెంచిన తరువాత గత నెల 29న 900 కిలోల పాంపనో చేపల్ని పట్టుబడి చేసి విక్రయించారు. ఇంకో 900 కిలోల చేపలు ఉన్నాయి. అధిక విస్తీర్ణంలో సాగు చేయటం లాభదాయకమేనన్నారు. పాంపనో సాగులో నష్టం వచ్చే అవకాశాలు తక్కువన్నారు. చెరువు నీటిలో పాంపనో సాగు మొదటిసారి విజయవంతం కావడంతో అధికారులు ఆంజనేయులును అభినందించారు. ప్రస్తుతం మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నారు. అధికారులు, శాస్త్రవేత్తల మార్గదర్శ కత్వంలో టెక్నికల్ కన్సల్టెంట్ కె. ఆంజనేయులు పాంపనో మొదటి చేపల సాగు జయప్రదమైంది. దీంతో ఈ ప్రాంత ఆక్వా రైతుల్లో రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సముద్ర చేపల సాగుపై ఆశలు రేకెత్తుతున్నాయి. పాంపనో సాగులో రిస్క్ తక్కువ! ఇండియన్ పాంపనో (చందువా పార) నీటిలో ఉప్పదనం 5 నుంచి 40 పిపిటి వరకు తట్టుకొని పెరుగు తుంది. ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సాగు చేయొచ్చు. పండుగప్ప పెద్ద చేపలు చిన్న చేపలను తినేస్తాయి. అయితే, పాంపనోతో ఆ సమస్య లేదు. రొయ్యలకు మాదిరిగా ప్రాణాంతక వ్యాధులు ముసురుకోవు. వ్యాధుల రిస్క్ తక్కువ. 10 గ్రా./2 అంగుళాల పిల్లలను చెరువులో వేసుకుంటే.. 5–6 నెలల్లో 500–600 గ్రా. బరువు పెరుగుతాయి. పెల్లెట్ల మేతను చక్కగా తింటాయి. రైతుకు కిలో రూ. 350–450 ధర వస్తుంది. రైతులకు మంచి నికరాదాయం వస్తుంది. పాంపనో సాగు 3 కోస్తా జిల్లాల్లో మొదలైంది. వచ్చే ఐదేళ్లలో బాగా ప్రాచుర్యంలోకొస్తుంది. – డా. మెగారాజన్ (95057 68370) సీనియర్ శాస్త్రవేత్త, ఈఎంఎఫ్ఆర్ఐ ప్రాంతీయ కార్యాలయం, విశాఖపట్నం2 కిలోల మేతకు కిలో చేపసముద్రపు జాతుల చేపలను ఉప్పునీటి చెరువుల్లో పెంచ డాని (మారికల్చర్)కి అనుభవంతో పాటు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు శ్రద్ధగా పాటించటం అవసరం. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న భూమిలో పనులు మొదలుపెట్టి అధికారులు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉంది. 25 సెంట్ల చెరువులో సాధారణంగా వెయ్యి పాంపనో పిల్లలు వేస్తారు. అయితే, అధికారులు, శాస్త్రవేత్తల సలహాతో అధిక సాంద్రతలో 3 వేల పిల్లలను పెంచాం. కిలో చేప పెరగడానికి రెండు కిలోల మేత అవసరమైంది. పిల్లలన్నీ చక్కగా పెరగటం సంతృప్తినిచ్చింది. మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నాం. మున్ముందు ఈ చేపల పిల్లలను ఉత్పత్తి చేసి ఆక్వా రైతులకు విక్రయిస్తాం. – కె.ఆంజనేయులు, టెక్నికల్ కన్సల్టెంట్, ఎన్ఎఫ్డీబీ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఆక్వాకల్చర్ ఫెసిలిటీ, మూలపొలం, శ్రీకాకుళం జిల్లా – పిరియ ధర్మేంద్ర, సాక్షి, సోంపేట, శ్రీకాకుళం జిల్లా -
చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?
కనస్ట్రక్షన్కి టెక్నాలజీ కూడా తోడవ్వడంతో విభిన్న ఆకృతిలో భవనాలను నిర్మిస్తున్నారు అధికారులు. అవి నగరానకి స్పెషల్ ఐకాన్గా నిలిస్తున్నాయి. అబ్బా ఎలా నిర్మించారు దీన్ని అని ఆశ్చరయపోయేలా వాటిని నిర్మిస్తున్నారు. అలానే చేప ఆకృతిలో భవనాన్ని నిర్మించి వాటే ఏ బిల్డింగ్ ఇది అను ముక్కునవేలేసుకునేలా చేశారు నిర్మాణకారులు. ఎక్కడుందంటే ఈ భవనం..?ఈ ఫిష్ బిల్డింగ్ హైదరబాద్ ఉంది. దీన్ని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయంగా చేప ఆకృతిలో నిర్మించారు. స్థానికంగా దీన్ని ఫిష్ బిల్డింగ్ అనిపిలుస్తారు. ఈ బిల్డింగ్కి స్ఫూర్తి..1992లో పూర్తి అయిన బార్సిలోనా ఫ్రాంక్ గెహ్రీ స్మారక ఫిష్ శిల్పం. దాన్ని చూసి ఇలా చేప ఆకారంలో బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. ఈ భవనం మిమెటిక్ ఆర్కిటెక్చర్కు ఒక ఉదాహరణ. చేప రూపంలో మొత్తం బిల్డింగ్ కార్యచరణ అంశాలను కలుపుతుంది. దీని ప్రవేశ ద్వారం రెండు మెట్లపై ఉన్న గుడారంలా ఉంటుంది. రెండు వృత్తాకరా అద్దాలు చేప కళ్లులా కనిపిస్తాయి. మొత్తం భవనం స్టెయిన్లెస్ స్టీల్తో కప్పబడి, మధ్యలో నీలిరంగు స్పెషల్ ఎట్రాక్షన్గా ఉంటుంది. అంతేగాదు ఆ బిల్డింగ్కి ఉన్న బ్లూ-పర్పుల్ స్పాట్లైట్లు రాత్రిపూట భవనాన్ని ప్రకాశించేలా చేస్తాయి. చూడటానికి ఈ ఫిష్ బిల్డింగ్ ఓ'జెయింట్ ఫిష్' హైదరాబాద్లో ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది.(చదవండి: రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్గా..రీజన్ వింటే షాకవ్వుతారు!) -
పీఎన్బీతో ఎన్ఎఫ్డీబీ ఒప్పందం
హైదరాబాద్: జాతీయ మత్స్య సంపద అభివృద్ధి మండలి(ఎన్ఎఫ్డీబీ).. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద మత్స్య పరిశ్రమలకు పీఎన్బీ ద్వారా రుణ సాయం లభించనుంది. మత్స్య రంగంలో సామర్థ్యం ఉండీ, అంతగా వెలుగుచూడని పరిశ్రమలకు ఎఫ్ఐడీఎఫ్, ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన కింద రుణ వితరణకు గాను పీఎన్బీతో ఒప్పందం వీలు కల్పిస్తుందని ఎన్ఎఫ్డీబీ సీఈవో సువర్ణ చంద్రప్పగిరి తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో సువర్ణ చంద్రప్పగిరి, పీఎన్బీ ఎండీ, సీఈవో మల్లికార్జునరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏపీలో నీలి విప్లవం తెస్తాం...
ఎన్ఎఫ్డీబీ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎం.వి.రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘పిజ్జాలు, బర్గర్లు ఇంటికొస్తున్నాయా? లేదా? అటువంటప్పుడు పచ్చి చేపలు, ఇతర చేప ఉత్పత్తులు ఎందుకు ఇళ్ల వద్దకు రావు? వాటిని అందరికీ అందుబాటు తేవడమే లక్ష్యం. ఇందుకోసం పెద్దఎత్తున కార్యక్రమాలను చేపట్టాం...’’ అని జాతీయ మత్స్యశాఖాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం.వి.రావ్ పేర్కొన్నారు. మత్స్యపరిశ్రమపై ఆధారపడిన వారిలో లక్షలాది పేద మత్స్యకారులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారేనని.. ఈ ఏడాది లక్ష మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు చేపల వినియోగాన్ని విరివిగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతంలో చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. కేజ్ కల్చర్కు ప్రోత్సాహం... ఆక్వా పెంపును ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో నీలి విప్లవాన్ని తేవాలన్నది తమ లక్ష్యమని రావ్ చెప్పారు. ఇందులో భాగంగా చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల నిల్వ, విక్రయ మెళకువలపై జాలర్లకు శిక్షణ ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వేయి మందికి పైగా జాలర్లకు శిక్షణ ఇచ్చారు. ‘‘ఇప్పటికే ఇది ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ముమ్మరంగా సాగవుతోంది. రాష్ట్రంలో శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. రిజర్వాయర్ లేదా చెరువుల్లో కొంతభాగాన్ని ఎంచుకుని అక్కడ నీటి మళ్లు ఏర్పాటు చేసి వాటి చుట్టూ ప్లాస్టిక్తో అడ్డుకట్టలు వేసి చేపల్ని పెంచుతారు. చిన్న రైతులతో పాటు పెద్దపెద్ద సంస్థలు సైతం ప్రస్తుతం ఈ కేజ్ కల్చర్ పట్ల ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది’’ అని ఆయన వివరించారు. ఆధునిక చేపల మార్కెట్లు... చేపల మార్కెట్లను ఆధునీకరించి పరిశుభ్రంగా మలచాలని ఎన్ఎఫ్డీబీ నిర్ణయించినట్లు రావ్ తెలిపారు. మార్కెట్లను హోల్సేల్, రిటైల్, సంచార మార్కెట్లుగా విభజించిందని.. రోజువారీ చేపలు తెచ్చుకుని అమ్ముకునే వారికి, మత్స్యకారుల సహకార సంఘాలకు, మహిళా సంఘాలకు వాహనాలు రాయితీపై ఇస్తున్నట్లు చెప్పారు. రాయితీ పొందటం ఇక సులభం... రాయితీ పొందే ప్రక్రియను సరళం చేశామని, ఒక పేజీ దరఖాస్తు చేసుకుంటే వారంలోగా దానిని పరిష్కరించటం జరుగుతుందని రావ్ వివరించారు. వ్యక్తిగత పథకాలకు (ద్విచక్రవాహనాలు, ఐస్ బాక్సులు, సంచార మార్కెట్ వంటివి) 25 శాతం, అదే ఎస్సీ, ఎస్టీలైతే 30 శాతం, అక్వేరియం చేపలకు (మహిళలకు) 40 శాతం, పురుషులకు (జనరల్) 25 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ వస్తుందని తెలిపారు. శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో జాలర్లు ఈ రాయితీ ద్వారా లబ్ధి పొందినట్లు చెప్పారు. చేపల చెరువుకైతే హెక్టారుకు రూ. 3 లక్షల వ్యయమవుతుందని.. అందులో రూ. 60 వేలు రాయితీగా పొందవచ్చని తెలిపారు.