ఎన్హెచ్పీసీలోవాటా విక్రయం నేడు
♦ షేర్ విక్రయ ధర రూ.21.75
♦ రిటైల్ ఇన్వెస్టర్లకు 5% డిస్కౌంట్
న్యూఢిల్లీ: ఎన్హెచ్పీసీ కంపెనీలో 11.36 శాతం వాటాను ప్రభుత్వం నేడు(బుధవారం) విక్రయించనున్నది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం విక్రయిస్తున్న తొలి పీఎస్యూ వాటా విక్రయం ఇది. ఒక్కో షేర్ను రూ.21.75(మంగళవారం ముగింపుధర రూ.23.05తో పోల్చితే ఇది 5.64%తక్కువ) చొప్పున ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. దీని ప్రకారంప్రభుత్వానికి రూ.2,700 కోట్లు సమకూరుతాయని అంచనా.ఎన్హెచ్పీసీలో ప్రభుత్వానికి 85.96% వాటా ఉంది. దీంట్లో 11.36% వాటా(125.76 కోట్ల షేర్లను)ను అమ్మనున్నది.
సెబీ కొత్త నిబంధనల ప్రకారం ఓఎఫ్ఎస్ తొలి రోజు వ్యవస్థాగత ఇన్వెస్టర్లు, రెండో రోజు రిటైల్ ఇన్వెస్టర్లు షేర్లకు బిడ్ చేస్తారు. ఈ ఓఎఫ్ఎస్లో 20 శాతం వాటా షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించామని, రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్కే ఎన్హెచ్పీసీ షేర్లను విక్రయిస్తామని ప్రభుత్వం తెలిపింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలకు, బీమా కంపెనీలకు 25 శాతం వాటాను కేటాయించామని పేర్కొంది. మరోవైపు సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ కార్పొరేట్ బాండ్ల జారీ ద్వారా రూ.900 కోట్లు సమీకరించడానికి తమ డెరైక్టర్ బోర్డ్ ఆమోదం తెలిపిందని ఎన్హెచ్పీసీ తెలిపింది.