ప్రభుత్వంతో మాట్లాడతా...
నిషేధంపై ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్
న్యూఢిల్లీ: కేంద్రం విధించిన నిషేధంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ స్పందించారు. త్వరలోనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ)లను సంప్రదించిన అనంతరం ఈ విషయమై క్రీడా శాఖతో మాట్లాడతానని చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఐఓఏ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమించడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై క్రీడా శాఖ ఐఓఏకు షోకాజ్ నోటీసు ఇవ్వగా అటు నుంచి స్పందన లేకపోవడంతో నిషేధం విధించింది.
నిషేధంపై బింద్రా మద్దతు
ఐఓఏపై నిషేధాన్ని మాజీ షూటర్ అభినవ్ బింద్రా సమర్థించారు. కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘కఠినంగా ఉంటేనే భారత క్రీడారంగంలో మార్పు కనిపిస్తుంది. చట్టం తేవాల్సిన అవసరం ఉంది. క్రీడా శాఖ ఐఓఏను నిషేధించడం సరైన చర్య. సుపరిపాలన, నీతి నియమాల కాలం ఇది’ అని బింద్రా ట్వీట్ చేశారు.