'అందుకే బాబు ఆగమేఘాల మీద విజయవాడొచ్చారు'
విజయవాడ: నూతన రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగమేఘాల మీద విజయవాడకు వచ్చారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ నెల 14న వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపిన ఆయన.. చంద్రబాబు రెండేళ్ల మోసపూరిత పాలనపై చర్చిస్తామన్నారు. చంద్రబాబు అనుచరులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజధానిలో ఇష్టానుసారం భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. రాజధాని టెండర్ల వ్యవహారాలన్నీ రహస్యంగా చేశారని, జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా విచ్చలవిడిగా దోచుకున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు.
రెండేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు లక్షాయాభైవేలకోట్ల మేర దోపిడికి పాల్పడినట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ప్రశ్నించే ప్రతిపక్షం ఉండకూడదన్న ఆలోచనతో వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని నిరంకుశంగా పాలిస్తూ.. అవినీతిని ఎండగడుతున్నందునే సాక్షి ప్రాసారాలను నిలిపివేశారన్నారు. ఈ నిరంకుశత్వం ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావని అన్నారు.
రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారథి అన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను కడుతున్నా మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించకపోవటానికి కారణం ఇసుక దోపిడితో ఆయన గొంతు కూరుకుపోవటమే అని పార్థసారథి విమర్శించారు. చంద్రబాబు పాలనపై.. భవిష్యత్ పోరాటాలపై ఈ నెల 14 న జరగనున్న విస్తృతస్థాయి సమావేశంలో చర్చింస్తామని పార్థసారథి తెలిపారు.