Patanjali noodles
-
'మాకు అనుమతులున్నాయి'
-
మాకు అనుమతులున్నాయి: రాందేవ్ బాబా
న్యూఢిల్లీ: తన సంస్థ తరుఫున ప్రారంభించిన పతంజలి నూడుల్స్ అనుమతుల వివాదం, ఆరోపణలపై యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి స్పందించారు. మేం ఎలాంటి తప్పు చేయడం లేదు అని రాందేవ్ బాబా పేర్కొన్నారు. పతంజలి నూడుల్స్ కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని ఆయన తెలిపారు. నూడుల్స్ అమ్మకాల విషయంలో కేంద్రమే మాకు లైసెన్స్ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలతో నూడుల్స్ వివాదం మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా పలు రకాల కంపెనీల నూడుల్స్ వివాదం కొనసాగుతుండగానే ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తన సంస్థ తరుపున పతంజలి నూడుల్స్ ప్రారంభించిన విషయం అందరికీ విదితమే. అయితే, ఈ నూడుల్స్ వ్యాపారం కోసం ఇప్పటి వరకు తమ అనుమతి తీసుకోలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్మన్ ఆశిష్ బహుగుణ బుధవారం తెలిపారు. పైగా ఈ ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ అనుమతి పొందినట్లు ఉందని తమ దృష్టికి వచ్చిందని చైర్మన్ వెల్లడించిన నేపథ్యంలో.. తమ సొంత సంస్థ తరుఫున ప్రారంభించిన పతంజలి నూడుల్స్కు అన్ని అనుమతులు ఉన్నాయంటూ మరోసారి వివరణ ఇచ్చారు. -
'రాందేవ్ మా పర్మిషన్ తీసుకోలేదు'
న్యూఢిల్లీ: దేశంలో నూడుల్స్ వివాదం కొనసాగుతుండగానే ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తన సంస్థ తరుపున నూడుల్స్ ప్రారంభించారు. అది కూడా ఫుడ్ సేప్టి అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోకుండానే. రాందేవ్ బాబా పతంజలి అట్టా నూడుల్స్, రాందేవ్ నూడుల్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నూడుల్స్ ఇప్పటి వరకు తమ అనుమతి తీసుకోలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్మన్ తెలిపారు. ఇసలు ఇప్పటి వరకు అలాంటి అనుమతి కోసం రాందేవ్ బాబా దరఖాస్తు కూడా చేసుకోలేదని అధికార వర్గాల సమాచారం. పైగా ఈ ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ అనుమతి పొందినట్లు ఉందని తెలిసింది. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై దృష్టి సారించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్మన్ ఆశిష్ బహుగుణ తెలిపారు. అనుమతి తీసుకున్నాం పతంజలి నూడుల్స్ ఫుడ్ సేఫ్టి సంస్థ అనుమతి తీసుకోలేదని ఆరోపించగా తాము ఇదివరకే దాని అనుమతులు పొందామని, అన్ని నియమనిబంధనలు, ప్రమాణాలు పాటించామని పతంజలి అధికార ప్రతినిథి ఎస్ కే తిజర్వాలా అన్నారు. -
పతంజలి నూడుల్స్ వచ్చాయ్..
70 గ్రాముల ప్యాక్ ధర రూ.15 * రిలయన్స్ ఫ్రెష్, బిగ్ బజార్ తదితర అవుట్లెట్స్లో లభ్యం న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ ప్రమోట్ చేస్తున్న పతంజలి ఆయుర్వేద సోమవారం దేశీ మార్కెట్లోకి నూడుల్స్ను ప్రవేశపెట్టింది. ‘ఆటా నూడుల్స్’ 70 గ్రాముల ప్యాక్ ధర రూ. 15గా నిర్ణయించింది. పోటీ సంస్థల నూడుల్స్ కన్నా తమ ఉత్పత్తి ధర రూ. 10 తక్కువగా ఉంటుందని బాబా రాందేవ్ తెలిపారు. ఇతర సంస్థల్లాగా వీటి తయారీలో పామాయిల్ కాకుండా రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగిస్తున్నట్లు ఆయన వివరించారు. రిలయన్స్ ఫ్రెష్, బిగ్ బజార్, డి-మార్ట్ వంటి రిటైల్ అవుట్లెట్స్తో పాటు పతంజలి బ్రాండ్ సొంత రిటైల్ స్టోర్స్లో కూడా ఇవి లభిస్తాయని ఆయన చెప్పారు. డిసెంబరు ఆఖరు నాటికి పది లక్షల స్టోర్స్లో ఇవి అందుబాటులో ఉంటాయన్నారు. నూడుల్స్ ఉత్పత్తి కోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ ఎన్సీఆర్లో మొత్తం అయిదు తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్లాంట్లలో పతంజలి ఆయుర్వేదకు చెందిన ఇతర ఉత్పత్తులు కూడా తయారవుతాయని రాందేవ్ చెప్పారు. బహుళ జాతి సంస్థలతో పోటీ పడే దిశగా త్వరలో పతంజలి నూడుల్స్తో పాటు నెయ్యి, టూత్పేస్ట్ తదితర ఉత్పత్తుల ప్రచారానికి టీవీ ప్రకటనలూ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 5 నెలల నిషేధం తర్వాత ఇటీవలే మళ్లీ అమ్మకాలు మొదలెట్టిన నెస్లే కంపెనీ మ్యాగీ నూడుల్స్తో పతంజలి నూడుల్స్ పోటీపడనుంది. త్వరలో చైల్డ్, స్కిన్ కేర్ ఉత్పత్తులు కూడా..: డిసెంబర్ నాటికి చైల్డ్కేర్, స్కిన్కేర్ ఉత్పత్తులతో పాటు హెల్త్ సప్లిమెంట్స్ను కూడా మార్కెట్లోకి తేనున్నట్లు బాబా రాందేవ్ వివరించారు. ‘శిశు కేర్’ బ్రాండ్తో శిశు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, ‘సౌందర్య’ బ్రాండ్ పేరిట సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు, ‘పవర్ వీటా’ బ్రాండ్ కింద హెల్త్ సప్లిమెంట్స్ను ప్రవేశపెడతామన్నారు. అలాగే టెక్స్టైల్స్ రంగంలోకి అడుగెట్టబోతున్నామని, ‘వస్త్రం’ బ్రాండ్ కింద ఉత్పత్తులు ఉంటాయని బాబా రాందేవ్ తెలిపారు. పతంజలి ఆయుర్వేదను స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ అటువంటి యోచనేదీ ప్రస్తుతానికి లేదన్నారు. ఎగుమతి అవకాశాలపై మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ కంపెనీ చిన్న స్థాయిదేనని, దేశీ డిమాండ్పైనే ప్రధానంగా దృష్టి పెడుతోందని రాందేవ్ చెప్పారు. ఎగుమతుల అంశాన్నీ పరిశీలిస్తామన్నారు. 2014-15లో కంపెనీ అమ్మకాల టర్నోవరు రూ. 2007 కోట్లని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 150% వృద్ధితో రూ. 5,000 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నట్లు రాందేవ్ తెలిపారు. -
ఇక బాబా రామ్దేవ్ నూడుల్స్
పతంజలి బ్రాండ్ పేరుతో ఈ నెల 15 నుంచి విక్రయం * ఫ్యూచర్ గ్రూప్తో పతంజలి ఆయుర్వేద జట్టు * రూ. 1,000 కోట్ల వ్యాపారంపై దృష్టి న్యూఢిల్లీ: నెస్లే మ్యాగీ నూడుల్స్పై వివాదం నేపథ్యంలో దేశీ యోగా గురు బాబా రామ్దేవ్ తాజాగా సొంత నూడుల్స్ బ్రాండ్ను మార్కెట్లోకి దింపుతున్నారు. ఆయన సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా వీటిని విక్రయించనుంది. అలాగే ఓట్స్, పాస్తా, జ్యూస్లు మొదలైన ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తేనుంది. ‘అక్టోబర్ 15 నుంచి పతంజలి నూడుల్స్ అమ్మకాలు దేశవ్యాప్తంగా మొదలుపెడుతున్నాం. మ్యాగీ రేటు రూ. 25 ఉండేది. మేము రూ. 15కే అందిస్తాం. దీనిలోని టేస్ట్ మేకర్.. ఆరోగ్యానికి కూడా మేలు చేసేదిగా ఉంటుంది. అందులో సీసం గానీ ఎంఎస్జీ (మోనోసోడియం గ్లూటమేట్) లాంటి హానికారక పదార్థాలేమీ ఉండవు’ అని రామ్దేవ్ తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మ్యాగీ తయారీలో నెస్లే కంపెనీ.. పామాయిల్ ఉపయోగిస్తుందని, తాము మాత్రం ఖరీదైన రైస్బ్రాన్ ఆయిల్ను మాత్రమే ఉపయోగిస్తామని చెప్పారు. హానికారకమైన సీసం, ఎంఎస్జీ ప్రమాదకర స్థాయిల్లో ఉన్నాయంటూ మ్యాగీ నూడుల్స్పై వివాదం రేగడం, ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘ఝట్పట్ పకావో.. ఔర్ బేఫిక్ ్రఖావో’ (క్షణాల్లో వండుకో..ఆనందంగా ఆరగించు)అనేది పతంజలి నూడుల్స్కి క్యాచ్లైన్గా ఉంటుందని బాబా రామ్దేవ్ వివరించారు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంలో భాగంగానే వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త ఉత్పత్తుల ఊతంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పతంజలి ఆయుర్వేద దాదాపు రూ. 5,000 కోట్ల వ్యాపారం నమోదు చేయగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశీయంగా నూడుల్స్ మార్కెట్ విలువ సుమారు రూ. 4,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో సింహభాగం వాటా మ్యాగీకే ఉండేది. ఫ్యూచర్ గ్రూప్తో ఒప్పందం.. తమ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి పతంజలి ఆయుర్వేద, ఫ్యూచర్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన స్టోర్స్లో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయించడం జరుగుతుంది. రాబోయే 20 నెలల్లో తమ స్టోర్స్లో వీటి అమ్మకాల ద్వారా రూ. 1,000 కోట్ల మేర వ్యాపారం జరగగలదని ఫ్యూచర్ గ్రూప్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హెచ్యూల్ అమ్మకాలు తమ స్టోర్స్లో రూ. 1,300 కోట్లు- రూ. 1,400 కోట్ల మేర ఉంటున్నాయని పతంజలి ఉత్పత్తులు ఈ లక్ష్యాన్ని సులభంగానే దాటగలవని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిశోర్ బియానీ చెప్పారు. ప్రారంభంలో వీటి విక్రయం ద్వారా నెలకు రూ. 30-40 కోట్ల ఆదాయం ఉండొచ్చని, తర్వాత ఇది రూ. 80 కోట్లకు పెరుగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. దీర్ఘకాలికంగా సంయుక్త భాగస్వామ్యంలో ఉత్పత్తుల తయారీ కూడా చేపట్టాలని ఇరు సంస్థలు యోచిస్తున్నట్లు బియానీ చెప్పారు. పతంజలి ఉత్పత్తుల పంపిణీ, మార్కెటింగ్ కోసం హరిద్వార్లో ప్రత్యేక కార్యాలయం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఫ్యూచర్ గ్రూప్ ఆదాయాలు 20-25% మేర వృద్ధి చెందగలవని, 2015-16 గ్రూప్ ఆదాయం రూ. 22,000 కోట్లు- రూ. 23,000 కోట్ల స్థాయిలో ఉండగలదని బియానీ పేర్కొన్నారు.