Porsche Tennis Grand Prix Tournament
-
ఫైనల్లో సానియా జంట
స్టట్గార్ట్ (జర్మనీ): వరుసగా మూడు టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం మళ్లీ సత్తా చాటుకుంది. పోర్షె టెన్నిస్ గ్రాండ్ప్రి టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ జోడీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-4, 7-5తో సబీనా లిసికి (జర్మనీ)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది. గంటా 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు జోడీలు తమ సర్వీస్లను కాపాడుకోవడంలో తడబడ్డాయి. సానియా జంట ప్రత్యర్థి జోడీ సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో అనాలెనా గ్రోన్ఫెల్డ్ (జర్మనీ)-క్వెటా పెషెక్ (చెక్ రిపబ్లిక్) లేదా కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లతో సానియా-హింగిస్ తలపడతారు. -
సెమీస్లో సానియా జోడీ
స్టట్గార్ట్ (జర్మనీ): పోర్షె టెన్నిస్ గ్రాండ్ప్రి టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 6-1, 6-3తో బార్బరా క్రెజిసికోవా-కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఈ ఇండో-స్విస్ జోడీ ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో సానియా-హింగిస్ 6-1, 6-1తో ఎరి హొజుమి-మియు కాటో (జపాన్)లపై గెలిచారు. మరోవైపు బార్సిలోనా ఓపెన్ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జోడీ 6-7 (5/7), 4-6తో ట్రీట్ హువె (ఫిలిప్పీన్స్)-మాక్స్ మిర్నీ (బెలారస్) జంట చేతిలో ఓడిపోయింది.