Priority projects
-
ప్రాధాన్య ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టులకు రానున్న బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులతోపాటు మెట్రో రైలు విస్తరణకు అధిక నిధులు కేటాయించే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అందే ఆర్థిక సాయం, వివిధ సంస్థల నుంచి తెచ్చుకొనే రుణాలు కాకుండా దాదాపు రూ. 20 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించొచ్చని చెబుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని.. కేంద్ర ఆర్థిక సాయం కోసం ఆయా ప్రాజెక్టుల (డీపీఆర్) సమగ్ర నివేదికలను కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ‘మూసీ’కి రూ. 2 వేల కోట్లు! హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా 2030 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ. 2 వేల కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ. 4,100 కోట్లను ప్రపంచ బ్యాంకు ద్వారా రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికితోడు కేంద్రం కూడా ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందిస్తుందని, మిగిలిన నిధు లను ప్రైవేటు రంగం ద్వారా పెట్టుబడుల రూపంలో తీసుకోవాలనేది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూ ర్తయ్యే సమయానికి రూ. లక్షన్న ర కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందులో ఎక్కువగా ప్రైవేటు పెట్టుబడుల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ప్రాజెక్టు తొలివిడతలో భాగంగా ఇబ్బందిలేని ప్రాంతాల్లో ఈ ఏడాది మూసీ పునరుజ్జీవ పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు కేటాయించొచ్చని తెలుస్తోంది. మెట్రో విస్తరణకు రూ. 7 వేల కోట్లపైనే? రూ. 24,369 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులో 30 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ మేరకు రూ. 7,200 కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశాలున్నాయి. దీంతోపాటు మరో రూ. 4 వేల కోట్లకుపైగా కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఇవి పోను రూ. 12 వేల కోట్లలో రూ. 1,000 కోట్లను పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాలనుకుంటోంది. మిగతా నిధులను జైకా, ఏడీబీ, ఎన్డీబీ లాంటి సంస్థల ద్వారా రుణాల రూపంలో తీసుకోనుంది. అదేవిధంగా హైదరాబాద్ శివార్లలో దాదాపు 800 చదరపు కిలోమీటర్లకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఫ్యూచర్ సిటీ భూసేకరణ కోసం తొలిదశలో భాగంగా రూ. 10 వేల కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించనున్నట్లు సమాచారం. -
Andhra Pradesh: వేగంగా ‘ప్రాధాన్యత’ పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తించిన ప్రాధాన్యత పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి సచివాలయం పరిధిలో అత్యంత ప్రాధాన్యత గల పనులను గుర్తించి, ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇలా అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన రూ.1,002.34 కోట్ల విలువైన 25,934 పనులను పోర్టల్లో అప్లోడ్ చేశారు. వీటిలో ఇప్పటివరకు రూ.922.88 కోట్ల విలువైన 23,845 పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.758 కోట్లకు పైగా విలువైన 20,408 పనులు ప్రారంభం కాగా, రూ.32.15 కోట్ల విలువైన 813 పనులను పూర్తి చేశారు. రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల 2వ తేదీ వరకు 5,173 సచివాలయాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. వాటి పరిధిలో ప్రజలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత పనులను గుర్తించి, వాటి వివరాలను గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా అప్లోడ్ చేసిన పనులను వెంటనే మంజూరు చేయడం, వాటిని ప్రారంభించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఒక్కో సచివాలయం పరిధిలోని పనులకు రూ.20 లక్షల చొప్పున రూ.3,000 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, పూర్తయిన పనుల బిల్లుల చెల్లింపునకు తొలి విడతగా రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను డీడీవోలకు పంపింది. ఈ పనుల పురోగతిని కూడా ఎప్పటికప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పూర్తయిన పనుల బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసి నిబంధనల ప్రకారం చెల్లించాలని డీడీవోలను ఆదేశించింది. పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. -
వరుసగా.. వడివడిగా
సాక్షి, అమరావతి: ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతన్నలకు ప్రయోజనం చేకూర్చాలని జలవనరుల శాఖకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్ర తనయ, తారకరామ తీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, రాయలసీమలోని జోలదరాశి, రాజోలి జలాశయాలు, కుందూ ఎత్తిపోతల, వేదవతి ఎత్తిపోతల, రాజోలిబండ డైవర్షన్ స్కీం కుడి కాలువ, మడకశిర బైపాస్ కెనాల్, భైరవానితిప్ప– కుందుర్పి ఎత్తిపోతలతోపాటు వరికపుడిశెల ఎత్తిపోతల, చింతలపూడి ఎత్తిపోతల, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకంతో సహా 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించారు. వచ్చే నెల నెల్లూరు, సంగం బ్యారేజీలు ఆగస్టు మూడో వారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీపై నెలకొల్పనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి విగ్రహం కోసం నిరీక్షిస్తున్నామని, త్వరలోనే రానుందని చెప్పారు. దసరాకి అవుకు రెండో టన్నెల్.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను దసరా నాటికి సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలకు వరదాయిని లాంటి వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. వెలిగొండ టన్నెల్–2లో ఏప్రిల్లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్లో 346.6 మీటర్లు, జూలైలో ఇప్పటివరకూ 137.5 మీటర్ల మేర పనులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు సిద్ధం చేయాలని సీఎం జగన్ గడువు విధించారు. వంశధార పనులు ముమ్మరం.. వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని, అక్టోబర్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలోనే గొట్టా బ్యారేజీ నుంచి హిర మండలం రిజర్వాయర్కు నీటిని తరలించే ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ఎత్తిపోతలకు రూ.189 కోట్లు వ్యయం కానుంది. పశ్చిమ కర్నూలుపై ప్రత్యేక దృష్టి దశాబ్దాలుగా బాగా వెనకబాటుకు గురైన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సమావేశంలో సీఎం జగన్ పేర్కొన్నారు. నీటి వసతి, సౌకర్యాల పరంగా అత్యంత వెనకబడ్డ ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసల నివారణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు నిర్దేశించారు. భూమిలేని వారికి కనీసం ఒక ఎకరా భూమినైనా ఇవ్వాలన్నారు. ఆ ప్రాంతంలో సాగు, తాగునీటి పథకాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని ఆదేశించారు. సాగునీరు అందించడం వల్ల ఉపాధి కల్పించి వలసలను నివారించవచ్చన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలు తదితరాలను నెలకొల్పి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అక్కడప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థ్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్సింగ్ రావత్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ప్రాజెక్టుల సీఈలు తదితరులు పాల్గొన్నారు. పోలవరంపై సమగ్ర సమీక్ష.. ► పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, గోదావరికి ముందస్తు వరదలతో తలెత్తిన పరిణామాలపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గతంలో వరద ఉధృతికి కోతకు గురై గ్యాప్–1, గ్యాప్–2ల్లో ఏర్పడిన అగాధాల పూడ్చివేత పనులపై విస్తృతంగా చర్చించారు. ఇందుకు సమగ్ర విధానాన్ని నిర్ధారించేందుకు తొమ్మిది రకాల పరీక్షలు, ఫలితాల నివేదికలు అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు పూర్తి కాగా మరికొన్ని నిర్వహించాల్సి ఉందని వివరించారు. ► కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సూచించిన విధానం ప్రకారం దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటంతోపాటు 30.5 మీటర్ల ఎత్తున నిర్మించే పనులను షెడ్యూల్ ప్రకారమే చేపట్టామని.. కానీ గోదావరికి ముందస్తు వరదల వల్ల దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన ప్రాంతం మీదుగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోకి వరద జలాలు చేరాయని సమావేశంలో అధికారులు తెలిపారు. ► ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోకి వరద జలాలు చేరడం వల్ల అగాధాలు పూడ్చేందుకు చేపట్టాల్సిన పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు. ముందస్తు వరదల వల్ల దిగువ కాఫర్ డ్యామ్ పనులకు అంతరాయం కలిగిందని చెప్పారు. ► గోదావరిలో వరద కనీసం 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగానీ దిగువ కాఫర్ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. వరద తగ్గుముఖం పట్టగానే పోలవరం పనులను ముమ్మరంగా చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం సూచించారు. ► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2,900 కోట్లను రీయింబర్స్ చేయాల్సి ఉందని సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఖర్చు చేసిందన్నారు. ఆ నిధులను రీయింబర్స్ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పోలవరం పనులను వేగవంతం చేసేందుకు అడ్హాక్ (ముందస్తు)గా రూ.6 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంపొనెంట్ (విభాగాలు) వారీగా రీయింబర్స్ చేసే విధానంలో కాకుండా అడ్హాక్గా నిధులు తెప్పించుకుంటే కీలక పనులను త్వరితగతిన పూర్తి చేయవచ్చన్నారు. వరద తగ్గగానే శరవేగంతో పనులు చేసేందుకు ఆ నిధులు ఉపయోగపడతాయన్నారు. ఈ మేరకు అడ్హాక్గా నిధులు సమకూర్చేలా కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులకు నిర్దేశించారు. పోలవరం కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే కనెక్టివిటీలు, హెడ్ రెగ్యులేటర్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. -
ప్రాజెక్టులకు ప్రాణం
ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో నీటిపారుదల శాఖ పరంగా జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు సోమవారం హైదరాబాద్లో ఆ శాఖ ఉన్నతాధికారులు, సాగునీటి రంగ నిపుణులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తక్షణ ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే సాగునీటి ప్రాజెక్టులకే బడ్జెట్లో అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేసి వాటికి అవసరమయ్యే నిధుల కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్లోనే చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో జిల్లాలోని ఐదు ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది. తక్కువ వ్యయంతో పూర్తి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పరంగా పరిశీలిస్తే.. కేవలం రూ.20 కోట్లు కేటాయిస్తే ఐదు ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. వీటి ద్వారా 56 వేల ఎకరాల ఆయకట్టు తక్షణం వృద్ధిలోకి వస్తుంది. ర్యాలీ వాగు, మత్తడివాగు, స్వర్ణ, సాత్నాల, గొల్లవాగులు స్వల్ప వ్యయంతో పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇందులో సాత్నాల, స్వర్ణ ప్రాజెక్టులు ఆధునికీకరణ పనులుకాగా మిగతావి కొత్త ప్రాజెక్టులు. ఇవీ చివరి దశ నిర్మాణంలో ఉన్నాయి. మరో రూ.128 కోట్లు కేటాయిస్తే నీల్వాయి, గడ్డెన్నవాగు, జగన్నాథ్పూర్, కడెం ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఇందులో కడెం ప్రాజెక్టువి ఆధునికీకరణ పనులు. ఈ ప్రాజెక్టుల ద్వారా 1.10 లక్షల ఎకరాలు వృద్ధిలోకి వస్తాయి. 2 లక్షల ఎకరాలకు సాగునీరందరించే 60 టీఎంసీల సామర్థ్యం గల శ్రీపాద ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదీ పరిస్థితి జైపూర్, చెన్నూర్ మండలాలకు చెందిన 20 గ్రామాల పరిధిలో ఆయకట్టుకు నీరందించే గొల్లవాగుకు పిల్లకాలువల మీద స్ట్రక్చర్స్ కట్టాల్సి ఉంది. దీనికోసం భూ సేకరణకు ఇబ్బందులు ఉన్నాయి. రూ.83.61 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.82.20 కోట్లు వెచ్చించారు. మరో రూ.1.41 కోట్లు సమకూర్చాల్సి ఉంది. తాంసి మండలంలోని వడ్డాడిలో ఉన్న మత్తడివాగు డిస్ట్రిబ్యూటర్ నంబర్ 14లో పనులు అసంపూర్తిగా నిలిచాయి. రూ.4 కోట్లు కేటాయిస్తే ఈ పనులు పూర్తి అవుతాయి. కుడికాలువ కెనాల్ కోసం తాజాగా రూ.9 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. {పాజెక్టు ఆధునికీకరణ పనుల్లో ఉన్న సాత్నాలకు రూ.7 కోట్లు, స్వర్ణకు రూ.5 కోట్లు, కడెం ప్రాజెక్టుకు రూ.18 కోట్లు కేటాయిస్తే మిగతా పనులు పూర్తయ్యే పరిస్థితి ఉంది.