రైతులను మోసం చేయడంలో ఆయనది పీహెచ్డీ
రైతులను మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ఆయకట్టుకు నీళ్లు అందించకపోవడానికి నిరసనగా కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతు మహాధర్నాలో భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులు, రైతు నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
రాష్ట్రంలో కరువు బారిన పడిన రైతులను ఆదుకోవాల్సిందిపోయి అసలు రాష్ట్రంలో కరువే లేదని చంద్రబాబు అంటున్నారు
ఒక్కసారి మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు చూడండి
వైఎస్ఆర్ బతికున్నప్పుడు అవి ఏస్థాయిలో ఉండేవి, చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడు ఉన్నాడా
2014లో గండికోట సభలో బాబు.. కనీసం 10 టీఎంసీలు 2015 ఖరీఫ్కి ఇస్తానన్నాడు. కానీ 2016 కూడా అయిపోవస్తున్నా గండికోట ప్రాజెక్టు ముందుకు కదల్లేదు
ఇంతవరకు ఆ ముంపు గ్రామాల సమస్యలు తీర్చలేదు
ప్రాజెక్టులోకి నీళ్లు తేవాలంటే.. ముందు పెండింగ్ పనులు పూర్తిచేయాలి
గండికోటకు నీళ్లు రావాలంటే కెనాల్, వరద కాలువ పూర్తి చేయాలి
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 80 శాతం పనులు జరిగితే, మిగిలిన 20 శాతం ఇంతవరకు పూర్తికాలేదు
ఏదైనా ప్రాజెక్టులో నీళ్లు నింపాలంటే ఇంకా ఆ ప్రాంతంలో ముంపునకు గురయ్యే గ్రామాల వాసులకు పరిహారం ఇవ్వాలి
గ్రామస్తులకు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వకుండా గండికోటకు ఎలా 10 టీఎంసీల నీళ్లిస్తారు
ఇక.. ఒక్కసారి తెలుగుగంగ ప్రాజెక్టు చూద్దాం. అందులో బ్రహ్మంసాగర్ అంతర్భాగం. చంద్రబాబు ఎప్పుడు జిల్లాకు వచ్చినా అందులో 12 టీఎంసీల నీళ్లు ఉండేలా చూస్తామంటారు.
ప్రాజెక్టు ఇప్పటికే కట్టి ఉన్నా.. రెండున్నరేళ్ల నుంచి చంద్రబాబు ఏం చేశారని చూస్తే, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుకు ఒక్కటంటే ఒక్క టీఎంసీ కూడా నీళ్లివ్వలేదు
ఒకవైపు శ్రీశైలం నుంచి నీళ్లు పొంగి పొరలిపోతున్నా.. తర్వాత నాగార్జున సాగర్ నుంచి సముద్రంలోకి వెళ్లి 92 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా బ్రహ్మంసాగర్ మాత్రం చంద్రబాబుకు కనిపించలేదు, ఇక్కడ 12 టీఎంసీలు పెట్టాలన్న ధ్యాస లేదు
బుద్ధి ఉన్న ఎవరికైనా ఒకటి తెలుస్తుంది. వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్కు నీళ్లు రావాలి. అంటే, 0-20 కిలోమీటర్ల మధ్య కెనాల్ వీక్గా ఉంది, దానికి రిపేర్లు చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు నేను కూడా చంద్రబాబుకు, మంత్రులకు ఎన్నోసార్లు చెప్పాం. కానీ ఇంతవరకు చంద్రబాబు ఆ రిపేర్ల గురించి పట్టించుకోకపోగా.. మళ్లీ రైతులను మోసం చేయడానికి బ్రహ్మంసాగర్లో 12 టీఎంసీలు నింపుతానంటాడు
ఇలాంటి మనిషిని ఎక్కడ పెట్టాలని అడుగుతున్నా.. పిచ్చాసుపత్రిలో పెట్టాలా, బంగాళాఖాతంలో కలపాలా అని అడుగుతున్నా
ఆయన నోరు తెరిస్తే చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు
బ్రహ్మసాగర్ నుంచి ఆర్టీపీపీకి కూడా నీళ్లు రావాలి. లేకపోతే కరెంటు ఉండదు. ఈయన సీఎం అయ్యాక వర్షాలు రాకుండా పోయాయి.
ఆర్టీపీపీ కూడా మూతపడితే ఇక కరెంటు కోసం ఎవరివైపు చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి
ఆర్టీపీపీ మూతపడితే సంతోషించేది చంద్రబాబే. ఆ పేరు చెప్పి దాన్ని సింగపూర్ వాళ్లకు అమ్మేస్తారు
చంద్రబాబు ఈ ప్రాజెక్టులకు చేసింది శూన్యం
జీఎన్ఎస్ఎస్కు ఆయన తన తొమ్మిదేళ్ల పాలనలో 11 కోట్లు ఇచ్చారు. వెలిగోడుకు 13 కోట్లు ఇచ్చారు. అయినా నీళ్లు వదిలితే ఆ ప్రాజెక్టులలోకి వచ్చే పరిస్థితి ఉందంటే, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండటమే కారణం
అందుకే కొద్దోగొప్పో డ్యాంలు, కెనాల్స్ పూర్తయ్యాయి కాబట్టి కాస్తయినా నీళ్లు వస్తున్నాయి
ఇదే చంద్రబాబు హంద్రీనీవా గురించి మాట్లాడతారు. అనంతపురం తనకు ప్రాణం అంటారు
సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలకు వెన్నుపోటు పొడవడం కష్టం కాదు
మూడు ప్రాజెక్టులకు కెనాల్ సిస్టం అభివృద్ధి చేసి ఉంటే మార్గమధ్యంలో వందల చెరువులకు నీళ్లు వచ్చేవి
అలా ఉంటే ఈవాళ అత్యధికంగా వేరుశనగ పంట వేసి నష్టపోయిన అనంతపురం జిల్లాకు తోడుగా ఉండేది
జీడీపల్లెకు 1.5 టీఎంసీ నీళ్లు ఇన్నాళ్లకు వచ్చాయి. పీఏబీఆర్లో 1 టీఎంసీ. అక్కడ నింపడం ఇప్పుడు మొదలుపెట్టాడు
రైతులను మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ తీసుకున్నాడు
ప్రజలను మోసం చేయడంలో ఆయన కొడుకు నారా లోకేష్ కూడా తండ్రి బాటలోనే ఉన్నారు
కడపలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి చంద్రబాబు ఒకమాట, లోకేష్ ఒకమాట మాట్లాడతారు
ఎవరైనా కొడుకులకు తండ్రి మంచి మాటలు చెబుతారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయన పార్టీ, కొడుకు అందరికీ.. రైతులను ఎలా మోసం చేయాలో నేర్పుతారు. రైతులకు సులభంగా అబద్ధాలు చెబితే మోసం చేయొచ్చు కదా, దానివల్ల అధికారంలోకి వస్తామని నేర్పుతారు
ఇంకా ఒక అడుగు ముందుకేసి బ్యాంకుల్లో రైతులు పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలని ఒక అబద్ధం ఆడండని చెబుతారు
రైతులనే కాదు.. చివరకు ఆడవాళ్లను కూడా మోసం చేసే కార్యక్రమం చేశాడు
డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అంటారు
చివరకు చదువుకునే చిన్నపిల్లలను కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. మామూలుగా అయితే ఎవరైనా వాళ్ల తిట్లు భయంకరంగా ఉంటాయని అనుకుంటారు
జాబు రావాలంటే బాబు సీఎం కావాలని అబద్ధాలు చెప్పించాడు. చివరకు ఏ స్థాయిలో అబద్ధాలు ఉన్నాయంటే సీఎం కుర్చీలో కూర్చోడానికి, ఆ తర్వాత కూడా అబద్ధాలు
చంద్రబాబు పాలన గురించి నాలుగు ముక్కలు చెప్పాలంటే.. అబద్ధం, మోసం, దుర్మార్గం, వెన్నుపోటు
చంద్రబాబును ఉద్దేశించి డిమాండ్ చేస్తున్నాం
నీ పుణ్యమాని కేసీ కెనాల్ పరిధిలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఇప్పటివరకు లేదు
92 వేల ఎకరాల ఆయకట్టును బతికించడానికి జనవరి 15 నాటికి నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తున్నాం
ముంపుగ్రామాల సమస్యలు తీర్చి గండికోట పనులు పూర్తి చేయాలి, గండికోటకు కనీసం 12 టీఎంసీల నీళ్లయినా నిల్వ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం
చిత్రావతిలో 90 శాతం పనులు వైఎస్ హయాంలో జరిగితే, 10 శాతం పనులు ఇంతవరకు చంద్రబాబు పూర్తి చేయలేకపోయాడు.. ఆ పనులు వెంటనే పూర్తిచేయాలి
తెలుగుగంగ ద్వారా బ్రహ్మసాగర్లో కనీసం 12 టీఎంసీలు నిల్వచేయాలి. వెంటనే మరమ్మతులు పూర్తిచేయాలి
తెలుగు గంగ, జీఎన్ఎస్ఎస్, వెలిగోడు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి
శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు
ఆ ప్రాజెక్టును విద్యుత్తు కోసం కాకుండా రైతుల కోసం ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాం
కడప జిల్లా ప్రజలు, యువకులు ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎదురు చూస్తున్నారు
వైఎస్ హయాంలో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఎంతోకొంత కదలిక వచ్చింది.
ఆ ఫ్యాక్టరీ పెట్టాలని, 10 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న స్పృహ కూడా లేదు
కనీసం ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా