Renewal Certificate
-
SEBI: 72 రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్ రద్దు
న్యూఢిల్లీ: రెన్యువల్ ఫీజును కట్టనందుకు గాను 72 రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. దీంతో వాటి రిజిస్ట్రేషన్ ఇక చెల్లుబాటు కాదు. గడువు తీరిపోయిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం నమోదు చేసుకున్న ప్రతి రీసెర్చ్ అనలిస్టు అయిదేళ్లకోసారి రెన్యువల్ ఫీజును కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ 72 అనలిస్టులు రెన్యువల్ ఫీజులు చెల్లించలేదని, వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గడువు ముగిసిపోయిందని సెబీ గుర్తించింది. దీంతో నిబంధనల ఉల్లంఘనకు గాను వారికి షోకాజ్ నోటీసులు పంపించి, తాజా నిర్ణయం తీసుకుంది. అటు లిక్విడిటీ ఉండని స్టాక్ ఆప్షన్లలో మోసపూరిత ట్రేడింగ్ ఆరోపణలపై సహదేవ్ పైక్ హెచ్యూఎఫ్, పరితోష్ సాహా హెచ్యూఎఫ్, త్రిప్తా ష్రాఫ్, దక్ష్ షేర్ బ్రోకర్స్ మొదలైన వర్గాలపై జరిమానా విధించింది. -
వాహనాలపై ఆర్సీ రెన్యువల్ మోత
సాక్షి, న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనిని కేంద్రం ఆమోదించిన వెంటనే 20 ఏళ్లకు పైబడి ఉన్న వాహనాలను తమ వద్ద ఉంచుకోవాలనుకునే వారు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. బీఎస్–2 ఉద్గార నిబంధనలు అమల్లోకి రాకముందే తయారైన వాహనాలను ప్రజలు వదిలించుకోవాలనే కేంద్రం ఈ చర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. రానున్న రోజుల్లో 20 ఏళ్ల పైబడిన ద్విచక్ర వాహన రిజి్రస్టేషన్ రెన్యువల్కు రూ.2 వేలు, త్రీ వీలర్కైతే రూ.5 వేలు, కార్లు/జీపులకు రూ.10 వేలు చేయాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అంతేగాక 15 ఏళ్లు పైబడిన భారీ వాహనాలను దశలవారీగా రద్దు చేయడంపై దృష్టి సారించిన కేంద్రం వాణిజ్య మీడియం ప్యాసింజర్/గూడ్స్ వాహనానికి రూ.12 వేలు, హెవీ ప్యాసింజర్/ గూడ్స్ వాహనానికి రూ.18 వేలు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలుగా ప్రతిపాదించింది. అదే వాహనాలను 20 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకుంటే వాటి రుసుములను వరుసగా రూ.24 వేలు, రూ.36 వేలుగా రెట్టింపు చేస్తూ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు అమలైతే దేశవ్యాప్తంగా వాహన యజమానులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో మాత్రం దీని ప్రభావం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 ఏళ్ల పైబడిన డీజిల్, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలను తప్పనిసరిగా తొలగించాల్సి ఉన్న విషయం తెలిసిందే. 2021లో రోడ్డు రవాణా శాఖ మోటార్ సైకిళ్లు, త్రీ వీలర్లు, కార్ల రిజి్రస్టేషన్ రెన్యువల్ రుసుమును మాత్రమే పెంచింది. దీంతో, తాజాగా 20 ఏళ్లు దాటిన మీడియం, హెవీ ప్రైవేట్ కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ పరీక్షల ఫీజును రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది. -
అవినీతి కేసులో ఆర్ఐ అరెస్ట్
తిరువొత్తియూరు, న్యూస్లైన్: పాఠశాల భవనం గుర్తింపు రెన్యువల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి రూ.2 వేలు లంచం తీసుకున్న కీళంబాక్కం ఆర్ఐని పోలీసులు అరెస్టు చేశారు. కాంచీపురం జిల్లా మామల్లపురానికి చెందిన కన్నన్, మామల్లపురం సమీపంలో పుదుఎడయూర్ కుప్పంలో జీకే నర్సరీ పాఠశాలను నడుపుతున్నాడు. పాఠశాల భవ నం రిజిస్ట్రేషన్, గుర్తింపును ప్రతి ఏటా రెన్యువల్ చేయవలసి ఉంది. ఈ మేరకు తన పాఠశాల భవనం నాణ్యత, గుర్తింపు రెన్యువల్ సర్టిఫికేట్ పొందడానికి కేళంబాక్కం రెవెన్యూ ఇన్స్పెక్టర్ మణివన్నన్(56)కు దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ నిర్ధారణ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆర్ఐ రూ.2వేలు లంచం కోరాడు. డబ్బులు ఇవ్వక పోవడంతో కన్నన్ను కార్యాలయానికి పలుమార్లు తిప్పించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో చెన్నైలో ఉన్న అవినీతి నిరోధక విభాగం అధికారులకు కన్నన్ ఫిర్యాదు చేశారు. డీఎస్పీ జీవానందం, ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసన్ మంగళవారం ఉదయం కీళంబాక్కం వచ్చారు. అధికారులు ఇచ్చిన సలహా మేరకు రూ.2 వేలును కన్నన్, ఆర్ఐకి ఇచ్చారు. ఆ నగదును తీసుకుంటున్న సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న అధికారులు రెడ్హ్యాండెడ్గా రెవెన్యూ ఇన్స్పెక్టర్ మణివన్నన్ను పట్టుకుని అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.