ఆర్టీపీపీ మనుగడపై నీలినీడలు
► డిమాండ్ లేదనే పేరుతో యూనిట్లు నిలిపివేస్తున్న జెన్కో
నవ్యాంధ్ర రాష్ట్రంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల మనుగడ కష్ట సాధ్యంగా మారింది. డిమాండ్ లేదనే పేరుతో రన్నింగ్లో యూనిట్లు నిలిపేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీల చేతులోనడుస్తోన్న సోలార్, విండ్ పవర్ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆర్టీపీపీ మనుగడపై జెన్కో యజమాన్యం చర్యలు తీసుకోక పోతే త్వరలోనే థర్మల్ స్టేషన్ మూసి వేసే ప్రమాదం ఉందని స్పష్టం అవుతోంది.
ఎర్రగుంట్ల: జిల్లాలోని ఎర్రగుంట్ల మండల పరిధిలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో ఐదు యూనిట్లకు గాను ఒక్కోదానిలో 210 మెగావాట్ల చొప్పున 1050 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. అయితే ఏపీజెన్కో యజమాన్యం థర్మల్ స్టేషన్కు విద్యుత్ జనరేషన్ కాస్ట్ అధికంగా వస్తుందని నిలుపుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆర్టీపీపీలో ఉన్న 1,2,3,4,5 యూనిట్లకు గాను, 1,5 యూనిట్లును ఓవరాలింగ్ పేరుతో నిలిపేశారు. థర్మల్ స్టేషన్ను నీరుగార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కార్మిక సంఘాలు దుయ్యబడుతున్నాయి.
ఆర్టీపీపీ మాదిరిగానే విజయవాడలో ఉన్న ఎస్డీఎస్టీపీఎస్( శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్), నెల్లూరులో ఉన్న డీఎన్టీటీపీఎస్( డాక్టరు నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్)లలో యూనిట్లను నిలిలిపి వేసి ఉత్పత్తిని పూర్తిగా తగ్గించారు. ఎస్డీఎస్టీపీఎస్ లో 7 యూనిట్లకు గాను 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి జరగాల్సింది. ఇప్పుడు ఇందులో 3 యూనిట్లు నిలిపినట్లు సమాచరం.డీఎన్టీటీపీఎస్లో 2 యూనిట్లు ఉండగా ఒక్కోదానిలో 800 మెగావాట్ల ఉత్పతి జరగాల్సి ఉండగా ఒక యూనిట్ను నిలిపేశారు. ప్రసుతం అక్కడ 500 మెగావాట్లు మాత్రమే ఉత్పతి చేస్తున్నారు.
ఆర్టీపీపీలో 3 రోజులు సరిపడా బొగ్గు నిల్వలు.
ఆర్టీపీపీలో ప్రస్తుతం 3 రోజులు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఆర్టీపీపీకి సింగరేణి, తాల్చేరు బొగ్గు క్షేత్రాల నుంచి బొగ్గు వస్తుంటుంది. ఇప్పడు సింగరేణి నుంచి బొగ్గు సరఫర తగ్గింది. కేవలం ఒరిస్సా నుంచి మాత్రమే వస్తోంది. గతంలో లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండేవి. కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి.
ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ ఏమంటున్నారంటే..
ఈ విషయంపై ఆర్టీపీపీ చీఫ్ ఇం జినీర్ శ్రీరాములును వివరణ కో రగా ఆర్టీపీపీలో 5 యూనిట్లకు గాను 1,5 యూనిట్లను ఓవరాలింగ్ వల్ల నిలుపుదల చేసినట్లు తెలిపారు. 2,3,4 యూనిట్ల నుంచి 160 మెగా వాట్లు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. బొగ్గు నిల్వలు ప్రస్తుతం 35 వేల టన్నులు మాత్రమే ఉన్నాయని. ఇవి కేవలం 3 రోజులకు సరిపోతాయన్నారు. రోజూ బొగ్గు వ్యాగన్లు వస్తున్నాయని చెప్పారు. – శ్రీరాములు ( ఆర్టీపీపీ చీఫ్ ఇంజనీరు, ఎర్రగుంట్ల)