shantipuram mandal
-
ఐదు భాషల్లో అనర్గళంగా!
శాంతిపురం: ఒక దీపం అనంత దీపాలను వెలిగించినట్టు.. తపన ఉన్న ఓ ఉపాధ్యాయుడు తలిస్తే వందల, వేల మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చన్నది చిత్తూరు జిల్లా (Chittoor District) శాంతిపురం, శెట్టేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల చాటుతోంది. మారుమూల గ్రామంలో ఉన్న ఈ స్కూలు విద్యార్థులు బహుభాషలపై తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు. పాఠ్యాంశాల్లోని తెలుగు (Telugu), ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు కన్నడం, తమిళం, మలయాళీ (Malayalam) భాషలు ఇక్కడి విద్యార్థులు సులువుగా రాయటం, చదవడం, మాట్లాడడం చేస్తున్నారు. ఒక భాషలోని పద్యాలు, రచనలను మరో భాషలోకి అనువాదం చేయగలుగుతున్నారు. ప్రత్యేక పరీక్షల్లో ఉత్తీర్ణత అధికారుల అనుమతితో ఆయా భాషల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థుల భాషాపరిజ్ఞానంపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. గుడుపల్లి ఏపీ మోడల్ స్కూలు ఉపాధ్యాయుడు షిజో మైకెల్ మలయాళంపై, గుడుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎస్కే.మణి తమిళంపై, కర్ణాటకలోని వేమన విద్యా సంస్థల ఉపాధ్యాయురాలు ఎస్వనజాక్షి కన్నడ భాషపై మొత్తం 94 మంది విద్యార్థుల స్థాయిలను ఇటీవల పరీక్షించారు. వీరిలో కన్నడంలో 93 మంది, మలయాళంలో 45 మంది, తమిళంలో 36 మంది సంతృప్తికర ప్రతిభను చాటుకున్నారు. ప్రధానోపాధ్యాయుని సంకల్పం ఇక్కడ ప్రధానోపాద్యాయుడుగా ఉన్న తీగల వెంకటయ్య భాషల పట్ల ఆసక్తితో రూపకల్పన చేసిన కార్యక్రమం విద్యార్థులను బహుభాషా కోవిదులుగా తయారు చేస్తోంది. తీరిక వేళల్లో హెచ్ఎం ఇస్తున్న తర్ఫీదు, మిగతా ఉపాధ్యాయుల సహకారం అందిపుచ్చుకుని అన్ని బాషల్లోనూ తమ పట్టును పెంచుకొంటున్నారు. మాతృభాష (Mother Tongue) వస్తే మరెన్ని భాషలైనా నేర్వవచ్చనే ఆలోచనతో హెచ్ఎం తీగల వెంకటయ్య ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తన ప్రత్యేక బోధనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.చదవండి: సోలో లైఫే సో బెటరూ అంటున్న యువతులు! 6, 7, 8, 9 తరగతుల వారికి భాషల గురించి చెప్పి, కేవలం 26 సరళమైన పదాలతో బోధన ప్రారంభించారు. ఎవరైనా ఉపాధ్యాయులు లేని సమయంలో వారి తరగతులను తీసుకుని విద్యార్థులకు దీనిపై పాఠాలు చెప్పారు. విద్యార్థులు కూడా ఇతర భాషలు నేర్చుకోవటంపై ఆసక్తి చూపడంతో సొంత ఖర్చులతో వారికి మలయాళం, తమిళం, కన్నడ పుస్తకాలను కొనిచ్చారు. ఈ ఆసరాను అందిపుచ్చుకున్న పిల్లలు ఆయా భాషలపై సులువుగా పట్టు సాధిస్తున్నారు. నా విశ్వాసం పెరిగింది ప్రైమరీ స్కూలు రోజుల నుంచి భాషలే నాకు ఇబ్బందిగా ఉండేవి. అక్కడ తెలుగు, ఇంగ్లీషు ఉంటే 6వ తరగతిలో చేరగానే వాటికి హిందీ కూడా తోడయ్యి అంతా అయోమయంగా ఉండేది. కానీ సులువుగా భాషలు నేర్చుకునే టెక్నిక్ తెలుసుకున్న తర్వాత తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు కన్నడ, తమిళం కూడా నేర్చుకొంటున్నాను. నాపై నాకు విశ్వాసం పెరిగింది. – బీ.రామాచారి, 8వ తరగతిఎన్ని భాషలైనా నేర్వవచ్చు నేను రూపొందించిన ప్రాజెక్టు నమూనాతో 20–25 రోజుల్లోపు ఏ బాషలైనా నేర్చుకోవచ్చు. అందరు విద్యార్థులకు దక్షిణ భారత భాషలను నేర్పితే వారి నిత్య జీవనంలో అది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది – తీగల వెంకటయ్య, హెచ్ఎం5 భాషలు నేర్చుకొంటున్నా కొత్త భాషలను సులువుగా నేర్చుకోవటం భలే సరదాగా ఉంది. ఏడాది క్రితం వరకూ తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోని పాఠ్యాంశాలు నేర్చుకోవటానికే కష్ట పడేదాన్ని. కానీ మా హెడ్మాస్టర్ చెప్పిన విధానం పాటించటంతో ఆ భాషలతో పాటు మలయాళం, తమిళం, కన్నడ కూడా సులువుగా నేర్చుకున్నాను. ఇదే ప్రేరణతో భవిష్యత్తులో నేను భాషా పండిట్ అవుతాను. – కె.ధరణి, 9వ తరగతివిస్తరిస్తే బాగుంటుంది వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని, విద్యార్థుల మిగతా పాఠ్యాంశాలకు ఇబ్బంది కలగకుండా మా హెచ్ ఎం చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. విద్యాశాఖ ఉన్నత అధికారులు ఈ నమూనాను పరిశీలించి మిగతా స్కూళ్లకు కూడా విస్తరిస్తే బాగుంటుంది. ఇంగ్లీషు, హిందీలకు అదనంగా పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయించినా కనీసం మరో మూడు భాషలు పిల్లలకు నేర్పవచ్చు. పోటీ ప్రపంచంలో కేవలం భాషలపై అవగాహన లేకపోవటం వల్లే చాలా మంది సరైన ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. – నాగభూషణం, ఇంగ్లీష్ టీచర్ -
మాటలకు అందని విషాదం: పవన్ కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: అభిమాన హీరో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరపాలని భావించిన ఓ ముగ్గురిని కరెంట్ కాటేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన చోటు చేసుకున్న చిత్తూరులోని శాంతిపురంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్లో జనసేన పార్టీ ద్వారా మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. గుండెల నిండా తనపై అభిమానం నింపుకున్న సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం విద్యుత్ షాక్తో దుర్మరణం పాలవడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. శాంతిపురం దగ్గర కటౌట్ కడుతుంటే విద్యుత్ షాక్ తగలడం వల్ల వారు చనిపోయారనే వార్త తన మనసును కలిచివేసిందని పేర్కొన్నారు. (చదవండి: పవన్ కళ్యాణ్ బ్యానర్ కడుతూ ముగ్గురి దుర్మరణం) ఇది మాటలకు అందని విషాదమని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ తల్లిదండ్రుల గర్భశోకాన్ని అర్థం చేసుకోగలను.. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక వారికి తానే ఓ బిడ్డగా నిలుస్తానని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని పవన్ ఆదేశించారు. అలాగే మరో నలుగురు హరికృష్ణ, పవన్, సుబ్రహ్మణ్యం, అరుణ్ చికిత్స పొందుతున్నారని, వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులను ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థించారు. (చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!) మీ ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరులో పవన్ బర్త్డేకు బ్యానర్ కడుతూ ముగ్గురు మరణించడం గుండెను కలిచివేసిందన్నారు. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు.. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీ కుటుంబానికి మీరే సర్వస్వం అన్న విషయం మర్చిపోవద్దని కోరారు. పవన్ కల్యాణ్ బర్త్డే వేడుకల ఏర్పాట్లలో ఆయన ముగ్గురు అభిమానులు మరణించడం విషాదకరమని హీరో వరుణ్ తేజ్ అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దయచేసి అందరూ ఎల్లవేళలా కనీస జాగ్రత్తలు పాటించండని కోరారు. "నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు కాలం చేశారనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మీ ఆరోగ్యం, మీ ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. ఈ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి" అని మెగా హీరో రామ్ చరణ్ ట్వీట్ చేశారు. (చదవండి: కాబోయే భర్తని పరిచయం చేసిన హాస్య నటి) -
పవన్ కళ్యాణ్ బ్యానర్ కడుతూ ముగ్గురి దుర్మరణం
శాంతిపురం (చిత్తూరు జిల్లా): జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ జన్మదినం సందర్భంగా బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికి గురై చిత్తూరు జిల్లాలో మంగళవారం రాత్రి ముగ్గురు యువకులు మృతిచెందారు. శాంతిపురం మండలంలోని కడపల్లి పంచాయతీ కదిరివోబనపల్లి క్రాస్ వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడపల్లి పంచాయతీలోని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు బుధవారం పవన్ జన్మదిన కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి జాతీయ రహదారి పక్కన బ్యానర్లు కట్టారు. ఈ సందర్భంగా ఓ 30 అడుగుల ఫ్లెక్సీ విద్యుత్ తీగల మీద పడి కడపల్లికి చెందిన రాజేంద్ర, సోమశేఖర్, అరుణాచలం అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన అరుణ్, హరి, పవన్.. కుప్పంలోని పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతుల్లో రాజేంద్ర, సోమశేఖర్ అన్నదమ్ములు. -
పెళ్లయిన రెండు రోజులకే ఆరిన ఆశలు
శాంతిపురం: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈతకని వెళ్లిన భర్త తిరిగిరాని లోకాలకు చేరడంతో ఆమె ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లిలో శనివారం చోటు చోటుచేసుకుంది. కడపల్లికి చెందిన సామప్ప, చెన్నమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆఖరి వాడైన శివ(22)కు తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలోని బందార్లపల్లెకు చెందిన మునెమ్మతో ఈ నెల 16న కృష్ణగిరిలో వివాహం చేశారు. అత్తారింట ఉన్న శివ శనివారం ఉదయం పది గంటల సమయంలో గ్రామ సమీపంలోని బావి వద్దకు ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో బంధువులు గాలించారు. బావి వద్ద శివ బట్టలు, చెప్పులు కనిపించడంతో అనుమానంతో బావిలో వెతకగా శివ మృతదేహం లభించింది. ఈ విషయం తెలిసిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు, గ్రావుస్తులు హుటాహుటిన కృష్ణగిరికి తరలి వెళ్లారు. పెళ్లయిన రెండు రోజులకే భర్త మరణించడంతో ఆ నవ వధువు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.