Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sri Lanka lost the final T20 by 15 runs1
భారత్‌ 5.. శ్రీలంక 0

ఫార్మాటే మారింది. కానీ జోరు ఏమాత్రం మారలేదు. తొలిసారి వన్డే ప్రపంచకప్‌ సాధించిన ఊపుమీదున్న భారత మహిళల జట్టు ఇదే ఉత్సాహంతో పొట్టి ఫార్మాట్‌లో శ్రీలంకను గట్టిదెబ్బ కొట్టింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత్‌ 5–0తో వైట్‌వాష్‌ చేసింది. ఆడినవన్నీ ఓడిన చమరి ఆటపట్టు సేన నిరాశగా వెనుదిరుగుతోంది.తిరువనంతపురం: ఆఖరి పోరులోనూ భారత అమ్మాయిలే హోరెత్తించారు. ఫలితంగా ఐదు టి20ల సిరీస్‌ను 5–0తో హర్మన్‌ సేన చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన చివరి సమరంలో భారత్‌ 15 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేసింది. హైదరాబాదీ ఆల్‌రౌండర్‌ అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) డెత్‌ ఓవర్లలో దంచేసింది. ప్రత్యర్థి బౌలర్లలో కవీశా దిల్హరి, రష్మిక, చమరి తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. హాసిని (42 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్‌), ఇమిషా దులాని (39 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించారు. ఈ టోర్నీలో నిలకడగా రాణించి 241 పరుగులు చేసిన షఫాలీ వర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించింది.ఆదుకున్న హర్మన్‌ మొదట బ్యాటింగ్‌కు దిగగానే భారత్‌ దెబ్బమీద దెబ్బతో కుదేలైంది. షఫాలీ (5), తొలి మ్యాచ్‌ ఆడుతుతన్న కమలిని (12), హర్లీన్‌ డియోల్‌ (13), రిచా ఘోష్‌ (5), దీప్తిశర్మ (7) ఇలా ప్రధాన బ్యాటింగ్‌ బలగాన్ని కోల్పోయి 77/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. అమన్‌జోత్‌ (21)తో కలిసి వికెట్‌ కాపాడుకుంటూనే పరుగుల వేగం పెంచింది. దీంతో 14.2 ఓవర్లో భారత్‌ స్కోరు 100కు చేరింది. హర్మన్‌ 35 బంతుల్లో ఫిఫ్టీని పూర్తిచేసుకుంది. సిక్స్, ఫోర్‌ కొట్టిన ఉత్సాహంలో ఉన్న అమన్‌ను రష్మిక అవుట్‌ చేయడంతో ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 4 పరుగుల వ్యవధిలో 142 స్కోరు వద్ద హర్మన్‌ ఏడో వికెట్‌గా వెనుదిరిగింది. హాసిని, ఇమిషా ఫిఫ్టీ–ఫిఫ్టీ లంక లక్ష్యఛేదన ఆరంభంలోనే చమరి (2) వికెట్‌ను కోల్పోయినప్పటికీ హాసిని, ఇమిషా రాణించడంతో 11 ఓవర్ల వరకు మరో వికెట్‌ను కోల్పోలేదు. 86/1 స్కోరు వద్ద శ్రీలంక గెలిచేలా కనిపించింది. కానీ అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే ఇమిషా అవుటయ్యాక లంక తిరోగమించింది. నీలాక్షిక (3), కవీశా (5), హర్షిత (8), కౌశిని (1) విఫలమయ్యారు. దీంతో శ్రీలంక లక్ష్యానికి దూరమైంది. 89వ మ్యాచ్‌ ఆడుతున్న ఓపెనర్‌ హాసిని ఎట్టకేలకు ఒక ఫిఫ్టీని ఈ మ్యాచ్‌ ద్వారా సాధించగలిగింది. దీప్తి, అరుంధతీ, స్నేహ్, వైష్ణవి, శ్రీచరణి, అమన్‌జోత్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. తమిళనాడుకు చెందిన గుణాలన్‌ కమలిని ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. భారత్‌ తరఫున టి20 మ్యాచ్‌లు ఆడిన 90వ క్రీడాకారిణిగా కమలిని గుర్తింపు పొందింది. 17 ఏళ్ల కమలిని ఈ ఏడాది ఆరంభంలో అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. సీనియర్‌ మహిళల టి20 టోర్నీలో తమిళనాడు తరఫున టాప్‌స్కోరర్‌ (297 పరుగులు)గా నిలవడంతో ఆమెకు భారత జట్టులో అవకాశం లభించింది. చివరి టి20లో కమలిని, రేణుకా ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకున్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌...స్మృతి మంధానకు విశ్రాంతినిచ్చి స్నేహ్‌ రాణాను తప్పించింది.20వ ఓవర్లో 20హైదరాబాదీ క్రికెటర్‌ అరుంధతీ డెత్‌ ఓవర్లలో చేసిన పరుగులే మ్యాచ్‌ విజయంలో కీలకమయ్యాయి. హర్మన్‌ అవుటయ్యే సమయానికి జట్టు స్కోరు 150ని కూడా చేరుకోలేదు. ఈ దశలో స్నేహ్‌ రాణా అండతో అరుంధతి ఆఖర్లో చెలరేగింది. 19వ ఓవర్‌ ముగిసేసరికి భారత్‌ స్కోరు 155/7 కాగా... మదర వేసిన ఆఖరి ఓవర్లో అరుంధతి విరుచుకుపడింది. మొదటి 5 బంతులాడిన ఆమె వరుసగా 4, 1(వైడ్‌), 6, 4, 4, 1లతో 19 పరుగులు పిండుకుంది. చివరి బంతికి స్నేహ్‌ రాణా పరుగు చేయలేదు. వైడ్‌ సహా 20వ ఓవర్లో 20 పరుగులొచ్చాయి.152 భారత బౌలర్‌ దీప్తిశర్మ తీసిన వికెట్లు. అంతర్జాతీయ టి20లో అత్యధిక వికెట్లు (152) తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కింది.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) ఇమిషా (బి) నిమషా 5; కమలిని (ఎల్బీడబ్ల్యూ) (బి) కవీశా 12; హర్లీన్‌ (బి) రష్మిక 13; హర్మన్‌ప్రీత్‌ (బి) కవీశా 68; రిచా ఘోష్‌ (సి) కౌశిని (బి) చమరి 5; దీప్తిశర్మ (సి) నిమషా (బి) చమరి 7; అమన్‌జోత్‌ (సి) కవీశా (బి) రష్మిక 21; అరుంధతీ (నాటౌట్‌) 27; స్నేహ్‌ రాణా (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–5, 2–27, 3–41, 4–64, 5–77, 6–138, 7–142. బౌలింగ్‌: మాల్కి మదర 4–0–37–0, నిమషా మీపగె 3–0–25–1, కవీశా దిల్హరి 2–0–11–2, ఇనొక 4–0–39–0, రష్మిక 4–0–42–2, చమరి 3–0–21–2. శ్రీలంక మహిళల ఇన్నింగ్స్‌: హాసిని (బి) శ్రీచరణి 65; చమరి (సి) వైష్ణవి (బి) అరుంధతీ 2; ఇమిషా (సి) షఫాలీ (బి) అమన్‌జోత్‌ 50; నీలాక్షిక (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 3; కవీశా (బి) వైష్ణవి 5; హర్షిత (సి) హర్లీన్‌ (బి) స్నేహ్‌ రాణా 8; కౌశిని రనౌట్‌ 1; రష్మిక (నాటౌట్‌) 14; మదర (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–7, 2–86, 3–100, 4–107, 5–132, 6–140, 7–140. బౌలింగ్‌: దీప్తి శర్మ 4–0–28–1, అరుంధతీ 2–0–16–1, స్నేహ్‌ రాణా 4–0–31–1, వైష్ణవి 4–0–33–1, శ్రీచరణి 4–0–31–1, అమన్‌జోత్‌ 2–0–17–1.

Indian player Arjun Erigaisi lost in the semis2
అర్జున్‌కు కాంస్యం

దోహా: ‘ఫిడే’ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌ ర్యాపిడ్‌ విభాగంలో మూడో స్థానం సాధించిన భారత ఆటగాడు, తెలంగాణకు చెందిన అర్జున్‌ ఇరిగేశికి బ్లిట్జ్‌ విభాగంలోనూ కాంస్య పతకం దక్కింది. మంగళవారం జరిగిన బ్లిట్జ్‌ ఈవెంట్‌ తొలి సెమీ ఫైనల్లో అర్జున్‌ 0.5–2.5 తేడాతో అబ్దుస్సత్తొరొవ్‌ నొదిర్‌బెక్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో ఈ మెగా టోర్నీలో అర్జున్‌ రెండో కాంస్యానికి పరిమితమయ్యాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఒకే వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ రెండు విభాగాల్లో (ర్యాపిడ్, బ్లిట్జ్‌) పతకాలు సాధించిన రెండో భారత ఆటగాడిగా అర్జున్‌ నిలవడం విశేషం. సత్తొరొవ్‌తో జరిగిన పోరులో తొలి రెండు గేమ్‌లలో అర్జున్‌ వరుసగా 47 ఎత్తుల్లో, 83 ఎత్తుల్లో పరాజయంపాలయ్యాడు. తప్పనిసరిగా నెగ్గాల్సిన మూడో గేమ్‌ 33 ఎత్తుల తర్వాత ‘డ్రా’గా ముగిసింది. దాంతో నాలుగో గేమ్‌ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే అర్జున్‌ ఓటమి ఖాయమైంది. రెండో సెమీఫైనల్లో కార్ల్‌సన్‌ చేతిలో 1–3తో ఫాబియానో కరువానా (అమెరికా) ఓటమిపాలయ్యాడు. టోర్నీ నిబంధనల ప్రకారం సెమీస్‌లో ఓడిన అర్జున్, కరువానాలిద్దరికీ కాంస్యం అందించారు. వీరిద్దరికి చెరో 28 వేల యూరోలు (సుమారు రూ.30 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సెమీస్‌ టైబ్రేక్‌కు ముందు జరిగిన రెగ్యులర్‌ రౌండ్లలో అర్జున్‌ 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆడిన 19 రౌండ్లలో 12 గెలిచి 6 డ్రా చేసుకొని ఒకటి మాత్రమే ఓడిన అర్జున్‌ నంబర్‌వన్‌గా ముగించాడు. అర్జున్‌తో పాటు టాప్‌–4లో నిలిచిన కరువానా (14), కార్ల్‌సన్‌ (13.5), అబ్దుస్సత్తొరొవ్‌ (13) సెమీ ఫైనల్‌కు అర్హత సాధించారు.

Magnus Carlsen becomes world champion for the 20th time3
20వ సారి ప్రపంచ చాంపియన్‌గా...

దిగ్గజ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) బ్లిట్జ్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ చాంపియన్‌ షిప్‌లో అతను ర్యాపిడ్‌ విభాగంలోనూ విజేతగా నిలిచాడు. ఫైనల్లో కార్ల్‌సన్‌ 2.5–1.5 తేడాతో అబ్దుస్సత్తొరొవ్‌పై విజయం సాధించాడు. తుది పోరు తొలి గేమ్‌లో ఓడిన అనంతరం కోలుకున్న కార్ల్‌సన్‌ రెండో గేమ్‌ను గెలుచుకున్నాడు. మూడో గేమ్‌ ‘డ్రా’గా ముగియగా...నాలుగో గేమ్‌లో నల్లపావులతో ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అసాధారణ కెరీర్‌లో కార్ల్‌సన్‌ అన్ని ఫార్మాట్‌లు కలిపి 20వ సారి ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. 2025లో మొత్తంగా కార్ల్‌సన్‌ 10 టోర్నీల్లో విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో బిబిసార అసౌబయెవా (కజకిస్తాన్‌) బ్లిట్జ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 2.5–1.5 తేడాతో అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)ను ఓడించింది. 21 ఏళ్ల బిబిసార వరల్డ్‌ బ్లిట్జ్‌లో విజేతగా నిలవడం ఇది మూడో సారి కావడం విశేషం.

India Women won by 15 runs On Srilanka4
టీమిండియా క్లీన్‌స్వీప్‌

శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. చివరిదైన ఐదో టీ20లో గెలిచి టీమిండియా తన జైత్ర యత్రను కొనసాగించింది. ఐదో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. శ్రీలంక బ్యాటర్లలో హాసిని పెరీరా(65), ఇమేషా దులాని(50)లు రాణించినా జట్టుకు విజయం చేకూర్చలేకపోయారు. భారత మహిళా బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్‌ రానా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్‌ జ్యోత్‌ కౌర్‌లు తలో వికెట్‌ తీసి విజయానికి సహకరించారు.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్‌) చెలరేగగా.. ఆఖర్లో అమన్‌జోత్‌ కౌర్‌ (18 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించారు.మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్‌ కమలిని 12, హర్లీన్‌ డియోల్‌ 13, రిచా ఘోష్‌ 5, దీప్తి శర్మ 7, స్నేహ్‌ రాణా (8 నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్‌ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్‌ పడగొట్టింది.

INDW VS SLW 5th T20I: sri lanka restricted team india to 175 runs5
హర్మన్‌ప్రీత్‌ మెరుపులు.. శ్రీలంక టార్గెట్‌ ఎంతంటే..?

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్‌) చెలరేగగా.. ఆఖర్లో అమన్‌జోత్‌ కౌర్‌ (18 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించారు.మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్‌ కమలిని 12, హర్లీన్‌ డియోల్‌ 13, రిచా ఘోష్‌ 5, దీప్తి శర్మ 7, స్నేహ్‌ రాణా (8 నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్‌ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్‌ పడగొట్టింది.కాగా, స్వదేశంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకొని, క్లీన్‌ స్వీప్‌ దిశగా అడుగులు వేస్తుంది.

Former Sri Lanka U19 star Akshu Fernando passes away after battling Coma6
శ్రీలంక క్రికెటర్‌ కన్నుమూత

శ్రీలంక మాజీ అండర్-19 క్రికెటర్ అక్షు ఫెర్నాండో కన్నుమూశాడు. 2018 డిసెంబర్‌లో జరిగిన రైల్వే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఏడేళ్లు అపస్మారక స్థితిలో ఉండి ఇవాళ (డిసెంబర్‌ 30) ఉదయం తుదిశ్వాస విడిచాడు. కొలొంబోకు సమీపంలో గల మౌంట్ లవినియా బీచ్ వద్ద రక్షణలేని ట్రాక్ దాటుతుండగా ఆక్షుని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలో చాలా చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో లైఫ్ సపోర్ట్‌పై ఉంచారు. ప్రమాదం జరిగిన నాటికి అక్షు వయసు 27 ఏళ్లు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందు అక్షు ఓ స్థానిక టోర్నీ ఆడాడు. అందులో రగామా క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అక్షు మరణం శ్రీలంక క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బంగారు భవిష్యత్తు కలిగిన అక్షు దురదృష్టకర రీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్నే బాధిస్తుంది.అక్షు న్యూజిలాండ్‌లో జరిగిన 2010 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలో కెనడాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో కీలక పరుగులు చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికాపై క్వార్టర్ ఫైనల్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియాపై సెమీఫైనల్‌లో 52 పరుగులు (88 బంతుల్లో) చేశాడు. ఆ టోర్నీలో అక్షు వ్యక్తిగతంగా రాణించినా, శ్రీలంక నాలుగో స్థానంలో ముగించింది.

INDW VS SLW 5th T20I: Sri Lanka Won the Toss and choose to Bowl7
శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్‌.. స్టార్‌ ప్లేయర్‌కు రెస్ట్‌

స్వదేశంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకొని, క్లీన్‌ స్వీప్‌ దిశగా అడుగులు వేస్తుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్‌ 30) నామమాత్రపు ఐదో మ్యాచ్‌ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్‌ తరఫున స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధన, రేణుక సింగ్‌కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహ్‌ రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌తోనే కమిలిని అరంగేట్రం చేస్తుంది.శ్రీలంక విషయానికొస్తే.. మల్షా శేషని, కావ్యా కవిండి స్థానాల్లో ఇనోకా రణవీరా, మల్కి మదారా తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), ఇనోకా రణవీరా, మల్కి మదారా, రష్మిక సెవ్వంది, నిమేషా మదుషానిభారత్‌: షఫాలీ వర్మ, స్నేహ్‌ రాణా, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, కమిలిని, శ్రీ చరణి

Shreyas Iyer India return delayed as sudden weight loss forces him out for a while says Report8
న్యూ ఇయర్‌కి ముందు టీమిండియాకు ఊహించని షాక్..!

మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండగా.. భారత క్రికెట్‌ అభిమానులకు ఊహించని షాక్‌ తగిలింది. స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌, వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ రీఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా సిరీస్‌ సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్‌.. న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే శ్రేయస్‌ కూడా ఫిట్‌నెస్‌ సాధించి, ప్రాక్టీస్‌ ముమ్మరం చేశాడు.ముందుగా జరిగిన ప్రచారం​ ప్రకారం ఇవాళ (డిసెంబర్‌ 30) శ్రేయస్‌కు బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE) నుంచి ఫిట్‌నెస్‌ క్లియెరెన్స్‌ లభించాల్సి ఉండింది. అయితే శ్రేయస్‌ అనూహ్యంగా 6 కిలోలు బరువు తగ్గినట్లు CoE వైద్య బృందం గుర్తించింది. దీని వల్ల శ్రేయస్‌కు బ్యాటింగ్‌ చేయడంలో ఎలాంటి సమస్య లేకపోయినా, మసిల్ మాస్ బాగా క్షీణించి, శక్తి స్థాయిలు తగ్గాయని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్‌కు రిటర్న్ టు ప్లే (RTP) సర్టిఫికేట్ ఇవ్వలేమని పరోక్షంగా చెప్పారు. దీంతో శ్రేయస్‌ రీఎంట్రీ మరో వారం వాయిదా పడనుంది.ఒకవేళ శ్రేయస్‌కు ఇవాళ RTP సర్టిఫికేట్ లభించి ఉంటే జనవరి 3, 6 తేదీల్లో ముంబై తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేవాడు. తాజా పరిస్థితి ప్రకారం.. శ్రేయస్‌ న్యూజిలాండ్‌ సిరీస్‌కు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సిరీస్‌ జనవరి 11 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. జట్టును 2 లేదా 3 తేదీల్లోగా ప్రకటించే అవకాశం ఉంది.ఆ సమయానికి శ్రేయస్‌కు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ లభించడం అసాధ్యంగా కనిపిస్తుంది. వన్డే జట్టులో కీలకమైన శ్రేయస్‌ విషయంలో CoE అధికారులు ఎలాంటి రిస్క్‌ తీసుకునే సాహసం చేయలేరు. ఒకవేళ శ్రేయస్‌ న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ను మిస్‌ అయితే, విజయ్‌ హజారే ట్రోఫీలో నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.

Sach Bolna Padega: Ex India Star Urged Ro Ko Unnatural Exit From Tests9
నిజాన్ని మీరే బయటపెట్టాలి: రోహిత్‌, కోహ్లికి మాజీ క్రికెటర్‌ విజ్ఞప్తి

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వారం వ్యవధిలోనే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో తొలుత రోహిత్‌ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో వీరిద్దరు పరుగులు రాబట్టలేక ఇబ్బందిపడ్డారు.రోహిత్‌ మధ్యలో విరామం తీసుకుంటూ మ్యాచ్‌లు ఆడగా.. కోహ్లి పదే పదే ఆఫ్‌ స్టంప్‌ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో దాదాపుగా ఎనిమిది సార్లు వికెట్లు పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రో- కో ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రోహిత్‌ టెస్టులకు స్వస్తి పలికితే బాగుంటుందనే డిమాండ్లు పెరగగా.. మేటి టెస్టు బ్యాటర్‌ అయిన కోహ్లి తప్పులను సరిదిద్దుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అనూహ్య రీతిలోఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా తొలుత ఇంగ్లండ్‌ పర్యటన నేపథ్యంలో టీమిండియాలో రో- కో ఆడతారని ముందుగా సంకేతాలు వచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో వీరిద్దరు టెస్టులకు గుడ్‌బై చెప్పేశారు. రోహిత్‌ శర్మ స్థానంలో టెస్టు పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్‌ గిల్‌.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కీలకమైన కోహ్లి నాలుగో స్థానాన్నీ భర్తీ చేశాడు.ఒత్తిడి చేశారుఅయితే, రోహిత్‌- కోహ్లి ఆకస్మిక రిటైర్మెంట్లపై భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇదైతే సహజమైన రిటైర్మెంట్‌లా అనిపించలేదు. ఈ విషయంలో వాళ్లు మాత్రమే నిజమేంటో చెప్పగలరు. నాకైతే ఇదేదో బలవంతంగా చేయించినట్లు అనిపిస్తోంది.నిజాన్ని మీరే బయటపెట్టాలిరోహిత్‌ శర్మ ఆరు నెలల పాటు విరామం తీసుకుని.. ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి వస్తే బాగుండేది. అదే జరిగితే తిరిగి అతడు ఫామ్‌ను అందుకునేవాడు. అతడిలో ఇంకా క్రికెట్‌ మిగిలే ఉంది. రోహిత్‌తో పాటు కోహ్లి కూడా కొన్నాళ్ల విరామం తర్వాత తిరిగి వస్తే బాగుండేది. ఏదేమైనా టెస్టు రిటైర్మెంట్‌ విషయమై వాళ్లు నోరు విప్పితేనే నిజం తెలుస్తుంది’’ అని రాబిన్‌ ఊతప్ప పేర్కొన్నాడు.ఇద్దరూ సిద్ధంఅదే విధంగా.. రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి ప్రస్తుత ఫామ్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సౌతాఫ్రికాతో వన్డేల్లో ఇద్దరూ అదరగొట్టారు. రోహిత్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీలు సాధిస్తే.. కోహ్లి వరుసగా రెండు శతకాలు బాదాడు. ఇద్దరూ ప్రపంచకప్‌ టోర్నీకి సిద్ధంగా ఉన్నారు.ఇటీవలే రోహిత్‌ను కలిశాను. అతడు ప్రస్తుతం రిలాక్సింగ్‌ మోడ్‌లో ఉన్నాడు. ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాడు. రోహిత్‌- విరాట్‌ పరుగుల దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికే ఇద్దరూ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. అయినా సరే ఇంకా ఇంకా ఆడాలనే పట్టుదల వారిని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’’ అని రాబిన్‌ ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్‌ పాండ్యా కీలక నిర్ణయం

big blow for Royal Challengers Bengaluru, Ellyse Perry withdraws from WPL 202610
ఆర్సీబీకి భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌

వచ్చే ఏడాది (2026) జనవరి 9 నుంచి ప్రారంభం కాబోయే మహిళల ఐపీఎల్‌ 2026కు ముందు 2024 ఎడిషన్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఎల్లిస్‌ పెర్రీ వ్యక్తిగత కారణాల చేత సీజన్‌ మొత్తానికి దూరం కానుంది. పెర్రీ స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం దేశీయ ఆల్‌రౌండర్‌ సయాలీ సత్ఘరేతో భర్తీ చేసింది.సత్ఘరే గతంలో గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున ఆడింది. ఈ సీజన్‌ వేలంలో సత్ఘరేను (30 లక్షలు) ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. తాజాగా ఎల్లిస్‌ లీగ్‌ నుంచి తప్పుకోవడంతో సత్ఘరేను అదృష్టం వరించింది. ఎల్లిస్‌ వైదొలిగిన తర్వాత ఆర్సీబీలో నడినే డి క్లెర్క్‌ మాత్రమే నాణ్యమైన విదేశీ ఆల్‌రౌండర్‌గా ఉంది.ఎల్లిస్‌ ఆర్సీబీ 2024లో టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఎల్లిస్‌కు డబ్ల్యూపీఎల్‌ మొత్తంలోనూ మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ లీగ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌ ఎల్లిసే. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్‌ ఆల్‌రౌండర్‌.. 8 హాఫ్‌ సెంచరీల సాయంతో 972 పరుగులు చేసి, 8.25 ఎకానమీతో 14 వికెట్లు తీసింది.ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా..!డబ్ల్యూపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఆసీస్‌ ప్లేయరే అయిన అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ కూడా వ్యక్తిగత కారణాల చేత సీజన్‌ మొత్తానికే దూరం కానుంది. సదర్‌ల్యాండ్‌ స్థానాన్ని డీసీ యాజమాన్యం అలానా కింగ్‌తో భర్తీ చేసింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement