team owners
-
IPL 2024: ఫ్రాంఛైజీ ఓనర్ల పేర్లు తెలుసా? వీరు స్పెషల్ అట్రాక్షన్!
-
కోట్లకు... ఆటకు కుదరని మైత్రి
ఐపీఎల్ అంటేనే అంకెలు... పరుగులు, వికెట్లు మాత్రమే కాదు, ఆటగాళ్లకి చెల్లించే ప్రతీ పైసా లెక్కలు కూడా కీలకం. డబ్బే ముఖ్యం కాదు అంటూ బయటకు ఎన్ని మాటలు చెప్పినా, క్రికెటర్లు సహజంగానే భారీ మొత్తాలను కోరుకుంటారు. అటు టీమ్ యాజమాన్యాలు కూడా తాము చెల్లిస్తున్న సొమ్ముకు తగి నంత ప్రతిఫలాన్ని సదరు ఆటగాడి నుంచి ఆశిస్తాయి. దాంతో క్రికెటర్లపై కచ్చితంగా రాణించాల్సిన ఒత్తిడి ఉంటుంది. చాలాసార్లు ఆ భారాన్ని మోయలేక క్రికెటర్లు విఫలమైతే, కొన్నిసార్లు మాత్రం వారు అంచనాలు అందుకుంటారు. చేసే ప్రతీ పరుగును, తీసే ప్రతీ వికెట్ను ఇచ్చిన మొత్తంతో గుణింతాలు, భాగహారాలతో లెక్కించి పోల్చడం సహజం. ఈ నేపథ్యంలో ఐపీఎల్–2020లో ఇప్పటివరకు ‘భారీ’ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తే.... ప్యాట్ కమిన్స్ (కోల్కతా నైట్రైడర్స్) వేలంలో విలువ: రూ. 15 కోట్ల 50 లక్షలు ప్రదర్శన: ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన బౌలర్గా కమిన్స్ ఈసారి బరిలోకి దిగాడు. టెస్టుల్లో నంబర్వన్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్న కమిన్స్ టి20లకు వచ్చేసరికి తేలిపోయాడు. యూఏఈలోని నెమ్మదైన పిచ్లు కూడా అతని శైలికి ఏమాత్రం సరిపోకపోవడంతో ఇప్పటికీ లయ అందుకునేందుకు అతను తిప్పలు పడుతూనే ఉన్నాడు. 7 మ్యాచ్లలో ఒక్కసారీ ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పిన ప్రదర్శన లేకపోగా... 2 వికెట్లే తీసిన అతను కనీసం ఒక్క ఓవర్ కూడా మెయిడిన్గా వేయలేకపోయాడు. 111 సగటు అతి పేలవం కాగా... 8.53 ఎకానమీ చూస్తే భారీగా పరుగులిచ్చినట్లు అర్థమవుతోంది. ఇది కోల్కతా నైట్రైడర్స్కు సమస్యగా మారింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) వేలంలో విలువ: రూ. 10 కోట్ల 75 లక్షలు ప్రదర్శన: ఒకప్పుడు విధ్వంసానికి చిరునామాగా నిలిచిన మ్యాక్స్వెల్ ఇప్పుడు ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. నిజానికి ఇంత మొత్తం చెల్లించి తీసుకున్న ఆటగాడిని ఎలా వాడుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో పంజాబ్ ఉంది. 8 మ్యాచ్లలో కలిపి అతను ఆడింది 61 బంతులే... దాదాపు మ్యాచ్ ముగిసే సమయంలో క్రీజ్లోకి వస్తున్న అతను బంతులకంటే తక్కువ పరుగులు (58) చేయడం ఆశ్చర్యకరం. కోల్కతాతో మ్యాచ్లో 16 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా మ్యాక్స్వెల్కంటే ముందు కనీసం ఒక ఫస్ట్క్లాస్ మ్యాచ్ అనుభవం కూడా లేని ప్రభ్సిమ్రన్ సింగ్ను పంపించారంటే మ్యాక్స్వెల్పై ఎంత అపనమ్మకమో అర్థమవుతుంది. లీగ్లో అతను ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. అతనికి చెల్లించిన మొత్తంతో పోలిస్తే మ్యాక్సీ ప్రదర్శన అట్టర్ ఫ్లాప్. షెల్డన్ కాట్రెల్ (పంజాబ్) వేలంలో విలువ: రూ. 8 కోట్ల 50 లక్షలు ప్రదర్శన: ప్రధాన పేసర్గా పంజాబ్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘సెల్యూట్’ కాట్రెల్ దానికి తగినట్లుగా రాణించలేకపోయాడు. 6 మ్యాచ్లలో 6 వికెట్లే తీయగా... 8.80 ఎకానమీ చూస్తే పరుగులు నిరోధించడంలో కూడా అతను విఫలమైనట్లు కనిపిస్తోంది. గత రెండు మ్యాచ్లలో తుది జట్టు నుంచి తప్పించడాన్ని చూస్తే సీజన్లో మిగిలిన మ్యాచ్లలో కూడా పంజాబ్ అతడికి అవకాశం ఇస్తుందా లేదా అనేది సందేహమే. జైదేవ్ ఉనాద్కట్ (రాజస్తాన్ రాయల్స్) వేలంలో విలువ: రూ. 3 కోట్లు ప్రదర్శన: గతంలో ఐపీఎల్ వేలంలో రెండుసార్లు రికార్డు స్థాయి మొత్తాలకు అమ్ముడుపోయి అంతగా రాణించలేకపోయిన ఉనాద్కట్... వాటితో పోలిస్తే ఈసారి తక్కువ మొత్తానికే రాజస్తాన్కు అందుబాటులోకి వచ్చాడు. లీగ్కు ముందు సౌరాష్ట్ర కెప్టెన్గా జట్టుకు తొలి రంజీ ట్రోఫీ అందించిన ఆత్మవిశ్వాసంతో కనిపించిన అతను లీగ్కు వచ్చేసరికి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 6 మ్యాచ్లలో కలిపి అతను తీసింది 4 వికెట్లే. చెప్పుకోదగ్గ స్పెల్ ఒక్కటి కూడా వేయని ఉనాద్కట్ 9.57 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఆరోన్ ఫించ్ (బెంగళూరు) వేలంలో విలువ: రూ. 4 కోట్ల 40 లక్షలు ప్రదర్శన: ఎనిమిది మ్యాచ్లలో కలిపి ఓవరాల్ ప్రదర్శన పర్వాలేదన్నట్లుగా కనిపిస్తున్నా, ఆస్ట్రేలియాలాంటి మేటి జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ నుంచి ఆశించింది మాత్రం ఇది (ఒక అర్ధసెంచరీ) కాదు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఈ ఆటగాడి స్ట్రయిక్రేట్ 113.69 మాత్రమే, అదీ ఓపెనర్గా ఉంటూ చేయడం అంటే వైఫల్యం కిందే లెక్క. ఒక్క విధ్వంసకర ఇన్నింగ్స్ కూడా అతడినుంచి రాలేదు. రాబిన్ ఉతప్ప (రాజస్తాన్ రాయల్స్) వేలంలో విలువ: రూ. 3 కోట్లు ప్రదర్శన: గతంలో కోల్కతా జట్టులో కీలక సభ్యుడిగా ఆ జట్టు రెండు టైటిల్స్ సాధించడంలో భాగమైన రాబిన్ ఉతప్పలో జోరు తగ్గినా... రాజస్తాన్ పెద్ద మొత్తానికి అతడిని తీసుకుంది. అయితే ఉతప్ప మరింత పేలవంగా ఆడి ఫ్రాంచైజీని నిరాశపర్చాడు. 6 మ్యాచ్లలో కలిపి ఉతప్ప చేసింది 83 పరుగులే (84 బంతుల్లో). తుది జట్టులో భారత ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో ఉతప్ప వైఫల్యం రాయల్స్ కూర్పును దెబ్బ తీసింది. ఇది భిన్నమైన పరిస్థితి... ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ నాథన్ కూల్టర్నైల్ను ముంబై రూ. 8 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అతడిని తుది జట్టులో ఆడించేందుకు వారికి అవకాశం లభించడం లేదు. బౌల్ట్ చక్కగా రాణిస్తుండగా, ముంబై తుది జట్టు చక్కగా కుదురుకోవడంతో మార్పులకు అవకాశం లేకుండా పోయింది. పూర్తి ఫిట్గా ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం లభించని కూల్టర్నైల్ పర్సులో మాత్రం భారీ మొత్తం చేరడం విశేషం. రూ. 10 కోట్లు ఇచ్చిన క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా)ను బెంగళూరు ఇప్పటికి మూడు మ్యాచ్లు ఆడించింది. ఇకపై అతడికి వరుసగా అన్ని మ్యాచ్లలో అవకాశం దక్కవచ్చు. -
క్రికెట్ లోకి వచ్చి.. మటాష్!
సునందా పుష్కర్, విజయ్ మాల్యా, శ్రీనివాసన్, ప్రీతి జింతా, రాజ్ కుంద్రా, వెంకటరామిరెడ్డి, సుబ్రతో రాయ్.. ఇంకా లలిత్ మోదీ. ఇంకొన్నాళ్లు ఆగితే ఈ జాబితా ఇంకాస్త పెద్దదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకీ మనం మాట్లాడుతున్నది దేని గురించో ఈ పాటికే అర్థమైంది కదా! అవును. 'క్రికెట్ కాసుల యంత్రం' ఐపీఎల్ గురించే! అప్పటిదాకా వారివారి రంగాల్లో ఘనులైన ఈ బడాబాబులందరూ క్రికెట్ లోకి అడుగుపెట్టాకే.. కాలు జారి పతనం అంచుల వరకు వెళ్లిపోయారు. పైన చెప్పుకున్న జాబితాలో ఒకరిద్దరు జైలులో మగ్గుతుండగా, ఇంకొందరు పారిపోయి విదేశాల్లో తలదాచుకున్నారు. న్యాయవ్యవస్థపై అపార నమ్మకం వ్యక్తంచేస్తోన్న మరికొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకరు మాత్రం ఈ లోకంలో లేరు. క్రికెట్ వల్ల వీరికి శనిపట్టుకుందా? లేక వీళ్లే క్రీడలను భ్రష్టుపట్టించారా? అంటే.. ప్రొఫెషనల్ క్రికెట్ లోని మజాను ప్రేక్షకులకు అందించడంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో భాగంగా 2007లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ప్రారంభించింది. భారత క్రికెట్ కంట్రలోల్ బోర్డు (బీసీసీఐ). ఇంగ్లాడ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ పోటీల నమూనాలో తయారైన ఐపీఎల్ ద్వారా ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అయితే ఆటకంటే ఎక్కువ అవినీతికే అందలం లభించిందని ఐపీఎల్ పై తీవ్రవిమర్శ. జట్లను కొనుగోలుచేసేందుకు సినీ, వ్యాపార, రాజకీయ రంగాల ప్రముఖులు విపరీతమైన ఆసక్తికనబర్చడం ఆ క్రమంలో భారీగా నల్లధనం తెల్లగా(సక్రమంగా) మారిపోవడం, నిజానికి ఆపని కోసమే ఐపీఎల్ ఉద్భవించిందని మాట్లాడుకోవటం అప్పట్లో హాట్ టాపిక్ లు. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆరోపితులు నిందితులుగా మారుతుండటాన్నిబట్టి ఐపీఎల్ కచ్చితంగా జూదమేననే వాదనకు బలంచేకూరుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ సాధారణ ప్రేక్షకులు, వీక్షకులు మాత్రం ఆటను ఆటలాగానే చూస్తున్నారు. ఆదరిస్తున్నారు. అంతకు ముందరి ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ ఐపీఎల్ జట్లకు యజమానులైన తర్వాతే వ్యాపార దిగ్గజాలనుకున్నవారు ఒకొక్కరుగా కుప్పకూలిన వైనాన్ని పరిశీలిస్తే.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు యజమాని విజయ్ మాల్యా వివిధ బ్యాంకుల్లో రూ. 9000 కోట్ల రుణం తీసుకుని ఎగవేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు బ్యాంకులపై ఒత్తిడి పెంచడంతో ఆయన దేశం విడిచి వెళ్లారనే వార్తలు వినవస్తున్నాయి. మాల్యా బ్యాంకులను బురిడీ కొట్టిస్తే.. పూణె వారియర్స్ జట్టు యజమాని, సహారా గ్రూప్ అధినేత సుబ్రతోరాయ్.. తన సంస్థలో చేరిన ముదుపుదారుల్ని దారుణంగా మోసంచేసి, మూడేళ్లుగా జైలులోనే ఉన్నారు. ఇక డెక్కన్ క్రానికల్ జట్టు యజమాని ,‘దక్కన్ క్రానికల్’ ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై నిషేధం విధించిన దరిమిలా వాటి యజమానులైన శ్రీనివాసన్, మేయప్పన్, రాజ్ కుంద్రాలపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సతీమణి, దివంగత సునందా పుష్కర్.. కొచ్చి టస్కర్స్ జట్టును కొనుగోలుచేసినప్పుడు భారీ ఎత్తున నల్లధనం వినియోగంలోకి తెచ్చారనే విమర్శలున్నాయి. క్రికెట్ సంబంధిత ఆర్థిక వ్యవహారాలే ఆమె చావుకు కారణమన్నది జగమెరిగిన సత్యం. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింతాది మరోరకం వివాదం. ఏళ్లుగా డేటింగ్ చేసి ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతారనగా, అదే జట్టుకు మరో సహయజమాని నెస్ వాడియాతో ఆమె గొడవపడి విడిపోయారు. ఈ మధ్యే మరొక వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. నీతి కథలో విపత్తును ముందే గ్రహించే సుమతి చేపలాగా.. అవినీతికి సుత్రధారి అయిన లలిత్ మోదీ విషయం ఇంతదాకా వస్తుందని ముందే ఊహించారు. అందుకే వీళ్లందరికంటే ముందే బిచాణా సర్దేసి ఎంచక్కా విదేశాల్లో సెటిల్ అయ్యారాయన! సుదూరాల్లో ఉంటూ కూడా భారత పార్లమెంట్ ను షేక్ చెయ్యగల సత్తాఉన్న లలిత్ మోదీ.. ఐపీఎల్ ముసుగులో భారీ జూదానికి తెరలేపారని అంటే, ఎవరైనా కాదంటారా?