telecaller job
-
టెలీ కాలింగ్ ఉద్యోగాల బూమింగ్
ముంబై: టెలీ కాలింగ్, బిజినెస్ డెవలప్మెంట్ తదితర ఆధునిక విక్రయ విభాగాల్లో గతేడాది 34 శాతం అధిక ఉపాధి అవకాశాలు లభించినట్టు జాబ్పోర్టల్ ‘వర్క్ ఇండియా’ నివేదిక వెల్లడించింది. సేల్స్ ఉద్యోగ మార్కెట్ భారత్లో మార్పును చూస్తున్నట్టు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. 2023తో పోల్చితే ఈ విభాగంలో 2024లో జాబ్ పోస్టింగ్లు 17 శాతం పెరిగాయి. సంప్రదాయ మార్గాల కంటే కొత్త తరహా డిజిటల్ ఛానళ్లపైనే కంపెనీలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఇలా ఆధునిక విక్రయ ఛానళ్లలో టెలీకాలింగ్, బిజినెస్ డెవలప్మెంట్లో గతేడాది ఉపాధి అవకాశాలు అంతకుముందు ఏడాదితో పోల్చితే గణనీయంగా (34 శాతం) పెరిగాయి. సంప్రదాయ సేల్స్ ఉద్యోగాలైన రిటైల్, ఫీల్డ్ సేల్స్ ఉద్యోగాలు మాత్రం అంతకుముందు ఏడాదితో పోల్చితే 2 శాతం తగ్గాయి. 2023, 2024 సంవత్సరాల్లో తన ప్లాట్ఫామ్పై నమోదైన 12.8 లక్షల జాబ్ పోస్టింగ్ల డేటా ఆధారంగా ఈ వివరాలను వర్క్ఇండియా విడుదల చేసింది. అన్నింటిలోకి టెలీకాలర్ ఉద్యోగాలకు బూమింగ్ వాతావరణం ఉన్నట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఎందుకంటే 2023లో టెలీకాలర్ ఉద్యోగాలకు ఎక్కువ పోస్టింగ్లు నమోదు కాగా, 2024లోనూ అదే వాతావరణం కొనసాగింది. 22 శాతం అధికంగా టెలీకాలర్ జాబ్ పోస్టింగ్లు వర్క్ఇండియాపై లిస్ట్ అయ్యాయి. బిజినెస్ డెవలప్మెంట్ జాబ్లకు ఏకంగా 80 శాతం అధిక పోస్టింగ్లు వచ్చాయి. మహిళలకు ప్రాధాన్యం.. టెలీకాలర్ ఉద్యోగాల్లో మహిళల నియామకాలు గణనీయంగా పెరిగాయి. 2024లో టెలీకాలింగ్, బిజినెస్ డెవలప్మెంట్లో మహిళల నియామకం 2023తో పోల్చితే 80 శాతం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. సేల్స్లో మహిళలకు పెరుగుతున్న ప్రాతినిధ్యాన్ని సూచిస్తున్నట్టు తెలిపింది. సేల్స్లో మార్పులు.. అమ్మకాల విషయంలో కంపెనీల్లో వస్తున్న మార్పును ఈ గణాంకాలు ప్రతిఫలిస్తున్నట్టు వర్క్ఇండియా నివేదిక తెలిపింది. అదే సమయంలో సంప్రదాయ సేల్స్ ఉద్యోగాలకు తగ్గడాన్ని ప్రస్తావించింది. టైర్, 3, 4 పట్టణాల మినహా మిగిలిన చోట సంప్రదాయ సేల్స్ ఉద్యోగాల పోస్టింగ్లు తగ్గినట్టు తెలిపింది. కొత్త తరహా సేల్స్ ఉద్యోగాల నియామకాల్లో బెంగళూరు, ముంబై ముందున్నాయి. 2023తో పోల్చితే 2024లో బెంగళూరులో 33 శాతం, ముంబైలో 26 శాతం చొప్పున జాబ్ పోస్టింగ్లు ఎక్కువగా వచ్చాయి. పట్టణాల్లో విక్రయ నైపుణ్యాలున్న వారికి పెరుగుతున్న డిమాండ్కు ఇది అద్దం పడుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. -
తప్పులో కాలేసిన టెలీకాలర్, కట్చేస్తే న్యూడ్ వీడియో కాల్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ సంస్థలో టెలీకాలర్గా పని చేస్తున్న యువతి చేసిన చిన్న పొరపాటు ఆమెకే శాపంగా మారింది. తన విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి వేధింపులు పాలైంది. వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో పాటు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. ఉత్తర మండల పరిధిలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతి ఓ ప్రైవేట్ సంస్థలో టెలీకాలర్గా పని చేస్తోంది. వృత్తిలో భాగంగా నిత్యం అనేక మందితో సంస్థ ఫోన్ నుంచి కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే టెలీకాలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ క్లైంట్స్కు వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, వివరాలు అందించకూడదనేది ప్రాథమిక సూత్రం. ఓ సందర్భంలో ఈ యువతి ఛత్రినాక ప్రాంతానికి చెందిన చంద్రవేగ్కు ఫోన్ చేసి తమ సంస్థ వ్యాపారం విషయం మాట్లాడింది. ఆ సంస్థకు కస్టమర్గా మారే విషయాన్ని తాను పరిశీలిస్తానంటూ చెప్పిన చంద్రవేగ్ కాస్త సమయం కావాలన్నాడు. సమాధానం చెప్పడం కోసం సంప్రదించడానికంటూ ఆమె వ్యక్తిగత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన ఇతగాడు అప్పటి నుంచి ఆమెను రకరకాలుగా వేధించడం మొదలెట్టాడు. అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో విచక్షణ కోల్పోయిన ఇతగాడు బాధితురాలికి న్యూడ్ వీడియో కాల్స్ చేయడం మొదలెట్టాడు. విసిగివేశారిన బాధితురాలు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు చంద్రవేగ్ నిందితుడిగా గుర్తించారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
అవాంఛిత కాల్స్పై అవగాహన పెంచండి
న్యూఢిల్లీ: అవాంఛిత టెలిమార్కెటింగ్ కాల్స్కు సంబంధించి అమల్లోకి వస్తున్న నిబంధనల గురించి వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ని టెలికం సంస్థలు కోరాయి. ఫిర్యాదులు, పరిష్కార విధానం పనిచేసే తీరు గురించి కస్టమర్లకు తెలిస్తే నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ‘డు నాట్ డిస్టర్బ్’ విధానం పనితీరు, ఐచ్ఛికాలను, ఫిర్యాదులను నమోదు చేసే ప్రక్రియ, నియోగదారులకు వారి హక్కుల గురించిన అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఇందుకోసం వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫండ్ నుంచి నిధులు ఉపయోగించవచ్చని మాథ్యూస్ చెప్పారు. అవాంఛిత కాల్స్పై కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించినవి, పెండింగ్లో ఉంచినవి, పూర్తి వివరాలు లేనందువల్ల తిరస్కరించినవి, విచారణ తర్వాత సహేతుకమైనవిగా పరిగణనలోకి తీసుకున్నవి తదితర అంశాలతో టెలికం సంస్థలు ప్రతి నెలా నివేదిక సమర్పించాలంటూ ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తోంది. -
ఐయామ్ కాలింగ్ ఫ్రమ్
తెల్లవారింది మొదలు ‘ఐయామ్ కాలింగ్ ఫ్రమ్’ అంటూ టెలీ కాలర్ల నుంచి ఫోన్ రాగానే విసుక్కుంటాం. కానీ... టెలీ కాలర్ ఉద్యోగంలో ఉండే ఇబ్బందులను మనం పట్టించుకోం. ‘చాలామందికి టెలీ మార్కెటర్స్ని ఎగతాళి చేయడం ఒక హాబీ. వారి మనసు ఆ సమయంలో ఎలా ఉందనేది ఎవరూ అర్థం చేసుకోరు’ అని చెప్తున్న స్వరూప్ ‘ఐయామ్ కాలింగ్’ పేరున లఘుచిత్రం తీశాడు. నెల్లూరు వాసి అయిన స్వరూప్ ఆర్ఎస్జే... ప్రస్తుతం బెంగళూరు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. అముల్ కంపెనీకి ఇతడు తయారుచేసిన ప్రకటన జాతీయ స్థాయిలో టాప్ 20లో నిలిచింది. మోఫిల్మ్ గోవా కాంటెస్ట్కి రూపొందించిన ప్రకటన ఫైనల్స్ వరకు వచ్చింది. రాక్ మ్యూజిక్ బ్యాండ్తో తయారైన ఒక పాటను ఎంటీవీలో టెలికాస్ట్ చేశారు. ‘డెరైక్టర్ కావాలనేది నాకు పెద్ద కోరిక. దానికి ముందు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నా. దానికి రూపమే ఈ చిత్రం. ఉద్యోగ బాధ్యతలో భాగంగానే టెలీకాలర్స్ ఫోన్ చేస్తుంటారు. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది వారిని ఆట పట్టిస్తుంటారు. ప్రతివారి ఉద్యోగమూ గౌరవప్రదమైనదేనని భావించాలి. సినీ ప్రముఖులు చాలా మంది నన్ను అభినందించారు’ అని చెప్పాడు స్వరూప్. డా. వైజయంతి