Advertisement
Trafficking in women
-
Impact and Dialogue Foundation: పల్లవించిన రక్షణ
‘బాలికల అక్రమ రవాణా’ ఈ హెడ్డింగ్తో వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. ‘అయ్యో’ అనుకుని మరో వార్తలోకి వెళ్లిపోవడం కూడా చాలా మామూలుగా జరిగిపోతూనే ఉంటుంది. మన కళ్ల ముందు ఉండే అమ్మాయిని ఎవరో అపహరించుకుని వెళ్లారని తెలిస్తే మనసంతా పిండేసినట్లవుతుంది. రోజులపాటు బాధపడతాం. కానీ ఏమీ చేయం. అక్రమాల మీద గళమెత్తలేకపోయి నప్పటికీ కనీసం నోరు తెరిచి మనకు తెలిసిన విషయాన్ని చెబితే ఆ సమాచారం దర్యాప్తుకు దోహదమవుతుందని తెలిసినా పోలీసు ముందు పెదవి విప్పడానికి భయం. కానీ, అస్సాంకు చెందిన పల్లవి ఘోష్ అలా చూసి ఊరుకోలేదు. పన్నెండేళ్ల వయసులో ఆమె కళ్ల ముందు జరిగిన ఓ సంఘటన ఆమెను కదిలించింది. సమాజానికి అంకితమయ్యేలా ఆమెను ప్రభావితం చేసింది. అప్పుడు పల్లవి ఘోష్కు పన్నెండేళ్లు. ఆమె నివసిస్తున్న గ్రామానికి సమీపంలో ఉన్న మరో చిన్న గ్రామానికి చెందిన బాలికను దుండగులు అపహరించుకు వెళ్లడం ఆమె కంట పడింది. పెద్దగా అరుస్తూ పెద్దవాళ్లను అప్రమత్తం చేయడం ద్వారా ఆ బాలికను రక్షించగలిగింది పల్లవి. ట్రాఫికింగ్ని స్వయంగా చూడడం ఆమెకది తొలిసారి. కానీ బాలికలు, మహిళల అక్రమ రవాణా పట్ల అస్పష్టంగానైనా కొంత అవగాహన ఉందామెకి. అక్రమ రవాణాను నిరోధించాలని ఆ వయసులోనే నిర్ణయించుకుంది పల్లవి. వయసు పెరిగేకొద్దీ ఆమెలో ట్రాఫికింగ్ పట్ల స్పష్టమైన కార్యాచరణ రూపుదిద్దుకుంది. ‘ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ ’ స్థాపించి బాలికలు, మహిళల కోసం పని చేయడం మొదలుపెట్టింది. వేదిక మీద ప్రసంగం చాలదు! ‘‘బాలికలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి వివరించి చెప్పడానికి, ఆ బారిన పడకుండా కాపాడడానికి వేదికల మీద ఎన్ని ప్రసంగాలు చేసినా వాటితో అనుకున్న లక్ష్యం నెరవేరట్లేదని కొద్దికాలంలోనే తెలిసింది. ఇలా ప్రసంగాలతో కనీసం ఆలోచననైనా రేకెత్తించగలుగుతున్నానా అనే సందేహం కూడా కలిగింది. అప్పటి నుంచి నేరుగా ఇంటింటికీ వెళ్లి తలుపు కొట్టడం మొదలుపెట్టాను. వాళ్ల ఉద్ధరణ కోసం నిజంగా చేయాల్సిన పని ఏమిటనేది అప్పుడు తెలిసింది. మహిళలు గతంలోకి వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని, జరగబోయి తప్పించుకున్న దురాగతాలను ఏకరువు పెట్టారు. ప్రమాదాలు ఎన్ని రకాలుగా చుట్టుముడతాయనే విషయాన్ని వారికి విడమరిచి చెప్పడంతోపాటు ప్రమాదాన్ని శంకించినప్పుడు రక్షణ కోసం ఏమి చేయాలో వివరించాను. కొన్ని ఇళ్ల నుంచి అప్పటికే మాయమైపోయిన బాలికల అన్వేషణ కోసం పోలీస్ శాఖను ఆశ్రయించాను. అలాగే సమాజాన్ని చైతన్యవంతం చేసే క్రమంలో కానిస్టేబుళ్లను భాగస్వాములను చేశాను. వారిని దగ్గరగా చూడడం, వారు చెప్పే ధైర్యవచనాలను వినడం ద్వారా బాలికలు తమకు ప్రమాదం ఎదురైనప్పుడు నిర్భయంగా పోలీసుల సహాయాన్ని కోరగలుగుతారు. ఇలా ఎన్నో ప్రయత్నాల ద్వారా అక్రమ రవాణా పట్ల బాలికల్లో చైతన్యం తీసుకువచ్చాను. అపహరణకు గురైన పదివేలకు పైగా బాలికలను తిరిగి వారి ఇళ్లకు చేర్చగలిగాను. అంతటితో సరిపోదని ఆ తర్వాత తెలిసింది. రక్షించిన బాలికలకు ఉపాధి కూడా కల్పించాలి. ఆ పని చేయలేకపోతే ట్రాఫికింగ్ మాఫియా పని పేరుతో ఆ బాలికలను తిరిగి తమ గుప్పెట్లోకి తీసుకుపోతుంది. అందుకోసం మా ఫౌండేషన్ ద్వారా వారికి పనుల్లో శిక్షణ ఇచ్చి పని కల్పించడం కూడా మొదలు పెట్టాను. పది వేలకు పైగా బాలికలను కాపాడడంతోపాటు 75 వేల మందిలో చైతన్యం తీసుకురాగలిగాను. వారి భవిష్యత్తు అంధకారంలోకి తోసేసే ముఠాల నుంచి వారికి జాగ్రత్తలు తెలియచేశాను. కానీ మాఫియా ముఠాలను కూకటి వేళ్లతో పెకలించి వేయడం అనే పనిని ప్రభుత్వాలు చేయాలి. అప్పుడే ఈ భూతం తిరిగి నిద్రలేవకుండా ఉంటుంది’’ అని వివరించింది పల్లవి ఘోష్. -
పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని..
ఈ మధ్య ఒక సినిమా డైలాగు విన్నాను. హీరోయిన్ అనుకుంటా.. ఆమె బహుశా హీరోని ఉద్దేశించి అయి ఉండవచ్చు. ' నీవు ఇంతకన్నా దిగజారవు అనుకున్నప్పుడల్లా నా అభిప్రాయం తప్పు అని రుజువు చేస్తూనే ఉన్నావు" అని ఆమె అంటుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ డైలాగు వర్తిస్తుంది. రాజకీయాలలో సినిమా డైలాగులు వాడుకుంటే ఫర్వాలేదు కాని.. అచ్చం సినిమాలో మాదిరి వ్యవహరించాలనుకుంటే తెలివి తక్కువతనం అవుతుంది. పవన్ కల్యాణ్ ఏపీలో మహిళల అక్రమ రవాణా గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. తాను పవిత్రంగా భావించే వారాహి అమ్మవారి పేరుతో ఉన్న వాహనం ఎక్కి ఇలాంటి అప్రాచ్యపు విషయాలా సంబాషించేది.! అందులోను వలంటీర్లపై ఆయన వ్యక్తపరచిన భావాలు దారుణమైనవి. ఇది కూడా సినిమా డైలాగులాగానో, అదేదో తానే చూసినట్లో మాట్లాడిన తీరు ఆయనను రాజకీయంగా, వ్యక్తిగతంగా మరింత పాతాళానికి తీసుకు వెళ్లింది. మహిళల మిస్సింగ్ కేసులుకాని, పురుషుల మిస్సింగ్ కేసులు కాని పలు రకాలుగా ఉంటాయి. ఎవరు మిస్ అయినా ఆ కుటుంబానికి తీరని బాధే. కాని వాటిలో 99.9 శాతం వ్యక్తిగత కారణాలతోనే జరుగుతుంటాయి. ప్రేమ విఫలం అయిందనో, ఇంట్లో కోప్పడ్డారనో ఇంకా రకరకాల కారణాలతో మిస్ అవుతుంటారు. కొన్ని సందర్భాలలో కిడ్నాప్లు జరుగుతుంటాయి. కొంతమంది దుర్మార్గులు అపహరణ చేయడమో, ప్రలోభాలకు గురి చేయడమో చేస్తుంటారు. అవన్ని సమాజంలో జరిగే కొన్ని నేరాలు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆ మాటకు వస్తే తెలంగాణలో ఏపీలో కన్నా ఎక్కువ మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. పవన్ కల్యాణ్కు దమ్ముంటే తెలంగాణకు వెళ్లి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి చూడమనండి. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వలంటీర్ల ఆగ్రహ జ్వాల ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి ఎల్లో మీడియా అండ చూసుకుని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు, ఆయనకు ఉన్న ఆర్దిక వనరులు చూసుకుని పవన్ కల్యాణ్ ఏపీలో చెలరేగిపోతున్నారు. బహుశా ఇలా నీచంగా మాట్లాడితే ఎవరో ఒకరు తనపై ఏదైనా రాయి విసరకపోతారా?. లేక ఏదైనా చిన్న గొడవ చేయకపోతారా? ఆ తర్వాత ఇంకేముంది శాంతిభద్రతులు లేవని ప్రచారం చేయవచ్చన్న దుష్టతలంపుతో ఇలాంటి కవ్వింపు మాటలు మాట్లాడి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా, అంతా ప్రశాంతంగా ఉండడంతో ఈయనను ప్రయోగించి ఉండవచ్చని కొందరు అనుమానం.పైగా ఈ దిక్కుమాలిన వ్యవహారాలను వలంటీర్లకు, వైసీపీ నేతలకు, ప్రభుత్వంలోని పెద్దలంటూ ఆపాదించి పవన్ కళ్యాణ్ తన హీన బుద్దిని ప్రదర్శించుకున్నారు. ఎదుటివారిని రాజకీయంగా ట్రాప్ వేయడానికి కొన్నిసార్లు ఇలా చేస్తుంటారు. కాని పవన్ కల్యాణ్కు ఆ తెలివితేటలు కూడా ఉన్నాయని అనుకోవడం లేదు. తనకు స్క్రిప్టు ఇచ్చినవారు రాసిన దానికన్నా అధికంగా ఏమైనా మాట్లాడి బురదలో పడ్డారేమో తెలియదు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ ట్రాప్లో ఆయన పడినట్లు అనిపిస్తుంది. ఈ మధ్య పవన్కు కౌంటర్ ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన పేరు చెప్పకుండా దత్తపుత్రుడు మాదిరి నాలుగు పెళ్లిళ్లు చేసుకుని వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించలేమని అన్నారు. ఆ తదుపరి కొద్ది రోజులకే ఎల్లో మీడియాతో సహా అన్ని మీడియాలలో పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కూడా ముగిసిపోయినట్లేనని కథనాలు వచ్చాయి. దాంతో పవన్ కళ్యాణ్ పరువు పూర్తిగా పోయింది. ఈ కారణంగా ప్రస్టేషన్కు గురైన పవన్ ఇలా పిచ్చి డైలాగులతో ఏదో చేసేయాలనుకుని తానే దెబ్బతిన్నారు. అసలు ఇలాంటి కొన్ని నేరాలు జరగడానికి సినిమాలు కూడా కారణమే అని చెప్పాలి. ఆడపిల్ల తను ప్రేమించిన వ్యక్తి కోసం ఎలా పారిపోవాలో ఈ సినిమాలలో చూపిస్తుంటారు. వాటిని నేర్చుకుని కూడా కొందరు అలా పారిపోతుంటారు. సినిమా హీరోలు, నటీ, నటుల అక్రమ సంబంధాల గురించి పలు వార్తలనండి.. ఊహాగానాలు అనండి వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజాలు ఉండవచ్చు. మరికొన్ని అవాస్తవాలు కావచ్చు. కాని అమాయక జనం వాటి ప్రభావానికి గురి అవుతుంటారు. ఎవరైనా ఒక హీరో మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా, అదేదో గొప్ప విషయం లా ఫీల్ అయ్యే అమాయకపు అభిమానులు ఉండవచ్చు. ఎవరైనా ఒక హీరో తాను పెళ్లి చేసుకున్న మహిళ ఇంటిలో ఉండగానే, మరో యువతిని తెచ్చి అక్రమ సంబందం పెట్టుకుంటే సపోర్టు చేసే మూర్ఖపు అభిమానులు కూడా ఉండవచ్చు. అలాంటి సన్నివేశాలలో సంబంధిత హీరో అసలు భార్య ఇంటి నుంచి వెళ్లిపోతే అది కూడా మిస్సింగ్ కేసే అవుతుంది. పవన్కు ఆ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. దానికి ఎవరు బాధ్యత వహించాలో తెలియకపోవచ్చు. ఒక సినీ హీరో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయినా, రాష్ట్ర ముఖ్యమంత్రిదే బాధ్యత అని చెప్పదలిస్తే మనం ఏమి చేయగలుగుతాం. కొన్నాళ్లపాటు ఆమె ఎక్కడో తలదాచుకుని, వివాహ బంధం తెంచుకున్న తర్వాత కూడా మరో పెళ్లి చేసుకోరాదని దారుణంగా ఆమెకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే సాడిస్టు అభిమానులు ఉన్న సమాజం మనది. బహుశా పవన్ కళ్యాణ్ వంటి సినిమా నటులకు అలాంటి సాడిస్టులంటేనే ఇష్టం ఉండవచ్చు. కాని సాధారణ సభ్య సమాజం అలాంటి వాటిని అంగీకరించదు. ఆ సంగతిని ఆయన గుర్తించాలి. చదవండి: ఓరీ దత్తపుత్రా.. అందుకేనా వాలంటీర్లపై అడ్డగోలు వాగింది! మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తులు సైతం నీతులు చెప్పే కాలమిది. ఏమి చేస్తాం. తప్పదు అన్నీ భరించాల్సిందే. ఇక్కడ విశేషం ఏమిటంటే పవన్ కల్యాణ్కు మహిళల అక్రమ రవాణా గురించి ఎవరో కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయట. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పవాడు ఏమైనా చెబుతాడన్నది సామెత. ఏపీ ప్రభుత్వం అంటే కేంద్రానికి భయమా? నిజంగా అలాంటివి జరుగుతుంటే బహిరంగంగానే కేంద్రం ప్రకటిస్తుంది. రాష్ట్ర అధికారులకు రిపోర్టు పంపుతుంది తప్ప పవన్ కు చెవిలో చెప్పి పంపరు. బహుశా ఎవరైనా తెలివితక్కువవారు పవన్ కళ్యాణ్కు అలాంటి మాటలుచెప్పారేమో తెలియదు. కాని ప్రసంగించిన తీరు చూస్తే ఎల్లో మీడియా రాసిచ్చినవాటిని కనీస ఆలోచన చేయకుండా చదివినట్లు అనిపిస్తుంది. తద్వారా టీడీపీ అనుకూల శక్తులు పవన్ను తమ గుప్పిట్లోనే ఉండేలా చేసుకోగలుగుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం వలంటీర్ల వ్యవస్థ అన్నది ఒక స్పెషల్. దాని ద్వారా లక్షలాది కుటుంబాలు సేవలు పొందుతున్నాయి. ప్రత్యేకించి ప్రతి నెల ఫస్ట్ తేదీన వృద్దులకు పెన్షన్ను ఇంటికి వెళ్లి తీసుకు వెళ్లడం నుంచి వరదలు వస్తే సాయపడడం వరకు అనేక పౌర సేవలను అందిస్తున్న వలంటీర్లను ఉద్దేశించి అంత మాటఅనడానికి పవన్కు నోరు ఎలా వచ్చిందో అర్దం కాదు. వలంటీర్లలో లక్షమందికిపైగానే మహిళలు కూడా ఉంటారు. అలాంటివారు ఇలాంటి ఛండాలపు పనికి సహకరిస్తున్నారని, ఏదేదో సమాచారం సేకరిస్తున్నారని తెలిసీ, తెలియని మాటలు అంటే ఆ వలంటీర్లు ఎంత ఆవేదనకు గురి అవుతారు! మహిళల అక్రమ రవాణా కేసులు వంటి నేరాలు గతంలోనూ జరిగాయి. ఇప్పుడు కూడా జరిగాయి. గత చంద్రబాబు ప్రభుత్వ టైమ్ తో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వం టైమ్లో ఇవి తక్కువగానే ఉన్నాయి. అలాగే అప్పుడు మిస్ అయిన వారిని ట్రేస్ చేశారు. ఇప్పుడు కూడా ట్రేస్ చేస్తున్నారు. వీటిలో అత్యధికం వ్యక్తిగత కేసులే. దానికి ప్రభుత్వానికి లింక్ చేసి ముఖ్యమంత్రి జగన్పై తనకు ఉన్న విద్వేషాన్ని, కక్షను వెళ్లగక్కి తానేదో సాధించాలని పవన్ అనుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మహిళల మిస్సింగ్ కేసుల గురించి ఆయన ఎందుకు ప్రస్తావించలేదు. అప్పుడు ఎవరు మిస్ అయినా ఫర్వాలేదని ఆయన అనుకున్నారా? ఇలాంటి వ్యక్తులు రాజకీయాలలోకి వస్తే ఎంత నీచంగా ప్రవర్తిస్తారో ఆయనే సమాజానికి తెలియచేసుకున్నారు. అంతా అయిపోయాక జనసేన పార్టీపరంగా ఎవరో ఖండన ఇచ్చి అబ్బే అలా అనలేదు.. ఇలా అనలేదు.. వక్రీకరించారు అని సన్నాయి నొక్కుడు నొక్కినా, పవన్ మాట్లాడిన వీడియోలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ ఏదో రకంగా పవన్ తన వ్యాఖ్యలను సమర్దించుకోవడం వెనుక ఉన్న లక్ష్యం అర్ధం అవుతుంది. వలంటీర్ల వ్యవస్థను డీమోరలైజ్ చేయాలన్న కుట్ర ఇందులో దాగి ఉంది. అందుకే ఇలా అనుచితంగా మాట్లాడుతున్నారు. తన భార్యకు విడాకులు ఇచ్చారని వార్తలు వస్తేనే అంతమాట అంటారా అని చించుకున్న ఆయన వలంటీర్లను ఉద్దేశించి ఇంతటి ఘోరమైన వ్యాఖ్యలు చేయడం ఎలా సమంజసమని అనుకున్నారో తెలియదు. కరోనా సమయంలో ఏపీలో వలంటీర్లు అందించిన సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన సంగతి ఆయనకు తెలియదా? ఒకసారి ఏదైనా గ్రామానికి వెళ్లి వలంటీర్లతో కలిసి పవన్ తిరిగితే వారి విలువ ఏమిటో తెలిసేది. గతంలో చంద్రబాబునాయుడు ఇలాగే వలంటీర్లను మూటలుమూసే ఉద్యోగమని, ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడతారని ఏదేదో మాట్లాడి అభాసుపాలయ్యారు. అదే చంద్రబాబు తాము వస్తే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పలేకపోతున్నారు. పైగా టీడీపీ వారికి అవకాశం ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు దారిలోనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసి దొరికిపోయారు. అసలు పవన్ కల్యాణ్కు నిజంగా మహిళల పట్ల గౌరవం ఉంటే వారిని అవమానించే రీతిలో ఉపన్యాసాలు చేస్తారా? సొంత ఆలోచనలు కాకుండా, ఎవరో బుర్రతో ఆలోచించి ప్రసంగాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఎవరినో మెప్పించడానికిగాను పవన్ తాను పరువు పోగొట్టుకుంటున్నారు. అసలు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పలేని దైన్య స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి అసంబద్ద వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలనుకుంటే అయ్యే పనికాదని తెలుసుకోవాలి. అందుకే వలంటీర్లు కాని సమాజంలోని ఆయా వర్గాలు కాని పవన్ కళ్యాణ్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎవరివో గుడ్డలూడదీస్తానని చెబుతున్నారు కాని, ఆయనకు తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తన బట్టలు తానే ఊడదీసుకుని తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
మహిళలకు రక్షా కవచం
విశాఖపట్నం : మహిళలు, బాలల అక్రమ రవాణా, వారిపై దాడులు, కిడ్నాప్లు వంటి సంఘవిద్రోహ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా రెవెన్యూ, పోలీసు విభాగాలు సంయుక్త కార్యాచరణ సిద్ధం చేశాయి. విశాఖను మహిళా, బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించాయి. ‘బంగారు తల్లులు–అంగడి సరుకులు’ అనే శీర్షకతో ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కధనంపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఓ పక్క పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మరో వైపు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఉమెన్ ట్రాఫికింగ్పై మంగళవారం జిల్లాస్థాయిలో సమీక్షించారు. మహిళలను ఆదుకునేందుకు, బాలకార్మికులు, బాల యాచకుల గుర్తింపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. వివిధ రూపాల్లో హింసకు గురయ్యే బాధిత మహిళలకు అవసరమైన మద్దతు, సహాయం అందజేయడంతోపాటు వారి పునరావాసానికి ఉద్దేశించిన వన్స్టాప్ సెంటర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. గత ఏడాది జనవరిలో కేజీహెచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంపై తగిన ప్రచారం లేకపోవడం వల్ల ఫలితాలు రావడంలేదన్న అభిప్రాయాన్ని కలెక్టర్ వ్యక్తం చేశారు. ఈ కేంద్రం పనితీరును మెరుగుపర్చాలని, అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఐసీడీఎస్ పీడీ చిన్మయిదేవిని ఆదేశించారు. వన్స్టాప్ సెంటర్కు శాశ్వత భవనం కోసం విమ్స్లో స్థలాన్ని కేటాయించేందుకు పంపిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం లభించేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. హెల్ప్లైన్ల ఏర్పాటు హింసకు గురయ్యే మహిళలు 0891–2564575 లేదా ఉమెన్ హెల్ప్లైన్–181కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో బాలకార్మికుల, బాలయాచకుల లేకుండా చూడాలని అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆయన కోరారు. నగరంలోని పలు కూడళ్లలో బాలయాచకుల సమస్య ఎక్కువగా ఉందని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తేగా దీనిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించేలా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయాలన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బాలకార్మికులు, బాలయాచకులను గుర్తించి వారికి తగిన పునరావాసం కల్పించాలన్నారు. నగరంలో బాలకార్మికులు, బాలయాచకులు, తప్పిపోయిన బాలలను ఎవరైనా గుర్తిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్–1098కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని విజ్ఞప్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో డ్రాపవుట్స్పై సర్వే నిర్వహించాలని సర్వశిక్ష అభియాన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీపీవో రామశాస్త్రి, పంచాయతీరాజ్ ఎస్ఈ గజేంద్ర తదితరులతో పాటు ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు సమావేశంలో పాల్గొన్నారు.