వెయ్యేళ్లు నిలిచేలా వెయ్యికాళ్ల మండపం
టీటీడీ చైర్మన్ చదలవాడ
సాక్షి, తిరుమల: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో వెయ్యేళ్లు నిలిచేలా వేయికాళ్ల మండపాన్ని పునఃనిర్మిస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పునాది రాయి వేయిస్తామని చెప్పారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించేందుకు వీలుగా మండపం నిర్మాణ ఆకృతులపై ఇప్పటికే ఈవో సాంబశివరావు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేశారని పేర్కొన్నారు.
న్యాయపరమైన చిక్కులు తొలగించి, తిరుపతిలో వకుళమాత ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. సోమవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో బోర్డు తీర్మానాలను చైర్మన్ వెల్లడించారు.
* సెప్టెంబరు 16 నుంచి 24 వరకు వార్షిక, అక్టోబరు 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సమయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ దర్శనాలు రద్దు చే స్తారు.
* ఆలయానికి అవసరమైన సరుకులు రూ.61.24 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. ఆవునెయ్యి ట్యాంకర్ల ద్వారా కిలో రూ.276 చొప్పున రూ. 46.92 కోట్లతో 17 లక్షల కిలోలు, డబ్బాల ద్వారా కిలో రూ.278 చొప్పున రూ. 6.65 కోట్లతో 2.25 లక్షల కిలోలు కొనుగోలు చేయనున్నారు. ఎండుద్రాక్ష కిలో రూ. 177.30 చొప్పున రూ. 3.54 కోట్లతో 2 లక్షల కిలోలు, తాండూరు రకం కందిపప్పు కిలో రూ.118 చొప్పున రూ. 4.13 కోట్లతో 3.5 లక్షల కిలోలు కొనుగోలు చే యనున్నారు.
* తిరుమలలోని జలాశయాల నుంచి సరఫరా అయ్యే తాగునీటిని శుద్ధిచేసి, సరఫరా చేసేందుకు రెండేళ్లకు రూ. 4.3 కోట్ల టెండర్ను ఆమోదించారు.
బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్, బ్రోచర్ను చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆవిష్కరించారు.