న్యూస్ ప్రెజెంటర్గా అంధబాలుడు
కోయంబత్తూర్: పట్టుదల, కృషి ఉంటే, శారీరక వైకల్యాలను సైతం అధిగమించి రాణించవచ్చని నిరూపించాడు తమిళనాడుకు చెందిన 11 ఏళ్ల బాలుడు. సంకల్పాన్ని మించిన బలం లేదని రుజువు చేస్తూ పుట్టుకతోనే చూపును కోల్పోయిన శ్రీరామానుజన్ మరో సంచలనానికి నాంది పలికాడు. ఒక తమిళ న్యూస్ ఛానల్లో న్యూస్ యాంకరింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరికంటే భిన్నంగా ఏదైనా సాధించాలని తపన పడిన రామానుజం, దానికి టీవీ మీడియాను వారధిగా ఎంచుకున్నాడు. టీవీలో వార్తలు చదవడం ద్వారా తన గురించి పదిమందికి తెలియజేయాలనుకున్నాడు. తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలవాలనుకున్నాడు.
నేపాల్ భూకంపం తర్వాత పరిణామాలు, మహింద్రా రాజపక్సే ట్రయల్ తదితర వార్తలతో కూడిన 22 నిమిషాల న్యూస్ బులిటెన్ను బ్రెయిలీ లిపి సహాయంగా శ్రీరామానుజం ప్రెజెంట్ చేశాడు. అది చూసిన అతని తల్లిదండ్రుల కళ్లు ఆనందంతో వర్షించాయి.
ముందు రెండు నిమిషాలు కొంచెం తడబడ్డా, అలవాటైన తర్వాత బాగా చదివానంటూ శ్రీరామానుజం ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
ప్రస్తుతానికి శ్రీరామానుజానికి వారానికి ఒక స్పెషల్ బులిటెన్ ఇస్తున్నామని.. తరువాత రెగ్యులర్గా వార్తలు చదివే అవకాశాన్ని కల్పిస్తామని ఛానల్ ఛైర్మన్ తెలిపారు. వికలాంగులను ప్రోత్సహించడంతోపాటు,నేత్ర దానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం తమ ఉద్దేశమన్నారు. ప్రపంచంలో తొలిసారిగా ఒక అంధుడి చేత వార్తలను చదివించిన ఘనత తమ ఛానల్ దక్కించుకుందని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే ట్రాన్స్జెండర్స్ న్యూస్ యాంకర్లుగా, ప్రోగ్రామ్ ప్రెజెంటర్స్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.