water stagnation
-
వర్షం అంటే భయం వేస్తోంది: కేటీఆర్
వర్షాకాలం అంటేనే ఒక రకంగా భయంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు పడకపోయినా పర్వాలేదని, వర్షం పడితే మాత్రం ఎక్కడికక్కడ నీరు నిలిచే ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన 70 మినీ జెట్టింగ్ మిషన్లను ప్రారంభించారు. సోమవారం నుంచే ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మ్యాన్హోల్స్ను మాన్యువల్గా శుభ్రం చేయడాన్ని ఇక మీదట పూర్తిగా ఆపేస్తామని, దానికి బదులు ఈ మిషన్ల ద్వారా శుభ్రం చేయిస్తామని అన్నారు. సివరేజి వ్యవస్థ మొత్తం మారాలంటే రూ. 11 వేల కోట్లు అవసరం అవుతాయని ఆయన చెప్పారు. త్వరలోనే వర్షాలు రాబోతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. -
హైదరాబాద్లో జలవిలయం
-
హైదరాబాద్లో జలవిలయం
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలలో నీళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ వేగానికి మనుషులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ఒక పాఠకుడు 'సాక్షి.కామ్ వెబ్సైట్'కు ఫోన్ చేసి చెప్పారు. అల్వాల్ జోషినగర్ ప్రాంతంలో ఉన్న చిన్నరాయని చెరువు నుంచి నీళ్లు వేగంగా వస్తున్నాయని.. వాటి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఉదయం నుంచి తాను అధికారులకు ఫోన్లు చేస్తూనే ఉన్నానని, 2-3 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని వాళ్లు చెబుతున్నా నీటి ప్రవాహం ప్రతి గంటకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదని ఆయన వివరించారు. భారీ వర్షం హైదరాబాద్ను అతలాకుతలం చేసింది. దాదాపుగా భాగ్యనగరం మొత్తం నీటమునిగింది. రోడ్లపై మోకాల్లోతు వర్షపునీరు నిలిచింది. కూకట్పల్లి-హైటెక్సిటీ రైల్వేబ్రిడ్జి దగ్గర కూడా భారీగా వరద నీరు చేరింది. అటు వైపు వెళ్లే వాహనాల్లోకి ఆ నీరు పోవడంతో.... అవి మొరాయించాయి. దీంతో వాహనాలు అక్కడికక్కడే ఆగిపోయాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. వర్షాలతో హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు చేరడంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటిని బయటకు వదులుతున్నారు. రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షం నీరు చేరింది. అర్థరాత్రి నుంచి చాలాచోట్ల ప్రధాన మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు వర్షపునీటిలోనే రాత్రంతా జాగారం చేస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటు రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, నాంపల్లి, అబిడ్స్తోపాటు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బాలానాగర్, సనత్ నగర్, అమీర్ పేట్, మలక్ పేట్, చాదర్ ఘాట్, దిల్ షుక్ నగర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండింది. రాత్రి కురిసిన వర్షానికి కూకట్ పల్లి బాలానగర్ నాలాల నుంచి భారీగా వరదనీరు సాగర్ లోకి చేరుతుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్ పల్లి, దోమల్ గూడ, నల్లకుంటతోపాటు దిగువ ప్రాంతాల్లోని కాలనీల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పురాతన భవనాలు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో నివసించేవారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కమిషనర్ అధికారులను అదేశించారు. రాత్రి నుంచి జీహెచ్ఎంసి సిబ్బంది, అత్యవసర సహాయక సిబ్బంది వాననీటిని ఎప్పటికప్పుడు నాలాల్లోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేశారు. మెట్రో మార్గంలో రోడ్డుపై ఉన్న డివైడర్ల కారణంగా పంజాగుట్ట, అమీర్ పేట్, బేగంపేట్, ఎర్రగడ్డతో పాటు పలుచోట్ల రోడ్లపై భారీగా నీరు నిలిచింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇంకా కోలుకోని హైదరాబాద్ నగరం...
హైదరాబాద్: బుధవారం కురిసిన భారీ వర్షంతో అస్తవ్యస్థమైన హైదరాబాద్ నగరం ఇంకా కోలుకోలేదు. నగరంలోని పలు కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రధాన రహదారుల వెంట, నాలాల వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడంతో రోడ్లపైకి నీరు చేరుకుంది. దీంతో ట్రాఫిక్కు ఆటంకం ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర మేయర్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నాలాలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పారిశుద్ధ్య లోపంతో వ్యాధులు ప్రబలే అవకాశముందని.. ప్రజలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పాదచారులు, వాహనదారులు మ్యాన్ హోల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో వైపు గురువారం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించే పనిలో గ్రేటర్ అధికారులున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హుస్సేన్సాగర్ వద్ద గురువారం వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 513.62 అడుగులుగా ఉంది. -
హైదరాబాద్ అతలాకుతలం
ఇటీవలి కాలంలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అయింది. జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. భోలక్పూర్, రామంతపూర్ ప్రాంతాల్లో గోడలు కూలి ఏడుగురు మరణించారు. హుస్సేన్సాగర్ నీటిమట్టం నాలుగు అడుగులకు పైగా పెరగడంతో అది ప్రమాదకరస్థాయిలో ఉందని.. తూములు తెరిచి నీటిని కిందకు వదిలారు. గత పదిహేనేళ్లలో ఎన్నడూ చూడనంతగా రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సైతం చెప్పారు. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచే చిరుజల్లులుగా మొదలైన వర్షం.. 7 గంటలకల్లా తీవ్రరూపం దాల్చింది. అక్కడి నుంచి దాదాపు మధ్యాహ్నం వరకు కూడా పలు ప్రాంతాల్లో కురుస్తూనే ఉంది. సాధారణంగా హైదరాబాద్లో ఒక ప్రాంతంలో వాన పడితే మరో ప్రాంతంలో ఎండ కాస్తుందంటారు. కానీ ఈసారి మాత్రం అక్కడ, ఇక్కడ అని లేకుండా నగరం నలుమూలలా భారీగా వర్షాలు కురిశాయి. కడపటి సమాచారం అందేసరికి అంబర్పేట ప్రాంతంలో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. (నగరంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు) అన్నిచోట్లా ట్రాఫిక్ జామ్ హయత్నగర్ వైపు నుంచి గానీ, కూకట్పల్లి వైపు నుంచి గానీ, సికింద్రాబాద్ వైపు నుంచి గానీ నగరంలోకి రావడానికి ఏమాత్రం వీలులేకుండా అన్నిచోట్లా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నీళ్లు మోకాలిలోతులో నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. కూకట్పల్లి నుంచి పంజాగుట్ట చౌరస్తా చేరుకోడానికి ఉదయం సమయంలో దాదాపు రెండు గంటలకు పైగా పట్టింది. ఇక దిల్సుఖ్నగర్ వైపు నుంచి మియాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు చుక్కలు చూశారు. చాలాచోట్ల కార్లు దాదాపు మూడు వంతులు మునిగిపోయాయి. తాను కారు తీసుకున్న తర్వాత ఐదేళ్లలో తొలిసారి ఇలా జరిగిందని, బెల్టు శబ్దం సైతం చాలా తేడాగా వచ్చిందని నిజాంపేట ప్రాంతానికి చెందిన రాము 'సాక్షి'కి తెలిపారు. మలక్పేట బ్రిడ్జి కింద మూడు బస్సులు ఇరుక్కుపోయాయి. నగరంలోని చింతల్బస్తీ ప్రాంతంలో ఒక కారు కొట్టుకుపోతుండగా స్థానికులు తాళ్ల సాయంతో దాన్ని, అందులోని డ్రైవర్ను కూడా కాపాడారు. సైఫాబాద్, మలక్పేట, అఫ్జల్గంజ్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, బేగంపేట, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యోగుల పరిస్థితి దారుణం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఉదయం 8 గంటలకు బయల్దేరి 9.30కల్లా వస్తామనుకుంటే.. 11.45కు గానీ ఆఫీసుకు చేరుకోలేకపోయామని కొందరు అన్నారు. మరికొందరు ఉదయం 10 గంటలకల్లా ఆఫీసులకు రావాల్సి ఉంటే.. సగం రోజు సెలవు పెట్టి, మధ్యాహ్నానికి చేరుకుంటామని చెప్పారు. ఇక భారీ వర్షం కారణంగా కార్యాలయాలకు ఒక గంట ఆలస్యంగా వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎంఎంటీఎస్ రైళ్లు హైదరాబాద్లోని పలు మార్గాలలో తిరగాల్సిన ఎంఎంటీఎస్ రైళ్లను సైతం వర్షాల కారణంగా రద్దు చేశారు. బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేకంగా నాలుగు రైళ్లను నడిపిస్తున్నారు. లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కింద ప్రాంతంలో కూడా వాహనాలు నిలిచిపోయాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవు విద్యార్థులు ఉదయం అష్టకష్టాలు పడి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తే.. వర్షం కారణంగా సెలవు ప్రకటించినట్లు యాజమాన్యాలు చెప్పాయి. వర్షాల నేపథ్యంలో రోడ్ల మీద మ్యాన్హోల్స్ పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం, విద్యార్థులు తడిసి అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా సెలవులు ఇచ్చేశారు. శిథిల భవనాలు ఖాళీ చేయాలి: మేయర్ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కొన్ని భవనాలు శిథిలస్థితికి చేరుకున్నాయని, ప్రజల ప్రాణాలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వాటిని వెంటనే ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. శిథిలభవనాలను కూల్చేయాలని తాము ప్రయత్నిస్తున్నా, వాళ్లు మాత్రం కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని, ఇప్పుడు మరో మూడు రోజుల పాటు వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న దృష్ట్యా పెను ప్రమాదం ఉందని ఆయన అన్నారు. అందువల్ల ఇప్పటికైనా అలాంటి భవనాల్లో ఉన్నవాళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. జీహెచ్ఎంసీకి చెందిన దాదాపు వంద వరకు సహాయ బృందాలు నిరంతరం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ముమ్మరంగా సహాయచర్యలు: కమిషనర్ సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని జీహచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి తెలిపారు. వర్షాల పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దనరెడ్డి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాల్లో ఎవరూ ఉండొద్దని కోరారు. గోడలు కూలి మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. రోడ్లపై నిలిచిన నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
శిథిల భవనాలు ఖాళీ చేయాలి