రోడ్డు ప్రమాదంలో దివీస్ ఉద్యోగి దుర్మరణం
తగరపువలస(విశాఖ): భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్ వద్ద యూనియన్ బ్యాంకు ఎదురుగా మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శేశెట్టి రాంబాబు అనే దివీస్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. నైట్ డ్యూటీకి వెళ్లిన రాంబాబు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ముందున్న ట్రాక్టర్ను దాటి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఎదురుగా లారీ వస్తుండటంతో వెనక్కు తగ్గే క్రమంలో ట్రాక్టర్ వెనుక భాగం బలంగా తగిలి రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్ర రక్తస్రావం కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన మృతుడు ఏడేళ్ల క్రితం దివీస్లో చేరాడు. ప్రస్తుతం జీవీఎంసీ భీమిలి జోన్ ఒకటో వార్డు బాలాజీనగర్లో నివసిస్తున్నాడు. అతనికి భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. అతని మృతితో తోటి ఉద్యోగులు దుఃఖంలో మునిగిపోయారు.
రోడ్డు ప్రమాదంలో దివీస్ ఉద్యోగి దుర్మరణం


