వేలిముద్రలు తీసుకున్నాడు.. డబ్బివ్వకుండా వెళ్లిపోయాడు! | - | Sakshi
Sakshi News home page

వేలిముద్రలు తీసుకున్నాడు.. డబ్బివ్వకుండా వెళ్లిపోయాడు!

Published Tue, Mar 4 2025 1:08 AM | Last Updated on Tue, Mar 4 2025 1:08 AM

-

సచివాలయ ఉద్యోగి నిర్వాకం

తాడిపత్రి రూరల్‌: పింఛన్‌దారుల నుంచి వేలిముద్రలు తీసుకున్న ఓ సచివాలయ ఉద్యోగి.. డబ్బు పంచకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన తాడిపత్రి మునిసిపాలిటీలోని నందలపాడు సచివాలయం–1 పరిధిలో జరిగింది. వివరాలు.. నందలపాడు సచివాలయం–1 ఉద్యోగి (ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌) సుధాకర్‌ ఈనెల 1న పింఛన్ల పంపిణీ చేపట్టాడు. దాదాపు 24 మంది లబ్ధిదారుల నుంచి వేలి ముద్రలు తీసుకొన్నాడు. కానీ వారితో వేలిముద్రలు పడలేదని, తరువాత వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం కర్ణాటకలోని బళ్లారికి చేరుకున్నాడు. ఈ విషయంపై తోటి ఉద్యోగులకు కూడా సమాచారం ఇవ్వలేదు. తన వద్ద ఉన్న పింఛన్‌ డబ్బు, వేలిముద్రల మిషన్‌ అప్పగించలేదు. రెండు రోజులైనా సుధాకర్‌ రాకపోవడంతో ఆందోళనకు గురైన పింఛన్‌దారులు సోమవారం స్థానిక కౌన్సిలర్‌ విజయ్‌కుమార్‌ ఇంటికి వెళ్లి విషయం వివరించారు. ఈ క్రమంలోనే అతను సుధాకర్‌కు ఫోన్‌ చేసి సాయంత్రంలోపు డబ్బు పంపిణీ చేయకుంటే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించగా.. సదరు సచివాలయ ఉద్యోగి హుటాహుటిన వచ్చి డబ్బు పంపిణీ చేయడం గమనార్హం. దీనిపై కమిషనర్‌ శివరామ కృష్ణ మాట్లాడుతూ విషయం తన దృష్టికి రాలేదన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వాస్తవమని తేలితే శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement