
సాక్షి, అమరావతి: 2023–24 సీజన్కు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకానికి కొత్తగా అర్హత పొందినవారు, గతంలో అర్హత కలిగి లబ్ధి పొందని భూ యజమాన రైతులు, అటవీ భూసాగుదారులు ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత నాలుగేళ్లుగా ఈ పథకం ద్వారా మే నెలలో తొలి విడత పెట్టుబడి సాయం విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.
ఇందుకోసం అర్హత పొందినవారు సమీప ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. తమ దరఖాస్తులను రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేసుకునేందుకు ఈ నెల 3 వరకు గడువునివ్వగా 90,856 మంది భూ యజమానులు, 6,632 మంది అటవీ భూసాగుదారులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరితో పాటు 2022–23లో రైతు భరోసా కింద లబ్ధి పొందేందుకు అర్హత కలిగిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఈ నెల 12 నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నామని చెప్పారు.
అర్హుల జాబితాలో ఎవరైనా అనర్హులున్నట్టుగా గుర్తించినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకురావచ్చన్నారు. అలాగే అర్హతలు ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 15 నుంచి 18 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గతేడాది లబ్ధి పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని తెలిపారు. వారికి ఈ ఏడాది కూడా యధావిధిగా రైతు భరోసా సాయం అందుతుందన్నారు. గతేడాది లబ్ధి పొంది ప్రస్తుతం మరణించినట్లైతే వారి భార్య లేదా భర్త నామినీగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. భూమికి సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment