Agriculture Department
-
రైతుసేవా కేంద్రాల కుదింపు నిజమే
సాక్షి, అమరావతి: రైతు సేవా కేంద్రాలను (ఆర్ఎస్కే) సాగు విస్తీర్ణం ప్రాతిపదికన కుదించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ‘ఆర్బీకేలు అదృశ్యం..!’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్ఎస్కేల (పూర్వపు రైతుభరోసా కేంద్రాలు–ఆర్బీకే) హేతుబద్ధీకరణ ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయాల విభాగం పర్యవేక్షిస్తుందని ప్రకటించింది. గతంలో జనాభా ప్రాతిపదికన ఏర్పాటు.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జనాభా ప్రాతిపదికన ప్రతీ రెండువేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుచేశారని, వీటికి అనుబంధంగా గ్రామస్థాయిలో మొత్తం 10,778 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటుచేశారని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఆ సమయంలో సాగు విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకోలేదని, ఈ కారణంగా కొన్ని ఆర్ఎస్కేలు 100–2,500 ఎకరాల పరిధితో ఏర్పాటయ్యాయని తెలిపింది. వీటి ద్వారా రైతులకు కావాల్సిన సాగు ఉత్పాదకాలతో పాటు రైతుసేవలన్నీ అందించేవారని.. కానీ, ప్రస్తుతం సాగు విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్ధీకరణ (కుదింపు) చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ పేర్కొంది. సాగు ఉత్పాదకాల పంపిణీ నిలిపివేత నిజమే2020 మే 30 నుంచి గత ప్రభుత్వ పాలనలో రైతులకు కావలసిన ఎరువులు, సబ్సిడీ నాన్ సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు, ఆక్వాఫీడ్, సీడ్, సంపూర్ణ దాణా వంటి సాగు ఉత్పాదకాలన్నీ ఆర్ఎస్కేల ద్వారానే పంపిణీ జరిగేవని వ్యవసాయ శాఖ ఆ ప్రకటనలో వివరించింది. ప్రస్తుతం వాటిల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిగా రైతులకు విస్తరణ సేవలు, సాంకేతిక సూచనలు, సలహాలందించేందుకు ఉపయోగిస్తున్నామని.. ఈ కారణంగానే ఆర్ఎస్కేల ద్వారా సాగు ఉత్పాదకాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొంది. వీటిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ద్వారా చేయాలని, తద్వారా వాటిని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. -
ప్రతి రైతుకూ గుర్తింపు సంఖ్య
సాక్షి, అమరావతి: రైతు (ఫార్మర్) రిజిస్ట్రీ అమలు ప్రక్రియ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. తొలి రోజు 63 వేల మందికి విశిష్ట సంఖ్య (యూసీ) జారీ అయినట్లు సమాచారం. ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికీ గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతీ రైతుకు 11 నెంబర్లతో యూనిక్కోడ్ (యూసీ)ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది భూ యజమానులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనాకాగా, వెబ్ల్యాండ్ డేటా ప్రకారం 60 లక్షల మంది రైతులున్నట్టుగా గుర్తించారు. ఫిబ్రవరి 25వ తేదీలోగా 25 లక్షల మందికి, మార్చి 25వ తేదీలోగా మిగిలిన 35 లక్షల మందికి ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్లు జారీ చేయనున్నారు. ప్రస్తుతం భూ యజమానులకు మాత్రమే.. ప్రస్తుతం భూ యజమానులకు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతోంది. తొలుత పీఎం కిసాన్ లబ్దిదారులకు ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్లు జారీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన భూ యజమానులకు జారీ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు పొందాలంటే భూ యజమానులు తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కావాల్సిందే. కాగా తమకు అవకాశం ఇవ్వలేదని కౌలురైతులు, అటవీ , దేవాదాయ భూ సాగుదారులు ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రయోజనాలు ఎన్నో.. ప్రతీ రైతుకు జారీ చేసే యూనిట్ ఐడీకి ఆయా రైతులు సీజన్లో పొందే సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటి పథకాలను అనుసంధానం చేస్తారు. ఇలా తయారైన ఫార్మర్ రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ, ఆధార్ బేస్డ్ అథంటికేషన్, పీఏం కిసాన్ వంటి డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్స్కు సైతం అనుసంధానం చేస్తారు. కౌలురైతులతో పాటు ల్యాండ్ లెస్ లేబరర్స్ సైతం ఈ రిజిస్ట్రీలో తమ ఆధార్ నెంబర్ల ఆధారంగా పేర్లను నమోదు చేసుకోవచ్చు.ఈ ఐడీని ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ లింకేజ్తో కూడిన ఆరి్ధక సేవలను పొందవచ్చు. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ ఐడీ ఉపకరిస్తుంది. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.రిజిస్ట్రీ ఎలా... రిజిస్ట్రీ కోసం ఏపీఎఫ్ఆర్అగ్రిస్టాక్ (ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ) అనే వెబ్సైట్ను రూపొందించారు. దీన్ని వెబ్ల్యాండ్, గిరిభూమి తదితర భూ సంబంధిత వెబ్సైట్లతో అనుసంధానించారు. ఈ వెబ్సైట్లో లాగిన్లోకి వెళ్లి రైతు ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత రైతుకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది.రెండోసారి ఓటీపిని ఎంటర్ చేసిన తర్వాత రైతు వివరాలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత ఆ రైతుకు గ్రామంలో పొలం ఉన్నట్టయితే ఆటోమెటిక్గా ల్యాండ్ డిటైల్స్ డిస్ప్లే అవుతాయి. ఆ సర్వే నెంబర్లను సెలక్ట్ చేసి సబ్మిట్ చేయగానే రైతుకు మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైతుకు 11 సంఖ్య ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్తో కూడిన మెస్సేజ్ రైతు మొబైల్కు వెళ్లడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. -
సన్న.. అన్నిటికన్నా మిన్న!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు రికార్డు సృష్టిస్తోంది. యాసంగిలో సాగవుతున్న వరిలో 60శాతానికిపైగా సన్న రకాలే ఉన్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అనుకూలమైన వాతావరణం, నీళ్లు అందుబాటులో ఉండటం, సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నాల సేద్యం జోరందుకుందని వెల్లడించాయి. ఫిబ్రవరి తొలివారానికల్లా రాష్ట్రంలో 49లక్షల ఎకరాలకుపైగా వరి సాగు మొదలైందని... ఇందులో 60శాతానికిపైగా అంటే 30 లక్షల ఎకరాల మేర సన్న రకాలే సాగవుతున్నట్టు అంచనా వేశాయి. రాష్ట్రంలో సాధారణంగా ఖరీఫ్లో సాగయ్యే వరిలో 50 శాతం వరకు, రబీలో 10–15 శాతం వరకు సన్న రకాలు ఉంటాయి. ఇప్పుడు రికార్డు స్థాయిలో, అదీ యాసంగిలో 60శాతం దాకా సన్నాలే సాగవడం గమనార్హం. ఉత్తర తెలంగాణలో గణనీయంగా..: కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాలతోపాటు మెదక్, నిజామాబాద్లలోని కొన్ని ప్రాంతాల్లో యాసంగిలో సన్నాల సాగు చాలా ఏళ్లుగా నిలిచిపోయింది. ఈసారి ప్రభుత్వం గుర్తించిన 33రకాల సన్న ధాన్యం వంగడాల్లో.. తమ ప్రాంతానికి అనుకూలంగా ఉన్న వాటిని ఈ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో బీపీటీ–5204, కెఎన్ఎం–1638, ఎంటీయూ–1224తోపాటు జగిత్యాలలోని పొలాస పరిశోధన కేంద్రం ఉత్పత్తి చేసిన వంగడాలను ఎక్కువగా వేసినట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు. నిజామాబాద్లో తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048)ను సాగు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం కన్నా.. ఈసారి ఒక్క వరి పంటే అధికంగా సాగవుతోందని తెలిపారు. వరంగల్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో సాగు మందకొడిగా ఉందని పేర్కొన్నారు. మొత్తం వరి సాగులోనూ రికార్డు! వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం.. యాసంగిలో అన్ని రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలు. అందులో వరి విస్తీర్ణం 47.27 లక్షల వరకు ఉంటుంది. ఈసారి పరిస్థితులు అనుకూలించడంతో.. అన్ని పంటలు కలిపి మొత్తం సాగు 79.40 లక్షల ఎకరాలకు చేరుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి ఒక్కటే 65 లక్షల ఎకరాల వరకు ఉంటుందని, యాసంగికి సంబంధించి ఇది రికార్డు అని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములకే ‘రైతు భరోసా’ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో.. కొన్నేళ్లుగా పంటలు వేయని బీడు భూముల్లోనూ రైతులు సాగు చేపట్టినట్టు వివరిస్తున్నారు. గత యాసంగిలో 67.83 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకాగా.. అందులో వరి 52 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి అంతకన్నా 10– 13 లక్షల ఎకరాల్లో అధికంగా సాగవుతుందని భావిస్తున్నారు. ఇక ఇక రాష్ట్రంలో ఖరీఫ్కు సంబంధించి 23 లక్షల టన్నుల సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్గా చెల్లించింది. ఈ మేరకు రైతులకు రూ.1,154 కోట్లను రైతుల ఖాతాల్లో వేసింది. దీనితోపాటు సీఎం, మంత్రులు కూడా సన్నాల సాగు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం ఫలితమిస్తోందని వ్యవసాయవర్గాలు చెబుతున్నాయి. మొక్కజొన్న, వేరుశనగ పంటలు కూడా.. యాసంగిలో 7.18 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. ఇప్పటికే 6.94 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. మరో రెండు లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిర్మల్, వరంగల్ రూరల్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో మొక్కజొన్న ఎక్కువగా వేశారు. వేరుశనగ కూడా 2.57 లక్షల ఎకరాల అంచనాకుగాను.. ఇప్పటికే 2.32 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. జొన్న, కంది పంటల సాగు కూడా పెరిగింది. నీళ్లు అందుబాటులో ఉండటంతో.. రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీళ్లు అందుబాటులో ఉండటంతోనూ యాసంగి సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ప్రధాన చెరువుల కింద పొలాలన్నింటికీ యాసంగి వరి సాగుకు సరిపడా నీళ్లు ఉన్నాయని.. భూగర్భ జలాలు కూడా ఆశాజనకంగానే ఉండటం వరిసాగు పెరగడానికి కారణమని పేర్కొంటున్నాయి. -
రాష్ట్రానికి 17.31 లక్షల టన్నుల ఎరువులు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ –2025 సీజన్ కోసం రాష్ట్రానికి 17.31లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయిస్తూ కేంద్ర వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో జరిగిన ఖరీఫ్–2025 పంటల జోనల్ సదస్సులో ఈ మేరకు ప్రకటన చేసింది. సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా 55.25 లక్షల హెక్టార్లలో పంటలు సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 71 శాతం నేలల్లో నత్రజని, 17.56 శాతం నేలల్లో భాస్వరం, 13 శాతం నేలల్లో పొటా‹Ù, 38 శాతం నేలల్లో సూక్ష్మపోషకాలైన జింక్, 31 శాతం నేలల్లో ఐరన్, 21 శాతం నేలల్లో బోరాన్, 13 శాతం నేలల్లో మాంగనీస్ లభ్యత తక్కువగా ఉన్నట్టుగా గుర్తించామన్నారు. యూరియా, డీఏపీ ఎరువుల స్థానంలో నానో యూరియా, నానోడీఏపీ వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. -
ఎకరంలోపు రైతులకు ‘తొలి’ భరోసా
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకం అమల్లో భాగంగా తొలుత ఎకరం విస్తీర్ణం వరకున్న సాగు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేసింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 17.03 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.533 కోట్లకు పైగా నిధులు జమ చేసింది. గత నెల 26న రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని 27వ తేదీన 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రూ.593 కోట్లు జమ చేశారు. దీంతో ఇప్పటివరకు దాదాపుగా 21.45 లక్షల మంది రైతులకు రూ.1,126.54 కోట్ల మొత్తాన్ని రైతుభరోసా కింద అందజేసినట్లయింది. 72 లక్షల మందికి పైగా రైతులకు... రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే ప్రకారం కోటిన్నర ఎకరాలకు పైగా వ్యవసాయ యోగ్యమైన భూమిని రైతు భరోసాకు అర్హత గలదిగా తేల్చారు. 72 లక్షల మందికి పైగా రైతుల వద్ద ఉన్న ఈ భూములన్నింటికీ ఖజానాలో నిధుల లభ్యతను బట్టి రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖజానాలో ఉన్న నిధులను బట్టి విడతల వారీగా రెండు, మూడు ఎకరాల ప్రాతిపదికన రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఎకరం వరకు ఉన్న భూమికి రైతు భరోసా నిధులివ్వగా, ఎకరం పైబడి రెండు ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే ఈ పథకం కింద నిధులను జమ చేయనున్నారు. అయితే సరిగ్గా ఎప్పుడు మలివిడత నిధులు విడుదల చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. వ్యవసాయ యోగ్యం కాని భూములు 2.50 లక్షల ఎకరాలు! రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యం కాని భూములు అటు ఇటుగా రెండున్నర లక్షల ఎకరాలని అధికారులు లెక్క తేల్చినట్లు తెలిసింది. గత నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జరిపిన సర్వేలో 2.10 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కానివిగా గుర్తించగా, 21 నుంచి 24వ తేదీ వరకు సాగిన గ్రామ సభల్లో వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదుల అనంతరం వాటి విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలకు పెరిగినట్లు తెలిసింది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లో రియల్ వెంచర్లుగా, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములపై ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా పలు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో తొలుత వ్యవసాయ యోగ్యం కాని భూములుగా గుర్తించిన వాటిని తర్వాత సాగుకు పనికొచ్చేవిగా మార్చారు. ఈ కసరత్తు కోసం ప్రభుత్వం దాదాపు వారం రోజుల సమయం తీసుకుంది. కూడికలు, తీసివేతల తరువాత సాగు యోగ్యం కాని భూముల విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలుగా నిర్ధారించినట్లు తెలిసింది. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం రైతులకిచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.1,126.54 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటికే రైతుబంధు (కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో) కింద రూ.7,625 కోట్లు, రుణమాఫీకి రూ.20,616.89 కోట్లు, రైతు భీమాకు రూ.3000 కోట్లు చెల్లించాం. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఎన్నడూలేని విధంగా రూ.14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించాం. రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసర, కంది పంటలను మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కోనుగోలు చేశాం. యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.10,547 కోట్లు వెచ్చించి సేకరించాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కింద రూ.1,154 కోట్లు రైతులకు అందజేశాం. ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తాం. – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
సాగు యోగ్యం కాని భూములు 2.10 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం నుంచి ప్రారంభమైన ‘రైతు భరోసా’ పథకం కింద ఎన్ని లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలనే విషయంలో ప్రభుత్వానికో స్పష్టత వచ్చింది. రైతుల వద్ద ఉన్న పట్టా భూముల్లో వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్క తేలింది. రాష్ట్రంలోని 10,277 గ్రామాల్లో 2,10,864 ఎకరాల విస్తీర్ణంలోని భూములు సాగు యోగ్యమైనవి కావని గుర్తించారు. అంటే ఇవి ‘రైతు భరోసా’కు అర్హత లేనివని నిర్ధారించారన్నమాట. అయితే గ్రామసభల్లో వచ్చిన విజ్ఞప్తుల మేరకు వీటిలో 5 నుంచి 10 శాతం వరకు భూములను వ్యవసాయానికి యోగ్యమైనవిగా నిర్ధారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకటీ రెండురోజుల్లో పూర్తిస్థాయిలో వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్కను నిర్ధారించుకుని,ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వర్తింపజేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది. తర్జన భర్జనల అనంతరం తెరపైకి ‘యోగ్యత’ బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతుబంధు (పస్తుతం రైతు భరోసా) పథకం కింద గుట్టలు, కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, క్వారీలకు కూడా పెట్టుబడి సాయం అందించారని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే రైతుభరోసా ఎవరికి వర్తింప జేయాలనే విషయమై సిఫారసు చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఓ కేబినెట్ సబ్కమిటీని నియమించారు. ఈ మేరకు చర్చోప చర్చలు, కూడికలు, తీసివేతలు జరిపిన మంత్రులు.. తొలుత సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందజేయాలని, ఎకరాకు ఒక సీజన్కు రూ. 6,000 చొప్పున అందించాలంటూ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఏ సీజన్కు ఆ సీజన్లో సాగైన భూములకే రైతుభరోసా అమలు చేస్తే వ్యతిరేకత వస్తుందని భావించిన సీఎం రేవంత్రెడ్డి.. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు గత నాలుగేళ్లుగా సాగులో లేని భూముల వివరాలను క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులకు పంపించి సర్వే చేయాలని ఆదేశించారు. గత కొన్నేళ్లుగా సాగు చేయకుండా, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయడంతో పాటు కాలేజీలు, కోళ్ల ఫారాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములు, గుట్టలు, కొండలు, ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న భూముల ఫ్రీజింగ్ (రైతు పట్టా పాస్ పుస్తకాల్లో సాగు యోగ్యం కాని భూములుగా నిర్ధారించడం)కు కూడా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్తో కలిసి వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఫీల్డ్ సర్వే చేశారు. కోటిన్నర ఎకరాలకు రైతుభరోసా? రాష్ట్రంలోని 600 గ్రామీణ మండలాల్లోని 10,622 గ్రామాలకు గాను వ్యవసాయ యోగ్యం కాని భూములు ఉన్న 10,277 గ్రామాల్లో సర్వే నిర్వహించిన అధికారులు.. వాటిలో 2,10,864 ఎకరాలు వ్యవసాయ యోగ్యత లేని భూములని తేల్చారు. గతసారి ‘రైతుబంధు’ పథకం కింద 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. 2023 జూన్ 26న పదకొండో విడత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి జమ ప్రారంభం కాగా, ఆ సీజన్లో రూ.7,624 కోట్లను 68.99 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఈ లెక్కన 2 లక్షల పైచిలుకు ఎకరాలను వ్యవసాయ యోగ్యం కాని భూములుగా నిర్ణయిస్తే కోటిన్నర ఎకరాలకు రైతుభరోసా అందే అవకాశం ఉందని అధికారులంటున్నారు. హైదరాబాద్ శివార్లలో రియల్ వెంచర్లు, కళాశాలలు! హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రియల్ వెంచర్లుగా, కళాశాలలు, కోళ్ల ఫారాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నిర్వహించిన సర్వేలో.. రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ యోగ్యం కాని పట్టా భూములు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నట్లు తేలింది. ఈ జిల్లాలో 28,287 ఎకరాల సాగు యోగ్యం కాని భూములకు ఇప్పటివరకు 11 విడతల్లో రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందినట్లు అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా తరువాత యాదాద్రి భువనగిరి జిల్లాలోని 18,190 ఎకరాలను వ్యవసాయ యోగ్యత లేని పట్టా భూములుగా తేల్చారు. ఆ తర్వాత స్థానంలో మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా (14,444 ఎకరాలు), సంగారెడ్డి జిల్లా (12,174 ఎకరాలు), నల్లగొండ (12,040 ఎకరాలు) ఉన్నాయి. మెదక్, మహబూబాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, కామారెడ్డి, తదితర జిల్లాల్లో కూడా సాగుయోగ్యం కాని భూములకు రైతుబంధు అందినట్లు తేలింది. ఈ భూములన్నిటినీ ఇప్పుడు ఫ్రీజ్ చేయడంతో వాటికి రైతుభరోసా అందే అవకాశం లేదు. -
యాసంగిలోనూ వరిసాగే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్లోనూ రైతు లు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. సీజన్ ప్రారంభమై నెలరోజులు కాగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25.61 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగ య్యాయి. ఇందులోనూ ఆయా జిల్లాల్లో 26 శాతం నుంచి 50 శాతం వరకు వరి సాగవడం గమనార్హం.యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎక రాలు కాగా, పెరిగిన నీటివసతి, సన్నవడ్లకు రూ. 500 బోనస్తో 79 లక్షల ఎకరాల వరకు సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో అత్యధికంగా 63 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని భావి స్తోంది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ ఏర్పా ట్లు చేసింది. ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో పంటల సాగు పూర్తవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఏడు జిల్లాల్లో 75 శాతం పూర్తి కావొచ్చిన పంటల సాగుకూరగాయలు, జొన్న, వేరుశనగ, మొక్కజొన్న, శనగ, కందులు, పొగాకు వంటి పంటలు వేసే జిల్లాల్లో..ఇప్పటి వరకు 51శాతం నుంచి 75శాతం వరకు పంటల సాగు పూర్తయింది. » ఆదిలాబాద్, నిర్మల్, జనగాం, నిజామాబాద్, ఖమ్మం, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో పంటలు వేగంగా సాగవుతున్నాయి. » 25 శాతం కన్నా తక్కువగా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మెదక్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో పంటలు సాగయ్యాయి. » ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వరి సాగు ఆలస్యమవుతోంది. రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో వరిసాగు విస్తీర్ణం తగ్గనుండగా, ఆరుతడి పంటలు ఎక్కువగా సాగవనున్నాయి.» మరో 12 జిల్లాల్లో 25 శాతం కన్నా అధికంగా 50 శాతం లోపు పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. 3.65 లక్షల టన్నుల యూరియా వినియోగం..ఈ యాసంగి సీజన్లో 19.60 లక్షల మెట్రిక్ టన్నుల మేర వివిధ రకాల ఎరువులు అవసరమవుతాయని ప్ర భుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతి పాదనలు పంపగా, దశల వారీగా సరఫరా అయినట్టు మార్క్ఫెడ్ తెలిపింది. ఇప్పటి వరకు 3.65 లక్షల ట న్నుల యూరియా, 1.10 లక్షల టన్నుల డీఏపీ, 3.79 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 24వేల టన్నుల పొటాష్, 19వేల టన్నుల సూపర్ ఫాస్ఫేట్ను రైతులు కొనుగోలు చేశారు. 3.61 లక్షల టన్నుల యూరియా, 24వేల టన్నుల డీఏపీ, 2.15 లక్షల టన్నుల కాంప్లెక్స్, 38వేల టన్నుల పొటాష్ , 17వేల టన్నుల సూపర్ ఫాస్ఫేట్ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నట్టు మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కూలీల బాగే వ్యవసాయ బాగు
అనేక కారణాల వల్ల వ్యవసాయ కూలీలు ఊర్లో ఉండి పని చేసుకుని బతికే అవకాశాలు తగ్గుతున్నాయి. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మార్పులు పని అవకాశాలను తగ్గించాయి. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. వ్యవసాయేతర అవసరాల కొరకు భూసేకరణ జరిగి, భూమి వినియోగం మారినప్పుడు, దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధానికి తగిన ప్రభుత్వ మద్దతు, ఉపశమనం కలిగించే పథకాలు ఉంటేనే వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది.వ్యవసాయంలో 2018–19 నాటికి సగటు రోజువారీ ఆదాయం 27 రూపాయలు మాత్రమే. ఆర్థిక సర్వే 2021–22 ప్రకారం, 2019 నాటికి వ్యవసాయ కుటుంబ సగటు నెలవారీ ఆదాయం రూ.10,218. రైతు ఆదాయమే అంత తక్కువ ఉండగా, వ్యవసాయ కూలీ ఆదాయం అంతకంటే ఘోరంగా ఉన్నది. ఉపాధి హామీ పథకంలో సగటు రోజు కూలీ రూ.179.70 చూపించి రైతు కన్నా వాళ్లకు ఎక్కువ వస్తుంది అనుకుంటారు. పథకంలో అమలు అవుతున్న పని దినాలు చాలా తక్కువ. కూలీల వలసలు తగ్గకపోవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సగటు రైతు ఆర్థిక పరిస్థితే బాగాలేనప్పుడు సగటు రైతు కూలీ పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం లేదు. వ్యవసాయ కూలీలకు సంవత్సరం మొత్తం పని ఉండదు. కూలీ సరిపోక చాలా కుటుంబాలు పిల్లలను బడికి కాకుండా పనికి పంపిస్తున్నాయి. భారతదేశంలో బాల కార్మి కుల సంఖ్య వివిధ అంచనాల ప్రకారం 1.75 నుండి 4.4 కోట్లు.అప్రకటిత నిర్లక్ష్యం2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం వ్యవసాయ కార్మికుల సంఖ్య 2001లో ఉన్న 23.41 కోట్ల (12.73 కోట్ల సాగు దారులు, 10.68 కోట్ల వ్యవసాయ కూలీలు) నుండి 2011లో 26.31 కోట్లకు (11.88 కోట్ల సాగుదారులు, 14.4 కోట్ల వ్యవసాయ కూలీలు) పెరిగింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం, భారతదేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 45.5 శాతం మంది 2021–22 నాటికి వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. దేశంలోని శ్రామిక శక్తి ఉపాధిలో వ్యవసాయ రంగం వాటా 2020–21లో 46.5 శాతం ఉండగా, 2021–22 నాటికి 45.5 శాతానికి తగ్గింది. పల్లెలలో సాగుదారులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాలని గత 40 యేండ్ల నుంచి ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కొందరు అపర మేధావులు కూడా ఉత్పాదకత పేరు మీద, ఇంకేవో లెక్కల ఆధారంగా వ్యవసాయంలో ఇంత మంది ఉండొద్దు, తగ్గించే కార్యక్రమాలు చేపట్టమని ప్రభుత్వా నికి పదేపదే చెబుతుంటారు. వ్యవసాయ కూలీలను నిర్లక్ష్యం చేసే అప్రకటిత ప్రభుత్వ విధానం ఆ కోణం నుంచే వచ్చింది. రైతులు, కూలీల సంఖ్య తగ్గించాలనుకునేవారు వారికి ఇతర మార్గాల ఏర్పాటు గురించి ఆలోచనలు చేయడం లేదు.వ్యవసాయమే ఆధారంగా ఉండే పల్లెలలో వ్యవసాయం ఆదాయాన్ని బట్టి, అందులో ఉన్న మార్పులను బట్టి ఇతర వృత్తుల మీద ప్రభావం ఉంటున్నది. రోడ్లు, విమానాశ్రయం, పరిశ్రమలు తదితర వ్యవసాయేతర అవసరాలకు కొరకు భూసేకరణ జరిగి, భూమి ఉపయోగం మారినప్పుడు, ఆ ఊర్లో ఆ మేరకు వ్యవసాయం తగ్గుతుంది. దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. బహుళ పంటలు ఉంటే నిరంతరం పని ఉంటుంది. ఒక్కటే పంట ఉంటే విత్తనాలప్పుడు, కోతలప్పుడు తప్పితే పని ఉండదు. ఇదివరకు రైతులు పండించి కొంత తమ దగ్గర పెట్టుకుని మిగతాది మార్కెట్కు తరలించేవారు. ఇప్పుడు మొత్తం నేరుగా మార్కెట్కు తరలిస్తున్నారు. రైసు మిల్లులు అధునాతనం అయినాక వాటి సగటు సామర్థ్యం పెరిగింది, కూలీ పని తగ్గింది. తగ్గుతున్న పనికాంట్రాక్ట్ వ్యవసాయం, యాంత్రీకరణ, రసాయనీకరణ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం డిజిటలీకరణ అంటున్నది. సబ్సిడీలు ఇచ్చి తెస్తున్న ఈ మార్పులు ఖర్చులను పెంచడంతో పాటు వ్యవ సాయ కూలీలకు పని అవకాశాలు తగ్గించాయి. కూలీ రేట్లు పెరిగి నందువల్ల కలుపును చంపే రసాయనాల వాడకం పెరిగిందని చాలా మంది నమ్ముతున్నారు. అది పెస్టిసైడ్ కంపెనీల మార్కెట్ మాయ మాత్రమే. సగటు పంట ఖర్చు పెరుగుదలలో విత్తనాలు, ఎరువులు, కీటకనాశక రసాయనాలు వగైరా అన్ని పెరిగినాయి. వాటి ధరల మీద, నాణ్యత మీద, వాటి కొరకు అయ్యే రవాణా, ఇతర ఖర్చుల మీద రైతులకు నియంత్రణ లేదు. పట్టణవాసులు ఐస్క్రీమ్, సబ్బులు, సినిమా టికెట్ కొనేటప్పుడు, హోటల్ బిల్లు కట్టేటప్పుడు పెద్దగా ఆలోచించరు. కానీ, కొత్తిమీర కట్ట రేటు పెరిగితే తెగ బాధపడతారు. అట్లాగే, రైతు బయట సరుకుల రేటు, వాటి కొరకు చేసే అప్పులు, వాటి మీద వడ్డీలు, తన ప్రయాణం, సరుకుల రవాణా వగైరా ఖర్చులను లెక్కలోకి తీసుకోడు. కానీ ఊర్లో ఉండే కూలీకి ఎంత ఇవ్వాలి అని మాత్రం ఆలోచిస్తాడు. కూలీ గురించి రైతుకు ఉన్న చింత బయటి నుంచి కొనుక్కొస్తున్న వాటి మీద ఉండటం లేదు. ఎందుకంటే కూలీ ఒక్కటే తన పరిధిలో ఉంటుంది.వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు సంక్షోభంలో ఉన్నాడు. వ్యవసాయ కూలీలు సంక్షోభంలో ఉన్నారు. పాడి పశువుల పరిస్థితి భిన్నంగా లేదు. పల్లెలు మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఊర్లోకి రూపాయి రాకడ కంటే పోకడ ఎక్కువ అయినందున సగటు గ్రామీణ కుటుంబం అప్పులలో ఉన్నది. అందుకే వ్యవసాయ కూలీలు వలస పోతున్నారు. స్థానిక వ్యవసాయ కూలీలను కోల్పోతే వారి స్థానంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు శారీరక శ్రమ చేయగలుగుతారేమో కానీ రైతుకు పూర్తి మద్దతు రాదు. స్థానిక వాతా వరణాన్ని బట్టి ఉండే నైపుణ్యం, జ్ఞానం, అనుభవం ఉన్న స్థానిక వ్యవసాయ కూలీలు రైతుకు అనేక రూపాలలో మద్దతు ఇవ్వ గలుగుతారు. వలస వచ్చిన కూలీలు ఆఫీసుకు వచ్చి పోతున్నట్లు వ్యవహరిస్తారు. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధా నికి తగిన ప్రభుత్వ మద్దతు, సానుకూల విధానాలు, ఉపశమనం కలిగించే పథకాలు, సంక్షేమ నిధులు ఇస్తేనే భారత వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది. లేకపోతే, మన ఆహార భద్రత ఆందోళన కలిగించకమానదు.కూలీలు కేంద్రంగా విధానంఆధునిక వ్యవసాయంలో విపరీతంగా వాడుతున్న ప్రమాదకర కీటకనాశక రసాయనాల వల్ల, వాతావరణ మార్పుల వల్ల వ్యవ సాయ కూలీల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, పిడుగుపాటు వల్ల ప్రతి సంవత్సరం సుమారు 2,000 మంది చనిపోతున్నారు. భారతదేశపు మొట్టమొదటి వార్షిక ఉరుములు మెరుపుల నివేదిక (2019–2020) ప్రకారం, పిడుగుపాటు మరణాలకు ప్రధాన కారణం చెట్టు కింద నిలబడటం. ఇది మొత్తం పిడుగుపాటు మరణాలలో 71 శాతం. అత్యధిక సంఖ్యలో వ్యవసాయ కూలీలు ఆరు బయట పని చేస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆయా కుటుంబాలకు ఉపశమనం కల్పించటానికి ఒక్క అడుగు కూడా వేయలేదు. 2021లో భారతదేశం ప్రకృతి వైపరీత్యాల వల్ల దాదాపు రూ. 27 వేల కోట్ల నష్టం అయ్యిందని ఒక అంచనా. ఇందులో వ్యవసాయ కూలీల జీవనోపాధికి వచ్చిన నష్టం కలుపలేదు. వీరిని కూడా నష్టాల అంచనాలలో, నష్ట నివారణ చర్యలలో ముఖ్యంగా పరిగణించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా చెప్పింది. ఈ సంస్థ తయారు చేసిన విధి విధానాలు భారతదేశంలో అమలు చేయడానికి ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చెయ్యాలి. జాతీయ బడ్జెట్లో దీనికి అవసరమైన కేటాయింపులు చేయాలి. వ్యవసాయ కూలీలు కేంద్రంగా సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అనుకూల గ్రామీణ విధానాలు తయారు చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
కోటి ఎకరాలకు ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న రైతుభరోసా పథకం మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుత యాసంగి సీజన్కు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 6 వేల చొప్పున సాగు ‘యోగ్యమైన’భూములకు రైతుభరోసా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించి అందుకు అనుగుణంగా ఆర్థిక లెక్కలు వేసుకుంటోంది. సాగు ‘యోగ్యత’ప్రకారం సగటున రాష్ట్రంలో కోటి ఎకరాలకు రైతుభరోసా పరిమితం అయ్యే అవకాశం ఉంది. రైతుల వద్ద ఉన్న సాగుయోగ్యమైన పట్టా భూములనే పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. గణతంత్ర దినోత్సవం నాటికి పూర్తిస్థాయి లెక్కలుకట్టి ఎకరాకు రూ. 6 వేల చొప్పున యాసంగికి రూ. 5,500 కోట్ల నుంచి రూ. 6,000 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు అమలు.. రాష్ట్రంలో సాగుచేసే భూములు 1.48 కోట్ల ఎకరాల వరకు ఉన్నట్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖల నివేదికలను బట్టి తెలుస్తోంది. ఇందులో వానాకాలం సీజన్ను ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో అత్యధికంగా 1.36 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వరి, పత్తి, మొక్క జొన్నతోపాటు వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు రికార్డు ఉంది. ఇంతకు మించి ఏ సీజన్లోనూ పంటల విస్తీర్ణం పెరగలేదు. మరో 12 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు మొదలు అన్ని రకాల ఉద్యాన పంటలు సాగవుతుంటాయి. మొత్తం 1.48 కోట్ల ఎకరాల్లోనే ‘పార్ట్–బీ’కేటగిరీ కింద 18 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయానికి పార్ట్–బీని మినహాయించారు. అయినా 1.52 కోట్ల ఎకరాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. అంటే 1.30 కోట్ల ఎకరాల సాగుభూమితోపాటు మరో 22 లక్షల ఎకరాల సాగులో లేని భూమికి కూడా రైతుబంధు లభించింది. రెండు సీజన్లలో రైతుబంధు దక్కిన సాగులో లేని భూమి 97.51 లక్షల ఎకరాలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల రైతుబంధు పథకం లెక్కలను మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2023–24 సంవత్సరంలో ప్రభుత్వం రెండు సీజన్లకు కలిపి 97.51 లక్షల ఎకరాల్లోని సాగులో లేని భూమికి రూ. 4,875.62 కోట్లు చెల్లించిందని తెలిపారు. అంటే సగటున ఒక సీజన్కు 48.70 లక్షల ఎకరాలకుగాను రూ. 2,438 కోట్లు చెల్లించినట్లు చెప్పడం గమనార్హం. ఇందులో యాసంగి సీజన్లో సాగు చేయని భూముల లెక్కలు కూడా ఉన్నాయి. కొత్త పథకంలో వానాకాలంలో సాగై యాసంగిలో సాగు చేయని భూములకు కూడా రైతుభరోసా ఇవ్వనున్నారు. అయితే రెవెన్యూ రికార్డులను పరిగణనలోకి తీసుకొని ‘పార్ట్–బీ’కేటగిరీ భూములతోపాటు రాళ్లు, రప్పులు, కొండలు, గుట్టలు, రోడ్లు, నాలా మార్పిడి తదితర వివాదాస్పద భూములన్నింటినీ తొలగించి రైతుకు సంబంధించిన సాగు చేసే పట్టా భూములనే లెక్కతేల్చి పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనా ప్రకారం కోటి ఎకరాలలోపు భూములనే సాగుయోగ్యమైన పట్టా భూములుగా వ్యవసాయ శాఖ తేలి్చనట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ నుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి తుది జాబితాను ప్రభుత్వం రూపొందించనుంది. -
సంక్రాంతికే భరోసా!
ఏమిటీ సెల్ఫ్ డిక్లరేషన్?‘అయ్యా.. ఫలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నంబర్ 1లో ఎకరం పొలం ఉంది. నా ఇంటి ఆవరణతో కలిపి 100వ సర్వే నంబర్లో మరో ఎకరం చెలక ఉంది. ఇంటి జాగా 2 గుంటలు పోను మొత్తం ఎకరా 38 గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను. ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపినట్లు తేలినా.. ప్రభుత్వం తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటాను. దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా అందించగలరని మనవి’ రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతు ఎవరైనా భవిష్యత్తులో వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సిన ‘సెల్ఫ్ డిక్లరేషన్ ’ నమూనా ఇది. సాక్షి, హైదరాబాద్: ‘రైతుభరోసా’ అమలుకు ముహూర్తం ఖరారైంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా అమల్లో ఉన్న పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ స్థానంలో ‘రైతు భరోసా’ను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పథకం మార్గదర్శకాలపై చర్చించింది. తాజాగా రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో తుది కసరత్తు కూడా పూర్తి చేసింది. వానాకాలం, యాసంగి సీజన్లలో రైతు ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు అందేది. ఇలాఉండగా రైతు ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేసే ‘సెల్ఫ్ డిక్లరేషన్’ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కూడా మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా రైతు సాగు చేసిన భూమిని లెక్కగట్టనున్నారు. అలాగే వ్యవసాయాధికారి ఇచ్చే పంటల విస్తీర్ణంతో రైతు నుంచి తీసుకున్న ‘సెల్ఫ్ డిక్లరేషన్’ను సరిపోల్చుకున్న తర్వాతే పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. రైతే స్వయంగా తన పేరిట ఉన్న భూమి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయడంతో పాటు తాను ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేస్తున్నాననే విషయాన్ని ప్రకటించేలా చూడటం ద్వారా రైతుల్లో జవాబుదారీతనాన్ని పెంచవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. తద్వారా ప్రభుత్వ సొమ్ము దారి మళ్లకుండా రైతు సాగు చేసిన భూమికే కచ్చితంగా పెట్టుబడి సాయం అందుతుందని భావిస్తోంది. సాగు విస్తీర్ణంలో కచ్చితత్వం కోసమే అంటున్న సర్కారు రైతు అందించే సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల ఒక గ్రామంలో ఉన్న పట్టా భూమి ఎంత? అందులో సాగవుతున్న విస్తీర్ణం ఎంతో తెలియడమే కాకుండా రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు కూడా కచ్చితంగా తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి సీజన్లో ఇచ్చే పంటల సాగు విస్తీర్ణం లెక్కల్లో కచ్చితత్వం ఉండడం లేదని భావిస్తున్న ప్రభుత్వం.. రైతు భరోసా పథకం ద్వారా ఈ వివరాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఈ యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలు కాగా, రైతులు ఏకంగా 79.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఇందులో వరి 63.20 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 7.18 లక్షల ఎకరాల్లో సాగవుతుందంటూ ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ఇప్పుడు రైతు భరోసాకు రైతు సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన వల్ల ఈ పంటలకు సంబంధించి కచ్చితమైన వివరాలు తెలిసే అవకాశం ఉందని, అలాగే ఏ పంటల లోటు ఎంత ఉందో తెలుసుకుని తదనుగుణంగా ఆయా పంటల విస్తీర్ణం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పంట సాగు చేస్తేనే పెట్టుబడి సాయం అందుతుందనే నిబంధన వల్ల..గతంలో పునాసలో మాత్రమే సాగు చేసే రైతు యాసంగిలో కూడా తప్పకుండా ఏదో ఒక పంట పండించేందుకు ఆసక్తి చూపుతారని, తద్వారా యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరుగుతుందని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ఎంత పెద్ద రైతుకైనా భరోసా ఖాయం! రైతు భరోసా కింద ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.7,500 చొప్పున చెల్లించాలని భావిస్తున్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిని ఎంతకు పరిమితం చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 2 లేదా 3వ తేదీన ఉపసంఘం మరోసారి సమావేశమై దీనిపై చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే అనే అంశాన్ని కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఎంత పెద్ద రైతైనా నిరీ్ణత సీలింగ్ పరిధికి లోబడి సాగు చేసిన భూమికి రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. పీఎం కిసాన్ పథకంలో ఐదెకరాలు పైనున్న భూ యజమానికి పెట్టుబడి సాయం అందని విషయం విదితమే. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలతో కూడిన నివేదికను మంత్రివర్గ ఉప సంఘం 3వ తేదీలోపు ప్రభుత్వానికి అందజేస్తే 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. -
సాగు రైతుకే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసిన భూమిని శాస్త్రీయ పద్ధతిలో లెక్కగట్టి తదనుగుణంగా ‘రైతు భరోసా’ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. రైతులు భూమిని సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు ప్రతి సీజన్లో శాటిలైట్ సర్వే చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సహకారాన్ని తీసుకోనుంది. అదే సమయంలో సహాయ వ్యవసాయ అధికారుల (ఏఏఓలు)తో క్షేత్రస్థాయిలో పంటల లెక్కలు సేకరించనుంది. ఎన్ఆర్ఎస్సీ సాంతికేతిక పరిజ్ఞానంతో ఏ రైతు ఎంత భూమిలో ఏ పంట సాగు చేశాడనే వివరాలను తీసుకుని.. ఏఏఓలు ఇచ్చే నివేదికలతో సరిపోల్చుకొని రైతు భరోసాను జమ చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. తద్వారా సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులను వ్యవసాయం దిశగా ప్రోత్సహించినట్టు అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. దీని ప్రకారం రైతులకు ఖరీఫ్ (వానకాలం)లో వచ్చే పెట్టుబడి సాయానికి, రబీ (యాసంగి)లో అందే సాయానికి మధ్య కూడా తేడా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో రబీలో సాగు విస్తీర్ణం తక్కువగా ఉంటుండటమే దీనికి కారణం. మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తి రైతులకు ఆరేళ్లుగా అందుతున్న పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ స్థానంలో... కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ‘రైతు భరోసా’ పథకానికి మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తయింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల శాసనసభలో ప్రకటించారు కూడా. ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘రైతు భరోసా’ అమలులో ప్రభుత్వం అనుసరించనున్న విధివిధానాలపై చర్చ జరుగుతోంది. ఏడెకరాల సీలింగ్? ఇక ఒక రైతుకు గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలనే విషయంలో మంత్రివర్గ సమావేశంలో స్పష్టత రానుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి సాయం అందుతున్న నేపథ్యంలో... రాష్ట్ర పథకంలోనూ భూమికి సీలింగ్ విధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు సమాచారం. పదెకరాలలోపు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తొలుత అభిప్రాయం వ్యక్తమైనా.. మధ్యే మార్గంగా ఏడెకరాల సీలింగ్ను అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పీఎం కిసాన్ పథకంలో ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుకు పెట్టుబడి సాయం అందదు. రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ఎంత భూమి ఉన్నా గరిష్టంగా ఏడెకరాలకు రైతు భరోసా సాయం అందించాలని భావిస్తున్నట్టు సమాచారం. కుటుంబం యూనిట్గా తీసుకుంటే..? పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కుటుంబం యూనిట్గా తీసుకున్నారు. రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించి కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని.. ఒక కుటుంబం మొత్తానికి కలిపి రూ. 2లక్షల రుణమాఫీ చేసింది. ఇప్పుడు రైతు భరోసాకు కూడా కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంటే ఒక కుటుంబంలో ఎంత మంది పేర్ల మీద ఎంత భూమి ఉన్నప్పటికీ... ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఏడెకరాలకే ప్రభుత్వ సాయం అందేలా విధి విధానాలు రూపొందించినట్టు తెలిసింది. ఇక గత ఐదేళ్లలో వరుసగా రెండేళ్లపాటు ఆదాయ పన్ను చెల్లించినవారు కుటుంబంలో ఒక్కరున్నా కూడా.. ఆ కుటుంబానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వర్తించదు. ఈ విధానాన్ని రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తే పెద్ద సంఖ్యలో అర్హులు తగ్గిపోయే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పలు వర్గాలకు కోత! పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇచ్చే పెట్టుబడి సాయానికి కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అందులో ఒకటి ఆదాయ పరిమితి. ఆదాయపన్ను చెల్లించే వ్యాపారులు, కార్పొరేట్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులను పీఎం కిసాన్ సమ్మాన్నిధి నుంచి మినహాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి తీసుకురానున్న రైతుభరోసాలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది. సాగు చేసే నిజమైన రైతులకే సర్కార్ సాయం అందాలన్న లక్ష్యంలో భాగంగా వీరికి రైతుభరోసా తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించినట్టు తెలిసింది. అయితే ఇందులో నాలుగో తరగతి ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మినహాయించినట్టు సమాచారం. కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని.. కుటుంబంలోని ఇతర సభ్యులు ఐటీ చెల్లింపుదారులుగా ఉంటే కోత పెట్టాలనే యోచన ఉన్నట్టు తెలిసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయానికి అనర్హులు వీరే.. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు (జీతాలు పొందేవారు, పెన్షనర్లు) ఆదాయ పన్ను చెల్లించేవారు (గత ఐదేళ్లలో కనీసం వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించినవారు. ఒక్కరున్నా ఆ కుటుంబానికి పథకం వర్తించదు) డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్స్ వంటి నిపుణులు కుటుంబంలో ఎంత మంది రైతులు ఉన్నా సరే.. ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం రైతులు, పెట్టుబడి సాయంలో తగ్గుదల కొత్త మార్గదర్శకాలతో రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 30 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుండగా.. రైతుబంధు ద్వారా 1,48,70,045 ఎకరాలకు సంబంధించి 65 లక్షల మంది రైతులకు సాయం అందుతూ వస్తోంది. ఏటా సగటున రూ.13 వేల కోట్ల చొప్పున ఆరేళ్లలో రూ.80,453.41 కోట్లను ప్రభుత్వం అందజేసింది. ఇందులో రూ.21,283.66 కోట్లు సాగులో లేని భూములకు, గుట్టలు, రాళ్లతో కూడిన భూములకు అందాయని మంత్రి తుమ్మల అసెంబ్లీలో చెప్పారు. ఇలా సాగులో లేని భూములతోపాటు ప్రభుత్వం పెట్టనున్న ఆంక్షలతో.. ఏటా రూ.3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్ల మేర పెట్టుబడి సాయంలో కోతపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
వ్యవసాయ ప్రమాదాలపై విధానమేది?
వ్యవసాయ కార్మికులు అనేక రకాల ప్రమాదాలకు లోనవుతున్నారు. కరెంటు షాకులు, రసాయనాల (పురుగు మందుల) విష ప్రభావం, పాము కాట్లు, యంత్రాలు, పిడుగులు, వడదెబ్బ, ఇంకా అనేక ఇతర సహజ, అసహజ, మానవ తప్పిదాలు వ్యవసాయ కార్మికుల భౌతిక భద్రతను ప్రభావితం చేస్తున్నాయి. వాటి బారిన పడి కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. కానీ దేశంలో సంఖ్యాపరంగా అతి పెద్ద శ్రామిక శక్తిగా ఉన్న వ్యవసాయ రంగం పట్ల సర్కారుల పూర్తి స్థాయి నిర్లక్ష్యం కనబడుతుంది. వ్యవసాయ కూలీలకు ప్రమాదాలు ఎదురైతే రాజకీయ, సామాజిక స్పందన శూన్యం. చట్టాలు కూడా వీళ్ళ విషయంలో ఏమీ నిర్దేశించడం లేదు. వ్యవసాయ కార్మికులందరికీ వైద్య, ఆర్థిక సహాయంతో కూడిన ఉపశమన విధానాన్ని రూపొందించాలి.పరికరాలు, యంత్రాలు, రసాయనాలు, డ్రోన్లు, మోటార్లు, ‘రసాయన’ పూత విత్త నాలు వగైరాలను వ్యవసాయంలో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం దానికి తగిన శ్రేయో మార్గదర్శకాలు రూపొందించడం లేదు. ప్రమాదాల బారిన పడిన వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతుల సత్వర చికిత్సకు ఏర్పాట్లు లేవు. నష్టపరిహారం, ఆర్థిక మద్దతు వగైరా అంశాలు గురించి ఆలోచననే లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు రసాయన పిచికారీ చేస్తూ స్పృహ తప్పితే పొలంలో నుంచి గ్రామంలోకి తేవడానికి 3 గంటలు పట్టింది. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ప్రాణం పోయింది. వ్యవసాయంలో ప్రవేశపెడుతున్న ‘ఆధునిక’ పరికరాలు, రసాయనాలతో జరిగే ప్రమదాలకు సంబంధించి ప్రాథమిక వైద్య కేంద్రాలలో కనీస చికిత్స, మందులు లేవు. జిల్లా ఆసుపత్రిలోనే ఉండవు. విద్యుదాఘాతం కారణంగా ప్రతిరోజూ కనీసం ముప్పై మంది భారతీయులు చనిపోతున్నారని అంచనా.ఇందులో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలోనే జరుగుతున్నాయి. వీళ్లలో వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ప్రమాదకరమైన వృత్తి న్యూఢిల్లీలోని ‘ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ సహకారంతో ‘జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి’ ఆధ్వర్యంలో 2004–07 నుంచి 2012–13 మధ్య కాలానికి వ్యవసాయ ప్రమాద సర్వే జరిగింది. ఒక సంవత్సరంలో మొత్తం సంఘటనల రేటు లక్ష మంది కార్మికులకు 334 ప్రమాదాలు కాగా, మరణాల రేటు లక్ష మంది కార్మికులకు 18.3గా ఉంది. ఇది చాలా తక్కువ అంచనా. వాస్తవంగా వ్యవసాయంలో వివిధ ప్రమాదాల మీద, తదుపరి పర్యవసానాల మీద ఏ ఒక్క ప్రభుత్వ సంస్థ సమాచారం సేకరించడం లేదు. యాంత్రీకరణ, రసాయనీకరణ, డిజిటలీ కరణను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు వాటి ఉపయోగం వల్ల ఏర్పడుతున్న ప్రమాదాలు, సంభవిస్తున్న మరణాల పట్ల దృష్టి పెట్టడం లేదు.ఆధునికత పొంగిపొర్లే అమెరికాలోనే వ్యవసాయం ప్రమాదకర వృత్తిగా పరిణమిస్తున్న వైనాన్ని అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా వ్యవసాయ శాఖకు సంబంధించిన ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్’ మద్దతుతో చేసిన ఒక అధ్యయనం,ఐదేళ్ల కాలంలో జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తూ వ్యవసాయ పరిశ్రమ గతంలో అనుకున్న దానికంటే మరింత ప్రమాదకరమైనదని సూచించింది. 2015–19 వరకు 60,000 మందికి పైగా వ్యవసాయ సంబంధిత గాయాలతో అత్యవసర చికిత్స పొందారని వెల్లడించింది. గాయపడిన వారిలో దాదాపు మూడోవంతు మంది యువకులు.ట్రాక్టర్లు, డ్రోన్ల ప్రమాదాలుభారతదేశంలో మధ్యప్రదేశ్లో 1995–99 వరకు, సంవత్సరానికి ప్రతి 1000 మంది వ్యవసాయ కూలీలలో 1.25 మందికి పనిచేసే సమయంలో గాయాలు, దాదాపు 9.2% మరణాలు అయినట్లు ఒక అధ్యయనం కనుగొంది. అత్యధిక మరణాలు ట్రాక్టర్లు, పాము కాటు వల్ల జరిగాయి. మరణాలు, గాయాలతో ఆర్థిక నష్టం కూడా ఎక్కువే. ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లాలో వ్యవసాయంలో ప్రమాదాల కారణంగా ఏటా సుమారు రూ.6.19 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఒక అధ్యయనం అంచనా వేసింది. దేశంలో సగటున వ్యవసాయ క్షేత్ర ప్రమాదాలలో ట్రాక్టర్ ప్రమాదాలు అత్యధికం (పల్టీలు కొట్టడం, ట్రాక్టర్ నుండి పడిపోవడం మొదలైనవి) (27.7%). తర్వాత నూర్పిడి యంత్రాల వల్ల (థ్రెషర్) (14.6%), పిచికారీ (స్ప్రేయర్ /డస్టర్) వల్ల (12.2%), చెరకు క్రషర్ (8.1%), గడ్డి కట్టర్ (7.8%) వల్ల జరిగాయి. ఇప్పుడు కొత్తగా డ్రోన్లు వస్తున్నాయి. 2010–17 మధ్య కాలంలో అమెరికాలో 12,842 మందికి డ్రోన్ల వల్ల గాయాలైనాయి. భారతదేశంలో దాదాపు ఆరు లక్షలకు పైగా డ్రోన్లు ఉపయోగిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి వీటి వినియోగాన్ని ప్రోత్స హిస్తున్నది. వీటి వల్ల కలిగే ప్రమాదాల మీద మాత్రం ఏ సంస్థ సమాచారం సేకరించడం లేదు. పెరుగుతున్న డ్రోన్ల సంఖ్య చూస్తే, సంబంధిత ప్రమాదాలు పెరగడం అనివార్యంగా కనిపిస్తోంది.పని కోసం వెళ్తున్నప్పుడు జరిగే ప్రమాదాల గురించి ప్రభుత్వం, యాజమాన్యాల స్పందన మీద చట్టం నిశ్శబ్దంగా ఉన్నది. పని ప్రదేశంలో భద్రత కల్పించే బాధ్యత ఆ యా వ్యక్తులు, లేదా సంస్థల మీదనే ఉంటుంది. కానీ పని ప్రదేశం చేరకముందు జరిగే ప్రమాదాల బాధ్యత ఎవరి మీదా ఉండటం లేదు.అదే ‘యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్’ ప్రకారం, కార్మికుల ప్రయాణ సమయాన్ని కూడా పని సమయంగా పరిగణించాలి. అప్పుడు వారి భద్రత కూడా పని ఇచ్చేవారి మీద ఉంటుంది. ప్రయాణ సమయంలో కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరాన్ని ప్రపంచ కార్మిక సంస్థ ‘గ్లోబల్ స్ట్రాటజీ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్’ 2024–2030 నొక్కి చెబుతోంది.బాధితులకు ఉపశమనం కలిగేలా...2024 నవంబర్లో అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో ఆర్టీసీ బస్సు, ప్యాసింజర్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో 9 మంది వ్యవసాయ కూలీలు మరణించారు. 2019 ఆగస్ట్లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో రిక్షాను లారీ ఢీకొనడంతో 14 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, కొన్ని కుటుంబాలు వైద్య చికిత్స కోసం ఉన్న అరకొర ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తున్నది. సరైన సమయంలో చికిత్స లభించనందున దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రమాద బాధితుల వైద్యానికి బీమా నుంచి కూడా మద్దతు లేదు. రవాణా వాహన ప్రమాదాలలో వ్యవసాయ కార్మికులకు థర్డ్ పార్టీ బీమా ప్రయోజనం ఉండదు.వారి ప్రయాణం తరచుగా నాన్ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు సాధారణంగా బీమా ఉండదు. డ్రైవర్కు లైసెన్స్ కూడా ఉండదు. ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణించడం కూడా ఒక కారణం. ప్రమాదాల కారణంగా రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాలు ఇంకా పేదరికంలోకి నెట్టబడుతున్నాయి. అవయవాలను కోల్పోయి వికలాంగులైతే, ఆ కుటుంబం పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంటుంది. ప్రమాదాలలో మరణమే మేలు అనే విధంగా పరిణామాలు ఉంటున్నాయి.వ్యవసాయ కార్మికులందరికీ, ప్రత్యేకించి క్షేత్రస్థాయి కూలీలు, మహిళలపై దృష్టి సారించి, వైద్య, ఆర్థిక సహాయంతో కూడిన ఉపశమన విధానాన్ని రూపొందించాలి. ప్రతి గ్రామీణ ప్రమాదాన్ని నమోదు చేయాలి, దర్యాప్తు చేయాలి. ఇది జరగాలంటే, మోటారు వాహనాల రవాణా చట్టంతో సహా సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయవలసి రావచ్చు. తమ తప్పులేకుండా బలి పశువులయ్యే వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను మెరుగు పరచాలి.వ్యవసాయ మార్కెట్ సెస్, ఇతర పద్ధతుల ద్వారా ఒక ప్రమాద సహాయ నిధి ఏర్పాటు చేయాలి. వ్యవసాయ కూలీలకు కనీస బీమా కవరేజీ రూ.5 లక్షలతో ప్రారంభించి మున్ముందు పెంచాలి. రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
79,40,520 ఎకరాల్లో యాసంగి సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. మొత్తం 79,40,520 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో ఒక్క వరి పంటే 63,54,288 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 47,27,000 కాగా, ఈసారి అదనంగా 15.86 లక్షల ఎకరాల్లో సాగవుతుందని లెక్కగట్టింది. వరి తరువాత మొక్కజొన్న 7,18,100 ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 5,89,098 ఎకరాలు కాగా.. ఈసారి అదనంగా 1.30 లక్షల ఎకరాల్లో సాగవుతుందని లెక్కలు వేశారు. స్వీట్కార్న్ (తీపి మొక్కజొన్న) కూడా 950 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు తెలిపారు. వీటి తరువాత స్థానంలో వేరుశనగ ఉంది. ఈ పంట సాధారణ సాగుకన్నా కొంచెం ఎక్కువగా 2,57,600 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. జొన్నలు 1,42,900 ఎకరాల్లో, మినుములు 49,250 ఎకరాల్లో, కుసుమలు 23,100 ఎకరాల్లో సాగు కానున్నట్లు ప్రతిపాదించారు. గత యాసంగి కన్నా అధికం.. గత సంవత్సరం యాసంగితో పోలిస్తే ఈసారి దాదాపు 12 లక్షల ఎకరాలకుపైగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 2023 యాసంగిలో 67,83,358 ఎకరాల్లో పంటలు వేయగా, అందులో వరి వాటా 55 లక్షల ఎకరాలు. మొక్కజొన్న, పప్పులు, చిరుధాన్యాలు, నూనె గింజలు తదితర అన్ని పంటలు కలిపి 12 లక్షల ఎకరాలకు పైగా సాగైనట్లు వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. గడిచిన వానాకాలం సీజన్లో సుమారు కోటి ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా, అందులో వరి ఒక్కటే 66.78 లక్షల ఎకరాల్లో వేశారు. వానాకాలం సాగుకు దాదాపు సమానంగా ఈసారి యాసంగిలో వరి సాగు ఉంటుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. పెరిగిన సన్నాల సాగు.. వానాకాలం సీజన్లో సన్నాల సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. సన్న వడ్లకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ప్రకటించడమే అందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. 2023 వానాకాలం సీజన్లో కేవలం 25.05 లక్షల ఎకరాల్లో (మొత్తం సాగులో 38 శాతం) సన్న రకం వరి పండించారు. 2024 వానాకాలం సీజన్లో ఏకంగా 40.55 లక్షల ఎకరాల్లో సన్న ధాన్యం వేశారు. ఈ నేపథ్యంలో యాసంగిలో కూడా సన్నాల సాగు గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. యాసంగిలో సాగుకు అనువైన వడ్ల రకాలను సీడ్ కార్పొరేషన్, ప్రైవేటు సీడ్ కంపెనీలు విడుదల చేయటంతో రైతులు ఎక్కువగా అటువైపే మొగ్గుచూపుతున్నారు. అందుబాటులో 30 లక్షల క్వింటాళ్ల విత్తనాలు యాసంగి సాగు కోసం 18,10,438 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, 30,11,119 క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. ఇందులో సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 52,850 క్వింటాళ్లు, ఎన్ఎస్సీ 27,308 క్వింటాళ్లు, ప్రైవేటు సంస్థలు 29,30,962 క్వింటాళ్లు అందుబాటులో ఉంచాయి. అలాగే యాసంగి సీజన్కు 19.60 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, యూరియా, ఎన్పీకే, ఎంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమాకు అనర్హులు
సాక్షి, అమరావతి: నిర్దేశించిన గడువులోగా ప్రీమియం చెల్లించకపోతే తాము సాగు చేసే పంటలకు బీమా పొందేందుకు రైతులు అర్హత కోల్పోతారని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం స్థానంలో ఈ ఏడాది నుంచి రైతులను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలు చేస్తున్నట్లు చెప్పారు. పంటల బీమా ప్రచార వారోత్సవాలను మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావుతో కలిసి ప్రారంభించారు. ఇన్సూరెన్సు కంపెనీలు తయారు చేసిన వాల్పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. మీడియాతో రాజశేఖర్ మాట్లాడుతూ..పంట రుణం పొందిన సందర్భంలో సంబంధిత బ్యాంక్ వారే ప్రీమియం వసూలు చేసి సదరు బీమా కంపెనీకి నేరుగా చెల్లిస్తారని చెప్పారు. బీమా వద్దనుకుంటే ప్రీమియం తగ్గింపు నిలిపివేయాలని రాతపూర్వకంగా బ్యాంక్కు సమరి్పంచాలన్నారు. రుణం తీసుకోని రైతులు తమ వాటా ప్రీమియం మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించి సచివాలయాలు, పీఏసీఎస్లు, పోస్టాఫీస్లు, కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్సీ)ల్లో నమోదు చేసుకోవాలన్నారు.దళారీలను నమ్మి మోసపోవద్దనన్నారు. రబీ సీజన్కు సంబంధించి ఇతర పంటలకు ఈ నెల 15గానూ, వరికి 31 లోగా ప్రీమియం చెల్లించాలని, లేకుంటే బీమా పొందేందుకు ఏమాత్రం అవకాశం ఉండదన్నారు. స్వచ్ఛంద నమోదు పద్ధతిపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలకు కేటాయించిన ఇన్సూ్యరెన్స్ కంపెనీలు, ఆయా జిల్లాలో నోటిఫై చేసిన పంటల వివరాలు, పంటల వారీగా కట్టాల్సిన ప్రీమియం శాతం, రైతులు చెల్లించాల్సిన వాటా, నమోదు చేయడానికి గడువు, తదితరాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ డైరక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంటలకు 2శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు తమ వాటా ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూ రికార్డులు, సీసీఆర్సీలు పొందిన రైతుల డేటాను జాతీయ పంటల బీమా పోర్టల్తో అనుసంధానం చేశామన్నారు. -
సామాన్యుడి బతుకు.. పెనం నుంచి పొయ్యిలోకి..
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పులు, తగ్గిన పంటల దిగుబడులు, అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు... సామాన్యుల వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిత్యం వినియోగించే బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏమాత్రం తగ్గకుండా పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఏం కొనేటట్టు లేదని.. ఏం తినేటట్టు లేదని వాపోతున్నాడు. దేశవ్యాప్తంగా 14 నెలల గరిష్టానికి నిత్యావసరాల ధరలు చేరుకున్నాయని ఇటీవలే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ స్పష్టం చేసింది. దేశంలో 70 రకాల పంటల సాగుకు అవకాశం ఉన్నప్పటికీ, కేవలం 20 నుంచి 25 రకాల పంటలనే ఎక్కువగా సాగు చేస్తున్నట్లు భారత వ్యవసాయ శాఖ గుర్తించింది. అందులో కొన్ని పంటలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయా వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలా దేశంలో గత పదేళ్లలో 22 రకాల సరుకుల ధరలు గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వం లెక్కలు వేసింది. మొత్తమ్మీద సగటు వినియోగదారుడు వెచ్చాల కోసం భారీగా వెచ్చించాల్సిన పరిస్థితి. కాగా, డిసెంబర్ 6న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణంపై సమీక్షించనుందని, ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కొంతమేర ఊరట దక్కుతుందని ఆశిస్తున్నారు. బియ్యం ధరలకు రెక్కలు బాస్మతీయేతర తెల్లబియ్యంపై ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం నెలరోజుల క్రితం రద్దు చేసింది. అలాగే పారా బాయిల్డ్ బియ్యంపై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించింది. ఆంక్షలు ఎత్తివేయడంతో దేశం నుంచి బియ్యం ఎగుమతులు పెరిగాయి. విదేశాలకు ఎగుమతి అవుతున్న తెల్ల బియ్యం, పారా బాయిల్డ్ రైస్లో భారత్ వాటా 45 శాతం కాగా, ఇందులో తెలంగాణ, ఏపీలే కీలకం. రాష్ట్రంలో మేలు రకం బియ్యం ధరలు క్వింటాలుకు రూ.6,500 నుంచి రూ.7,500కు చేరుకున్నాయి. ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, సోనా మసూరి, జైశ్రీరాం వంటి మేలు రకాల ముడి బియ్యం ధరలు రూ.7వేల పైనే ఉన్నాయి. స్టీమ్డ్ రైస్ క్వింటాలుకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు లభిస్తున్నాయి. మిల్లుల నుంచి కిరాణా దుకాణాలు, ప్రొవిజనల్ స్టోర్స్, భారీ మాల్స్ వరకు అన్ని చోట్ల ధరలు అటు ఇటుగా ఇలాగే ఉండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండుతున్న నూనె కేంద్ర ప్రభుత్వం ఇటీవలే క్రూడ్ పామ్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్పై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. అలాగే రిఫైన్ చేసిన పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్పై ఇప్పటికే ఉన్న 12.5 శాతం సుంకాన్ని 32.5 శాతానికి పెంచింది. దీంతో మార్కెట్లో రూ.90 లోపు లభించే లీటర్ పామాయిల్ రూ.130 వరకు చేరుకోగా, సన్ఫ్లవర్ నూనె ధరలు రూ.135 నుంచి రూ.150కి చేరాయి. సుంకం పెంచని వేరుశనగ, రైస్బ్రాన్, కుసుమ నూనె ధరలను కూడా ఆయా ఉత్పత్తి సంస్థలు విపరీతంగా పెంచడం గమనార్హం. కూర ‘గాయాలే’..! కూరగాయల ధరల్లో ఈ ఏడాది సగటున 30 శాతం వృద్ధి కనిపించింది. అందరూ రోజూ కూరల్లో తప్పకుండా వినియోగించే టమాట, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, వెల్లుల్లి ధరలు కొంతకాలంగా ఆకాశాన్ని అంటుకున్నాయి. నెలరోజుల క్రితం వరకు ఉల్లిగడ్డ, టమాట ధరలు ఏకంగా కిలో రూ.వందకు చేరాయి. ప్రస్తుతం ఉల్లి రూ.60 వరకు ఉండగా, టమాట ధరలు కొంత తగ్గినట్టు కనిపించినా, ఇప్పటికీ మేలు రకం రూ.50కి తక్కువ లేదు. క్యారట్ కిలో ఏకంగా రూ.120 వరకు ఉండగా, బీట్రూట్ రూ.80, ముల్లంగి రూ. 72, చిక్కుడు రూ.100, వంకాయలు రకాన్ని బట్టి రూ. 70–90 వరకు విక్రయిస్తున్నారు. క్యాప్సికమ్ రూ.90, బెండకాయ రూ.60, బీరకాయ రూ.70, బీన్స్ రూ.70, కాకర రూ.60, దోసకాయ రూ.60 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లు, రైతుబజార్లలో కొంత మేర తక్కువకు విక్రయించినప్పటికీ, చిల్లర వ్యాపారుల వద్ద ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ములక్కాడలు ఒక్కోటి రూ.20కి విక్రయిస్తుండగా, నిమ్మకాయలు కిలోకు రూ.120–140 వరకు ఉన్నాయి. ఆకుకూరల ధరలూ ఆకాశంవైపే చూస్తున్నాయి. కాగా, సబ్బులు, టూత్పేస్ట్, షాంపూలు, కాఫీ, టీ పౌడర్, సౌందర్య వస్తువుల ధరలు కూడా మూడు నెలలుగా పెరిగినట్లు తెలుస్తోంది. -
సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రతకు మరింత ఊతం
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను రెండు పథకాలు... పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజనగా హేతుబద్దీకరించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రతకు మరింత ప్రోత్సాహం ఇవ్వడమే లక్ష్యంగా ఈ రెండు భారీ పథకాలకు ఆమోద ముద్ర వేసింది. రూ.లక్ష కోట్లకుపైగా నిధులతో పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(పీఎం–ఆర్కేవీవై), కృషోన్నతి యోజన(కేవై)ను అమలు చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుస్థిర వ్యవసాయానికి ఊతం ఇవ్వడానికి, పీఎం–ఆర్కేవైవీ, ఆహార భద్రతలో స్వయం సమృద్ధి కోసం కృషోన్నతి యోజనను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రెండు పథకాల మొత్తం వ్యయం రూ.1,01,321 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.69,088 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.32,232 కోట్లు. పీఎం–ఆర్కేవీవైకి రూ.57,074 కోట్లు, కృషోన్నతి యోజనకు రూ.44,246 కోట్లు ఖర్చు చేస్తారు. దాదాపు 18 పథకాలను ఈ రెండు పథకాలుగా హేతుబద్దీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వీటిని అమలు చేస్తారు. » వంట నూనెల ఉత్పత్తిని భారీగా పెంచి, స్వయం సమద్ధి సాధించడానికి ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. రూ.10,103 కోట్లతో 2024–25 నుంచి 2030–31 వరకు ఈ కార్యక్రమం అమలు చేస్తారు. 2030–31 నాటికి దేశంలో నూనె గింజల ఉత్పత్తిని 69.7 మిలియన్ టన్నులకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నూనె గింజల సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లు పెంచాలని నిర్ణయించింది. » మరాఠి, పాళీ, ప్రాకతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఈ చరిత్రాత్మక నిర్ణయమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. భారతీయ భాషలకు ప్రాచీన హోదా ఇచ్చే విధానాన్ని 2004 అక్టోబర్ 12న కేంద్ర ప్రారంభించింది. ఇప్పటివరకు తమిళం, సంస్కతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ఈ హోదా లభించింది. »11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఉత్పాదక అనుసంధానిత బోనస్ చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 78 రోజులకు గాను మొత్తం రూ.2,028.57 కోట్లు చెల్లించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే శాఖ పనితీరును మరింత మెరుగుపర్చడానికి ప్రోత్సాహకంగా ఉద్యోగులకు ఈ బోనస్ చెల్లిస్తుంటారు. » చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
చెరువులకు జలకళ
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట/నాగార్జునసాగర్: భారీ వర్షాలతో చెరువులకు జలకళ సంతరించుకుంది. దీంతో ఈసారి పంటలకు నీటి సమస్య తలెత్తే అవకాశం లేదు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరుగుతోంది. కోటి పది లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి, నీటిపారుదల శాఖ మొత్తం 19 డివిజన్లుగా విభజించగా, వాటి పరిధిలోని చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్ ఇన్ చీఫ్లు ఇచి్చన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,176 చెరువులు ఉంటే.. అందులో 15,608 చెరువులు పూర్తిగా మత్తడి దుంకుతున్నాయి. 5,952 చెరువులు మాత్రం ఇంకా 50 శాతం కంటే తక్కువ నీరు ఉన్నట్టు నీటిపారుదలశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 75 నుంచి 100 శాతం మేరకు నిండిన చెరువులు 8,144 ఉన్నాయి. ఇవికాక 50–75 శాతం మేరకు నిండిన చెరువులు మరో 5,012 వరకు ఉన్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. వర్షాకాల సీజన్ ఈనెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ మధ్యలో పడే వర్షాలకు మిగిలిన చెరువులు కూడా పూర్తిస్థాయిలో నిండుతాయన్న ఆశాభావాన్ని నీటిపారుదలశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వర్షాలతో భూగర్భజల నీటిమట్టం కూడా పెరుగుతుందని, తద్వారా నీటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. 50 శాతంలోపు నిండిన చెరువుల్లోకి కూడా నీరు వచ్చి చేరితే, ప్రాజెక్టులు, రిజర్వాయర్లతోపాటు, అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నిండినట్టు అవుతుందని అంటున్నారు. మేడిగడ్డ వద్ద ఉధృతంగా గోదావరి మేడిగడ్డ వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ బరాజ్ నుంచి 9.02 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దాని ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుండగా, వచ్చిన వరదను వచ్చినట్టే వదిలేస్తున్నారు. శ్రీరాంసాగర్కు 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే.. దిగవనకు 2.40 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 4.72 లక్షల క్యూసెక్కులు వస్తుంటే.. దిగువకు అంతేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇక సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) బరాజ్లో నుంచి 7.23 లక్షల క్యూసెక్కుల నీరు, సీతమ్మసాగర్(దుమ్ముగూడెం) నుంచి 7.55 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. శాంతిస్తున్న కృష్ణమ్మ ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో నీటి ప్రవాహం లేకపోయినా.. క్యాచ్మెంట్ ఏరి యాల్లో పడిన వర్షంతో జూరాల నుంచి 2.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలంలోకి వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.16 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంటే.. దిగువకు పదిగేట్లు ఎత్తి 3.61 లక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. నాగార్జునసాగర్ డ్యాంలోకి 3.04 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటే.. అంతే మొత్తాన్ని ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు వదిలేస్తున్నారు. -
‘నేను ఇస్తున్న వివరాలన్నీ వాస్తవమే’
సాక్షి, హైదరాబాద్: ‘కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం నేను ఇస్తున్న నా కుటుంబ సభ్యుల వివరాలు వాస్తవం/సరైనవి. రుణమాఫీ పొందడానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినా లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు తేలినా లేదా పంట రుణమాఫీకి అర్హత లేదని నిర్ధారణ అయినా.. పొందిన రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి అంగీకరిస్తున్నాను. ఆ మొత్తం రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది..’ఇది రూ.2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతులు, రుణమాఫీ కోసం ఇవ్వాల్సిన అఫిడవిట్. ఇలా అఫిడవిట్ కోరడంతో పాటు రుణమాఫీ–2024 బ్యాలెన్స్ ఉన్న రైతు కుటుంబాలకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ జారీ చేసింది. రుణమాఫీ కాని రైతులను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. మార్గదర్శకాలకు రైతులు ఇవ్వాల్సిన అఫిడవిట్ను జత చేసింది. ఫొటో తీయాలి..సెల్ఫీ దిగాలి ⇒ పంట రుణం ఉన్న రైతు ఇంటిని ఎంఏవో తప్పనిసరిగా సందర్శించి, రైతు వెల్లడించిన కుటుంబ సభ్యుల వివరాలను ఆధార్ నంబర్తో సహా నమోదు చేసుకోవాలి. ⇒ ఎంఏవోతో సహా ఏ అధికారికీ ఒకటి కంటే ఎక్కువ మండలాలను కేటాయించకూడదు. మండల స్థాయిలో నియమితులైన అధికారి వివరాలను వెంటనే రుణమాఫీ విభాగానికి సమర్పించాలి. ⇒ ఎంఏవో రుణమాఫీ లాగిన్లలో కుటుంబ సభ్యుల వివరాలను అప్లోడ్ చేయడానికి మొబైల్ యాప్ అభివృద్ధి చేయడం జరిగింది. ⇒ మండలంలోని అన్ని బ్యాంకు బ్రాంచీల వారీగా కుటుంబ సభ్యులను నిర్ధారించి రుణం పొందిన రైతుల జాబితా ప్రదర్శించాలి. ⇒ రుణం పొందిన రైతు జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేయాలి. ⇒ జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేసిన తర్వాత ఇతర కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ⇒ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో పాటు వారి వయస్సు నమోదు చేయాలి. కుటుంబ పెద్దతో ఫొటో తీయాలి. ⇒ రైతు సమర్పించే అఫిడవిట్లో అతను అందించిన కుటుంబ సభ్యుల వివరాలు ఏ ప్రభుత్వ అధికారి అయినా లేదా పంచాయతీ కార్యదర్శి లేదా ఏఈవో లేదా ఏఏవో ధ్రువీకరించాలి. ⇒ రైతులు సమర్పించిన అఫిడవిట్ను యాప్లో అప్లోడ్ చేయాలి. ⇒ డేటా సేకరణ సమయంలో అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యులతో పాటు రుణం పొందిన రైతుతో ఎంఏవో సెల్ఫీ దిగి యాప్లో అప్లోడ్ చేయాలి. వివరాల సేకరణ షురూ రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్..బ్యాంక్ అకౌంట్లలో తప్పిదాలు, సాంకేతిక కారణాలతో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం వ్యవసాయశాఖ అధికారులు బుధవారం గ్రామాల్లో సర్వే చేపట్టారు. మండలం యూనిట్గా రైతుల వివరాలను సేకరిస్తున్నారు. అనేకచోట్ల వివరాలను సేకరిస్తున్నా రైతులు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. రూ.2 లక్షలకు పైన రుణం ఉన్న రైతులు రుణమాఫీ విషయంపై నిలదీస్తున్నారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న సొమ్ము బ్యాంకులో చెల్లించాలా వద్దా? అని అడుగుతున్నారు. దీనిపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోతున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని అన్నారం గ్రామంలో ఎస్బీఐ, గ్రామీణ వికాస్బ్యాంక్ సైట్లు ఓపెన్కాగా ఎన్డీసీసీ బ్యాంక్ సైట్ మాత్రం ఓపెన్ కాలేదు. గ్రామంలో 30 మంది రైతుల వివరాలను అప్లోడ్ చేశారు. కానీ ఎన్డీసీసీ బ్యాంక్ సైట్ ఓపెన్ కాకపోవడంతో 15 మంది రైతులు వెనుదిరగాల్సి వచ్చింది. ఇంకోవైపు రుణం తీసుకొని మృతి చెందిన రైతుల రుణమాఫీకి సంబంధించి, ఆధార్, బ్యాంక్ అకౌంట్ల నమోదులో తప్పిదాలను సరిచేయడం కోసం యాప్లో ఎలాంటి ఆప్షన్లు లేకపోవడంతో దీనిపై స్పష్టత కొరవడింది. ఇలాంటి వారికి సంబంధించి గ్రామంలో 11 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. -
రైతుబడి అగ్రి షో!
తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు రాజేంద్రరెడ్డి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 17, 18 తేదీల్లో నల్గొండలోని నాగార్జున గవర్నమెంటు కాలేజీ ఆవరణలో జరిగే తొలి వ్యవసాయ ప్రదర్శనలో వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీ, ఆక్వా రంగాలకు చెందిన 150 దేశ విదేశీ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు. సందర్శకులు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఉచిత పాస్లు పొందవచ్చు. ఇతర వివరాలకు.. rbagrishow.com28న అమలాపురంలో కొబ్బరి రైతుల సదస్సు..‘కలసి నడుద్దాం – కొబ్బరికి లాభసాటి ధర సాధిద్దాం’ నినాదంతో ఈ నెల 28 (బుధవారం) ఉ. 10 గం. నుంచి అమలాపురంలో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సును నిర్వహించనుంది. దేశం నలుమూలల నుంచి కొబ్బరి రైతులు ఈ సదస్సులో పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఇతర వివరాలకు.. 94906 66659, 95425 9966629 నుంచి హైదరాబాద్లో నర్సరీ మేళా..హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గల పీపుల్స్ ΄్లాజాలో ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 16వ అఖిలభారత నర్సరీ మేళా జరగనుంది. 140 సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు...98492 61710.15న తార్నాకలో సేంద్రియ సంత..గ్రామభారతి, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15న సికింద్రాబాద్లోని తార్నాకలో మర్రి కృష్ణ హాల్లో ఉ. 10 గం. నుంచి సా. 6 గం. వరకు బ్యాక్ టు రూట్స్ మూలం సంత పేరిట సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తుల సంతను నిర్వహించనున్నారు. ఇతర వివరాలకు.. 94908 50766, 63051 82620.17న హైదరాబాద్లో బయోచార్పై సెమినార్..హైదరాబాద్ యూసఫ్గూడలోని నిమ్స్మే ఆడిటోరియంలో ఈ నెల 17(శనివారం) ఉ. 9.30 నుంచి సా. 6 గం. వరకు బయోచార్ (కట్టెబొగ్గు)పై జాతీయ సదస్సు జరగనుంది. ్ర΄ోగ్రెసివ్ బయోచార్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, నిమ్స్మే, రెయిన్బో బాంబూ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 63051 71362.18న పెనుకొండలో..బయోచార్ (కట్టెబొగ్గు) ఉత్పత్తిపై ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్లోని పెనుకొండలో చార్ గోల్డ్ సంస్థ ఆవరణలో వర్క్షాప్ జరగనుంది. బయోచార్ నిపుణులు డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి, ప్రేమ్రాజ్ అవగాహన కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. వాట్సప్ – 92463 52018.11న సేంద్రియ చెరకు సాగు, 18న మట్టి సేద్యంపై శిక్షణ..‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘కర్షక సేవా కేంద్రం’ నిర్వహణలో హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో ఈ నెల 11,18 తేదీల్లో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 11 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ పద్ధతిలో చెరకు సాగు, చెరకుతో బెల్లం తయారీ విధానం’పై రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు శిక్షణ ఇస్తారు.18(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ సాగులో మట్టి ద్రావణంతో పురుగులు తెగుళ్ళ నివారణ ఎలా?’ అనే అంశంపై రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. హాజరుకాగోరే వారు తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 95538 25532, 70939 73999. -
దేశవ్యాప్తంగా పెరిగిన ఖరీఫ్ సాగు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వరి, పప్పులు, పెసర, రాగి, మొక్కజొన్న, నూనెగింజలు, చెరకు తదితర పంటలు కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు 904 లక్షల హెక్టార్లలో సాగైనట్లు ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 879.22 లక్షల హెక్టార్లలోనే రైతులు పంటలను సాగు చేశారని పేర్కొంది. అదేవిధంగా, గత ఏడాది 263.01 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా ఈ ఏడాది 276.91 హెక్టార్లలో సాగు చేశారు. గతేడాది ఇదే సమయానికి 99.71 లక్షల హెక్టార్లలో పప్పు «ధాన్యాలు సాగు జరగ్గా, ఈ ఏడాది 110.61 లక్షల హెక్టార్లకు పెరిగింది. వీటితో పాటు గతేడాది 174.53 లక్షల హెక్టార్లలో నూనెగింజల సాగవగా ఈసారి 179.69 లక్షల హెక్టార్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ముతక తృణ ధాన్యాలు, చెరకు సాగు కూడా పెరిగింది. సాగు పెరగడంతో పప్పు, నూనెగింజల ధరలు తగ్గొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. -
దేశంలో సాధారణ స్థితికి వరిసాగు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విస్తరించిన రుతు పవనాలు, జోరుగా కురుస్తున్న వర్షాలతో వరి సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరుకుంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి వరి 23.7 మిలియన్ హెక్టార్లలో సాగవగా, ఈ ఏడాది జూలై 27 నాటికి 21.5 మిలియన్ హెక్టార్లలో సాగైందని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ ఐదేళ్ల సగటుతో పోలిస్తే 2.2 శాతం మేర అధికమేనని తెలిపింది. ఈ ఏడాది మొత్తంగా 40.15 మిలియన్ హెక్టార్లలో వరి సాగు కానుందని అంచనా వేసింది. ఇక వేరుశెనగ, సోయాబీన్, పొద్దు తిరుగుడు వంటి నూనెగింజల సాగు గత ఏడాది కంటే 3.8 శాతం ఎక్కువగా, 17.16 మిలియన్ హెక్టార్లలో సాగయ్యాయని వివరించింది. పప్పుధాన్యాల సాగు సైతం 14 శాతం మేర పెరిగి, 10.2 మిలియన్ హెక్టార్లలో సాగైందని వెల్లడించింది. -
మాటకు కట్టుబడి మాఫీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ మాటే శిలాశాసనమని మరోసారి రుజువైందని అన్నారు. రైతుల రుణ మాఫీ పథకంలో భాగంగా గురువారం సచివాలయంలో తొలి విడతగా రూ. లక్ష వరకు మాఫీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఇది మరపురాని రోజు ‘నాడు కరీంనగర్లో సోనియాగాంధీ మాట ఇచ్చారు. అనంతరం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా, మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా, రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండుసార్లు మాట తప్పారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి రూ.12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రెండోసారి ప్రభుత్వంలో రూ.12 వేల కోట్లు మాఫీ చేస్తానని చెప్పి కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజలకిచ్చిన మాటను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో 2022 మే 6న వరంగల్లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రుణమాఫీ చేస్తామన్నారు. 2023 సెపె్టంబర్ 17న తుక్కుగూడాలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. వారిచ్చిన మాట ప్రకారమే నేడు సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను జమ చేస్తున్నాం. నా 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇది మరుపురాని రోజు. రుణమాఫీ చేసే భాగ్యం నాకు కలిగింది. కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9ని రుణమాఫీ కటాఫ్గా పెట్టాం. ఏ అవాంతరాలు లేకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం. ముందుగా ఈ రోజు రూ.లక్ష వరకు రుణ విముక్తి కల్పించాం. రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణ విముక్తి కలుగుతుంది. ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరతాం. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి..’అని సీఎం అన్నారు. రేషన్కార్డు ప్రాతిపదిక కాదు ‘కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్కార్డు తప్పనిసరిగా ఉండాలనే అపోహ çసృష్టిస్తున్నారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. పాస్ బుక్నే కొలబద్ద. దొంగలు చెప్పే దొంగ మాటలు నమ్మొద్దు. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. అందుకే పాసుబుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నాం. ప్రతి రైతు రుణమాఫీకి కావాల్సిన చర్యలు చేపడుతున్నాం. సమస్యలు తలెత్తితే బ్యాంకు అధికారులను సంప్రదించాలి. బ్యాంకు అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా రైతు. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు..’అని రేవంత్ చెప్పారు. త్వరలో వరంగల్లో రాహుల్గాందీతో సభ ‘గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సంక్షేమ కార్యక్రమాలకు రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వ అప్పులకు మిత్తీగా ప్రతి నెలా రూ.7 వేల కోట్లు చెల్లిస్తున్నాం. జీతాలు, పింఛన్ల కోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. రైతు రుణమాఫీలో దేశానికి తెలంగాణ మోడల్గా ఉండబోతుంది. 8 నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం. సవాల్ చేసిన ఆయనను రాజీనామా చేయమని మేం అడగం. ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని వారు గుర్తు పెట్టుకోవాలి. రైతు రుణమాఫీ సందర్భంగా రాహుల్గాంధీని ఆహా్వనించి వరంగల్లో బహిరంగ సభ నిర్వహిస్తాం. త్వరలో మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి ఆయన్ను ఆహ్వానిస్తాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర రైతులకు పెద్ద పండుగ: భట్టి రాష్ట్రంలో ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం ఆశ్చర్యంగా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇది పెద్ద పండుగ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయడంతో పాటు ఈ రోజు రైతు రుణమాఫీ అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి రూ.7 లక్షల కోట్ల అప్పుతో తమకు అప్పజెప్పినప్పటికీ రూపాయి రూపాయి పోగేసి రుణమాఫీ అమలు చేసి చూపిస్తున్నామని చెప్పారు. కాగా రైతు రుణమాఫీ పురస్కరించుకుని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాం«దీకి ధన్యవాదాలు తెలుపుతు సమావేశంలో తీర్మానం చేశారు. కార్యక్రమం చివర్లో కొందరు రైతులకు రుణమాఫీ చెక్కులు సీఎం పంపిణీ చేశారు. -
గడ్డినే కాదు, జీవులనూ చంపుతుంది!
ఒక ఉత్పత్తి గురించి అనేక దేశాలు గోస పడుతున్నాయి. అయినా దాని మీద శాశ్వత నిషేధం విధించడం లేదు. కలుపు సంహారక సమ్మేళనం గ్లైఫోసేట్ (గడ్డి మందు) వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు పెరుగుతున్నాయి. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం చాలా ప్రమాదకరం. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాలను తిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి. అయినా దీన్ని వినియోగం ఆపడం, ఉత్పత్తిని నిలిపివేయడం, అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. వివిధ దేశాల రాజకీయ సంకల్పం పెద్ద కంపెనీల గణనీయమైన లాబీయింగ్ శక్తి ముందు దిగదుడుపే అని అర్థమవుతోంది.2015లో గ్లైలఫోసేట్ నిషేధాన్ని ఆమోదించి, అమలుచేసిన మొట్టమొదటి దేశం శ్రీలంక. కానీ ఈ నిషేధాన్ని 2018లో పాక్షికంగా మార్చవలసి వచ్చింది. 2022లో పూర్తిగా ఉపసంహరించబడింది. 2014లో ఒక స్థానిక శాస్త్రవేత్త గ్లైలఫోసేట్ వలన ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్’ వస్తున్నదని పరిశోధించి చెప్పిన దరిమిలా శ్రీలంక నాయకత్వం దీని మీద దృష్టి పెట్టింది. 2015లో ఎన్నికైన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఆమోదించింది. ఈ నిషేధం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బౌద్ధ సన్యాసి రథనా థెరో మద్దతు కొరకు ఇచ్చిన వాగ్దానం. కానీ తర్వాత నిషేధంలో వెనక్కి తగ్గడం, తరువాత పూర్తిగా ఎత్తి వేయడం జరిగింది. ఈ లాబీయింగ్ వెనుక అమెరికా ప్రభుత్వం, బేయర్ కంపెనీ (అప్పట్లో మోన్శాంటో) ఉన్నదని అందరికీ తెలుసు. డిసెంబర్ 2023లో, నెలల తరబడి తర్జనభర్జనల తర్వాత, ఐరోపా కూటమి దేశాలలో కొన్ని నిషేధించాలని కోరినా, దీని లైసెన్స్ను పునరుద్ధరించాలని యూరోపియన్ కమిషన్ నిర్ణయించింది. మరో పదేళ్లపాటు వినియోగాన్ని ఆమోదించింది. ఆస్ట్రియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ వంటి కొన్ని యూరప్ దేశాలు కొన్ని ప్రాంతాల్లో, ఇళ్లల్లో దీని వాడకంపై పాక్షిక నిషేధాలనో, పరిమితులనో విధిస్తున్నాయి.గ్లైఫోసేట్ ఒక రసాయన ఉత్పత్తి. ఇదివరకు మోన్శాంటో, తరువాత దానిని కొన్న బేయర్ కంపెనీ అంతర్జాతీయ గుత్తాధిపత్య కంపెనీ. చాలా శక్తిమంతమైన ఐరోపా కూటమి కూడా ఈ కంపెనీ ఒత్తిడికి తలొగ్గి జీవరాశికి, మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన గ్లైఫో సేట్ వాడకం ఆపలేకపోయింది. సాంకేతిక, మార్కెట్, నియంత్రణ వ్యవస్థల మధ్య ఏర్పడిన ఒక సంక్లిష్టమైన పరస్పర అవగాహన వల్ల ఆధునిక వ్యవసాయంలో గ్లైఫోసేట్కు ప్రోత్సాహం లభించిందని ఒక ఆధ్యయనం చెబుతున్నది. ఇందులో 4 కీలక విషయాలు ఇమిడి ఉన్నాయి. (1) జన్యుమార్పు పంటల మీద ఉపయోగం కోసం గ్లైఫో సేట్ వినియోగం; (2) కొత్త వ్యవసాయ వినియోగాలను ప్రోత్సహించడం ద్వార ప్రపంచవ్యాప్త సాధారణ గ్లైఫోసేట్ మార్కెట్ పెరుగుదల; (3) గ్లైఫోసేట్ వాడకంతో మిళితం చేసే డిజిటల్ వ్యవసాయం, జీనోమ్ ఎడిటింగ్ వంటి కొత్త సాంకేతిక ప్రోత్సాహం; (4) కార్పొరేట్ మార్కెట్ శక్తి పెరుగుదల వల్ల వ్యవసాయ పరిశోధన కార్యక్రమాల్లో ప్రభుత్వ పెట్టుబడి తగ్గి హెర్బిసైడ్ రహిత కలుపు నియంత్రణ మీద పరిశోధనలు ఆగిపోవడం.మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలు ఆ మధ్య వరుసగా ఒక మూడు సంవత్సరాలు దీనిమీద 60 రోజులు పాటు నిషేధం ప్రకటించాయి. ఈ తాత్కాలిక నిషేధం ఉద్దేశ్యం చట్టవిరుద్ధమైన, హెర్బిసైడ్–తట్టుకునే బీటీ పత్తి విత్తనాలను ఉపయోగించకుండా అరికట్టడానికి అని చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం కూడా కాగితాలకే పరిమితం అయ్యింది. ఆ పరిమిత నిషేధ కాలంలో కూడా బహిరంగంగానే అమ్మకాలు జరిగాయి. పురుగు మందుల నియంత్రణ చట్టం, 1968 ప్రకారం రాష్ట్రాలు విష రసాయనాలను 60 రోజుల వరకు మాత్రమే నిషేధించవచ్చు. కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. వివిధ రాష్ట్రాలు కోరినా కేంద్రం నిషేధం గురించి స్పందించడం లేదు. కేరళ, సిక్కిం రాష్ట్రాలు మాత్రం కొన్ని అధికరణలను ఉపయోగించి శాశ్వత నిషేధం విధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి రాసి మిన్నకున్నాయి. ఇతర విషయాలలో అధ్యయనాలకు బృందాలను పంపే రాష్ట్రాలు మరి కేరళ, సిక్కిం ఎట్లా సాధించాయో తెలుసు కునే ప్రయత్నం చేయలేదు.2019–21 మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ అవగాహన కార్య క్రమాలు చేపట్టి, గ్లైఫోసేట్ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ రెండు లక్షల మంది సంతకాలతో కూడిన మెమోరాండంను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించింది. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. అనేక విషయాలలో ఆర్ఎస్ఎస్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపణ ఎదురుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, గ్లైఫోసేట్ మీద మాత్రం ఆ సంస్థ కోరిన నిషేధం విధించలేకపోతున్నది. రాజకీయ ఒత్తిడులలో ఉండే అధికార క్రమం ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. అక్టోబర్ 2020లో, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా మరియు పాన్ ఆసియా పసిఫిక్ సంయుక్తంగా ‘స్టేట్ ఆఫ్ గ్లైఫోసేట్ యూజ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి. దీని వాడకం విచ్చలవిడిగా ఉందని నివేదించాయి. దీని వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్ర భావాలు పెరుగుతున్నాయని పేర్కొంది. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం ప్రమాదకరం.ప్రజల నుంచి, సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో నిషేధించకుండా కేంద్ర ప్రభుత్వం 2020లో కొన్ని ఆంక్షలు ప్రకటించింది. దీని ప్రకారం పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్ల ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా దీన్ని పిచికారీ చేయరాదు. అంటే సాధారణ రైతులు ఉప యోగించరాదు. కేవలం రసాయన పిచికారి చేసే సంస్థల ద్వారానే ఉపయోగించాలని కొత్త నిబంధన తెచ్చింది. తదుపరి కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఈ ఆంక్షలను సవరించారు. శిక్షణ పొందిన వారు ఎవరైనా ఉపయోగించవచ్చు అని చెప్పారు. ఆ శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్ర పరిశోధన సంస్థకు అప్పజెప్పితే వారు కొన్ని ఆన్లైన్ తరగతులు నిర్వహించి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు.రైతులలో పూర్తి అవగాహన లేకపోవడం, పురుగుమందు / విత్తన కంపెనీల మార్కెట్ మాయాజాలం, కొరవడిన ప్రభుత్వ నియంత్రణ వంటి కారణాల వల్ల, రైతులు దీన్ని వాడుతున్నారు. రైతులు తాము కొన్నవి గ్లైఫోసేట్ తట్టుకునే విత్తనాలు అనుకుని, కాయ కాసిన తరుణంలో, గడ్డిని తొలగించటానికి దీన్ని వాడటం వల్ల, మొత్తం పంట మాడిపోయి నష్టపోయిన ఉదంతాలు ఉన్నాయి. దీని వాడకం మీద ఆంక్షలు ఉండడంతో, ప్రభుత్వం నుంచి పరిహారం కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. గ్లైఫోసేట్ పిచికారీ చేసిన గడ్డి అని తెలియక దాన్ని నోట్లో పెట్టుకున్న ఒక అమ్మాయి చనిపోయింది. అనేక విధాలుగా గ్రామాలలో అమాయకులు ఈ విష రసాయనాల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. పంట ఎండపెట్టడానికి ఓపిక లేని రైతులు పంట కోతకోచ్చే సమయానికి దీన్ని వాడు తున్నారు. దాని వల్ల మొక్క మాడుతుంది, చచ్చిపోతుంది. అట్లాంటి పంట వ్యర్థాలు విషపూరితం అవుతాయి. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాల్నితిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి.క్యాన్సర్ ప్రమాదాల గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంటూ మో¯Œ శాంటో (ఇప్పుడు బేయర్ యాజమాన్యంలో ఉంది)తో సహా గ్లైఫోసేట్తో సంబంధం ఉన్న రౌండప్ తయారీదారులపై అమెరికాలో వేలకొద్దీ కోర్టు వ్యాజ్యాలు దాఖలైనాయి. 2019 నాటికి ఇవి 42,700. ఇతర దేశంలో గ్లైఫోసేట్ మీద ఈగ వాలితే అమెరికా ప్రభుత్వం వాలిపోతుంది. అదే అమెరికాలో వేల కొద్ది వ్యాజ్యాలను ఆ కంపెనీ ఎదుర్కుంటున్నది.మానవాళికి, జీవకోటికి ప్రమాదకరంగా పరిణమించిన ఈ వ్యాపార వస్తువును నిషేధించలేని పాలనా వ్యవస్థలను, అందులోని లోపాలను అధ్యయనం చేయాలి. ఒక వ్యాపార వస్తువుని నియంత్రించలేని దేశాధినేతల బలహీనతలు ఇక్కడే తేలిపోతున్నవి. ప్రజా రోగ్యాన్ని దెబ్బ తీస్తూ, పర్యావరణానికి దీర్ఘకాల హాని చేసే రసాయనాల నియంత్రణ మీద ఒక వైపు అంతర్జాతీయ చర్చలు జరుగు తుంటే మన దేశంలో మాత్రం ఏ చర్యా లేదు. ఇది మారాలి. ఈ పరిస్థితి మారాలంటే మన రాజకీయం మారాలి. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
మాఫీ ‘లెక్క’ మారిందా?
సాక్షి, హైదరాబాద్: రైతుల పంట రుణాల మాఫీ అంశంలో గందరగోళం కనిపిస్తోంది. రుణమాఫీ ‘లెక్క’ తప్పిందని.. రైతులకు ఇవ్వాల్సిన మొత్తం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి విడతగా రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నామని, 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమకానున్నాయని కాంగ్రెస్ సర్కారు చేసిన ప్రకటన సందేహాలకు తావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ సర్కారు రూ.లక్షలోపు పంట రుణాల మాఫీకోసం రూ.19,198.38 కోట్ల నిధులు లెక్కతేల్చితే.. ఇప్పుడు రేవంత్ సర్కారు అదే రూ.లక్షలోపు రుణాల మాఫీకి కేవలం రూ.7 వేల కోట్లు అవుతున్నట్టు పేర్కొనడంపై రైతు సంఘాల నేతలు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఇస్తున్న పంట రుణాలు ఏటేటా పెరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. పైగా గత ఐదేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది కూడా. అయినా రుణమాఫీ సొమ్ము మూడో వంతుకు తగ్గడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లాలకు ‘మాఫీ’ రైతుల జాబితాలు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.లక్ష వరకు రుణమాఫీ సొమ్మును గురువారం రోజున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. 11.50 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7 వేల కోట్లు జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు రైతుల జాబితాను జిల్లాలకు పంపించింది. వీరంతా లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులే. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా అధికారులకు అందిన సమాచారం ప్రకారం.. రూ.లక్ష మాఫీ అవుతున్న రైతులు 459 మంది ఉన్నారు. మిగతావారికి అంతకన్నా తక్కువ రుణాలు ఉన్నాయి. గత సర్కారు రుణమాఫీ లెక్కలతో.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) హామీ ఇచ్చింది. ఇందుకోసం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు రూ.19,198.38 కోట్ల మేర అవసరమని తేల్చింది. అంతకుముందు 2014లోనూ అప్పటి టీఆర్ఎస్ సర్కారు రూ.లక్ష రుణమాఫీ ప్రకటించి.. 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్లు మాఫీ చేసింది. మరోవైపు ఈసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తం 39లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు సుమారు రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే.. 2018 నాటి రూ.లక్ష రుణమాఫీ కోసం రూ.19 వేల కోట్లకుపైగా అవసరమవగా.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అదే రూ.లక్ష వరకు రుణమాఫీ కోసం కేవలం రూ.7 వేల కోట్లనే లెక్క వేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఐదేళ్లలో భారీగా పెరిగిన పంట రుణాలు గత ఐదేళ్లలో పంట రుణాలు భారీగా పెరిగినట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నివేదిక స్పష్టం చేస్తోంది. 2020–21లో రూ.41,200 కోట్లు, 2021–22లో రూ.42,853 కోట్లు, 2022–23లో రూ.59,060 కోట్లు, 2023–24లో రూ.64,940 కోట్లు రుణాలు ఇచి్చనట్టు తెలిపింది. సర్కారు రుణమాఫీకి నిర్ణయించిన కటాఫ్ ప్రకారం చూస్తే.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రైతులు తీసుకున్న రుణాలు రూ.49,500 కోట్లు కావడం గమనార్హం. బ్యాంకర్లు చెప్తున్న వివరాల ప్రకారం ఏటా రైతుల నుంచి రుణాల రికవరీ దాదాపు 90శాతం వరకు ఉంటుంది. కానీ తాము గెలిస్తే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ 2022లోనే ప్రకటించిన నేపథ్యంలో.. 2023–24లో తీసుకున్న రుణాలను రైతులు చెల్లించి ఉండరని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంటే 2022–23లో తీసుకున్న రుణాల్లో కొంత మేరకు, 2023–24లో డిసెంబర్ వరకు తీసుకున్న రుణాల్లో చాలా వరకు చెల్లించకుండా ఉన్నాయని బ్యాంకుల సిబ్బంది చెప్తున్నారు. అంటే ఏ రకంగా చూసుకున్నా.. దాదాపు రూ.49 వేల కోట్ల మేరకు పంట రుణాల బకాయిలు ఉంటాయని అంచనా. రాష్ట్ర సర్కారు మాత్రం రూ.2 లక్షల వరకు రుణాల మాఫీ కోసం రూ.31 వేల కోట్లే అవసరమని అంచనా వేసింది. పీఎం కిసాన్ నిబంధనలు, పాస్బుక్కులు, రేషన్కార్డుల నిబంధనల వల్ల అర్హులైన రైతుల సంఖ్య బాగా తగ్గి ఉంటుందని.. మాఫీ సొమ్ము అందుకు తక్కువై ఉంటుందని రైతు సంఘాల నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ రూ.2 లక్షలు మాఫీ చేస్తామన్న సర్కారు.. ఇప్పుడు నిబంధనలు ఎందుకు పెడుతోందని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీకి నిధుల అన్వేషణలో సర్కారు! ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామన్న సర్కారు.. అందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం అన్నిరకాల మార్గాలను అన్వేíÙస్తోంది. నిధులు పూర్తి స్థాయిలో సమకూరకపోవడంతోనే మూడు దశల్లో మాఫీ నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కు చెందిన భూములు అభివృద్ధి చేసి, తనఖా పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే మర్చంట్ బ్యాంకర్ల నుంచి రుణాల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ను జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని డీసీసీబీలు, ప్యాక్స్కు మూలధనం సమకూర్చి బలోపేతం చేసుకుంటామని చెప్పి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రూ.5 వేల కోట్ల రుణం కోసం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. మద్యం డిస్టిలరీలకు బ్రూవరీస్ కార్పొరేషన్ చెల్లించాల్సిన బిల్లులను ఐదు నెలలుగా ఆపి ఉంచినట్టు తెలిసింది, ఈ సొమ్మును రుణమాఫీకి మళ్లించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ మొత్తం ఐదారు వేల కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు ఈసారి రైతుభరోసా కింద చెల్లించాల్సిన నిధులను కూడా రుణమాఫీకి మళ్లించినట్లు చర్చ జరుగుతోంది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకోగలిగిన రుణాలను కూడా ముందస్తుగా సేకరించడం ద్వారా రూ.ఐదు వేల కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. రుణాల మొత్తం భారీగా పెరిగినా.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31వరకు మొత్తం రూ.64,940 కోట్లు స్వల్పకాలిక పంట రుణాలు మంజూరు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కోసం గత ఏడాది డిసెంబర్ 9వ తేదీని కటాఫ్గా తీసుకుంది. రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి రూ.31 వేల కోట్లు అవసరమని లెక్కలు వేసింది. -
'రేషన్' ఉంటేనే మాఫీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీ రేషన్కార్డు ఉన్నవారికే అమలుకానుంది. ఆహార భద్రత కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులను తేల్చడానికి.. బ్యాంకుల్లో రైతుల రుణఖాతాలోని ఆధార్ను.. పట్టాదారు పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో, పీడీఎస్ (రేషన్) డేటాబేస్లోని ఆధార్తో అనుసంధానం చేయనున్నట్టు పేర్కొంది. అర్హులుగా తేల్చిన ఒక్కో రైతు కుటుంబానికి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్య ఉన్న పంట రుణాల బకాయిల్లో రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. తప్పుడు పత్రాలతో రుణమాఫీ పొందినట్టు తేలితే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు సోమవారం ‘పంట రుణ మాఫీ పథకం–2024’ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను తెలుగులో విడుదల చేయడం విశేషం. పథకం అమలు ప్రక్రియ, ఏర్పాట్లు చేసేదిలా.. ⇒ వ్యవసాయ శాఖ డైరెక్టర్ పంటల రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా ఉంటుంది. ⇒ వ్యవసాయశాఖ డైరెక్టర్, ఎన్ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ను నిర్వహిస్తాయి. ఈ పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ ఐటీ పోర్టల్లోనే.. ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్కు బిల్లులు సమర్పించడానికి, రుణమాఫీ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి. ⇒ ఈ పథకం అమలుకోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (బీఎస్ఐ) నియమించాలి. ఆ నోడల్ అధికారులు తమ బ్యాంక్ పంట రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి. ⇒ ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) నుంచి.. రిఫరెన్స్–1 మెమో, ప్రొఫార్మా– 1లో డిజిటల్ సంతకం చేసిన టేబుల్ను ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సీబీఎస్లో లేవు కాబట్టి.. ప్యాక్స్కు అనుబంధమైన సంబంధిత బ్యాంకు బ్రాంచ్, రిఫరెన్స్–2వ మెమో, ప్రొఫార్మా–2లో డేటాను డిజిటల్గా సంతకం చేసి సమర్పించాలి. ⇒ ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడమే.. అవసరమైతే వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఎన్ఐసీ డేటా వ్యాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి. ⇒ అర్హతగల రుణమాఫీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో (డీబీటీ పద్ధతిలో) జమ చేస్తారు. ప్యాక్స్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ, బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని ప్యాక్స్లో ఉన్న రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ⇒ ప్రతి రైతు కుటుంబానికి రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ మొత్తాన్ని జమ చేయాలి. ⇒ కటాఫ్ తేదీ నాటికి ఉన్న మొత్తం రుణం, లేదా రూ.2 లక్షలు.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ⇒ ఏదైనా రైతు కుటుంబానికి రూ.2 లక్షలకుపైగా రుణం ఉంటే.. రైతులు అదనంగా ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాతే రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబ సభ్యుల రుణ ఖాతాలకు బదిలీచేస్తారు. ⇒ రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న పరిస్థితులలో.. కుటుంబంలో మహిళల పేరిట ఉన్న రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలోని పురుషుల పేరిట ఉన్న రుణాలను మాఫీ చేస్తారు. వీరికి రుణమాఫీ వర్తించదు ⇒ పంట రుణమాఫీ పథకం ఎస్హెచ్జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్ఈసీఎస్లు తీసుకున్న రుణాలకు వర్తించదు. ⇒ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. ⇒ కంపెనీలు, సంస్థలు తీసుకున్న పంట రుణాలకు వర్తించదు. అయితే ప్యాక్స్ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. ⇒ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మినహాయింపుల నిబంధనలను.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ఆచరణాత్మకంగా అమలు చేయడం కోసం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటారు. మార్గదర్శకాల మేరకు బ్యాంకులు, రైతుల బాధ్యతలివీ.. ⇒ ప్రతి బ్యాంకు ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మాలో డేటాను ప్రభుత్వానికి సమర్పించాలి. ⇒ పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బీఎన్వో డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించినట్టు భవిష్యత్తులో గుర్తిస్తే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు ఉంటాయి. ⇒ ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినా, లేదా మోసపూరితంగా పంటరుణం పొందినట్టుగానీ, అసలు పంట రుణమాఫీకి అర్హులుకారని తేలినా.. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్కు అధికారం ఉంటుంది. ⇒ రైతుల రుణఖాతాల్లోని డేటా యదార్థతను నిర్ధారించేందుకు... సహకార శాఖ డైరెక్టర్, సహకార సంఘాల రిజి్రస్టార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ముందస్తు శాంపిల్ ప్రీఆడిట్ను చేపట్టాలి. అమలు అధికారికి ఆ వివరాలను అందజేయాలి. ⇒ రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఇబ్బందులపై ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో నెలకొల్పే సహాయ కేంద్రాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి అభ్యర్ధనను సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు పరిష్కరించి, దరఖాస్తుదారుకు వివరాలు తెలపాలి. -
కుటుంబం యూనిట్గా రుణమాఫీ!
సాక్షి, హైదరాబాద్: కుటుంబం యూనిట్గా పంటల రుణమాఫీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక కుటుంబంలోని వారి పేరిట బ్యాంకుల్లో పంట రుణాలు ఎంత ఉన్నా.. గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కసరత్తు పూర్తయిందని.. నేడో, రేపో మార్గదర్శకాలు విడుదల కావొచ్చని తెలిపాయి. ఒక కుటుంబాన్ని ఎలా లెక్కలోకి తీసుకోవాలన్న దానిపై అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. రేషన్కార్డుగానీ, గ్రామ పంచాయతీ రికార్డుగానీ, వ్యవసాయశాఖ వద్ద ఇప్పటికే ఉన్న డేటాను ఆధారం చేసుకొనిగానీ కుటుంబాలను అంచనా వేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అనంతరం ఒక రైతు కుటుంబానికి ఎన్ని బ్యాంకు ఖాతాలు, వాటిలో ఎన్ని పంట రుణాలు ఉన్నప్పటికీ.. మొత్తం రూ.2 లక్షల వరకే మాఫీ చేయనున్నారు. రుణాలు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం ఈ మాఫీ సొమ్మును విభజిస్తారు. ఒక కుటుంబం అంటే.. భర్త, భార్య, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్గదర్శకాలు విడుదలైన వెంటనే గ్రామాల వారీగా రైతుల జాబితా తయారు చేస్తారు. బ్యాంకుల అధికారులతో కలసి రుణాలున్న వారి జాబితా తయారు చేస్తారు. చివరగా గ్రామసభలో చర్చించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. పీఎం కిసాన్ నిబంధనల అమలు యోచన! వచ్చే నెల 15వ తేదీ నాటికి పంట రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్లలో రాష్ట్ర రైతులు తీసుకున్న రూ.2 లక్షల మేరకు పంట రుణాలను మాఫీ చేయనున్నారు. దాదాపు 47 లక్షల మంది రైతులకు దీనితో లబ్ధి జరుగుతుందని అంచనా. అయితే రుణమాఫీ కోసం పీఎం కిసాన్ పథకంలోని మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పీఎం కిసాన్ పథకంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారిని మినహాయించారు. అదే తరహాలో ఇప్పుడు రుణమాఫీని మినహాయించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆదాయ పన్ను చెల్లించే అందరినీ కాకుండా అధిక ఆదాయం ఉన్నవారిని మాత్రమే మినహాయించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరినీ మినహాయించకుండా.. అటెండర్లు వంటి చిన్నస్థాయి ఉద్యోగులకు రైతు రుణమాఫీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని.. మిగిలే మొత్తం ఎక్కువగా ఉంటేనే పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయాలని, లేకుంటే ఉదారంగానే రుణమాఫీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా పంటలు పండించే ప్రతి రైతుకు ప్రయోజనం కలిగించేలా పథకం అమలు జరుగుతుందని అధికారులు అంటున్నారు. బంగారం పెట్టి తీసుకున్న రుణాలు కూడా..! బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్బుక్ను జతచేసి, పంటల కోసం తీసుకున్న బంగారం రుణాలకు మాత్రమే రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలను మాఫీ నుంచి మినహాయించాలనే యోచన ఉన్నట్టు సమాచారం. గతంలోనూ ఇదే తరహా నిబంధనలు అమలు చేశారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లు, కో–ఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు (అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు సహా), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణాలు, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
సాగుభూమికే రైతుభరోసా ఇవ్వాలి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రైతుభరోసా విధివిధానా ల రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం కదిలింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో రైతులు, కౌలురైతులు, రైతుసంఘాల నేతలు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు 70 మందికి పైగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అంతేకాక లేఖ ద్వారా కూడా అభిప్రాయాలు తెలపొచ్చని మంత్రులు ప్రకటించడంతో పలువురు రైతులు లేఖలు అందించారు. సమావేశంలో మెజారిటీగా వెల్లడైన అంశాలిలా ఉన్నాయి. ⇒ సాగుచేసే వారికే రైతుభరోసా పథకం అమలు చేయాలి. నిజమైన రైతులు ఎవరనేది వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి జాబితా రూపొందించాలి. సాగు చేయని భూములకు గతంలో రైతుబం«ధు ఇచ్చారు. ఈ విధానానికి స్వస్తి పలికితే అర్హులైన, సాగు చేసుకునే రైతులకే రైతు భరోసా అందుతుంది. ⇒ రైతుబంధు పరిమితి లేకుండా ఎంత భూమి ఉన్నా ఇచ్చారు. అలా కాకుండా పదెకరాల వరకే రైతుభరోసా ఇవ్వాలి. అన్ని జిల్లాల్లో రైతుల నుంచి వచ్చే మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ⇒ సీజన్ ప్రారంభంలోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బంది పడతారు. ఈ సమయంలో రైతుభరోసా అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ⇒ బంజరు భూములు, బీడు భూములు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతుబంధు ఇచ్చారు. భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందింది. రైతుభరోసాలో ఈ భూములు, ఈ కేటగిరీకి చెందిన వారిని తొలగించాలి. ⇒ కౌలు రైతులకు ఉపయోగపడేలా రైతుభరోసా ఉండాలి. రైతుబం«ధు అందక, పంటనష్టం జరిగినా పరిహారం లేక.. ఇన్పుట్ సబ్సిడీ రాక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ఎంతో కొంతైనా రైతుభరోసా ఇవ్వాలి. లేదా సబ్సిడీపై విత్తనాలు అందించాలి. యంత్రలక్ష్మి పథకాన్ని పునరుద్ధరించి రైతులు, కౌలు రైతులకూ వ్యవసాయ పరికరాలు ఇవ్వాలి. ⇒ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కౌలు రైతులను అధికారికంగా గుర్తించారు. 2011లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమాన్ని పునరుద్ధరించి అర్హులైన వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. గ్రామసభలు నిర్వహించి మళ్లీ కౌలు రైతులను గుర్తించాలి. ⇒ ఒకటి, రెండు ఎకరాలున్న చాలామంది రైతుల భూములు ధరణిలో నమోదు కాలేదు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వీరికి పాత పాస్ పుస్తకాలు ఉన్నా.. ధరణిలో ఎక్కకపోవడంతో కొత్తవి రాలేదు. ఈ రైతులు రైతుభరోసా పథకాన్ని కోల్పోకుండా భూములను ధరణిలో చేర్చేందుకు రైతు సదస్సులు నిర్వహించాలి. ⇒ ఒకే భూమికి సంబంధించి ఇద్దరు, ముగ్గురు రైతుబంధు తీసుకున్నారు. వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మారినప్పుడు ఇలా జరిగింది. వీటిని నియంత్రిస్తే అర్హులైన ఎక్కువమంది రైతులకు రైతుభరోసా అందుతుంది. ⇒ విత్తన సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయాలి. గతంలో జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. పంటల బీమాను త్వరితగతిన అమలు చేయాలి. ⇒ ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు పట్టాలు పొందిన, పోడు పట్టాలు పొందకుండా ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతుభరోసా వర్తింపజేయాలి. -
ఉచిత పంటల బీమా కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2019కి ముందు ఉన్న పాత పద్ధతిలోనే పంటల బీమాను అమలుచేస్తామని వ్యవసాయ శాఖపై జరిగిన తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్రెడ్డి తప్పుబట్టారు. రైతుల భాగస్వామ్యంతో పంటల బీమా అమలుచేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో బీమా ప్రీమియం భారం భరించే స్థితిలో రైతుల్లేరని వారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేసినట్లుగానే రైతుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. రైతులపై భారం లేకుండా ఉచిత పంటల బీమా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50శాతం చొప్పున భరించాలన్నారు. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకూ ఉచిత పంటల బీమా అమలుచేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ బీమా సంస్థలొద్దు.. పంటల బీమా అమల్లో ప్రైవేటు, కార్పొరేట్ బీమా సంస్థలను పక్కన పెట్టి ప్రభుత్వ రంగ బీమా సంస్థలను అనుమతించాలన్నారు. ప్రైవేట్ బీమా కంపెనీలు తమ లాభాల కోసం రైతులకు జరిగిన నష్టాన్ని తక్కువచేసి చూపి రైతులకు పంటల బీమా చెల్లించకుండా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం కూడా తొలి మూడేళ్లూ తానే బాధ్యత తీసుకుని రైతులకు పంటల బీమా అమలుచేసిందని గుర్తుచేశారు.రెండేళ్లుగా కేంద్రం ఒత్తిడితో పంటల బీమాలోకి ప్రైవేట్, కార్పొరేట్ బీమా కంపెనీలను అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా కొన్ని పంటలకు బీమా పరిహారం అందక రైతులు నష్టపోయారన్నారు. కరువు, తుపాను వంటి విపత్తులతోపాటు వాతావరణ ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. పంట నష్టం అంచనాలో అధికారుల నివేదికల ఆధారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
వ్యవసాయానికి 64 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వాన్ని కోరింది. రుణమాఫీ, రైతు భరోసా, ఇతర పథకాల అమలు కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేయాలంటూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందజేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.64 వేల కోట్ల మేర అవసరమని పేర్కొంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టులో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం శాఖల వారీగా ప్రతిపాదనలను స్వీకరిస్తోంది.పథకాల వారీగా అవసరాలతో..: బుధవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా అధికారులు పథకాల వారీగా నిధుల అవసరాలను వెల్లడించారు. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు, రైతుభరోసా కోసం రూ.23 వేల కోట్లను ప్రతిపాదించారు. ఈ ఏడాది నుంచి అమలు చేయబోయే పంటల బీమాకు రూ.3 వేల కోట్లు కావాలని పేర్కొన్నారు. దీంతోపాటు రైతుబీమాకు రూ.1,500 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయ అనుబంధ విభాగాల కోసం మిగతా నిధులను కోరారు. ఆయిల్ పామ్ సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. దానికి దాదాపు వెయ్యి కోట్లు కావాలని కోరినట్టు సమాచారం.వ్యవసాయ యాంత్రీకరణ కీలకంగత పదేళ్లుగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీంతో కూలీలు దొరకడం కష్టంగా మారింది. కానీ ప్రభుత్వం నుంచి కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై అందే పరిస్థితి లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. బయట మార్కెట్లో కొనాలంటే.. రైతులు ఆ ధరలు భరించడం కష్టం. కొరత కారణంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. 2018 వరకు ప్రభుత్వం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ఇచ్చిందని.. ఆ తర్వాత పథకం నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నారు. -
గ్రామాల వారీగా రుణమాఫీ రైతుల జాబితా
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయా రైతుల జాబితాను బ్యాంకులతో కలిసి అధికారులు తయారు చేయాలని యోచిస్తోంది. అనంతరం గ్రామసభలో చర్చించి తుది జాబితా సిద్ధం చేస్తారని అధికారులు అంటున్నారు. పంట రుణమాఫీ మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలో మార్గదర్శకాలు ఖరారు చేయనున్న నేపథ్యంలో అందులో ఉండాల్సిన అంశాలపై వ్యవసాయశాఖ అధికారులు తలమునకలయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనాటికి పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ. 31 వేల కోట్లు ఖర్చు అవుతాయని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించిన సంగతి విదితమే. రుణమాఫీ మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని కూడా సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందులో ఎలాంటి అంశాలు చేర్చాలన్న దానిపై అధికారులు చర్చి స్తున్నారు. గతంలో రుణమాఫీ అమలు సందర్భంగా విడు దల చేసిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేస్తు న్నారు. దాదాపు అవే మార్గదర్శ కాలు ఉంటాయని వ్యవసాయ శాఖవర్గాలు అంటున్నాయి. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు. పాస్పుస్తకం జత చేసి బంగారు రుణాలు తీసుకున్న వాటికి మాత్రమే....అసలు, వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రైతు కుటుంబం అంటే..భార్య, భర్త, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే... వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకంతో కలిపి బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకం వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలకు ఇది వర్తించదని తెలిపారు. గతంలో ఈ తరహా నిబంధనలనే అమలు చేశారు. ఇప్పు డు కూడా వాటినే అమలు చేయనున్నారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు (అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్లతో సహా), గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణా లు, బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తారు. అయితే పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం అందులో ఉన్న అర్హతలను రుణమాఫీకి అమలు చేస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కొన్ని నిబంధనలను మాత్రం తీసుకుంటారని, పూర్తిగా దాన్నే రుణమాఫీ పథకానికి వర్తింపజేయరని అంటున్నారు. మార్గదర్శకాల్లో చేర్చాల్సిన అంశాల్లో ముఖ్యాంశాలు.. » రైతులకు రుణమాఫీ అందజేయడానికి అర్హులైన లబ్ధి దారుల డేటా సేకరణ, ప్రాసెసింగ్కు పోర్టల్ను అభివృద్ధి చేయాలి.» పంట రుణ బకాయిలున్న రైతుల జాబితాను సిద్ధం చేసి వాటిని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వాటిని చెక్ చేయాలి. రెండు లక్షల వరకు పరిమితమైన రైతుల తుది జాబితాను బ్యాంక్ బ్రాంచీలో సిద్ధం చేయాలి. అందుకు సంబంధించిన ఒక కాపీని జిల్లా కలెక్టర్కు పంపాలి.» అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకులు, బ్యాంకు శాఖల పంట రుణాలు పొందిన బంగారు రుణాలు మాఫీ చేయరు. అయితే ఆయా బ్యాంకులు గ్రామీణ బ్రాంచీలు ఉంటే అక్కడ తీసుకున్న బంగారు రుణాలు మాఫీ చేస్తారు. » కొంతమంది రైతులు ఒకే బ్యాంకుకు చెందిన ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు శాఖల నుంచి పంట రుణాలు తీసుకొని ఉండవచ్చు. అందువల్ల నకిలీ లేదా మల్టీపుల్ ఫైనాన్సింగ్ను తొలగిస్తారు. అందుకు జాయింట్ మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా మండల స్థాయిలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేస్తారు. రుణమాఫీకి అర్హులైన వారందరికీ వ్యవసాయ భూములున్నాయో లేదో ధ్రువీకరిస్తారు. » ఒక రైతు కుటుంబానికి వివిధ బ్యాంకు ఖాతాలు ఉన్నా, పంటరుణం మొత్తం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అర్హత ఉన్న మాఫీ మొత్తం కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం విభజిస్తారు. » తహసీల్దార్, ఎంఏఓ, ఎంపీడీఓలతో కూడిన మండల స్థాయి అధికారుల బృందం సంబంధిత గ్రామానికి చెందిన ఏఈఓ, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు రైతు వివ రాలు సేకరిస్తారు. ఆయా రైతుల సమగ్ర సమాచారాన్ని ధ్రువీకరిస్తారు. సామాజిక తనిఖీ చేస్తారు. గ్రామసభ నిర్వహించడం ద్వారా బ్రాంచి మేనేజర్ అన్ని అభ్యంతరా లను తీసుకుంటారు. అనంతరం బ్యాంకుల రైతుల తుది జాబితా ప్రకటిస్తారు. ఆ జాబితాను కలెక్టర్కు పంపిస్తారు. » జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకుల వారీగా, రైతుల వారీగా రుణమాఫీకి సంబంధించిన జిల్లా వివరాలు నమోదు చేస్తారు. దాన్ని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)కి పంపిస్తారు. దాన్ని ఐటీ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. బ్యాంకుల వారీగా, శాఖల వారీగా, గ్రామాల వారీగా రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలను వ్యవసాయశాఖ డైరెక్టర్కు పంపిస్తారు. » రుణాలు ఇచ్చిన బ్యాంకులే రుణమాఫీకి అర్హులైన లబ్ధిదారుల అర్హత కచ్చితత్వానికి బాధ్యత వహించాలి. » పంట రుణాన్ని మోసపూరితంగా తీసుకున్నట్టు లేదా రుణమాఫీకి అర్హులు కాదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని రైతు నుంచి ఒక హామీని వ్యవసాయశాఖ తీసుకోవాలి. -
రుణమాఫీకి పరిమితులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల రుణ మాఫీకి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. అనర్హులకు రుణమాఫీతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని.. అర్హులందరికీ పూర్తి న్యాయం జరిగేలా రుణమాఫీ ప్రక్రియ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రుణమాఫీ అంశంపై శుక్రవారం తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ఈ సమావేశంలోనే పూర్తిస్థాయిలో చర్చించి రుణమాఫీపై ఒక నిర్ణయానికి వస్తారని.. మార్గదర్శకాలకు ఒక రూపం ఇస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖలు పెద్ద ఎత్తున కసరత్తు చేశాయని సమాచారం. ధనికులు, ప్రముఖులను మినహాయిస్తూ.. సీఎం కార్యాలయ వర్గాలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల అంచనా ప్రకారం.. ధనికులకు రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్నా పీఎం కిసాన్ పథకం కింద.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్ పర్సన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఆదాయ పన్ను చెల్లించేవారిని మినహాయించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న రైతు రుణమాఫీలోనూ ఈ వర్గాలను మినహాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆదాయ పన్ను చెల్లించే ప్రతీ ఒక్కరినీ కాకుండా.. అధిక ఆదాయమున్న వారిని మాత్రమే మినహాయిస్తారని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అందరినీ కాకుండా.. అటెండర్లు వంటి చిన్నస్థాయి ఉద్యోగులకు రైతు రుణమాఫీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారని వివరిస్తున్నాయి. ఇలాంటి వారికి రుణమాఫీని మినహాయిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్తున్నాయి. ఇక రుణమాఫీకి కటాఫ్ తేదీని కూడా మంత్రివర్గ సమావేశంలోనే ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తేదీ, లేదా సోనియాగాంధీ పుట్టినరోజును ప్రామాణికంగా తీసుకునే ప్రతిపాదన ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు తేదీల్లో ఏదో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. భూసీలింగ్ ఏదైనా వర్తింపజేస్తారా? ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రైతులకు ఇచి్చన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు కూడా. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం? అందుకు తగ్గట్టుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులేమిటన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతోపాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులపై అధికారులు అధ్యయనం చేశారు. ఆ పథకాల ప్రయోజనాలు, అనుసరించిన విధివిధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయశాఖల అధికారులు ముంబై వెళ్లి మహారాష్ట్ర రుణమాఫీని అధ్యయనం చేసి వచ్చారు. ఏం చేసినా అసలైన రైతులకు మేలు జరిగేలా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతీ రైతుకు ప్రయోజనం కలిగించేలా విధివిధానాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. అయితే ధనిక రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉండదన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేసే ప్రతిపాదన ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రైతు భరోసాను ఐదు లేదా పదెకరాలకు పరిమితం చేసే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే రుణమాఫీకి కూడా అలాంటి పరిమితి విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇంకా తర్జనభర్జన రైతు రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి దాదాపు రూ.35 వేల కోట్లు కావాలని అధికారులు అంచనా వేశారు. కటాఫ్ తేదీ, షరతులను బట్టి ఆర్థికభారం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆర్థికభారం తగ్గించుకునేందుకు ఎక్కువ షరతులు విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా? అన్న సంశయం ప్రభుత్వంలో వ్యక్తమవుతున్నట్టు చెప్తున్నారు. ఉద్యోగులను మినహాయిస్తే వారి నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్న చర్చ జరుగుతోంది. అలాగే ఐదు లేదా పదెకరాలకే పరిమితి విధిస్తే.. మిగతా రైతుల నుంచి వ్యతిరేకత రావొచ్చని అంటున్నారు. షరతులు పెడితే ఆర్థికంగా పెద్ద మొత్తంలో మిగులు ఉండాలని.. అలాకాకుండా మిగిలేది తక్కువే ఉంటే షరతులు ఎక్కువగా పెట్టకపోవడమే మంచిదన్న అభిప్రాయం కూడా నెలకొంది. ఈ క్రమంలో ‘మినహాయింపుల’పై ప్రభుత్వం తర్జనభర్జన పడుతూనే ఉంది. మరోవైపు ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్మును సమకూర్చడం సాధ్యంకానందున.. విడతల వారీగా రుణమాఫీ జేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. -
అన్నదాత అడిగేదొకటి..మార్కెట్లో ఉన్నదొకటి..
సాక్షి, హైదరాబాద్: అధిక దిగుబడులు వచ్చే పత్తి విత్తనాల కోసం రైతులు కోరుతుంటే.. ఆ విత్తనాలు అందుబాటులో లేకుండా ఇతర కంపెనీల విత్తనాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. తమకు కావాల్సిన విత్తనాల కోసం రైతులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ క్యూలలో నిలబడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల రాస్తారోకోలు సైతం చేస్తున్నారు. డిమాండ్ ఉన్న విత్తనాలను సరఫరాలో చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోరుకునే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. డిమాండ్ ఉన్న విత్తనాలను కొందరు వ్యాపారులు బ్లాక్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. విత్తనాల కొరత లేదని చెబుతున్న అధికారులు... డిమాండ్ ఉన్న విత్తనాల కొరత విషయంలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రైతులు పెద్దగా కొనుగోలు చేయని విత్తనాలకు సంబంధించి ఆయా కంపెనీల నుంచి కొందరు అధికారులు వాటిని మార్కెట్లో ప్రోత్సహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఏ రకం విత్తనాలకు డిమాండ్ ఉంటుందో వ్యవసాయశాఖకు తెలుసు.. కానీ వాటిని మార్కెట్లో ఎందుకు అందుబాటులో ఉంచలేదో అధికారులు చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీజన్ ముంచుకొస్తున్నా...రుతుపవనాలు త్వరలోనే రాష్ట్రాన్ని తాకనున్నాయి. చినుకు పడితే చాలు రైతులు తక్షణమే పత్తి విత్తనాలు చల్లేస్తారు. ఇప్పుడు రైతులకు అత్యంత కీలకమైనవి పత్తి విత్తనాలే. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీజన్ ప్రారంభానికి ముందుగా అధికారులు ప్రణాళిక రచించలేదు. రాష్ట్రంలో ఈసారి 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని భావించారు. గురువారం నాటికి 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. అయితే, మిగతా ప్యాకెట్లు కూడా వచ్చే నెల 5 నాటికి జిల్లాలకు చేరతాయని, అందువల్ల కొరతే లేదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఇతర కంపెనీల విత్తనాలనూ కొనుగోలు చేసుకోవాలని పిలుపునిస్తున్న అధికారులు.. దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు నిలదీస్తున్నారు. దిగుబడి తక్కువ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. నకిలీ విత్తనాల ప్రవాహం...ప్రభుత్వం అవసరమైన పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో ఇదే అదనుగా భావించిన విత్తన దళారులు మూకుమ్మడిగా నకిలీ విత్తనాలను అన్నదాతకు అంటగడుతున్నారు. నిషేధిత హెటీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తెలంగాణ జిల్లాలకు తరలించారు. ప్రభుత్వం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినా నకిలీ విత్తనాల బెడద వేధిస్తూనే ఉంది. ఇదిలావుంటే, పచ్చిరొట్ట విత్తనాలను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచలేదు. 1.38 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే మొత్తం 1.41 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలైన డయాంచ, సన్హెంప్, పిల్లి పెసర విత్తనాలను అందుబాటులో ఉంచాలి. కానీ ఇప్పటివరకు కేవలం 79 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాలకు చేరాయి. వ్యవసాయశాఖ లోని ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లేమి ఈ సమస్యకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక ఉన్నతాధికారి ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాల ని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఆదేశిస్తుంటే... మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్లుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు ఇవ్వాలని చెబుతున్నారు. ఒక ఏఈవోను ఇద్దరు ఉన్నతాధికారులు వేర్వేరుగా ఆదేశిస్తూ మరింత గందరగోళపరుస్తున్నారని వ్యవసాయ ఉద్యోగుల సంఘం నేత ఆరోపించారు. ఐదో తేదీ నాటికి మిగతా పత్తి విత్తనాలుమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ఈ మేరకు ఆయన విత్తన కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లైతే, కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గతవారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని, అందువల్ల విత్తన కంపెనీలన్నీ ప్రణాళిక ప్రకారం మిగతా పత్తి విత్తన ప్యాకెట్లను జూన్ 5 కల్లా జిల్లాలకు చేరవేయాలని చెప్పారు. కొన్ని జిల్లాల్లో.. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీ విత్తనాలనే రైతులందరూ కోరుతున్నారని, అన్ని విత్తనాల దిగుబడి ఒక్కటేనని ఆయన వివరించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి కూడా అన్నారు. -
విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం సబ్సిడీ విత్తనాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పచ్చిరొట్ట, వేరుశనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధం చేశారు. గురువారం నుంచే విత్తనాలు కోరే రైతుల వివరాల నమోదు మొదలవగా, 20వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. జూన్ 5వ తేదీ నుంచి వరి, ఇతర విత్తనాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు ముందుగానే సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇండెంట్ మేరకు సేకరించిన విత్తనాలను మండల కేంద్రాల్లో నిల్వ చేశారు. అయితే.. పోలింగ్ ముగిసే వరకు పంపిణీ చేపట్టవద్దంటూ ఈసీ ఆంక్షలు విధించడంతో బ్రేకులు పడ్డాయి. పోలింగ్ ప్రక్రియ ముగియటంతో ఈసీ ఆంక్షలు సడలించింది. దీంతో విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కలిసి వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.కేవీకే, ఏఆర్ఎస్లలో ఫౌండేషన్, సర్టిఫైడ్ సీడ్రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), వ్యవసాయ పరిశోధనా స్థానాలు (ఏఆర్ఎస్) కేంద్రాల్లో 7,941.35 క్వింటాళ్ల వరి, 2,404.50 క్వింటాళ్ల వరి విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసింది. బ్రీడర్ సీడ్ కిలో రూ.77.80 చొప్పున, ఫౌండేషన్ సీడ్ (ఎన్డీఎల్ఆర్7) కిలో రూ.50 చొప్పున, సర్టిఫైడ్, నమ్మదగిన సీడ్ (ఎన్డీఎల్ఆర్–7) కిలో రూ.42 చొప్పున ధర నిర్ణయించి అందుబాటులో ఉంచారు. బీపీటీ 5204, 2270, 2782, 2595, 2846, 2841, ఎన్డీఎల్ఆర్ 8, ఎంటీయూ 1262, 1271, 1224, ఎంసీయూ103, ఆర్జీఎల్ 2537 వంటి ఫైన్ వెరైటీస్కు చెందిన ఫౌండేషన్ సీడ్ కిలో రూ.45, సర్టిఫైడ్ సీడ్ కిలో రూ.42, ఇతర వరి రకాల ఫౌండేషన్ సీడ్ కిలో రూ.40, సర్టిఫైడ్ సీడ్ కిలో రూ.38 చొప్పున ధర నిర్ణయించి రైతులకు అందుబాటులో ఉంచారు. కనీసం 25–30 కేజీల ప్యాకింగ్తో విత్తనం సిద్ధంగా ఉందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీనివాస్ తెలిపారు.రూ.450 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వంఖరీఫ్ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్దం చేశారు. వీటిలో ప్రధానంగా 2.26 లక్షల క్వింటాళ్లు వరి, 2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు, 50 శాతం సబ్సిడీపై చిరుధాన్యాలు, 40 శాతం సబ్సిడీపై వేరుశనగ, నువ్వులు, 30 శాతం సబ్సిడీపై అపరాల విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. వరి విత్తనాలకు మాత్రం జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పరిధిలోని జిల్లాల్లో క్వింటాల్కు రూ.1,000, మిషన్ పరిధిలో లేని జిల్లాల్లో క్వింటాల్కు రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విత్తన పంపిణీ కోసం రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రూ.195 కోట్లను సబ్సిడీ రూపంలో భరించనుంది.ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభంఖరీఫ్ సీజన్కు సర్టిఫై చేసిన విత్తనాలను సిద్ధం చేశాం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఆంక్షలు సడలించడంతో ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీకి చర్యలు చేపట్టాం. ఆర్బీకేల్లో రైతుల రిజిస్ట్రేషన్ మొదలైంది. – ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ సీడ్స్పంపిణీకి విత్తనాలు సిద్ధంసీజన్కు ముందుగానే సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనంతో పాటు అవసరం మేరకు ఏపీ సీడ్స్ ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్లలో వాటి నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. – చేవూరు హరికిరణ్, ప్రత్యేక కమిషనర్, వ్యవసాయ శాఖ -
క్రాప్లోన్ కట్టాల్సిందే...!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, బ్యాంకులు మాత్రం రైతుల నుంచి అప్పులు వసూలు చేస్తూనే ఉన్నాయి. నోటీసులు ఇవ్వడంతోపాటు అధికారులు రోజూ ఫోన్లు చేస్తూ చికాకు పెడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ వారి వేధింపులు ఆగడం లేదనడానికి సరస్వతి చెప్పిన సంఘటనే ఉదాహరణ. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రైతుభరోసా సొమ్మును కూడా అప్పు కింద జమ చేసుకున్నారు. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచే ప్రారంభం అవుతుందని, కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాలని, అప్పుడే కొత్త పంట రుణం ఇస్తామని చెబుతున్నాయి. మరోవైపు సహకార బ్యాంకులు కూడా రైతుల అప్పులను ముక్కుపిండి వసూలు చేస్తూనే ఉన్నాయి. వారు తాకట్టు పెట్టిన భూములను వేలం వేసేందుకు ఇప్పటికే అనేకమందికి నోటీసులు కూడా ఇచ్చాయి. భరోసా ఇవ్వని యంత్రాంగం...అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అయితే రూ. 2 లక్షల వరకు రుణం మాఫీ చేయాలంటే రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికిప్పుడు రుణమాఫీ మార్గదర్శకాలు కానీ, అందుకు సంబంధించిన ప్రక్రియ కానీ మొదలు పెట్టడం సాధ్యం కాదని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. అంటే జూన్ 4వ తేదీ వరకు కోడ్ అమలులో ఉన్నందున అప్పటివరకు రుణమాఫీపై ముందుకు సాగలేమని అంటున్నారు. అయితే అప్పటివరకు రైతులు బ్యాంకుల్లో కొత్త పంటరుణాలు తీసుకోవాలి. కానీ పాతవి ఉండటంతో కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులు చెప్పిన ప్రకారమే పాత అప్పులు చెల్లించాలని, అంతకు మించి తాము ఏమీ చేయలేమని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేశాక బ్యాంకులకు రైతులు చెల్లించిన సొమ్ము అడ్జెస్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు మండి పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపటా్ననికి చెందిన సీహెచ్ సరస్వతి గతేడాది లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో దానికోసం ఎదురుచూస్తు న్నారు. కానీ బ్యాంకర్లు మాత్రం ఆమెకు ప్రతీ రోజూ ఫోన్ చేసి అప్పు చెల్లించాల్సిందేనని, ప్రభుత్వ రుణమాఫీతో తమకు సంబంధం లేదని వేధిస్తున్నారు. అంతేగాక నోటీసులు ఇచ్చారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమె స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి వడ్డీతో కలిపి రూ.1.10 లక్షలు చెల్లించారు. అతని పేరు లక్ష్మయ్య (పేరు మార్చాం)... ఖమ్మం జిల్లాకు చెందిన ఈ రైతు గత మార్చి నెలలో రూ. 95 వేల పంట రుణం తీసుకున్నా రు. బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడితో తీసు కున్న అప్పుతో కలిపి మొత్తం రూ.1.05 లక్ష లు చెల్లించాడు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, అప్పటివరకు ఆగాలని వేడుకున్నా బ్యాంకులు కనికరించలేదని వాపోయాడు. -
పంట నష్టం పరిహారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గత నెల వడగళ్లు, అకాల వర్షాలతో జరిగిన నష్టానికి రైతులకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో చెల్లింపుల ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు. మార్చిలో వడగళ్లు, అకాల వర్షాలకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ నిర్ధారించిన సంగతి తెలిసిందే. మొత్తం పది జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. 15,246 మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. వారందరికీ ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.15.81 కోట్లు పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో గతేడాది ఒకసారి తీవ్రమైన వర్షాలతో పంటలకు నష్టం జరిగినప్పుడు ఎకరాకు రూ. 10 వేలు పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. -
రైతులకు విత్తన సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతులకు సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వరి, మొక్కజొన్న, కంది, పెసర, సోయాబీన్, మినుములు, జీలుగ, జనపనార, పిల్లి పెసర తదితర విత్తనాలను సబ్సిడీపై అందజేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జీలుగ, జనపనార, పిల్లి పెసర మినహా ఇతర విత్తనాలకు మూడేళ్ల క్రితమే సబ్సిడీ ఎత్తేయగా ఇప్పుడు సబ్సిడీని పునరుద్ధరించాలని నిర్ణయించారు. కేవలం వానాకాలం సీజన్లో అందించే విత్త నాల సబ్సిడీ కోసమే దాదాపు రూ. 170 కోట్లు ఖర్చు కానుందని అంచనా. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ. 25 కోట్ల మేరకు విత్తన సబ్సిడీ కింద నిధులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సమ కూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. 35–65 శాతం వరకు సబ్సిడీ... గతంలో మాదిరిగానే విత్తనాలకు 35 నుంచి 65 శాతం వరకు సబ్సిడీని అందించనున్నారు. సోయాబీన్కు 37 శాతం, జీలుగ, పిల్లి పెసర, జనపనార విత్తనాలకు 65 శాతం సబ్సిడీ... కంది, పెసర, మినుము, వేరుశనగ విత్తనాలకు 35 శాతం వరకు సబ్సిడీ అందించాలని భావిస్తున్నారు. వరి పదేళ్లలోపు పాత విత్తనాల ధర ఎంతున్నా రూ. వెయ్యి సబ్సిడీ ఇవ్వాలని... పదేళ్లకుపైగా ఉన్న వరి విత్తనాలకు రూ. 500 సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మొత్తం విత్తన సరఫరాలో వ్యవసాయశాఖ అధికంగా వరి విత్తనాలనే రైతులకు సరఫరా చేయనుంది. రైతు కోరుకొనే విత్తనాలే కీలకం... ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే కొన్ని రకాల విత్తనాలను రైతులు పెద్దగా కోరుకొనే పరిస్థితి ఉండదు. గత అనుభవాల ప్రకారం రాష్ట్రంలో మొక్కజొన్న సాగు అధికం. ఆ విత్తనాన్ని ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. కానీ మొక్కజొన్నలో అనేక హైబ్రీడ్ రకాల విత్తనాలున్నాయి. వాటిలో కొన్ని రకాలకు మరింత డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం సరఫరా చేసే మొక్కజొన్న విత్తనాలను పెద్దగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడని రైతులు.. ప్రైవేటు డీలర్ల వద్ద తమకు అవసరమైన డిమాండ్ ఉన్న విత్తనాలనే కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏదో యథాలాపంగా టెండర్లు పిలిచి టెండర్లు ఖరారు చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. రైతులు కోరుకొనే రకాల విత్తనాలు ఇవ్వకపోవడం వల్ల గతంలో అనేక సబ్సిడీ విత్తనాలు వ్యవసాయశాఖ వద్ద మిగిలిపోయాయి. దీనివల్ల ఆ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. 1.21 కోట్ల పత్తి విత్తనాలు అవసరం: మంత్రి తుమ్మల వచ్చే వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 60.53 లక్షల ఎకరా లలో పత్తి సాగు కానుందని... అందుకు 1.21 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. అధికారులు, విత్తన కంపెనీలతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. అన్ని ప్రైవేటు విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు. వరి 16.50 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్న 48,000 క్వింటాళ్ల విత్తనాలు అవసరమన్నారు. ప్రస్తుత లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎకరాకు రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎకరాకు రూ.10 వేలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పంటనష్టం అంచనా వేయాలని వ్యవసాయశాఖను ఆదేశించింది. వచ్చే రెండుమూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో అప్పటివరకు జరిగే మొత్తం నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం ఇస్తామ ని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతేడాది ఒకసారి తీవ్రమైన వర్షాలతో పంటలకు నష్టం జరిగినప్పుడు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున ఈసీ అనుమతి తీసుకొని పరిహారం ప్రకటించొచ్చని అంటున్నారు. 50 వేల ఎకరాల్లో పంటల నష్టం అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి, మొక్కజొన్న, జొన్న, పొగా కు, వేరుశనగ, మిర్చి, కూరగాయలు, బొప్పాయి, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. వరి పొలాలకు నీరు లేక ఎండిపోయి దెబ్బతినటంతోపాటు ఈ వర్షాల వల్ల ఉన్న కాస్త ధాన్యం రాలిపోయింది. నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ నిర్థారించింది. మిగిలిన జిల్లాల్లోనూ పంటలకు ఏమైనా నష్టం జరిగిందా లేదా అన్న వివరాలు పంపించాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించింది. ఎక్కడికక్కడ పంట న ష్టం అంచనాలు వేయడంపై దృష్టి సారించినట్టు అధికారులు తెలిపారు. అయితే తీవ్రమైన ఎండల వల్ల ఇటీవల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నా యి. వాటి విషయంలో మాత్రం తాము నష్టాలను అంచనా వేయడం లేదని అధికారులు తెలిపారు. ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలి: పశ్య పద్మ దెబ్బతిన్న పంటలన్నింటినీ సర్వే చేసి నష్టం అంచనా వేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ప్రభుత్వాన్ని కోరారు. నష్టం జరిగిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ స్తంభం, చెట్టు విరిగిపడి రైతు మరణించారని, చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి తుమ్మల రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం సంభవించినట్టు తెలుస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండు మూడు రోజులు కూడా అకాల వర్షాలు సంభవించే అవకాశముందన్నారు. రైతులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం, మిర్చి సహా ఇతర పంటలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కల్లాల్లోగానీ, ఇతర ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యంగానీ దెబ్బతినకుండా రైతులకు తగు సూచనలు ఇవ్వాలన్నారు. -
జొన్న రైతులకు ప్రభుత్వం బాసట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హైబ్రీడ్ రకం జొన్నల మార్కెట్ ధర మద్దతు ధరకంటే తక్కువగా ఉండటంతో రైతులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద వెంటనే హైబ్రీడ్ రకం జొన్నలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. 27,722 టన్నుల హైబ్రీడ్ రకం జొన్నలు కనీస మద్దతు ధర క్వింటాలు రూ.3,180కు కొనుగోలుకు అనుమతినిచ్చింది. ఈమేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అహ్మద్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం నుంచి ఆర్బీకేల ద్వారా జొన్న రైతుల రిజిస్ట్రేన్కు మార్క్ఫెడ్ ఏర్పాట్లు చేసింది. రబీ సీజన్లో 2.38 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 4.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. హైబ్రీడ్ రకం క్వింటాలు రూ.3180గా, మల్దిండి రకం క్వింటాలు రూ.3,225గా ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రీడ్ రకం ఆహార అవసరాల కోసం, మల్దిండి రకం పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. హైబ్రీడ్ జొన్నల ధర మార్కెట్లో ప్రస్తుతం క్వింటాలు రూ.2,500 నుంచి రూ.2,600 వరకు పలుకుతోంది. మద్దతు ధరకంటే మార్కెట్ ధర తక్కువ ఉండటంతో జొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా (మోర్ ప్రిఫర్డ్ వెరైటీగా) గుర్తింపు పొందిన హైబ్రీడ్ రకం జొన్నలను 27,722 టన్నులు కొనడానికి అనుమతినిచ్చింది. బుధవారం నుంచి మే 31వ తేదీ వరకు రైతుల నుంచి ఈ రకం జొన్నలను సేకరిస్తారు. ఇప్పటికే కనీస మద్దతు ధరలకు రబీ సీజన్లో పండిన శనగ, మినుము, పెసర, వేరుశనగ పంటలను ఆర్బీకేల ద్వారా ఏపీ మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తోంది. తక్కువకు అమ్ముకోవద్దు కనీస మద్దతు ధరకంటే తక్కువకు ఏ రైతూ అమ్ముకోవద్దు. జొన్న రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 27,722 టన్నుల సేకరణకు అనుమతినిచ్చింది. మద్దతు ధర దక్కని రైతులు ఆర్బీకేల ద్వారా వివరాలు నమోదు చేసుకొని వారి వద్ద ఉన్న హైబ్రీడ్ రకం జొన్నలను అమ్ముకోవచ్చు. – డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, ఏపీ మార్క్ఫెడ్ -
వ్యవసాయ కార్పొరేషన్లపై ఏసీబీ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఆయన వ్యవసాయశాఖలోని ఒక కార్పొరేషన్ ఎండీ.. టెండర్లు, పనుల్లో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటారని ఆరోపణలున్నాయి. ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు మొదలు అన్నింటిలోనూ వసూళ్లేనని.. ఆయన ఆస్తుల విలువ రూ.100 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఆయన హైదరాబాద్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, ఒక విల్లా, హైదరాబాద్ పరిసరాల్లో 30 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ♦ ఇదేశాఖలోని ఓ కార్పొరేషన్కు చెందిన జనరల్ మేనేజర్కు రెండు విల్లాలు, రెండు ప్లాట్లు, నగర శివారులో ఐదెకరాల ఫాంహౌస్ ఉందని సమాచారం. మరో కార్పొరేషన్కు చెందిన జనరల్ మేనేజర్కు ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, ఐదుచోట్ల ఇళ్ల స్థలాలు, నగర సమీపంలో రెండెకరాల భూమి ఉన్నాయి. ఒక కార్పొరేషన్లోని డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారికి ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, స్థలాలు ఉన్నాయి. ♦ ..వ్యవసాయశాఖ పరిధిలోని కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, డిప్యూటీ మేనే జర్లపై వస్తున్న ఫిర్యాదుల్లోని అంశాలివి. దీనిపై దృష్టిపెట్టిన ఏసీబీ కొందరు పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బెట్టినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. రెండు కార్పొరేషన్ల ఎండీలపై నేరుగా ఫిర్యాదులు అందడంతో.. ఏసీబీ అధికారులు లోతుగా పరిశీల న చేపట్టి, రికార్డులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అవసరమైతే ఆయా ఉద్యోగులను పిలిపించి విచారించేందుకు, సోదాలు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఆయా కార్పొరేషన్ల జనరల్ మేనేజర్లు, మేనేజర్లపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని వ్యవసా య ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. ఐఏఎస్ల విచారణతో.. వ్యవసాయశాఖలోని 11 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇద్దరు ఐఏఎస్లను విచారణ అధికారులుగా నియమించారు కూడా. దీంతో భారీగా దండుకున్న అధికారుల్లో దడ మొదలైంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, దీని నుంచి బయటపడేందుకు పలువురు ఎండీలు, జనరల్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మార్క్ఫెడ్లో భారీగా ఉల్లంఘనలు! వ్యవసాయశాఖ పరిధిలో మార్క్ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఆయిల్ఫెడ్, ఆగ్రోస్, హాకా, టెస్కాబ్, సీడ్ కార్పొరేషన్ వంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో వందల కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. మార్క్ఫెడ్ లోనైతే ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. దానిద్వారానే రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రైతుల పంటలను కూడా మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకురావడం, రైతుల నుంచి కొన్న పంటలను విక్రయించాక వచ్చే డబ్బును బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. అధికా రులు ఆయా లావాదేవీలను ప్రభుత్వ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్ బ్యాంకులతో నిర్వహిస్తుండటంపై విమర్శలు న్నా యి. ఈ వ్యవహారంలో కమీషన్లు చేతులు మారుతు న్నట్టు ఆరోప ణలు న్నాయి. ఎరువుల నుంచి గన్నీ బ్యాగుల దాకా.. ఎరువుల రవాణా టెండర్లు అధికారులకు వరాల జల్లు కురిపిస్తాయని.. రూ.వంద కోట్లకు పైబడి ఉండే ఈ టెండర్లను ఒకే కంపెనీకే వచ్చేలా నిబంధనలు రూపొందించి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కంపెనీకే టెండర్ దక్కుతూ వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇక గన్నీ బ్యాగుల టెండర్లలోనూ కొందరు అధికారులు కంపెనీల నుంచి కమీషన్లు అందుకుంటున్నారన్న సమాచారం ఉంది. ♦ 2019–20లో మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నను టెండర్ల ద్వారా తక్కువ ధరకు విక్రయించాల్సి రావడంతో దాదాపు రూ.1,200 కోట్లు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ఎండీ స్థాయి అధికారి నుంచి మేనేజర్ల వరకు కోట్లలో కమీషన్లు ముట్టినట్లు ఫిర్యాదులున్నాయి. మార్క్ఫెడ్కు రూ.3 వేల కోట్ల అప్పులుంటే, ఈ స్కాం వల్లే సగం అప్పు పేరుకుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అసలు పదేళ్లుగా మార్క్ఫెడ్ జనరల్ బాడీ సమావేశం జరగలేదంటే నిబంధనల ఉల్లంఘన ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నాయి. మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగిరెడ్డి కాంగ్రెస్లో చేరి తన పోస్టును కాపాడుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ♦ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లోనైతే జిల్లా మేనేజర్లు కూడా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారు. వీరిలో కొందరిని అడ్డుపెట్టుకొని పైస్థా యి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమా లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవే ట్ గోదాములతో సంబంధాలు పెట్టుకుని.. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ను దివాలా తీయిస్తున్నా రన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని పనులకు టెండర్లకు వెళ్లకుండా పాత వాటినే కొనసాగిస్తూ నష్టం కలిగిస్తున్నారని అంటున్నారు. ♦ ఆయిల్ఫెడ్లో సిద్దిపేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతుల టెండర్ను తక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీకి కాకుండా మరో కంపెనీకి ఇవ్వడం వివాదం రేపింది. కోర్టులో ఈ వివాదం ముగిసింది. కానీ ఈ వ్యవహారంలో కొందరు అధికారులు పాత్ర పోషించారని.. కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ♦ నిబంధనలకు విరుద్ధంగా ఆయిల్ఫెడ్లో రూ.కోటిన్నర, వేర్హౌజింగ్ కార్పొరేషన్లో రూ.కోటి మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద కేటాయించారు. ♦ హాకాలో శనగల కొనుగోలు వ్యవహారం విమర్శలకు దారితీసింది. ఇందులో ఎండీ పాత్ర కంటే అప్పటి ఒక ప్రజాప్రతినిధి జోక్యమే అన్ని విధాలుగా హాకాను భ్రష్టుపట్టించిందనే విమర్శ లున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి శనగలు సరఫరా చేసే బాధ్యత తీసుకొని వాటిని విని యోగదారులకు కాకుండా వ్యాపారులకు కమీష న్లకు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ♦ ఇక ఆగ్రోస్ను పెద్దగా అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. ఇందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ యాంత్రీకరణ అమలుకాకపోవడంతో ఆగ్రోస్ కునారిల్లిపోయింది. ♦ ఒక కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేసిన ఒక ప్రజాప్రతినిధి తన పదవిని అడ్డుపెట్టుకొని రూ.500 కోట్ల దాకా వెనకేసుకున్నట్టు ఆరోపణ లున్నాయి. అధికారం ద్వారా అనేక వ్యాపారాలు చేసి కమీషన్లు వసూలు చేశారని, అధికారులు తనకు నచ్చినట్టుగా వ్యవహరించేలా చేశాడని సమాచారం. అదే ఇప్పుడు సదరు కార్పొ రేషన్ను బోనులో నిలబెట్టిందని అంటున్నారు. ఇప్పటికీ చక్రం తిప్పుతున్న మాజీ చైర్మన్లు గత ప్రభుత్వంలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసినవారు ఇప్పుడు మాజీలుగా మారినా కొత్త ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారు. ఆయా కార్పొరేషన్ ఎండీలు, ఇతర మేనేజర్లు, ఉద్యోగులపై ఒత్తిడి చేస్తూ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే పార్టీ మారి మళ్లీ ఇదే కార్పొరేషన్కు చైర్మన్గా వస్తామనీ బెదిరిస్తున్నట్టు సమాచారం. కొందరు ఇప్పటికీ కార్పొరేషన్ల డ్రైవర్లను వాడుకుంటున్నట్టు తెలిసింది. సదరు మాజీ చైర్మన్లతో కలసి అక్రమాలకు పాల్పడిన పలువురు ఎండీలు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
సాగుబడి: విపత్తులకూ వివక్షే..!
'అధిక ఉష్ణోగ్రత, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినటం వల్ల గ్రామీణ రైతాంగం వ్యవసాయక ఆదాయాన్ని పెద్ద ఎత్తున నష్టపోతుంటారని మనకు తెలిసిందే. అయితే, ఇందులో ఏయే వర్గాల వారు ఎక్కువగా నష్టపోతున్నారన్నది ఆసక్తి కరమైన ప్రశ్న. ఈ దిశగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చేసిన తొట్టతొలి పరిశోధనలో మహిళలు, యువత సారధ్యంలోని రైతు కుటుంబాలకే ఎక్కువని తేలింది!' పురుషాధిక్యతతో పాటు వాతావరణ మార్పులు తోడై విపత్తుల వేళ మహిళా రైతు కుటుంబాలకు అధికంగా ఆదాయ నష్టం కలిగిస్తున్నాయని ఈ అధ్యయనం తేల్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘అన్జస్ట్ క్లైమెట్’ శీర్షికతో ఎఫ్.ఎ.ఓ. ఈ నివేదికను వెలువరించింది. విపరీతమైన వాతావరణ సంఘటనలకు తట్టుకునే, ప్రతిస్పందించే సామర్థ్యంలో హెచ్చు తగ్గులే ఈ అసమానతకు కారణమని తేల్చింది. భారత్ సహా 24 అల్పాదాయ, మధ్య తరహా ఆదాయ దేశాల్లో ఈ అధ్యయనం జరిగింది. ఈ దేశాల్లో 95 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే లక్ష గ్రామీణ కుటుంబాల నుంచి సామాజిక ఆర్థిక గణాంకాలను సేకరించి, గత 70 ఏళ్లలో విపత్తుల గణాంకాలతో పాటు విశ్లేషించారు. వాతావరణ విపత్తుల వల్ల పురుషుల సారధ్యంలోని కుటుంబాల కంటే మహిళల నేతృత్వంలోని కుటుంబాలకు వ్యవసాయ ఆదాయ నష్టం ఎక్కువగా ఉందని ఒక కొత్త నివేదిక ఎత్తిచూపింది. పురుషులు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలతో పోల్చితే, మహిళలు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలు అధికోష్ణం ఒత్తిడి కారణంగా 8 శాతం, వరదల కారణంగా 3 శాతం ఎక్కువ నష్టాలను చవిచూస్తున్నాయి. అదేవిధంగా, పురుషులు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాల్లోనూ.. పెద్దల నేతృత్వంలోని కుటుంబాలతో పోల్చితే 35 ఏళ్లు నిండని యువకుల నాయకత్వంలోని కుటుంబాలు ఎక్కువగా వ్యవసాయ ఆదాయం కోల్పోతున్నాయని ఎఫ్.ఎ.ఓ. గుర్తించింది. సామాజికంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న గ్రామీణ ప్రజలకు వాతావరణ సంక్షోభం ద్వారా ఎదురయ్యే సవాళ్ల ప్రభావం సంపద, లింగం, వయస్సు భేదాల కారణంగా ఎలా ఉందనే ఖచ్చితమైన ఆధారాలను అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. మహిళల నేతృత్వం వహించే కుటుంబాలకు అధిక వేడి వల్ల 83 డాలర్లు, వరదల కారణంగా 35 డాలర్ల మేరకు తలసరి నష్టం జరుగుతోంది. 24 దేశాల్లో మొత్తంగా అధిక వేడి వల్ల 3700 కోట్ల డాలర్లు, వరదల వల్ల 1600 కోట్ల డాలర్ల మేరకు నష్టం జరుగుతోందని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు కేవలం 1 డిగ్రీల సెల్షియస్ పెరిగితే, పురుషులతో పోలిస్తే మహిళా రైతులు తమ వ్యవసాయ ఆదాయంలో 34 శాతం ఎక్కువ నష్టాన్ని చవిచూస్తారు. ఇవీ కారణాలు.. మహిళా రైతులు కుటుంబ సభ్యుల సంరక్షణ, గృహ బాధ్యతలు వంటి అనేక వివక్షతతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అసమానత భారం, భూమిపై వారికి ఉండే పరిమిత హక్కులు, శ్రమపై నిర్ణయాలు తీసుకోకుండా నిరోధించే ప్రతికూల పరిస్థితుల వల్ల మహిళా రైతులు వత్తిడికి గురవుతున్నారు. పంటల సాగులో మహిళా రైతులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్ల కారణంగా పంటల ఉత్పాదకతలో, స్త్రీ పురుషుల మధ్య వేతనాలలో వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగానే వాతావరణ సంక్షోభకాలాల్లో వీరు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటిని ప్రభుత్వాలు పరిష్కరించకపోతే, వాతావరణ సంక్షోభం వల్ల రాబోయే కాలంలో ఈ అంతరాలు బాగా పెరిగిపోతాయని ఎఫ్.ఎ.ఓ. హెచ్చరించింది. 68 దేశాల్లో వ్యవసాయ విధానాలను ఎఫ్.ఎ.ఓ. గత ఏడాది విశ్లేషించగా.. దాదాపు 80 శాతం విధానాల్లో మహిళలు, వాతావరణ మార్పుల ఊసే లేదు! వాతావరణ సంక్షోభకాలంలో గ్రామీణులకు రక్షణ కల్పించే పథకాలపై అధికంగా పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వాలకు ఎఫ్.ఎ.ఓ. సూచిస్తోంది. ఇవి చదవండి: డాక్టర్ గీతారెడ్డి బోర: స్టార్టప్ దిశగా అంకురం! -
సాగును బాగు చేశాం
సాక్షి, అమరావతి: ‘సచివాలయాలు, ఆర్బీకేలు లాంటి గొప్ప వ్యవస్థల ఏర్పాటుతో గ్రామ స్థాయిలో పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తెచ్చి రైతులకు తోడుగా నిలిచాం. వారికి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. అందుకే ఈ ఐదేళ్లలో వారి జీవితాల్లో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఖరీఫ్ 2023లో వర్షాభావంతో ఏర్పడిన కరువు, గత డిసెంబర్లో మిచాంగ్ తుపానుతో నష్టపోయిన 11,59,126 మంది వ్యవసాయ, ఉద్యాన రైతులకు రూ.1,294.58 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. అవినీతి, వివక్షకు తావు లేకుండా.. పారదర్శకంగా మంచి జరుగుతుందా? అని ఎవరైనా ఐదేళ్ల క్రితం ప్రశ్నిస్తే అది అయ్యే పని కాదనే సమాధానం వచ్చేది. ఎందుకంటే ఆరోజు పారదర్శకంగా ఏ ఒక్క పని జరిగేది కాదు కాబట్టి. మొట్టమొదటిసారిగా అటువంటి పరిస్థితులు మారాయి. ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థ తోడుగా ఉంది. ప్రతి ఎకరాను ఇ–క్రాప్ చేయడం వల్ల సచివాలయ పరిధిలో ఏ పంటను ఎవరు ఎన్ని ఎకరాల్లో వేశారో పూర్తి డేటా అందుబాటులోకి వచ్చింది. వైపరీత్యాల వల్ల ఏ పంటకు నష్టం జరిగినా అత్యంత పారదర్శకంగా అర్హుల జాబితాలను ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే వెసులుబాటు ఉంది. ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా అర్హులైన ప్రతి రైతుకూ సహాయం సకాలంలో అందుతున్న పరిస్థితి ఈ 58 నెలల పాలనలోనే జరుగుతోందని చెప్పడానికి ఆనందపడుతున్నా. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పడానికి సంతోషపడుతున్నా. తడిసిన ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం మనదే.. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదన్న సంకల్పంతో రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని మొట్టమొదటిసారిగా కొనుగోలు చేస్తూ అడుగులు పడ్డాయి. మిచాంగ్ తుపాన్ వేళ దాదాపు 3.25 లక్షల టన్నులు రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలిచిందీ ప్రభుత్వం. నాలుగేళ్ల పాటు సమృద్ధిగానే వర్షాలు పడ్డాయి. గతేడాది ఖరీఫ్లో కొంత మేర వర్షం తక్కువగా నమోదు కావడంతో 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాల్సి వచ్చింది. ఈ మండలాల్లో పంటలు నష్టపోయిన 6.96 లక్షల మంది రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.847 కోట్లు విడుదల చేస్తున్నాం. మిచాంగ్ తుపాను వల్ల పంటలు నష్టపోయిన 4.61 లక్షల మంది రైతన్నలకు మరో రూ.442 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తున్నాం. ఈ రెండూ కలిపి 11.61 లక్షల మంది రైతన్నలకు మొత్తంగా రూ.1,294.58 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసే మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల జరుగుతోంది. 80 శాతం సబ్సిడీపై విత్తనాలందించాం కరువు, తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు సబ్సిడీపై విత్తనాలను అందించి అండగా నిలిచాం. ఉలవలు, అలసంద, మినుము, పెసర, కంది, రాగి, మొక్కజొన్న లాంటి స్వల్ప కాలిక పంటల సాగు కోసం 30 వేల క్వింటాళ్లను రూ.26 కోట్లతో 1.14 లక్షల మంది రైతులకు సరఫరా చేయగలిగాం. మిచాంగ్ తుపాను వల్ల డిసెంబర్ 4న నష్టం జరిగితే డిసెంబర్ 8వ తేదీకల్లా రూ.31 కోట్లతో 80% సబ్సిడీ మీద రాయితీతో 49,758 క్వింటాళ్ల విత్తనాలను 71,415 మంది రైతులకు ఆర్బీకేల ద్వారా సరఫరా చేసి తోడుగా నిలబడగలిగాం. జూన్లో వారికి పంటల బీమా పరిహారం అందిస్తాం. పైసా భారం లేకుండా పంటల బీమా చంద్రబాబు పాలనలో ఏటా కరువు కాటకాలే నెలకొన్నా 2014–19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు మాత్రమే బీమా పరిహారం ఇచ్చిన పరిస్థితిని చూశాం. ఇప్పుడు దేవుడి దయతో ఏటా మంచి వర్షాలు పడుతున్నాయి. ఒక్క సంవత్సరమే కొద్దో గొప్పో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగేళ్లలో ఎప్పుడూ ఒక్కటి కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. మనం 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్ల బీమా పరిహారం ఇచ్చి తోడుగా నిలబడ్డాం. పైసా కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేసి రైతులకు తోడుగా నిలబడింది ఈ ప్రభుత్వమే. ఇ– క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా వర్తింపజేసే అడుగులు మొదటిసారిగా పడ్డాయి. గతంలో రుణాల కోసం బ్యాంకులకు వెళ్లినప్పుడు 5 శాతం ప్రీమియం కింద జమ చేసుకుని ఇన్సూరెన్స్ వర్తింపజేసేవారు. రుణాలు తీసుకోని రైతులకు, ఆ విషయం తెలియని వారికి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశమే ఉండేది కాదు. అలాంటిది ఈరోజు పంటల బీమా అమలులో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించమని ప్రతి రైతన్ననూ కోరుతున్నా. చిన్న రైతుకు పెద్ద భరోసా ప్రతి రైతుకూ పెట్టుబడి సహాయంగా రూ.13,500 అందించడం ఇంతకు ముందెన్నడూ లేదు. చంద్రబాబు హయాంలో రైతులు పంటలు వేసేటప్పుడు వారికి తోడుగా నిలబడాలనే ఆలోచన చేయలేదు. తాజా లెక్కల ప్రకారం దాదాపు 63%మంది రైతులకు అర హెక్టారు లోపు మాత్రమే భూములున్నాయి. హెక్టారు లోపు భూమి ఉన్న వారు మరో 24% మంది ఉన్నారు. ఈ 87%మంది రైతులు దాదాపు 70% విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అర హెక్టార్ లోపు పొలం ఉన్న రైతులకు రూ.13,500 రైతు భరోసా సాయం 80% పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతోంది. ఇటువంటివన్నీ గత 58 నెలలుగా మాత్రమే జరుగుతున్నాయి. ► మంత్రి కాకాణితో పాటు సీఎస్ జవహర్రెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్జీ రంగా వర్సిటీ పాలనా భవనం ప్రారంభం ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేషన్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి జగన్ బుధవారం వర్చువల్గా ప్రారంభించారు. గుంటూరు లాంలోని వర్సిటీ ప్రాంగణంలో 5.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.110 కోట్లతో నూతనంగా నిర్మించిన ఈ అత్యాధునిక భవన సముదాయం ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. గత సర్కారు కేవలం శంకుస్ధాపన చేసి సరిపుచ్చగా సీఎం జగన్ పూర్తి చేసి ప్రారంభించడం సంతోషకరమని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు లాం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్శిటీ ఉపకులపతి డాక్టర్ శారద జయలక్ష్మిదేవి, జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకుముందు విత్తనాల కోసం లాఠీ దెబ్బలు తినేవాళ్లం నాకు ఐదెకరాలున్నాయి. ఖరీఫ్లో 2 ఎకరాల్లో మొక్కజొన్న వేశా. సకాలంలో వర్షాలు రాక నష్టపోయా. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. రైతుల కష్టాలను గుర్తించి సాయం చేస్తున్నారు. గతంలో పెట్టుబడుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోయేవాళ్ళం. నేడు ఏటా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్నారు. పంటల బీమా వస్తుంది. సున్నా వడ్డీ రాయితీ వస్తోంది. గతంలో విత్తనాల కోసం లాఠీ దెబ్బలు తినేవాళ్ళం. ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేల ద్వారా ఇస్తున్నారు. గతంలో వ్యవసాయం చేయాలంటే చాలా అవస్థలు పడేవాళ్లం. మీరు వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. పంటలకు మద్దతు ధర ఇస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మా గ్రామంలో హెరిటేజ్ డెయిరీ మాత్రమే ఉండేది. అందులో లీటర్ పాలకు రూ. 20 నుంచి రూ. 25 మాత్రమే ఇచ్చేవారు. కానీ నేడు లీటర్కు రూ. 35 నుంచి రూ. 40 వస్తున్నాయి. పాడి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నాను. గత 57 నెలల్లో వ్యవసాయ పథకాల ద్వారా రూ.88,392 వచ్చాయి. మా నాన్నకు పింఛను రూ. 1,35,750, నా భార్యకు వైఎస్సార్ ఆసరా కింద రూ. 54,000, సున్నా వడ్డీ కింద రూ. 5,369, పిల్లలకు విద్యా దీవెన కింద రూ. 66,000, వసతి దీవెన కింద రూ. 58,000 వచ్చాయి. అన్నీ కలిపి రూ. 4,06,761 వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో సాయం అందడం ఇదే ప్రథమం. అదీ లంచాలతో పని లేకుండా నేరుగా మా ఖాతాలో జమ చేశారు. ఇంత కంటే ఇంకేం కావాలి. మళ్లీ మీరే సీఎం కావాలి. – జనార్ధన్ రెడ్డి, రైతు, భైరాపురం, శ్రీ సత్యసాయి జిల్లా ఇంతలా ఆలోచించే సీఎంను ఎన్నడూ చూడలేదు నేను 1.20 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. గతేడాది డిసెంబర్లో మిచాంగ్ తుపాన్ వల్ల పంట దక్కదేమోనని అనుకున్నాం. సకాలంలో పూడికలు తీయించడం వల్ల వర్షం నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోయింది. గతంలో తుపాను వస్తే పట్టించుకునేవారు కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. తడిసిన ధాన్యం కొంటున్నారు. మిల్లుకు పంపిన 13 రోజుల్లో డబ్బు వస్తోంది. ట్రాక్టర్ బాడుగ, గోతాలకు కూడా సొమ్ములిచ్చారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నారు. తుపాను నష్టం సాయం అందుతోంది. రైతుల కోసం ఇంతలా ఆలోచించే సీఎంను ఎన్నడూ చూడలేదు. గతంలో పంట నష్ట పరిహారం వారికి అనుకూలమైన వారికే ఇచ్చారు. నేడు పార్టీలకతీతంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మేం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మా ఊళ్లోనే మాకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స చేయించుకున్నా. ఇంటికొచ్చే సమయంలో డబ్బులు కూడా ఇచ్చారు. మా పాప చదువుతున్న ప్రభుత్వ పాఠశాలను చాలా బాగా అభివృద్ధి చేశారు. చిన్నమ్మాయికి ట్యాబ్ ఇచ్చారు. మంచి ఆహారం ఇస్తున్నారు. ఎక్కడా రూపాయి లంచం ఇవ్వకుండా అర్హత ఉంటే చాలు అన్ని పథకాలు అందిస్తున్నారు. నా ఒక్క కుటుంబానికే రూ.3.10 లక్షల సాయం అందింది. మీరు మాట ఇస్తే జరిగినట్లే. మళ్ళీ మీరే సీఎంగా ఉండాలి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట కాలువలు బాగు చేయాలని కోరుతున్నా. –మోషే, రైతు, నర్రావారి పాలెం, కర్లపాలెం మండలం, బాపట్ల చెప్పిన మాటకు మించి సాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల్లో చెప్పిన దానికి మించి సాయం అందిస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా సోషల్ ఆడిట్ నిర్వహించి, పారదర్శకంగా, నేరుగా రైతులే వెరిఫై చేసుకున్న తర్వాత లబ్ధిదారుల తుది జాబితాలు ప్రకటిస్తున్నాం. మిచాంగ్ తుపానుకు దెబ్బతిన్న పంటలకు రికార్డు టైంలో నాలుగు రోజుల్లోనే సబ్సిడీ విత్తనాలు ఇచ్చాం. దీనివల్ల రైతులు వెంటనే నారుమళ్ళు పోసుకుని విత్తుకోగలిగారు. ఈ ప్రభుత్వంలో 34.43 లక్షల మంది రైతులకు రూ.3,262 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. గతంలో బాబుప్రభుత్వం రూ.2,560 కోట్ల బకాయిలు పెట్టి రైతులను మోసం చేసింది. సీఎం జగన్ ఇచ్చిన మాటకంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ ఇలా ప్రతిదీ ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో 39 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.1180.66 కోట్ల సున్నా వడ్డీ బకాయిలను సైతం వైఎస్ జగన్ చెల్లించారు. పంటల బీమా, విత్తన, బిందు సేద్యం బకాయిలనూ చెల్లించారు. టీడీపీ ప్రభుత్వం రైతులను వంచిస్తే వైఎస్ జగన్ రైతు పక్షపాతిగా నిలిచారు. రైతులను కంటిపాపలా కాపాడుకున్న సీఎం వైఎస్ జగన్కు అన్నదాతలు ఆశీస్సులు అందించాలి. మరో 3 నెలల్లో సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యి ఇదే రీతిలో అండగా నిలుస్తారు. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
సాగు రుణాలు రూ.20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు గడిచిన పదేళ్ల కాలంలో సాగు రంగానికి సంస్థాగత రుణ సాయం గణనీయంగా పెరిగింది. 2013–14 ఆర్థిక సంవత్సరానికి ఇనిస్టిట్యూషన్లు (బ్యాంక్లు) ఇచి్చన రుణ వితరణ రూ.7.3 లక్షల కోట్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) పది నెలల్లో (2024 జనవరి చివరికి) రూ.20.39 లక్షల కోట్లకు (1,268 లక్షల ఖాతాలు) చేరుకున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నిజానికి 2023–24 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా, అది మరో రెండు నెలలు మిగిలి ఉండగానే చేరుకోవడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి సాగు రంగానికి రుణాలు రూ.22 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. స్వల్పకాలిక సాగు రుణాలు రూ.3 లక్షల వరకు ఉండే వాటికి కేంద్ర వ్యవసాయ శాఖ వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికింద రైతులు 7 శాతానికే రుణ సాయం పొందొచ్చు. కేంద్రం తనవంతుగా బ్యాంక్లకు 2 శాతం సమకూరుస్తోంది. 2022–23 సంవత్సరానికి పంపిణీ చేసిన సాగు రుణాలు రూ.21.55 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. అదే ఏడాదికి కేంద్రం విధించుకున్న లక్ష్యం రూ.18.50 లక్షల కోట్లను మించిన సాయాన్ని బ్యాంకులు అందించాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్(కేసీసీ)పై 4 శాతం రేటుకే అందించే రుణ సదుపాయాన్ని పశు సంవర్ధక, మత్య్సకార రైతులుకు కూడా విస్తరించిన విషయాన్ని సదరు అధికారి గుర్తు చేశారు. 2023 మార్చి నాటికి 7,34,70,282 కేసీసీ ఖాతాలకు సంబంధించిన బకాయిలు రూ.8,85,463 కోట్లుగా ఉన్నాయి. .2.81 లక్షల కోట్ల సాయం పీఎం–కిసాన్ పథకం కింద కేంద్రం అర్హత కలిగిన ప్రతి రైతుకు ఏటా రూ.6,000 చొప్పున అందిస్తుండం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు రూ.2.81 లక్షల కోట్లను ప్రత్యక్ష బదిలీ ద్వారా అందించినట్టు సదరు అధికారి తెలిపారు. సాగు పెట్టుబడి అవసరాలకు సాయంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా గడిచిన పదేళ్లలో పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. మోదీ సర్కారు వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, నూనె గింజలను ఎంఎస్పీపై రైతుల నుంచి సమీకరిచేందుకు గడిచిన పదేళ్ల కాలంలో రూ.18.39 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో భాగంగా చెప్పారు. యూపీఏ పదేళ్ల కాలంలో అందించిన రూ.5.5 లక్షల కోట్ల కంటే మూడు రెట్లు అధికమన్నారు. -
1 నుంచి రేషన్ లబ్దిదారులకు రాగిపిండి పంపిణీ
సాక్షి, అమరావతి: వచ్చే నెల 1 నుంచి రేషన్ లబ్దిదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రాగిపిండిని పంపిణీ చేయనుంది. తద్వారా ప్రభుత్వం పౌష్టికాహార భద్రతకు పెద్దపీట వేయనుంది. ముందు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బలవర్థక ఆహారంగా రాగి పిండిని సరఫరా చేయాలని నిర్ణయించింది. మార్చి 1 నుంచి కిలో ప్యాకెట్ల రూపంలో దీన్ని అందించనుంది. బహిరంగ మార్కెట్లో కిలో రాగిపిండి రూ.40పైనే పలుకుతుండగా ప్రభుత్వం లబ్దిదారులకు కిలో రూ.11కే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, రాయలసీమలోని వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఒక్కో కార్డుకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలను అందజేస్తోంది. ఈ క్రమంలోనే కార్డుదారులు వాటిని మిల్లింగ్ చేసుకుని వినియోగించుకుంటున్నారు. ఇకపై లబ్దిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా.. పౌరసరఫరాల శాఖ చరిత్రలో తొలిసారిగా రాగిపిండి పంపిణీకి శ్రీకారం చుడుతోంది. నేరుగా రైతుల నుంచే కొనుగోలు రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడంలో భాగంగా స్థానిక రైతులకు సంపూర్ణ మద్దతు కల్పిస్తూ పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాఖ ద్వారా రైతులను చిరుధాన్యాల సాగువైపు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే రాయితీపై చిరుధాన్యాల విత్తనాలను అందిస్తోంది. కొర్రల కొనుగోలుకు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ మద్దతు ధరల జాబితాలో చేర్పించింది. కొర్రలు కోతలకు వచ్చే సమయంలో వాటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పుడు శ్రీసత్యసాయి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రాగులు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో జొన్నల కొనుగోలును చేపడుతోంది. ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ ప్రామాణికంగా వ్యవసాయ క్షేత్రం నుంచే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ రైతుకు బాసటగా నిలుస్తోంది. వాటిని ప్రాసెసింగ్ చేసి తిరిగిన స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీ చేస్తోంది. దీంతోపాటు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ద్వారా ఇతర రాష్రా్టల నుంచి రాగులును దిగుమతి చేసుకుంటోంది. ఈ ఖరీఫ్లో ఇప్పటివరకు రాగులు, జొన్నలు కలిపి సుమారు 6,500 టన్నులకుపైగా సేకరించింది. మరో 20 వేల టన్నుల జొన్నలు.. నంద్యాల జిల్లాలో జొన్నలు మంచి దిగుబడులు వచ్చాయి. రైతుల నుంచి డిమాండ్ ఉండటంతో అదనంగా జొన్నల కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీని ప్రకా రం మరో 20వేల టన్నుల వరకు జొన్నలను సేకరించనుంది. ఇందులో రాష్ట్ర అవసరాలకు పోనూ మిగిలిన వాటిని ఎఫ్సీఐకి అందించనుంది. తద్వారా రాష్ట్ర రైతులకు పూర్తి మద్దతు ధర దక్కేలా చర్యలు చేపడుతోంది. గోధుమ పిండికి డిమాండ్.. పీడీఎస్లో అందిస్తున్న ఫోర్టిఫైడ్ గోధుమ పిండికి మంచి డిమాండ్ ఉంది. ప్రతి నెలా 2,500 టన్నుల నుంచి 5 వేల టన్నుల వరకు వినియోగం ఉంటోంది. ఇదే గోధుమ పిండిని కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. రాష్ట్రంలో కిలో రూ.16కే అందిస్తున్నారు. మార్కెట్ రేటు కంటే తక్కువకే నాణ్యమైన గోధుమపిండి లభిస్తుండటంతో కార్డుదారులు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యం.. పీడీఎస్లో పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. అందుకే నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరా చేస్తున్నాం. రాగులుకు వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే వాటిని మిల్లింగ్ చేసుకుని వాడుకునేందుకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. అందుకే రాగిపిండిని ఇవ్వాలని నిర్ణయించాం. కిలో ప్యాకెట్ల రూపంలో రూ.11కే మార్చి నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. రాగులను ప్రాసెసింగ్ చేసి.. పిండి ఆడించి, ప్యాకింగ్, రవాణా చేసేందుకయ్యే ఖర్చులను మాత్రమే రేటుగా నిర్ధారించాం. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
ప్రతిష్టాత్మక అగ్రి షో ‘కిసాన్ 2024’ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద అగ్రి షో ‘కిసాన్ 2024’ 2వ ఎడిషన్ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పలువురు రైతులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోనే అతిపెద్ద అగ్రి షో - కిసాన్ 2024 వ్యవసాయ రంగంలోని ప్రముఖులు, నిపుణులు, ప్రగతిశీల రైతులను వేదిక పైకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 1వ నుంచి 3వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమం వ్యవసాయంలో తాజా పురోగతుల ప్రదర్శనపై దృష్టి సారించింది. ముఖ్యంగా కిసాన్ హైదరాబాద్ 2024.. వ్యవసాయ పరిశ్రమలోని విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లకు శక్తివంతమైన వేదికను అందిస్తోంది. ఎగ్జిబిషన్లో వ్యవసాయ యంత్రాలు-పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, వాటర్-ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టికల్చర్, వివిధ రకాల పనిముట్లు(టూల్స్), ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్తో సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్ మొబైల్ యాప్లు సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ పొందుపరిచారు. ఈ అద్భుత వ్యవసాయ ప్రదర్శనలో 140 మందికి పైగా ఎగ్జిబిటర్లు, అగ్రి పరిశ్రమల ప్రముఖుల నుండి ఇన్నోవేటివ్ స్టార్టప్ల వరకు పాల్గొన్నారు. ఈ వేదికపై వ్యవసాయానికి అనుకూలమైన తాజా ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి 140కి పైగా కంపెనీలను, 20,000 మంది సందర్శకులను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "కిసాన్ హైదరాబాద్ అనేది వ్యవసాయంలో విభిన్న వాటాదారులను విజయవంతంగా ఒకచోట చేర్చిన ఒక వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించడమే కాకుండా తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి అవసరమైన సంభాషణలను, ప్రోత్సాహాకాలను రైతులకు అందిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు." 3 రోజుల అగ్రి షో నేపథ్యంలో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు నాలెడ్జ్ సెషన్లను అందించడానికి ఏకకాల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో సమగ్ర ప్రదర్శన, సమాచార సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో తాజా పురోగతులు, ఉత్పత్తులు, సేవలను అన్వేషించే అవకాశాన్ని హాజరైన వారికి అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
వ్యవసాయానికి రూ.1.33 లక్షల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రుణ ప్రణాళికను ఖరారు చేసింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఇతర రంగాలు సహా మొత్తంగా రూ.2.80 లక్షల కోట్ల రుణాలకు పచ్చజెండా ఊపింది. ఇది గతేడాది రుణ ప్రణాళికతో పోలిస్తే రూ.94 వేల కోట్లు అదనం కావటం విశేషం. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ రుణ ప్రణాళికతో కూడిన ఫోకస్ పేపర్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకే పెద్దపీట వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి భారీ చేయూతనే లభించే అవకాశం ఉంది. రూ.133587.86 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట వేయటం విశేషం. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికలో నాబార్డు ఖరారు చేసిన మొత్తం రూ.1,12,762 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరారైన వ్యవసాయ రుణాల్లో.. పంటల సాగు, మార్కెటింగ్ కోసం రూ.81,478.02 కోట్లు, టర్మ్లోన్ల కింద రూ.27,664.91 కోట్లు, వ్యవసాయ రంగంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.5197.26 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాలకు రూ.19,247.67 కోట్ల రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. వ్యవసాయ రంగం తర్వాత సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను ఖరారు చేసింది. ఈ రంగానికి రూ.1,29,635.83 కోట్ల వరకు రుణాల రూపంలో ఇవ్వవచ్చని బ్యాంకర్లకు సూచించింది. బ్యాంకర్లు మరింత సాయానికి ముందుకు రావాలి: తుమ్మల దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా బ్యాంకర్లు మరింత ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వ్యవసాయంపై ఫోకస్ చేస్తుండటాన్ని నాబార్డు, బ్యాంకర్లు గుర్తించాలని కోరారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని సూచించారు. ఆ రంగంలో గేదెలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని, కానీ ఆవు పాల వృద్ధిని కోరుకుందామని, దీని వల్ల ఆరోగ్యంతోపాటు, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించినట్టవుతుందని మంత్రి తుమ్మల సూచించారు. పామాయిల్ సాగుకు కూడా మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. వరి సాగు విస్తృతంగా సాగుతోందని, కానీ సంప్రదాయ తృణ ధాన్యాల వృద్ధిపై రైతులు దృష్టిసారించాలని మంత్రి కోరారు. నాగార్జున గ్రామీణ బ్యాంకు రుణంతోనే నా తొలి నామినేషన్ తనకు వ్యవసాయం రంగం, అందుకు రుణాలిచ్చే గ్రామీణ బ్యాంకులతో మంచి అనుబంధం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తాను సాగు కోసం నాగార్జున గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకునేవాడినని, 1983 తొలి నామినేషన్ కోసం కూడా ఆ బ్యాంకు నుంచే రుణం తీసుకున్నట్టు వెల్లడించారు. రైతు బంధు నిధులను పెంచుతాం: రఘునందన్రావు రాష్ట్రంలో ప్రతి రెండున్నర వేల మంది రైతులకు ఒకటి చొప్పున ఉన్న రైతు వేదికలను ఆధునికీకరించటం ద్వారా వాటి వినియోగాన్ని పెంచి రైతులకు మరింత ఉపయోగకరంగా మారుస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్రావు వెల్లడించారు. వాటిల్లో టూ వే ఆడియో విజువల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో క్రాప్ ఇన్స్రూెన్స్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రైతు భరోసా ద్వారా ప్రస్తుతం అందుతున్న రైతు బంధు నిధులను పెంచుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వీలైనన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు నాబార్డు తీవ్రంగా కృషి చేస్తోందని, వాటి అవసరాలకు తగ్గట్టుగా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటోందని ఆ సంస్థ సీజీఎం సుశీల చింతల పేర్కొన్నారు. ఆర్బీ డీజీఎం రాజేంద్రప్రసాద్, ఎస్బీఐ జీఎం, ఎస్ఎల్బీసీ కన్వీనర్ దేబాశీష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. 2024–25 సంవత్సరానికి వివిధ రంగాలకు నాబార్డు ఖరారు చేసిన రుణ ప్రణాళిక వ్యవసాయం, అనుబంధ రంగాల రూ.133587.86 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రూ. 129635.83 కోట్లు ఎగుమతుల కోసం రుణాలు రూ. 451.67 కోట్లు విద్య రూ.2706.50 కోట్లు గృహనిర్మాణం రూ.10768.58 కోట్లు పునరుత్పాదక విద్యుత్తు రూ.566.61కోట్లు ఇతర రంగాలు రూ.2283.51 -
సన్నకారుకు నారూ నీరూ!
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ప్రస్తుతం ఒక ఫలవంతమైన మార్పు నిశ్శబ్దంగా జరుగుతోంది. ఇది సరికొత్త సన్నకారు వ్యవసాయానికి పరివర్తనను రూపొందిస్తోంది. ఏపీలో ఎనిమిది లక్షల మంది రైతులు రసాయనాల నుంచి పూర్తిగా రసాయనేతర వ్యవసాయం వైపు మళ్లారు. లేదా పరివర్తన దశలో ఉన్నారు. 2031 నాటికి రాష్ట్రంలో మొత్తం 60 లక్షల వ్యవసాయ జనాభాను రసాయనాల నుండి సహజ వ్యవసాయానికి తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రైతు సంక్షేమానికి నారు, నీరు నీరు పోయడమే! కార్పొరేట్ ప్రయోజనాలకు మాత్రమే సరిపోయే కాలం చెల్లిన ఆర్థిక విధానాలను నియంత్రించడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఈ అద్భుతమైన మార్పును సాకారం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వీరపనేని గూడెం గ్రామానికి చెందిన సన్నకారు రైతు మహిళ రాధిక. ఆమెకు 1.1 ఎకరాల భూమి మాత్రమే ఉంది. దాంట్లో సహజ వ్యవసాయం సాగుతోంది. తన కొడుకు ఎంబీఏ చేశాడని, కూతురు అమెరికాలో చదువుతోందని ఆమె చెప్పినప్పుడు నేను నమ్మ లేకపోయాను. పిల్లలు బాగా చదువుతున్నందున ఆమె వ్యవసా యాన్ని ఎందుకు వదిలిపెట్టలేదని అడిగాను. అందుకు ఆమె ‘‘నేను నా పని వదులుకుని వారితో కలిసి జీవించాలని నా పిల్లలు కోరుకుంటారు. కానీ మీరు ఏం చేస్తున్నారో అది చేయండి. అలాగే నేను ఏం చేస్తూ ఆనందిస్తున్నానో ఆ పనిని చేయనివ్వండి అని వారికి చెబుతు న్నాను’’ అని పేర్కొంది. ఆమె సహజసాగు పంట పద్ధతిని అనుస రిస్తోంది, దీనినే ఏటీఎమ్ (ఎనీ టైమ్ మనీ) అని పిలుస్తారు. ఇది ఆమెకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తోంది. ఏటీఎమ్ అనేది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ–నిర్వహణలోని సహజ వ్యవసాయ కార్యక్రమం కింద పొందుపరిచిన కార్యకలాపాల వర్గీకర ణలో ఒక రూపం, ఇది ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయ డంలో భాగం. రెండు దశాబ్దాల క్రితం ఖమ్మం జిల్లాలోని పునుకల గ్రామం నుంచి ప్రారంభమైన ఈ వ్యవసాయ– పర్యావరణ సేద్య విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లోని 3,730 గ్రామాలకు విస్తరించింది. ఎనిమిది లక్షల మంది రైతులు రసాయనాల నుంచి పూర్తిగా రసాయనేతర వ్యవసాయం వైపు మళ్లారు లేదా పరివర్తన దశలో ఉన్నారు. 2031 నాటికి రాష్ట్రం మొత్తం 60 లక్షల వ్యవసాయ జనాభాను రసాయనాల నుండి సహజ వ్యవసాయానికి తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైసమ్మ ఎన్టీఆర్ జిల్లా బత్తినపాడు గ్రామానికి చెందిన మహిళ. ఆమె రెండు ఎకరాల్లో పత్తి సాగు చేసేది. 2018లో సహజ వ్యవసాయం వైపు మళ్లింది. తన కూతురు ఏరోనాటికల్ ఇంజనీర్ అని చెప్పినప్పుడు, ఒక్క క్షణం నేను ఒక మధ్యతరగతి గృహిణితో మాట్లా డుతున్నట్లు అనిపించింది. అయితే వీరు చిన్న, సన్నకారు రైతులు. ఎక్కువగా మహిళలు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు వాతావరణాన్ని తట్టుకోగల, పర్యావరణానికి ఆరోగ్యకరమైన సహజ వ్యవసాయ విధానపు సద్గుణాలు, బలాలతో పాటు దాని అపారమైన సంభావ్యత గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. వారిలో కొందరికి, సగటున 1 ఎకరం కంటే తక్కువ భూమి ఉంది. కొంతమందికి 0.10 నుండి 0.50 సెంట్ల వరకు భూమి ఉంది. ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్)కి చెందిన గుంటూరు ప్రధాన కార్యాలయంలో వీరు సమావేశ మయ్యారు. దీనిని ప్రభుత్వ యాజమాన్యంలోని రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) నిర్వహిస్తోంది. ప్రధాన స్రవంతి ఆలోచన ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అమలు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుందో వెనువెంటనే స్పష్ట మైంది. చిన్న భూకమతాలు తరచుగా పనికిరానివిగా పరిగణించ బడతాయి కాబట్టి భూ సంస్కరణలు, కార్మిక సంస్కరణల పేరుతో ఆర్థికవేత్తలు, కార్పొరేట్ నాయకులు వ్యవసాయం నుండి వారిని మిన హాయించాలని వాదించారు, చిన్న కమతాల్లో పనిచేసేవారిని పట్టణ శ్రామికశక్తిలో ఏకీకృతం చేయాలని కోరుతారు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక రూపకల్పన చిన్న, సన్నకారు రైతులను ఆర్థిక భారంగా మారుస్తుంది. కానీ కొద్దిగా చేయూత నివ్వడంతోపాటు తగిన మార్కె టింగ్ కార్యక్రమాలు ఈ పొలాలను ఆచరణీయంగా మార్చగలవు, ఇవి భూగ్రహాన్ని వేడి చేయవు. గాలి, నీరు, నేలను విషపూరితం చేయవు. 50 సంవత్సరాల కాలంలో 51 దేశాలలో నిర్వహించిన అధ్యయనాల నుండి సేకరించిన డేటాతో కొంతకాలం క్రితం ‘నేచర్’ పత్రికలో వచ్చిన ఒక వ్యాసం నాకు గుర్తొస్తోంది. సాధారణంగా భావించే అవగాహనకు విరుద్ధంగా, చిన్న పొలాలు మరింత ఉత్పాద కత కలిగి ఉండి పర్యావరణపరంగా స్థిరమైనవి అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. కానీ అలాంటి అధ్యయనాలు ప్రధాన స్రవంతి సైన్స్ విధానంలో భాగం కావు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, మీడియా, విధాన నిర్ణేతలు వ్యవసాయ వ్యాపార దిగ్గజాల వాణిజ్య ప్రయోజనాలను దశాబ్దాలుగా ఆమోదించారు. ఇవి సాంద్ర వ్యవసాయాన్ని మినహాయించి, పర్యావరణపరంగా ఆరోగ్యకరమైన, సమాన ఉత్పాదక, స్థిరమైన ఆహార వ్యవస్థ వైపు వెళ్లే ప్రయత్నాలను నిరోధించాయి. అయినప్పటికీ ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతోంది. ఇది కొత్త వ్యవసాయానికి పరివర్తనను రూపొందిస్తోంది. నేను దీనిని కొత్త వ్యవ సాయం అని పిలుస్తాను. ఎందుకంటే మిగులు ఉత్పత్తిపై ఎక్కువగా ఆధారపడే సాంప్రదాయిక ఏకరూప వ్యవసాయ పద్ధతులు వ్యవ సాయ భూములను ఎండిపోయేలా చేశాయి. భూములను నిర్వీర్యంగా మార్చాయి, భూగర్భ జలాలను తోడేశాయి. ఆహార గొలుసును కలుషితం చేశాయి. పైగా వ్యవసాయ జనాభా వ్యవసాయాన్ని విడిచిపెట్టి వలస వెళ్లవలసి వచ్చింది. ఇంకా ఇది మానవ వ్యాధులు, వాతావరణ అత్యవసర పరిస్థితుల అధిక భారానికి చెందిన ద్వంద్వ సవాళ్లకు దోహదపడింది. అయితే, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, భవిష్యత్తులో ఈ రకమైన వ్యవసాయం పరిమిత పాత్రతో మిగిలిపోతుంది. అందుకే ఆహార వ్యవస్థను వ్యవసాయ – పర్యావరణ వ్యవస్థ వైపు మళ్లించడం అనేది ఆహార భద్రత, పోషణను మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరిస్తుంది. ఆర్థికంగా లాభదాయక మైన జీవనోపాధిని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. వ్యవసాయం గురించి పునరాలోచించడం ఈ కాలపు అవసరం. ఫిలిప్పీన్స్ నుండి వియత్నాం వరకు, కంబోడియా నుండి మెక్సికో వరకు; భారతదేశం నుండి అమెరికా వరకు, వ్యవసాయ–పర్యావరణ శాస్త్రం వైపు ఒక బలమైన, శక్తిమంతమైన ఉద్యమంగా నెమ్మదిగానే కావచ్చు కానీ స్థిరంగా విధానాలలో మార్పును తీసుకువస్తోంది. అయితే కార్పొరేట్ ప్రయోజనాలకు మాత్రమే సరిపోయే కాలం చెల్లిన ఆర్థిక విధానాలను విస్మరించాల్సిన అవసరం మాత్రం ఉంది. వ్యవ సాయ పరిశోధన, విద్య కోసం పర్యావరణ స్థిరత్వం వైపు పరివర్తనను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. జన్యుపరంగా మార్పు చెందిన బీటీ పత్తి విఫలం కావడం వల్ల కలిగే విధ్వంసాన్ని తీసుకోండి. వెండి బుల్లెట్గా కీర్తించబడినది దుమ్ములో కలిసిపోయింది. మరోవైపు సేంద్రియ పద్ధతిలో పత్తి సాగు చేస్తున్న ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ వంటి రైతుల్లో నాకు ఆశ కనిపిస్తోంది. అతని పొలంలో 100 కంటే ఎక్కువ బంతులతో పెద్ద సంఖ్యలో మొక్కలు ఉన్నాయి. 50 కంటే ఎక్కువ ఆరోగ్యకరమైన బంతులు ఉన్న మొక్కను మంచి పంటగా పేర్కొనవచ్చు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని, ఇది చాలా ప్రోత్సా హకరంగా ఉందన్నారు. అదే విధంగా అదే జిల్లాకు చెందిన గోపాల రావు 3.5 ఎకరాల్లో సేంద్రియ వరి సాగు చేశాడు. రెండేళ్ల క్రితం సేంద్రియ వ్యవసాయానికి మారిన ఆయన ఎకరాకు దాదాపు 30 క్వింటాళ్ల పంట వస్తుందని చెప్పారు. రసాయనేతర వ్యవసాయం కాబట్టి ఇది సాంద్ర వ్యవసాయంతో సానుకూలంగా పోలిక అవుతుంది. దీనికి మరిన్ని పరిశోధనలు, ప్రభుత్వ రంగ పెట్టుబడులు అవసరం. ఏమైనా మనం వెనక్కి తగ్గకూడదు. చిన్న, సన్నకారు రైతులను చేయి చేయి పట్టి సరైన దిశలో నడిపిద్దాం. అప్పుడే వ్యవసాయం మరింత ఆశాజనకం అవుతుంది. దేవిందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
పంటలపై శాటి‘లైట్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏయే పంటలను, ఎంతెంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలను పక్కాగా తేల్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం శాటిలైట్ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పంటల నమోదు ప్రక్రియ పక్కాగా ఉండాలన్న లక్ష్యంతో ఇప్పటికే 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద శాటిలైట్ సర్వే ప్రారంభించారు. డిసెంబర్ 20 నుంచి 23 వరకు.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. 144 మండలాల్లోని 318 క్లస్టర్లలో ప్రక్రియను పూర్తి చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శాటిలైట్ సర్వే చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో.. రాష్ట్రంలో ఇప్పటివరకు పంటల నమోదు ప్రక్రియ కొంత అశాస్త్రీయంగా ఉందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే శాటిలైట్ సర్వే చేపట్టడానికి అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. క్లస్టర్ల వారీగా ప్రతి 300 మీటర్ల పరిధిలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు అవుతున్నాయనేది ఈ ప్రక్రియలో భాగంగా లెక్కిస్తారు. ఈ యాప్లో ‘గ్రౌండ్ ట్రూత్ పాయింట్ (జీటీ పాయింట్)’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు ఆయా క్లస్టర్ పరిధిలోని సంబంధిత పాయింట్ వద్దకు వెళ్లి పరిశీలించి.. పంటల వివరాలు నమోదు చేస్తారు. క్షేత్రస్థాయికి వెళితేనే వివరాలు కనిపించేలా.. వ్యవసాయ శాఖలో కొన్నేళ్లుగా ఏఈవోలు రోజువారీ హాజరు, రైతుబీమా, రైతుబంధు నమోదు కోసం ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లు, మొబైల్ ఫోన్లలో యాక్టివ్ ౖలాగర్ యాప్ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా సర్వే నంబర్ల ఆధారంగా పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. మొదట్లో రైతు యూనిట్గా పంటల సర్వే చేపట్టగా.. పంటలు అమ్ముకునే సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో సర్వే నంబర్ల ఆధారంగా పంటలను అప్లోడ్ చేశారు. ఈ విధానంలో ఏఈవోలు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు రైతులు, రెవెన్యూ అధికారులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలాంటి లోటుపాట్లను సరిచేసి కచ్చితత్వంతో పంటల నమోదు చేపట్టేందుకు తాజాగా యాప్ను అందుబాటులోకి తెచ్చారు. సంబంధిత సర్వే నంబర్ ప్రాంతానికి వెళ్లినప్పుడే వివరాలు కనిపించేలా తీర్చిదిద్దారు. ఏఈవోలు ఏదైనా సర్వే నంబర్ వద్దకు వెళ్లాల్సి వస్తే.. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆ లొకేషన్కు చేరుకోవచ్చు. శాటిలైట్ ద్వారా 300 మీటర్ల పరిధిలో ఉన్న సర్వే నంబర్ వివరాలు యాప్లో కనిపిస్తాయి. ఇలా పక్కాగా పంటల నమోదు జరిగితే.. రాష్ట్రవ్యాప్తంగా ఏ పంటలు ఎంతమేర సాగు చేస్తున్నారనేది కచ్చితంగా లెక్కించవచ్చని అధికారులు చెప్తున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఏదైనా పథకానికి పంటల సాగుకు లింక్ పెట్టాల్సి వచ్చినా.. ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారం ఉంటుందని అంటున్నారు. -
రబీలోనూ ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి : రబీ సీజన్లోనూ నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. సీజన్లో నెలకొన్న బెట్ట పరిస్థితులకనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుచేసేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. సీజన్ ఆరంభమై నెలన్నర రోజులైన నేపథ్యంలో.. రబీసాగు లక్ష్యం 55.96 లక్షల ఎకరాలుగా కాగా, ఇందుకు 3,64,372 క్వింటాళ్ల విత్తనం అవసరమని వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. దీంతో 3,78,200 టన్నులను ఆర్బీకేల్లో పొజిషన్ చేయగా, ఇప్పటివరకు 2,49,647 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ప్రధానంగా 2.45 లక్షల క్వింటాళ్ల శనగ, 3,500 క్వింటాళ్ల వేరుశనగ, 500 క్వింటాళ్ల చొప్పున వరి, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. గతేడాది ఇదే సమయానికి 10.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 8.5 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టిసారించింది. ఇప్పటికే ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను ప్రతీ 15 రోజులకోసారి సమీక్షిస్తూ తదనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే, అచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సిఫార్సులకనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించారు. గోదావరి ప్రాజెక్టు కింద సాగునీరు గోదావరిలో పుష్కలంగా నీరుండడంతో ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ, ఆక్వా అవసరాలకు తగినంత నీరివ్వనున్నారు. ఐఏబీ–డీఏఏబీ సమావేశంలో ఏ మేరకు సాగునీరు ఉందో అంచనావేస్తూ ఎంత విస్తీర్ణంలో సాగుకు నీరు ఇవ్వగలమో రైతులకు ముందుగానే చెబుతున్నారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు కాలువల కింద నీటి సరఫరాను నిలిపివేసే తేదీలపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పింస్తున్నారు. ఇక శివారు ప్రాంతాల్లో (టెయిల్ ఎండ్ ఏరియాస్) సాధ్యమైనంత త్వరగా నాట్లు వేసుకునేలా అవగాహన కల్పింంచడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులు విధిగా పాటించేలా రైతులను అప్రమత్తం చేయనున్నారు. గోదావరి డెల్టా పరిధిలో వెదజల్లు సాగును ప్రోత్సహించడంతో పాటు అత్యధిక నీటి వినియోగమయ్యే పంటల్లో ఒకటైన మొక్కజొన్న సాగును కాలువల కింద ప్రోత్సహించకూడదని నిర్ణయించారు. వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఐఏబీ, డీఏఏబీ సమావేశాలను సంయుక్తంగా నిర్వహించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మెట్ట ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా అపరాల సాగును, కాలువల ఎగువ ప్రాంతాల్లో అపరాలతో పాటు మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకనుగుణంగా 14 జిల్లాల పరిధిలో కనీసం 60వేల ఎకరాల్లో కంటిజెంట్ ప్లానింగ్ అమలుచేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం 6,229 క్వింటాళ్ల విత్తనం అవసరమని గుర్తించారు. వీటిని సబ్సిడీపై రైతులకు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం స్వల్పకాలంలో చేతికొచ్చే పంటల సాగును ప్రోత్సహించేలా రూపొందించిన ఈ కార్యాచరణను ఆర్బీకేల ద్వారా కరపత్రాలు, వాల్ పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు. అంతేకాక.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికనుగుణంగా సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులకు సంబంధించి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కూడిన చిన్నపాటి వీడియో, ఆడియో సందేశాలతో రైతులకు అవగాహన కల్పింస్తున్నారు. -
రబీ రంది తీరేదెలా?
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటివరకు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ అయ్యింది. 9.44 లక్షల ఎకరాల్లో రైతులు ఇప్పటికే యాసంగి పంటలు సాగు చేశారు. అందులో 1.47 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మరో 38 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు అవసరమవుతాయి. ఈ కీలకమైన సమయంలో సొమ్ము పడకపోతే ప్రైవేట్ అప్పులే శరణ్యమని రైతుల ఆందోళన చెందుతున్నారు. ఈనెల 12 నుంచి రైతుబంధు ప్రక్రియ ప్రారంభం కాగా, ఎకరాలోపు భూమి ఉన్న రైతుల్లో.. అది కూడా కొందరికే సొమ్ము పడింది. వాస్తవంగా రోజుకో ఎకరా చొప్పున మొదటి రోజు ఎకరా వరకు, రెండో రోజు రెండెకరాలు... ఇలా రోజుకు ఎకరం చొప్పున గతంలో ఇచ్చేవారు. అలాగే ఇస్తామని అధికారులు కూడా చెప్పారు. కానీ ఎకరాకు మించి భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అందలేదని రైతులు అంటున్నారు. మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలు: అధికారంలోకి రాగానే రైతుబంధు సొమ్ము అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఆ ప్రకారం రైతుబంధు సొమ్ము జమ ప్రక్రియ ప్రారంభమైంది. అది ఎకరాలోపు కొందరికి మాత్రమే ఇచ్చి నిలిచిపోయింది. మిగిలిన వారికి సొమ్ము పడలేదు. మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలున్నారు. వారందరికీ కలిపి రూ.7,625 కోట్లు చెల్లించాలి. ఎకరాలోపు ఉన్న రైతులు 22.55 లక్షల మంది ఉన్నారు. వారికి రూ. 642.57 కోట్లు చెల్లించాలి. ఇప్పటివరకు ఎకరాలోపున్న వారి లో సగం మందికే రైతుబంధు వచ్చింది. మొత్తంగా చూస్తే రైతుబంధు కోసం ఇంకా దాదాపు 58 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని వ్యవసాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. నిధులు లేకపోవడం వల్లే రైతుబంధు ఆలస్యమవుతుందని అధికారులు అంటున్నారు. ఈ నెలాఖరుకైనా ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇదిలాఉంటే రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. గత పంటల రుణమాఫీ పూర్తికాకపోవడం, ఇంకా పెండింగ్లో ఉండటంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. కొత్త రుణమాఫీపై కసరత్తు... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై మార్గదర్శకాలు ఖరారు చేయాలని ప్రభుత్వం వ్యవసాయశాఖకు విన్నవించినట్టు తెలిసింది. గత రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటారా? లేక కొత్తగా అదనపు నిబంధనలతో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. -
బడ్డింగ్ మెథడ్లో గ్రాఫ్టింగ్ చేస్తూ.. పనస వైభవం!
కేరళలోని కొట్టాయంకు చెందిన రైతు వి.ఎ. థామస్ 8 ఏళ్ల క్రితం రబ్బర్ సాగుకు స్వస్తి చెప్పారు. 70 ఏళ్ల వయసులో రసాయనిక వ్యవసాయం వదిలి సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. ఇంత వరకే అయితే పెద్ద విశేషం లేదు. కొట్టాయం దగ్గర్లోని చక్కంపుఝ గ్రామంలోని తమ 5 ఎకరాల కుటుంబ క్షేత్రాన్ని 400 రకాల పనస చెట్లతో జీవవైవిధ్యానికి చెరగని చిరునామాగా మార్చారు థామస్. బడ్ గ్రాఫ్టింగ్ లేదా బడ్డింగ్ మెథడ్లో గ్రాఫ్టింగ్ చేస్తూ కొత్త రకాలను సృష్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పనస తొనలను రుచి చూస్తారు. నచ్చిన రకాల మొక్కల్ని వెంట తెచ్చి నాటుకుంటారు. రెండేళ్లు, ఏడాదిన్నరలోనే కాపుకొచ్చే వియత్నాం, కంబోడియాల నుంచి కూడా కొన్ని పనస రకాలను సేకరించారు. మొక్కలతో పాటు ఎండబెట్టిన పనస తొనలను అమ్ముతూ ఎకరానికి ఏటా రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఎండబెట్టిన పచ్చి పనస కాయలను కిలో రూ. వెయ్యి. ఎండబెట్టిన పనస పండ్లను కిలో రూ. 2 వేలకు అమ్ముతుండటం విశేషం! ఇవి కూడా చదవండి: ‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%! -
తెలంగాణ: రైతు సాయంలో సమూల మార్పులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి కూడా రైతుబంధు అందుతోంది. వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సాయపడటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పథకం కింద.. భారీగా భూములున్న వారికి, ధనికులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలన్న విమర్శలు ఉన్నా యి. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చినా.. అప్పటి సీఎం కేసీఆర్ అందరికీ ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. కొందరికే ఇస్తే పథకంలో పైరవీలు, అక్రమాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నది కేసీఆర్ భావన అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. పరిమితి ఐదెకరాలా.. పదెకరాలా? కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థికసాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే కొత్త సర్కారు రైతుబంధు సాయానికి ఐదెకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పదెకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. భారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రెండు మూడెకరాలున్నా రైతుబంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నందున.. ఇప్పటికిప్పుడే ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో గతంలో మాదిరిగానే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తారని.. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తాయని వివరిస్తున్నారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. మొత్తంగా 68.99 లక్షల మందికి.. రాష్ట్రంలో రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.4 వేల చొప్పున.. ఏటా రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. తర్వాత ప్రభుత్వం ఈ సొమ్మును ఏడాదికి రూ.10 వేలు చేసింది. 2018 వానాకాలం సీజన్లో 1.30కోట్ల ఎకరాలకు చెందిన 50.25లక్షల మంది రైతులకు రూ.5,236 కోట్లు జమచేయగా.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. మొత్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతులకు రూ.72,815 కోట్లు జమ చేశారు. 90శాతంపైగా రైతులు ఐదెకరాల్లోపు వారే.. ఈ ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం చూస్తే.. రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షల మందికాగా.. అందులో అత్యధికంగా ఎకరాలోపే భూమి ఉన్న రైతులే 22.55 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో ఉన్న భూమి 12.85 లక్షల ఎకరాలు మాత్రమే. ♦ ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి రైతుల సంఖ్య 16.98 లక్షలుకాగా.. వీరి చేతిలో ఉన్న మొత్తం భూమి 25.57 లక్షల ఎకరాలు. ♦ రెండు నుంచి మూడెకరాల వరకు ఉన్న రైతులు 10.89 లక్షలు అయితే ఉండగా.. వీరి మొత్తం భూమి 26.50 లక్షల ఎకరాలు. ♦ ఇక మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్న 6.64 లక్షల మంది రైతుల చేతిలో 22.62 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ నాలుగు నుంచి ఐదెకరాల భూమి ఉన్న 5.26 లక్షల మంది చేతిలో 21.04 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ మొత్తంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలుకాగా.. వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90శాతానికిపైగా ఐదెకరాలలోపే భూములు ఉన్నాయి. ♦ ఐదెకరాలకు పైబడి భూమిన ఉన్న రైతుల సంఖ్య కేవలం 6.65 లక్షలే.. కానీ వారి వద్ద ఏకంగా 52 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యధికంగా సన్నచిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని.. ఐదెకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపచేసినట్టు అవుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. -
పంట.. నీటిపాలు
సాక్షి, హైదరాబాద్/ఖమ్మంవ్యవసాయం/సూపర్బజార్(కొత్తగూడెం): వర్షాలతో చేతికొచ్చిన పంటలన్నీ నేలపాలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, మిర్చితోపాటు టమాటా, వంగ, బీర, బెండ తోటలు కూడా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న వరి తడిసిపోవడంతో మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడింది. కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న వరి పంట కూడా నేల రాలింది. నష్టంపై వ్యవసాయశాఖ అంచనా వేస్తోందని అధికారులు చెబుతున్నారు. రంగుమారుతున్న పత్తి.. ప్రస్తుతం పత్తి తీతలు కొనసాగుతున్నాయి. ఈదురుగాలులు, వానలతో పత్తి నేలరాలిపోతోంది. రంగు మారి నాణ్యత కోల్పోతుండగా, కాయలోకి నీరు దిగి పత్తి నల్లబడుతోంది. పత్తి తీతకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కూలీల ఖర్చు కూడా పెరుగుతుంది. వర్షానికి తడిసిన పత్తి బరువు కూడా తగ్గుతుంది. ఇక పత్తిలో ఉన్న గింజ మొలకెత్తే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం రెండో తీతలో ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు చేతికందే దశలో ఉంది. తుపాను కారణంగా ఈ పత్తి చేతికందుతుందా లేదా అనేది రైతుల్లో ఆందోళనగా ఉంది. ఒకవేళ తుపాను ప్రభావం తగ్గినా ప్రస్తుత పరిస్థితుల్లో చేతి కందే పత్తి బరువు తగ్గి 4 క్వింటాళ్లకు ఒక క్వింటా నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. నేలవాలుతున్న వరి.. వానకాలం వరి కోతలు సగమే పూర్తయ్యాయి. ఇంకా ఆయా జిల్లాల్లో కోతలు కొనసాగుతున్నాయి. వరి కోత, నూర్పిడి దశలో ఉంది. పలు ప్రాంతాల్లో ధాన్యం కల్లాల్లో ఆరబెడుతున్నారు. కోత దశలో ఉన్న వరి ఈదురుగాలులు, తుపాను కారణంగా కంకి బరువుకు నేలవాలుతోంది. గాలులకు ఆరిపోయి ఉన్న కంకుల నుంచి గింజలు నేలరాలిపోతున్నాయి. ఇక నేలవాలిన కంకులు తేమ కారణంగా మొలకొచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇక నేలవాలిన వరిని యంత్రాలు కోయటం అంతగా సాధ్యం కాదు. కూలీలతో వరికోతలు జరిపించాల్సి ఉంటుంది. దీంతో రైతులకు ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఓ వైపు పంట నేలవాలి కొంత దెబ్బతినగా, మరో వైపు కూలీల ఖర్చులు పెరిగి పెట్టుబడులు మరింతగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కల్లాల్లో ఆరబెట్టిన రైతులు రాశులుగా చేసి టార్పాలిన్లను కప్పి రక్షించుకునే పనిలో ఉన్నారు. తేమతో ఉన్న ధాన్యం రాశులు నాణ్యత కోల్పోతాయని రైతులు దిగులు చెందుతున్నారు. రెండు రోజులు తుపాను కొనసాగితే రాశుల్లో మొలకొచ్చే ప్రమాదం కూడా ఉందని రైతులు చెబుతున్నారు. మిర్చిని అదే పరిస్థితి... కాత దశలో ఉన్న మిర్చి పైర్లు నేలవాలే ప్రమాదం ఉంది. మిర్చి కాయబరువుతో చెట్టు పడిపోతుందని రైతులు చెబుతున్నారు. అక్కడక్కడ తొలి కోతలు కూడా సాగుతున్నాయి. కోసిన మిర్చి ఆరబెట్టకుండా రాశులుగా కల్లాల్లో ఉంచితే తేమబారిన పడి నాణ్యత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. తేమతో ఉన్న కాయకు నల్లమచ్చ ఆశించే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వానలు మాత్రం రైతులను నష్టపరుస్తున్నాయే తప్పా ప్రయోజనం కలిగించటం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగానే నష్టం ఖమ్మం జిల్లాలో 53,903 మంది రైతులకు చెందిన 82,191 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో అధికంగా వరి 59,307 ఎకరాల్లో నష్టపోయినట్టు చెబుతున్నారు. ► భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 7,450మంది రైతులకు సంబంధించిన 13,608 ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి, పత్తి పంటలు ధ్వంసమైనట్లు అంచనావేశారు. ప్రస్తుతం అధికారులు అంచనాల్లో నిమగ్నం కాగా.. ఒకటి, రెండు రోజుల్లో పంట నష్టంపై స్పష్టత రానుంది. ► వాజేడు మండలంలో ప్రత్యేకాధికారి సర్ధార్ సింగ్ ఆధ్వర్యంలో అధికారులు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రాంత ప్రజలను కాపాడేందుకు ఏటూరునాగారంలో పోలీస్ విపత్తు దళం ముళ్లకట్ట వద్ద హైపవర్ బోటులో రీహార్సల్ చేపట్టింది. చనిపోయిన 13వేల బాతులు...గుండెపోటుతో యజమాని మృతి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురానికి ఏపీలోని జగ్గయ్యపేట మండలానికి చెందిన పేరం ఆదిలక్ష్మి (67) కుటుంబ సభ్యులతో కలిసి బాతులను తీసుకొచ్చి పెంచుతున్నారు. తుపాన్ ప్రభావంతో తడిచిన 13వేల బాతు పిల్లలు మృతి చెందడంతో యజమాని ఆదిలక్ష్మి గుండెపోటుతో మృతి చెందారు. పరిహారం ఇవ్వాలి: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి నష్టపోయిన ఆహార పంటలకు ఎకరాకు రూ. 20 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ. 40 వేలు చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి.సాగర్ కోరారు. వేలాది ఎకరాల్లో పంటలు తడిసి ముద్దయ్యాయి: కూనంనేని రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. పత్తి, మిర్చికి ఎకరాకు రూ. 40 వేలు, వరికి ఎకరాకు రూ. 20 వేలు, కూరగాయలకు ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వాలన్నారు. -
సీఎం జగన్ ఆదేశాలు.. సాయం శరవేగం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: తుపాను ప్రభావానికి గురైన జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం వేగంగా సహాయక చర్యలు చేపట్టింది. తుపాను ప్రారంభం కాక ముందు నుంచే కట్టుదిట్టంగా ముందస్తు ఏర్పాట్లు చేయడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. ఎనిమిది జిల్లాల్లో 320 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. 20,572 మందిని తరలించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 124 శిబిరాల్లో 6,077 మందికి ఆశ్రయం కల్పించారు. తిరుపతి జిల్లాలో 36 కేంద్రాల్లో 3,386 మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో పన్నెండు కేంద్రాల్లో 5,113, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 37 కేంద్రాల్లో 910, బాపట్ల జిల్లాలో 74 కేంద్రాల్లో 3,888, గుంటూరులో 14 శిబిరాల్లో 1,111, కోనసీమ జిల్లాలో 36 శిబిరాల్లో 910, పశ్చిమ గోదావరిలో 32 శిబిరాల్లో 5,113, తూర్పు గోదావరిలో 3 కేంద్రాల్లో 87 మందికి పునరావాసం కల్పించారు. బాధితులందరికీ భోజనం, మంచి నీటి సౌకర్యం కల్పించారు. వారికి అక్కడే నిత్యావసరాలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాలు ఇళ్లకు వెళ్లే ముందు ఆర్థిక సాయంగా రూ.1000 నుంచి రూ.2500 అందిస్తున్నారు. తుఫాను ప్రభావిత గ్రామాల్లో 6 ఎస్డీఆర్ఎఫ్, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు, ఉలవపాడు, బాపట్ల, నాయుడుపేటలో ఈ బృందాలు సేవలు అందిస్తున్నాయి. అధికార యంత్రాంగం దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించడంతో రాకపోకలు యధాతథంగా కొనసాగుతున్నాయి. వర్షం తెరిపి ఇవ్వడంతో రైతులు ముంపునకు గురైన పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఆర్బీకే సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరోవైపు రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యలతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆపదలో ఉన్న రైతులను గుర్తించడమే కాకుండా, వారి వద్ద నుంచి ధాన్యం కొనుగోలు వెంటనే కొనుగోలు చేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. సీఎం ఆదేశాల మేరకు తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. బాపట్ల జిల్లా రావికంపాడులో రైతులతో కలసి వర్షపు నీటిని పొలం నుంచి బయటకు మళ్లిస్తున్న ఆర్బీకే సిబ్బంది.. యుద్ధ ప్రాతిపదికన కదిలిన యంత్రాంగం ► ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాత్రింబవళ్లు 3 వేల మందికి పైగా విద్యుత్ అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తూ సరఫరాను పునరుద్ధరించారు. బాపట్ల జిల్లాలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు బాధితులకు సహాయం అందించే పనుల్లో నిమగ్నమయ్యారు. 353 విద్యుత్ స్తంభాలను శాఖ అధికారులు తిరిగి పునరుద్ధరించారు. కూలిపోయిన 282 చెట్లను రోడ్లపై నుంచి తొలగించారు. 261 గ్రామాలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. 74 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, 3,888 మందికి పునరావాసం కల్పించారు. బుధవారం ఉదయం నుంచే ఉపాధి హామీ కూలీలతో వరి పంట పొలాల్లోని నీటిని బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 93 చోట్ల హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పశువులకు సైతం వైద్య సేవలు అందిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు వచ్చిన ఒక్కో కుటుంబానికి రూ.2,500 పంపిణీ చేశారు. 25 కేజీల బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు పరిహారం పంపిణీ చేస్తున్నారు. మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు బాధితులకు ధైర్యం చెప్పారు. తిరుపతి జిల్లా కోట మండలం రొయ్యలగుంతల వద్ద చిక్కుకున్న వారిని తీసుకువస్తున్న రెస్క్యూ టీం ► తిరుపతి జిల్లాలో నిర్వాసితుల కోసం 80 పునరావాస కేంద్రాలు, 80 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 25 వేల కుటుంబాలకు ప్రభుత్వ సాయం పంపిణీ చేస్తున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.2,500 నగదుతో పాటు ఐదు రకాల వస్తువులు పంపిణీ చేస్తున్నారు. దైవాలదిబ్బ సమీపంలో రొయ్యలగుంతల వద్ద కాపలాదారులుగా పని చేస్తున్న 18 మంది వరద ఉధృతిలో చిక్కుకుపోయారు. గూడూరు ఆర్డీఓ కిరణ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సాయంతో 18 మందిని ఒడ్డుకు చేర్చారు. నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కేరోజా తన చారిటబుల్ ట్రస్టు ద్వారా తన సోదరుడు రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్యాంకర్ల ద్వారా తాగు నీరు సరఫరా చేశారు. ► కాకినాడ జిల్లాలో సుడిగాలికి దెబ్బతిన్న పిఠాపురం మండలం పి.దొంతమూరు, కొత్తపల్లి మండలం కొండెవరంలలో 100 కుటుంబాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి సదుపాయాలు కల్పించారు. కోనసీమ జిల్లాలో సహాయ, పునరావస చర్యలు వేగమందుకున్నాయి.అమలాపురం మున్సిపాలిటీతోపాటు పలు గ్రామాల్లో రోడ్డుకు అడ్డుగా పడిన చెట్లను తొలగిస్తున్నారు. వరి చేలల్లో మంపు నీరు దిగేందుకు ఉపాధి హామీ పథకం కూలీలు డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. కూనవరం డ్రెయిన్ మొగ వద్ద ముంపునీరు దిగేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. తద్వారా సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలోని ముంపు నీరు వేగంగా సముద్రంలోకి దిగనుంది. అయినవిల్లి మండలం మాగాంలో దెబ్బతిన్న వరిచేలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ప్రత్యేకాధికారి జయలక్ష్మిలు బుధవారం పరిశీలించారు. అమలాపురం పట్టణంలో 28,29,14,11 వార్డులలో ముంపు బాధితులకు వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు భోజనాలు అందించారు. మరోవైపు ధాన్యం కొనుగోలును కొనసాగించారు. 17 శాతం తేమ అధికంగా ఉన్నా, రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 3వ తేదీ నుంచి బుధవారం వరకు 14,278 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. -
పక్కాగా పరిహారం
సాక్షి, అమరావతి: కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు కొలిక్కి వచ్చాయి. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తరువాత డిసెంబర్ 1న తుది జాబితాలను ప్రదర్శిస్తారు. డిసెంబర్ నెలాఖరులోగా పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రుతుపవనాలు మొహం చాటేయడంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. ఈ ప్రభావం రాయలసీమ జిల్లాల్లో కొంతమేర చూపించింది. ఖరీఫ్లో 574.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. 487.2 మిల్లీమీటర్లు నమోదైంది. 7 జిల్లాలో 21 నుంచి 35 శాతం మధ్య లోటు వర్షపాతం నమోదైంది. వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం 85.97 లక్షల ఎకరాలు కాగా.. వర్షాభావ పరిస్థితుల వల్ల 64.35 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఉద్యాన పంటల సాధారణ విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా.. 28.94 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. 103 మండలాల గుర్తింపు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కరువు నిర్వహణ మాన్యువల్ ప్రకారం మండలాన్ని యూనిట్గా తీసుకొని 4 సూచికల ఆధారంగా మూడు దశల్లో పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత కరువు మండలాలను గుర్తించారు. 80 మండలాల్లో కరువు ప్రభావం ఎక్కువగా ఉందని.. 23 మండలాల్లో స్వల్పంగా ఉందని అధికారులు గుర్తించారు. మొత్తంగా 7 జిల్లాల పరిధిలో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. కరువు ప్రభావిత మండలాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దాదాపు నెల రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పంట నష్టాన్ని అంచనా వేశారు. వ్యవసాయ పంటల వారీగా నష్టం అంచనాలు కొలిక్కిరాగా.. ఉద్యాన పంటల నష్టం అంచనాలు నాలుగైదు రోజుల్లో కొలిక్కి రానున్నాయి. పత్తి, వేరుశనగ పంటలకే నష్టం వ్యవసాయ పంటలకు వాటిల్లిన నష్టం పరిశీలిస్తే.. 7 జిల్లాల పరిధిలో 7.06 లక్షల రైతులకు చెందిన 14.91 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. వర్షాధారం కింద సాగయ్యే ప్రాంతాల్లో 14.17 లక్షల ఎకరాలు, నీటివసతి ఉన్న ప్రాంతాల్లో 74 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాల్లో 6.92 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. ఆ తర్వాత అనంతపురంలో 4.66 లక్షల ఎకరాల్లో, శ్రీసత్యసాయి జిల్లాలో 1.98 లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావం చూపినట్టు గుర్తించారు. పంటల వారీగా చూస్తే అత్యధికంగా 5.59 లక్షల ఎకరాల్లో పత్తి, 3.93 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.41 లక్షల ఎకరాల్లో కంది, లక్ష ఎకరాల చొప్పున ఆముదం, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా, 43 వేల ఎక ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. వీటిని ఆధారంగా చేసుకుని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రాథమిక అంచనాల మేరకు కరువు సాయం కోసం ఇప్పటికే కేంద్రానికి నివేదిక కూడా సమర్పించారు. నెలాఖరులోగా పంపిణీ పంట నష్టం జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఇప్పటికే ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాల పరిశీలన పూర్తయింది. తుది జాబితాలను డిసెంబర్ 1న ప్రచురిస్తాం. అర్హులకు డిసెంబర్ నెలాఖరులోగా పంట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) జమ చేసేలా కసరత్తు చేపట్టాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ధర వరించేలా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. దిగుబడులు సైతం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం 3,500 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్బీకేల్లో ఈ–క్రాప్ సోషల్ ఆడిట్ పూర్తయిన వెంటనే షెడ్యూల్ ఇచ్చి రైతుల నుంచి ధాన్యం సేకరించనుంది. ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 చొప్పున మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి జిల్లాలకు ఎటువంటి లక్ష్యం నిర్ధేశించకుండా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లోనూ మంచి ధర ఖరీఫ్లో 67.43 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 50 శాతం వరకు ఏ–గ్రేడ్ (ఫైన్ వెరైటీలు) ఉండటం విశేషం. వీటికి బహిరంగ మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పంజాబ్ రైస్–126 రకాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం దిగుబడుల్లో విత్తనాలకు, గృహ అవసరాలతోపాటు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుండగా.. 50–60 శాతం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఫైన్ వెరైటీలతోపాటు సాధారణ ధాన్యం రకాలను కూడా వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం రైతులకు పారదర్శకంగా సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు ఆరి్థక భారాన్ని తగ్గిస్తూ రవాణా, హమాలీ, గన్నీ చార్జీల కింద టన్నుకు రూ.2,523 అందిస్తోంది. తద్వారా బయటి వ్యాపారులు తమకు కావాల్సిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పకడ్బందీగా రవాణా ఏర్పాట్లు రవాణా శాఖ, లారీ ఓనర్స్ అసోసియేషన్ల సమన్వయంతో జాప్యం లేకుండా కళ్లాల్లోని ధాన్యాన్ని తరలించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆర్బీకే పరిధిలో 10–15 వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చి ధాన్యం రవాణాను పర్యవేక్షించనున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో నవంబర్ తొలి రెండు వారాల్లో ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంది. మూడవ వారంలో ఎన్టీఆర్, నాలుగో వారంలో పార్వతీపురం మన్యం, చివరి వారంలో శ్రీకాకుళం, విజయనగరంలో పంట వస్తుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ మొదటి రెండు వారాల్లో విశాఖపట్నం, అనకాపల్లితో పాటు డిసెంబర్ నెలాఖరు నుంచి పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. చాలా ప్రాంతాల్లో లేట్ ఖరీఫ్తో కోతలు ఆలస్యం అవుతున్నాయి. దళారులతో పని లేకుండా.. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థను రూపుమాపి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మిల్లర్ల ప్రమేయం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. 21 రోజుల్లోనే మద్దతు ధర జమ చేసేలా ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలను వివరిస్తూ రైతుల్లో చైతన్యం తీసుకొస్తోంది. రైతులు ఆర్బీకేలో ధాన్యం ఇచ్చిన తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్టీవో) వచ్చేలా ఏర్పాట్లు చేసింది. అందులో ధాన్యం వివరాలు, ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర నమోదై ఉంటాయి. ఎఫ్టీవో జనరేట్ అయితే రైతుకు, ధాన్యానికి సంబంధం ఉండదు. పూర్తి మద్దతు ధర ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రవాణా, దిగుమతి, మిల్లర్కు సరుకు వచ్చినట్టు ఇచ్చే క్లియరెన్స్ను మిల్లుల వద్ద ప్రభుత్వం నియమించే కస్టోడియన్ (డిప్యూటీ తహసీల్దార్ స్థాయి) అధికారులు చూసుకుంటారు. తేమ, ఇతర నాణ్యత విషయంలో ఆర్బీకేలో ధ్రువీకరించిన ప్రమాణాలను మిల్లరు ఫైనల్గా పరిగణించాల్సిందే. రైతులకు మిల్లర్ నుంచి ఎటువంటి ఒత్తిడి/డిమాండ్ వచ్చినా ప్రభుత్వ కాల్సెంటర్ 1967కు సంప్రదిస్తే వెంటనే చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొనుగోళ్లకు సిద్ధం గోదావరి జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. వచ్చే వారంలో 150 ఆర్బీకేల్లో పంట కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కోతలు పూర్తయిన చోట రైతులు పంటను ఆరబెడుతున్నారు. మార్కెట్లో ధాన్యానికి గిరాకీ పెరుగుతోంది. అందుకే గోదావరి జిల్లాల్లో ఫైన్ వెరైటీలతో పాటు సాధారణ రకాలను కూడా ప్రైవేటు వ్యాపారులు మంచి ధరకు కొంటున్నట్టు తెలుస్తోంది. రైతుకు పూర్తి మద్దతు ధర అంటే ఎక్కువ రేటు తీసుకురావడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. పెద్ద మిల్లుల్లో ధాన్యం ఆరబోతకు డ్రయర్లు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాం. తొలుత వంద మిల్లుల్లో పెట్టాలని కోరాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత పంట ఉత్పత్తులు బాగుండటంతో మార్కెట్లో ధర కూడా బాగా పలుకుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వచ్చినా తీసుకుంటాం. రైతులు ఆర్బీకేల్లో ధాన్యం ఇచ్చిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్బీకేల వారీగా అవసరమైన సంచులను అందుబాటులో ఉంచాం. సీఎంఆర్ కేటాయించిన ప్రకారం మిల్లర్లు సంచులు అందిస్తారు. ధాన్యం రవాణా కోసం ముందస్తుగానే వాహనాలను రిజిస్ట్రేషన్ చేశాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ మద్దతు ధరల చెల్లింపు ఇలా.. ఏ–గ్రేడ్ ధాన్యం: రూ.2,203 (క్వింటాల్కు) రవాణా, హమాలీ, గన్నీ చార్జీలు:రూ.2,523 (టన్నుకు) సాధారణ రకాలకురూ.2,183 (క్వింటాల్కు) -
Fact Check: 'సర్టిఫై' చేసినా సణుగుడే..
నాడు: టీడీపీ హయాంలో విత్తనాల కోసం పడరాని పాట్లు పడేవారు. ఎండనక, వాననక.. రేయనకా పగలనక రైతులు నిద్రహారాలు మాని సొసైటీల వద్ద పడిగాపులు పడితేగానీ కాసిన్ని గింజలు దొరికేవి కావు. తమకు అనుకూలంగా ఉన్న వారు, కాస్త పలుకుబడి ఉన్న వారికి ఇవ్వగా మిగిలినవే సన్న, చిన్నకారు రైతులకు విదిల్చేవారు. విత్తనాల కోసం బారులు తీరిన క్యూలైన్లలో నిల్చొనే సందర్భంలో ఎండలు తట్టుకోలేక స్పృహతప్పి పడిపోవడం, వడగాడ్పుల బారినపడి చనిపోవడం అప్పట్లో సర్వసాధారణం. నేడు.. కానీ, ఇప్పుడు చూద్దామంటే ఎక్కడా ఒక్క క్యూలైన్ కన్పించడంలేదు. విత్తనం దొరకలేదని కానీ, నాసిరకం విత్తనంవల్ల పంటలను కోల్పోయామని కానీ ఏ ఒక్క రైతు ఫిర్యాదు చేసిన దాఖలాల్లేవు. పైగా ఏ సీజన్కు ఆ సీజన్లో సకాలంలో అన్నీ అందుతున్నాయి. విత్తనాల కొరత అనే ఊసేలేదు. చిన్నా, పెద్దా అనే తారతమ్యంలేదు. పక్కాగా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి. సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను రైతులకు సరఫరా చేస్తోంది. నిజానికి ఇదొక విప్లవాత్మక మార్పు. ఈ రాష్ట్రంలో మాదిరిగా ఆర్బీకేలుగానీ, విత్తు నుంచి విక్రయం వరకూ రైతును చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థ మరే రాష్ట్రంలోనూ లేదు. అయినా, బురదజల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు ‘శనగ విత్తన పంపిణీలో డొల్లతనం’ అంటూ రైతులను తప్పుదారి పట్టించేలా ఆదివారం అసత్యాలతో ఓ రుచీపచీలేని కథనాన్ని వండివార్చింది. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా.. ‘పచ్చ’కామెర్ల ‘ఈనాడు’కు ఇవేవీ కనపడవు. ఆ పత్రిక కక్కిన విషంపై ఈ ‘ఫ్యాక్ట్చెక్’.. ఆరోపణ: రాయితీ విత్తనంతో ఒరిగేదేంటి? వాస్తవం: 2023–24 సీజన్లో ఇప్పటికే 10.90 లక్షల మంది రైతులకు రూ.204.15 కోట్ల సబ్సిడీతో 5.99 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా 80 శాతం రాయితీపై 96,392 మంది రైతులకు రూ.21.44 కోట్ల సబ్సిడీతో 24,635 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశారు. అలాగే, ముందస్తు రబీ కోసం 2.96 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని కూడా సిద్ధంచేశారు. సీజన్లో సబ్సిడీ విత్తన ధరలను ఏటా రాష్ట్రస్థాయి ధరల నిర్ణయాక కమిటీ నిర్ణయిస్తుంది. అదే రీతిలో మొన్న సెప్టెంబర్ 15 నాటికి స్థానిక మార్కెట్ ధరలను అనుసరించి విత్తన శుద్ధి, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, తాలు మినహాయింపు, ప్రాసెసింగ్ నష్టం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని శనగ విత్తన ధరలను నిర్ణయించారు. జేజీ–11 రకానికి క్వింటాకు రూ.8,100, కేఏకే–2 రకానికి రూ.14,050 చొప్పున నిర్ణయించారు. గత ఏడాది 25 శాతం రాయితీపై ఎకరాకు 25 కేజీలు సరఫరా చేయగా, ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా చిన్న, సన్నకారు రైతులకు 40 శాతం రాయితీపై ఎకరాకు 40 కేజీల చొప్పున విత్తన సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోపణ: నాసిరకం అంటూ తిరుగుటపా? వాస్తవం: వ్యవసాయశాఖ నుంచి 2,59,660 క్వింటాళ్ల జేజీ–11 రకం, 36,313 క్వింటాళ్ల కేఏకే–2 రకం విత్తనం కోసం ఇండెంట్ రాగా.. వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం తదితర జిల్లాలకు 1.30 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 85,598 మంది రైతులకు 68,655 క్వింటాళ్ల విత్తనాన్ని వాటి ద్వారా సరఫరా చేశారు. వైఎస్సార్ జిల్లాలో 74,120 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా.. ఇప్పటికే 61,670 క్వింటాళ్లు సిద్ధంచేశారు. విత్తనం కోసం ఆర్బీకేల్లో 41,746 మంది రైతులు తమ వివరాలను నమోదు చేయగా, ఇప్పటికే 45వేల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేశారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన విత్తనాల్లో సన్నగింజ, మట్టిగడ్డలు, పుల్లలతో సరఫరా చేస్తున్నారని, నాసిరకంగా ఉన్నాయని, నాణ్యత బాగోలేదని ఏ ఒక్క రైతు ఫిర్యాదు చేసిన, తీసుకున్న విత్తనాన్ని వెనక్కి ఇచ్చిన దాఖలాలు కానీ లేవు. అయినా సరే.. ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు రైతులను రెచ్చగొట్టే ధోరణిలో రోజుకో తప్పుడు కథనాన్ని ప్రచురిస్తుండడంపట్ల రైతులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఆరోపణ: సన్నగింజ.. మట్టిగడ్డలు.. పుల్లలే.. వాస్తవం: సాధారణంగా విత్తన నాణ్యత ప్రమాణాలను నాలుగు దశలలో పరీక్షించిన తర్వాత ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్నారు. ఏపీ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ ద్వారా సర్టిఫై చేసిన సీడ్ను ఆ తర్వాత ఏపీ సీడ్స్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లలో పరీక్షిస్తారు. చివరగా.. ఆర్బీకేల ద్వారా సరఫరా చేసే ముందు సంబంధిత ఆర్బీకే ఇన్చార్జి, ఆయా గ్రామాల అభ్యుదయ రైతుల సమక్షంలో మొలక, భౌతిక పరీక్షలు నిర్వహించి నాణ్యత బాగుందని నిర్థారించిన తర్వాతే రైతులకు సరఫరా చేసేందుకు అనుమతిస్తారు. ఇదేరీతిలో అత్యంత శాస్త్రీయంగా, విత్తన నాణ్యతను పరీక్షించిన తర్వాతే విత్తన పంపిణీకి అనుమతిచ్చారు. -
ప్రతి అడుగులో అన్నదాత సంక్షేమం
గత నాలుగున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వాటి ద్వారా ప్రతీ రైతన్న లబ్ధి పొందాలి. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సమయంలో అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలవాలి. ఏ ఒక్క రైతు నుంచి కూడా మద్దతు ధర దక్కలేదన్న మాటే వినిపించకూడదు. రైతులెవరూ మిల్లర్లు, మధ్యవర్తులను ఆశ్రయించే పరిస్థితే ఎక్కడా రాకూడదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధరతో పాటు జీఎల్టీ రూపంలో ప్రతీ క్వింటాల్కు రూ.250 చొప్పున రైతులు అదనంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకున్నాం. ఇదొక గొప్ప మార్పు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చిరు ధాన్యాలను (మిల్లెట్స్) సాగు చేసే రైతులకు తోడుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏర్పాటు చేస్తున్న యూ నిట్లను వినియోగించుకుంటూ మిల్లెట్స్ను ప్రాసెస్ చేయాలన్నారు. ఏటా రైతుల నుంచి తృణ ధాన్యాల కొనుగోలు పెరిగే అవకాశాలున్నందున ఆ మేరకు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. పీడీఎస్ (రేషన్ షాపులు) ద్వారా మిల్లెట్లను ప్రజలకు విస్తృతంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుని వాటి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయం, అను బంధ రంగాలతో పాటు పౌరసరఫరాల శాఖలపై బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించి పలు సూచనలు చేశారు. పంట వేసే ముందే భూసార పరీక్షలు ఏటా సీజన్లో పంటలు వేయటానికి ముందే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసి వాటి ఫలితాలతో కూడిన సర్టిఫికెట్లను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలి. అందుకు అవసరమైన పరికరాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చూడాలి. ముందుగానే భూసార పరీక్షలు చేయడం ద్వారా ఏ పంటలు వేయాలి? ఏయే రకాల ఎరువులు ఎంత మో తాదులో వేయాలన్న దానిపై రైతులకు అవగాహన కల్పిస్తూ పూర్తి వివరాలు అందించేలా ఉండాలి. దీనివల్ల అవసరమైన మేరకు మాత్రమే ఎరువుల ను వినియోగిస్తారు. తద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు కలిసి వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 2023–24 సీజన్కు సంబంధించి ‘‘వైఎస్సార్ రైతు భరోసా’’ రెండో విడత పెట్టుబడి సాయాన్ని నవంబర్ మొదటి వారంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో పథకం ద్వారా రైతులకు రూ.31,005.04 కోట్లు అందజేసి తోడుగా నిలిచాం. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుస్థిర జీవనోపాధి మార్గాలపై దృష్టి వ్యవసాయంతో పాటు పాడిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వారికి సుస్థిర జీవనోపాధి మార్గాల కల్పనపై సమీక్ష జరగాలి. వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో మహిళలకు స్వయం ఉపాధి మార్గాలు బలోపేతం కావాలి. వైఎస్సార్ చేయూత కింద ఏటా ఇస్తున్న డబ్బులకు అదనంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పాడి సహా ఇతర స్వయం ఉపాధి మార్గాలను చూపాలి. తద్వారా గ్రామీణ మహిళల ఆరి్ధక స్థితిగతులు ఎంతగానో మెరుగుపడతాయి. ఇప్పటికే మంజూరు చేసిన యూనిట్లు విజయవంతంగా నడిచేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. జగనన్న పాల వె ల్లువ పథకం కింద అమూల్ ద్వారా పాల సేకరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది మహిళా పాడి రైతులు లబ్ధి పొందుతున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది. రాష్ట్రంలో మూగజీవాలకు పశుగ్రాసం, దాణా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్బీకేను యూనిట్గా తీసుకుని సంపూర్ణ మిశ్రమ దాణాను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ముందస్తు రబీ.. 10 లక్షల ఎకరాల్లో సాగు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందస్తు రబీలో 10 లక్షల ఎకరాల్లో పంటలు వేసే అవకాశం ఉన్నట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ పంటలు సాగవని ప్రాంతాల్లో రైతులు ముందస్తు రబీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే శనగ సహా ఇతర అన్ని రకాల విత్తనాలను ఆర్బీకే స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. రబీలో సాగుచేసే శనగ విత్తనాలపై సబ్సిడీని 25 శాతం నుంచి 40 శాతానికి పెంచామన్నారు. విత్తనాల పంపిణీ చురుగ్గా సాగుతోందని, సుమారు లక్ష క్వింటాళ్ల శనగ విత్తనాలను సిద్ధం చేయగా, ఇప్పటికే 45 వేల క్వింటాళ్లను రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎరువుల లభ్యతలో ఎలాంటి సమస్యా లేదని, రబీ సీజన్లో రైతుల అవసరాలకు తగిన విధంగా నిల్వలున్నాయని స్పష్టం చేశారు. ఖరీఫ్కు సంబంధించి ఇప్పటికే 85 శాతం ఇ–క్రాప్ పూర్తి చేశామని, అక్టోబరు 15 లోగా వంద శాతం లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జూన్, ఆగస్టులో వర్షాలు లేకపోవడం పంటల సాగుపై కొంత మేర ప్రభావం చూపిందన్నారు. ఈ కారణంగానే ఖరీఫ్ సీజన్లో 73 శాతం మేర పంటలు సాగైనట్లు చెప్పారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిలోని డీఆర్ఓజీఓ– ఆర్టీపీఓ కేంద్రాల్లో ఔత్సాహికులైన వారికి కిసాన్ డ్రోన్లపై శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకూ 422 మందికి శిక్షణ అందించామన్నారు. నవంబర్ మూడోవారం నాటికి నాటికి మండలానికి ఒకరు చొప్పున శిక్షణ పూర్తవుతుందని, వీరి ద్వారా మిగతా వారికి శిక్షణ ఇప్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పాడి పరిశ్రమ మత్స్య శాఖల మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు తిరుపాల్రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్ డాక్టర్ శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్ధ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. -
ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త
ఆయనను తరచుగా భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా కీర్తిస్తారు. ఘనత వహించిన శాస్త్రవేత్త–వ్యవహర్త అయిన ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్కు ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి అవార్డు వచ్చినప్పుడు, ఆయన్ని అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కర్ట్ వాల్డ్హీమ్ ఒక లేఖలో ‘లివింగ్ లెజెండ్’ అని ప్రశంసించారు. స్వామినాథన్ మరణంతో ఒక శకం ముగిసింది. ‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం ఆయన మార్గదర్శకత్వంలో వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. హరిత విప్లవ రూపశిల్పి అయినప్పటికీ ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాలు ఆయనకు తెలుసు. అలాగే రైతు క్షేమాన్నే ఎల్లవేళలా తలిచారు. ‘హరిత విప్లవ చరిత్ర వాస్తవానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి నేను చేసిన అరగంట కారు ప్రయాణంలో లిఖితమైంది,’ అని ఒకసారి స్వామినాథన్ నాతో చెప్పారు. వ్యవసాయ విప్లవానికి మద్దతు ఇవ్వడానికి కావలసిన రాజకీయ సంకల్పాన్ని పొందడం ఎంత కష్టమనే నా ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా పూసా కాంప్లెక్స్లో ఒక భవన ప్రారంభోత్సవానికి వెళ్లిన సంగతిని గుర్తు చేసుకున్నారు. దారిలో ప్రధాని ఆయన్ని అడిగారు: ‘‘స్వామీ, మీరు చెబుతున్న కొత్త గోధుమ పొట్టి వంగడాల రకాలకు నేను అనుమతిస్తాను. కానీ, కొన్నేళ్లలో ఒక కోటి టన్నుల మిగులు గోధుమలు చూపుతానని మీరు నాకు మాటివ్వగలరా? ఈ ‘బ్లడీ అమెరికన్ల’ హింస నాకు తప్పాలి.’’ స్వామినాథన్ మాటిచ్చారు, తర్వాతిదంతా చరిత్ర! ‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం అనంతరం వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. భారతదేశాన్ని స్వయం సమృద్ధ దేశంగానే కాకుండా, నికర ఎగుమతిదారుగా మార్చింది. తగిన విధానాల ద్వారా మద్దతు లభ్యమైన హరిత విప్లవ వీరోచిత గాథ, ప్రధానంగా ఆకలి ఉచ్చు నుండి బయటపడే లక్ష్యంపై దృష్టి పెట్టింది. 1943 బెంగాల్ క్షామం తర్వాత కేవలం నాలుగు సంవత్సరాల లోపే స్వాతంత్య్రం రావడంతో, ఆకలిని అధిగమించే సవాలు అప్పటికి ఎదుర్కోలేదు. దశాబ్దాలుగా, ఉత్తర అమెరికా నుండి పీఎల్–480 పథకం కింద భారత్కు ఆహారం వస్తూ ఉండేది. 1970ల మధ్య నాటికి భారతదేశంలోని సగం జనాభా కబేళాలకు దారి తీస్తుందని కొందరు నిపుణులు అంచనా వేశారు. ఆ తర్వాత దేశ క్షుద్బాధపై పోరాడేందుకు స్వామినాథన్ చేసిన తీవ్రాతితీవ్ర ప్రయత్నం, ప్రపంచం వీక్షించిన అత్యంత ముఖ్యమైన ఆర్థిక పరిణామాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇది దేశంలోని కోట్లాది ప్రజల జీవితాలను మార్చడమే కాకుండా, మిగిలిన ప్రపంచానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. హరిత విప్లవానికి రూపశిల్పిగా ఉన్నప్పటికి కూడా, స్వామినాథన్ కు వ్యవసాయంలో ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాల గురించి తెలుసు. ఆయన ప్రతి కోణంలోనూ దూరదృష్టి గలవారు. రాబోయే పరాజయం గురించి అనేకసార్లు ముందే హెచ్చరించారు. హరిత విప్లవం ప్రారంభమైన కొన్ని సంవత్సరాల తర్వాత, 1968 లోనే ఆయన ఇలా రాశారు: ‘‘నేల సారాన్ని, నేల నిర్మాణాన్ని పరిరక్షించకుండా భూమిపై తీవ్ర ఒత్తిడి కలిగించే సేద్యం చేయడం అంతిమంగా ఎడారుల పుట్టుకకు దారి తీస్తుంది. పురుగు మందులు, శిలీంద్ర (ఫంగస్) సంహారిణులు, కలుపు సంహారకాలను విచక్షణారహితంగా ఉపయోగించడం వలన ధాన్యాలు లేదా ఇతర తినదగిన భాగాలలో చేరే విషపూరిత అవశేషాల వల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించిన ప్రతికూల మార్పులు సంభవించవచ్చు. భూగర్భ జలాలను అశాస్త్రీయంగా తోడిపారేయడం వల్ల ఈ అద్భుతమైన మూలధన వనరు వేగంగా తరిగిపోతుంది.’’ ఫిలిప్పీన్ ్సలోని అంతర్జాతీయ ధాన్య పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) డైరెక్టర్ జనరల్గా స్వామినాథన్ ఉన్న సమయంలోనే ఇండోనేషియా అధ్యక్షుడు సుహార్తో నుంచి ఆయనకు అసాధారణ కబురు వచ్చింది. ఇండోనేషియా వరి పంటను బ్రౌన్ ప్లాంట్హాపర్ తెగులు నాశనం చేయడంతో, స్వామినాథన్ ఒక పరిష్కార మార్గాన్ని అందించాలని సుహార్తో కోరారు. ఇండోనేషియాకు వెళ్లిన శాస్త్రవేత్తల బృందాన్ని ఒకచోట చేర్చి, వారికి మరిన్ని శక్తిమంతమైన పురుగు మందులను ఉపయోగించాలని సూచించడానికి బదులుగా, వరి పంటపై ఉపయోగించే పురుగు మందులను నిషేధించాలని సుహార్తోకు స్వామినాథన్ సలహా ఇచ్చారు. అదే సమయంలో సమీకృత తెగులు నిర్వహణను ప్రారంభించాలని చెప్పారు. సుహార్తో అధ్యక్ష హోదాలో 57 పురుగు మందులను నిషేధించారు. ప్రొఫెసర్ స్వామినాథన్ టెక్నాలజీని గుడ్డిగా విశ్వసించేవారు కాదని చాలామందికి తెలియదు. జన్యుమార్పిడి పంటలకు వ్యతిరేకంగా ప్రచారం తారస్థాయికి చేరిన రోజుల్లో, బీటీ వంకాయల వాణిజ్యీకరణకు వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించడంపై అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేష్కు ఆయన ప్రతిస్పందన గమనించదగ్గది. చెన్నైలోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్లో జరిగిన ఒక సమావేశంలో, ఆయన ఒక మునగకాయ స్లయిడ్ను ప్రదర్శించి, ఆ తర్వాత ‘విటమిన్ ఏ’ని కలిగిన జన్యుమార్పిడి బియ్యం ఆవశ్యకతపై ఒక ప్రశ్నను సంధించారు. అన్నంతోపాటు కలిపి వండిన మునగ ఆకులు మన సాంప్రదాయ ఆహారంలో భాగమనీ, ఇవి తమకు తాముగా విటమిన్ ఏ అందించగలవనీ ఆయన ఉద్దేశ్యం. స్వామినాథన్ పదే పదే లేవనెత్తిన పర్యావరణ పరమైన ఆందోళనలను విధాన నిర్ణేతలు తగిన విధంగా పరిష్కరించినట్లయితే, భారతీయ వ్యవసాయరంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకునేది కాదు. ఆయన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల కన్సార్టియంకు చెందిన మొక్కల జన్యు వనరులపై సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్కు కూడా నాయకత్వం వహించారు. నేను ఆ సమయంలో మేధా సంపత్తి హక్కులపై సీసీఐఏఆర్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిని. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొక్కల జన్యు వనరులను ప్రైవేట్ కంపెనీలకు ఏకమొత్తంగా విక్రయించడాన్ని నిలువరించడంలో ఆయన పోషించిన పాత్ర గుర్తింపు పొందలేదు. ప్రపంచ జీవవైవిధ్యానికి చెందిన అపారమైన సంపదను ప్రైవేటీకరించడానికి జరిగిన ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఆయన చేసిన తీవ్రమైన ప్రయత్నాలకు నేనే సాక్షిని. స్వామినాథన్ 2004లో జాతీయ రైతుల కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైనప్పుడు, కమిషన్ నివేదికకి చెందిన జీరో డ్రాఫ్ట్ను రాయమని నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దానిపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి. రైతును కేంద్ర స్థానంలో ఉంచి, ఆపై అతని పరిస్థితిని ఎలా మెరుగుపరచవచ్చో చూడాలని నాకు ఆదేశం ఇచ్చారు. అయితే కేవలం రైతుపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా, వివిధ వాటాదారులను కూడా అందులో చేర్చాలని తర్వాత చెప్పినప్పుడు, నేను క్షమాపణలు చెప్పాను. అయితే, ఆ మొత్తం కాలం రైతులకు ఆదాయ భద్రత కల్పించడంపై స్వామినాథన్ దృష్టి సారించారు. ఆహారోత్పత్తిని పెంచడంలో రైతులు పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించేవారు. కానీ రైతు సమాజం దుఃస్థితికి ఎప్పుడూ బాధపడేవారు. 2004, 2006 మధ్య ఐదు భాగాలుగా సమర్పించిన స్వామినాథన్ కమిషన్ నివేదిక, భారతీయ వ్యవసాయంలో ఉత్పాదకత, లాభదాయకత, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందింది. ఇది దేశవ్యాప్తంగా రైతు సంఘాలకు కీలకమైన అంశంగా నిలుస్తోంది. సగటు(వెయిటెడ్ యావరేజ్) మీద 50 శాతం లాభం రైతులకు అందించాలన్న ఆయన సూచనను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ గొప్ప దార్శనికుడికి దేశం అర్పించే అత్యుత్తమ నివాళి ఏమిటంటే, స్వామినాథన్ కమిషన్ నివేదికను అక్షరమక్షరం అమలు చేయడమే! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
తగ్గిన పప్పు ధాన్యాల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నేటి(శనివారం)తో వానాకాలం సీజన్ ముగియనుంది. ఆదివారం నుంచి యాసంగి సీజన్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. వానాకాలం సీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది మాత్రం 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా వరి సాగు విస్తీర్ణం ఆల్ టైం రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 65 లక్షల ఎకరాల్లో (130.37 శాతం) సాగైంది. ఇక సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, 4.67 లక్షల (113%) విస్తీర్ణంలో సాగైంది. వరి మినహా పెరగని ప్రధాన పంటల విస్తీర్ణం వరి, సోయాబీన్ మినహా ఇతర ముఖ్యమైన పంటల విస్తీర్ణం పెరగలేదు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, 44.77 లక్షల (88.51 శాతం) విస్తీర్ణంలోనే సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాగు మాత్రం గణనీయంగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్లో 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 5.51 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అంటే 58.46 శాతానికే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.69 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.74 లక్షల (61.62 శాతం) ఎకరాల్లోనే సాగైంది. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 81,389 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 31,107 ఎకరాల్లో (38.22 శాతం) సాగైంది. రాగులు దాని సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 19.70 శాతం, కొర్రలు, సామలు, కోడో వంటి మిల్లెట్ల సాగు 16.15 శాతానికే పరిమితమైంది. -
పక్కాగా.. పారదర్శకంగా ఈ–క్రాప్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో ఈ–పంట (ఎలక్ట్రానిక్ క్రాప్) నమోదును వ్యవసాయ శాఖ వేగవంతం చేసింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సాగవుతుండగా.. సాగైన ప్రతి పంటను నమోదు చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. సంక్షేమ ఫలాలు ఈ–క్రాప్ నమోదే ప్రామాణికం కావడంతో పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత సీజన్ మాదిరిగానే పంటల నమోదుతోపాటు నూరు శాతం ఈకేవైసీ నమోదే లక్ష్యంగా ముందుకెళ్తోంది. 78 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు లక్ష్యం 1.10 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 78 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ప్రధానంగా 38.36 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 29.48 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇతర పంటల విషయానికి వస్తే.. 2.56 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.30 లక్షల ఎకరాల్లో కందులు, 7.19 లక్షల ఎకరాల్లో వేరుశనగ, సుమారు లక్ష ఎకరాల చొప్పున ఆముదం, చెరకు పంటలు సాగయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై విత్తన సరఫరాతోపాటు సెప్టెంబర్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సాగు లక్ష్యం దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్లో సాగైన పంటల నమోదుపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. వెబ్ల్యాండ్, సీసీఆర్సీ డేటా నమోదుతో పాటు తొలిసారి జియో ఫెన్సింగ్ ఆధారంగా జూలైలో ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టారు. తొలుత తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నమోదు చేపట్టగా, ఆ తర్వాత మిగిలిన జిల్లాల్లో శ్రీకారం చుట్టారు. నమోదులో అగ్రస్థానంలో కర్నూలు ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 78 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవగా.. 46.50 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. 84.98 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు లక్ష్యం కాగా.. 55.95 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటికే 31.50 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. 22 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవ్వాల్సి ఉండగా.. 21 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటల వివరాలను ఈ క్రాప్లో నమోదు చేశారు. 17.53 లక్షల ఎకరాల్లో వరి, 5.52 లక్షల ఎకరాల్లో పత్తి, 3.53 లక్షల ఎకరాల్లో మామిడి, 2.86 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.10 లక్షల ఎకరాల్లో కంది, 2.13 లక్షల ఎకరాల్లో మిరప, 1.60 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న, 1.50 లక్షల ఎకరాల్లో జీడిమామిడి, 1.35 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్, 1.29 లక్షల ఎకరాల్లో బత్తాయి, 99 వేల ఎకరాల్లో కొబ్బరి, 75 వేల ఎకరాల్లో ఆముదం, 61 వేల ఎకరాల్లో అరటి, 52 వేల ఎకరాల్లో నిమ్మ, 46 వేల ఎకరాల్లో టమోటా పంటలు నమోదు చేశారు. జిల్లాల వారీగా చూస్తే కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలు నూరు శాతం నమోదుతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. జియో ఫెన్సింగ్ ద్వారా హద్దులు నిర్ధారించి.. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్లో ఆధార్, వన్బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్పీసీఐ), ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్, సీసీఆర్సీ కార్డు వివరాలను నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత జియో ఫెన్సింగ్ ద్వారాæ సరిహద్దులు నిర్ధారించి, రైతు ఫోటోను ఆర్బీకే సిబ్బంది అప్లోడ్ చేస్తున్నారు. గిరి భూమి వెబ్సైట్లో నమోదైన వివరాల ఆధారంగా అటవీ భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ–క్రాప్లో నమోదు చేస్తున్నారు. మరోవైపు పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఖాళీగా ఉంటే నో క్రాప్ జోన్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వాకల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రిల్యాండ్ యూజ్ అని నమోదు చేసి లాక్ చేస్తున్నారు. 30 నాటికి తుది జాబితాలు ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 25 నాటికి పూర్తి చేసి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ఈ–పంట జాబితాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అభ్యంతరాల పరిశీలన తర్వాత సెప్టెంబర్ 30న ఆర్బీకేల్లో తుది జాబితాలను ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ డూప్లికేషన్కు తావులేకుండా.. డూప్లికేషన్కు తావు లేకుండా ఈ–ఫిష్ డేటాతో జోడించారు. ఈ–క్రాప్తో పాటు ఈ–కేవైసీ (వేలి ముద్రల) నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ రైతుకు భౌతికంగా రసీదు అందజేస్తున్నారు. ఈ క్రాప్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 10 శాతం ఎంఏవోలు–తహసీల్దార్లు, 5 శాతం జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు, 3 శాతం సబ్ కలెక్టర్లు, 2 శాతం జాయింట్ కలెక్టర్లు, 1 శాతం చొప్పున కలెక్టర్ ర్యాండమ్ చెక్ చేస్తున్నారు. -
ఈ-క్రాప్ నమోదుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వర్షాల కొరత నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజు, సీఎస్ జవహర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎం జగన్కు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో జూన్ నుంచి ఆగస్టు వరకూ రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 419.6 మి.మీ. కాగా 314.6 మి.మీ. వర్షం కురిసిందని తెలిపారు. 25శాతం తక్కువగా వర్షాలు కురిసినట్టు చెప్పారు. కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, ఎస్పీఎస్ నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాల కొరత ఉన్నట్టు తెలిపారు. ఇందులో కొన్ని ప్రాంతాలకు ఇరిగేషన్ సదుపాయం ఉన్నందున అక్కడ వర్షాల కొరత ప్రభావం తక్కువగానే ఉందన్నారు. రాష్ట్రంలో మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అధికారులు తెలిపారు. అన్ని రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం 1174.58 టీఎంసీలు కాగా, 507.88 టీఎంసీల నీరు ఉందని తెలిపిన స్పష్టం చేశారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కోసం దిగువకు నీటిని విడిచిపెడుతోందని అధికారులు చెప్పారు. ముందస్తుగా సాగునీటిని విడుదలచేయడం వల్ల కృష్ణాడెల్టాకు అవసరమైన నీటిని అందించగలిగామన్నారు. సీఎం జగన్ ఆదేశాలు ఇవే.. ► ఈ–క్రాప్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ► రైతుల్ని ఆదుకునే చర్యలకు ఈ డేటా చాలా కీలకం. ► పశువులకు అవసరమైన దాణా, గ్రాసాన్ని సిద్ధంచేసుకోవాలి. ► వర్షాల కొరత నేపథ్యంలో పంటల ప్రత్యామ్నాయ ప్రణాళికపై అవగాహన కల్పించాలి. ► వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఎంఎస్పీ యాక్ట్ను ప్రవేశపెట్టాలి. ► రైతులకు నిర్ణయించిన కనీస మద్దతు ధర ఇవ్వకుంటే ఈ చట్టం ప్రకారం చర్యలు. కరెంటు డిమాండు, పంపిణీలపై సీఎం జగన్ సమీక్ష.. గత ఏడాదితో పోలిస్తే గ్రిడ్ నుంచి డిమాండ్ కనీసంగా 18 శాతం వరకూ పెరిగిందని అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగం నుంచి కూడా డిమాండ్ పెరిగిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 3.3 లక్షల కనెక్షన్లు రైతులకు ఇచ్చామని వెల్లడించారు. గాలి లేనందున విండ్ పవర్ గణనీయంగా తగ్గిందన్నారు. అలాగే బొగ్గుకూడా తడి బొగ్గు రావడంతో సామర్థ్యం మేరకు థర్మల్ కేంద్రాలు విద్యుత్ను ఉత్పత్తి చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పొడివాతావరణం, వేసవిని తలపించేలా పరిస్థితులు ఉండడం వల్ల అనుకోకుండా అనూహ్యంగా ఈ డిమాండ్ వచ్చిందని తెలిపారు. ప్రతిరోజూ కూడా కనీసంగా 44.25 మిలియన్ యూనిట్ల కరెంటు కొనుగోలు చేస్తున్నామన్నారు. మార్చి నుంచి ఆగస్టు వరకూ సుమారు రూ.2935 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. దేశవ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. అయినా ఎక్కడా కూడా రైతులకు, ప్రజలకు ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. అధిక రేట్లు ఉన్నా సరే.. ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఒక్క ఆగస్టు-2023లోనే రూ.966.09కోట్లు విద్యుత్ కొనుగోలు చేశాం. యూనిట్ ధర రూ.7.52 పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నాం. ఇంత ఖర్చు చేసి విద్యుత్ను సరఫరా చేస్తున్నా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది కూడా చదవండి: భూమి లేని పేదలకు అండగా ఉంటాం.. కౌలురైతుకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ -
రైతులకు తోడుగా ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ అన్నారు. ‘పొలాలు బీడు–ఏదీ రైతుకు తోడు’ శీర్షికన ఈనాడులో ప్రచురితమైన కథనంలో ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు సాయం కోసం ప్రత్యామ్నాయ సాగు ప్రణాళిక చేపట్టడం లేదనడంలో వాస్తవం లేదన్నారు. సీజన్ ప్రారంభానికి నెల రోజులు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఐసీఏఆర్, సీఆర్ఐడీఏ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఆర్బీకే, మండల, జిల్లా వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో చర్చించి జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తయారు చేశామన్నారు. అవసరమైన చోట లేట్ ఖరీఫ్ కింద ఇతర పంటలను సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా భూ యజమానులతో పాటు కౌలుదారులకు ఒక్కొక్క రైతుకు 2 హెక్టార్ల వరకు 80 శాతం రాయితీపై విత్తనాలను సిద్దం చేసామన్నారు. జూలై నెలలో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతుకు సైతం 80 శాతం రాయితీపై విత్తనాలను సరఫరా చేశామన్నారు. ఈ విధంగా ఆర్హత, అవసరం ఉన్న రైతులను గుర్తించి ఆ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించామన్నారు. వ్రర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో ప్రత్యామ్నాయ పంటలకు మారడానికి రైతులు ఆగస్టు చివరి వారం వరకు వేచి చూస్తారని చెప్పారు. కాగా.. ఖరీఫ్–2023లో ఇప్పటివరకు సాగైన పంటలను ప్రస్తుత వాతావరణంలో నిలదొక్కుకొని ఆశించిన దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన పంట యాజమాన్య పద్ధతులపై జిల్లా రిసోర్స్ సెంటర్స్, కేవీకే, ఏఆర్ఎస్, ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలతో రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. ఇలా ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తుంటే.. రైతులను ఆందోళనకు గురిచేసేలా, ప్రభుత్వం బురద జల్లే రీతిలో లేనిపోని ఆరోపణలు సరికాదన్నారు. -
వరిసాగు పైపైకి.. పప్పు ధాన్యాలు కిందకి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలు, పెరిగిన భూగర్భ జలాల లభ్యత కారణంగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత ఏడాది ఖరీఫ్లో వరిసాగు దేశ వ్యాప్తంగా 3.45 కోట్ల హెక్టార్లుగా ఉంటే ఈ ఏడాది అది 15 లక్షల హెక్టార్లు (4 శాతం) మేర పెరిగి 3.60 కోట్ల హెక్టార్లకు చేరిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఏడాది పప్పుధాన్యాల సాగు మాత్రం 6 శాతం మేర తగ్గింది. గత ఏడాది మొత్తంగా పప్పుధాన్యాల సాగు 1.26 కోట్ల హెక్టార్ల మేర ఉంటే అది ఈ ఏడాది 12 లక్షల హెక్టార్ల మేర తగ్గి 1.14 కోట్ల హెక్టార్లకు పరిమితం అయ్యిందని వివరించింది. ముఖ్యంగా కందుల సాగు బాగా తగ్గిందని వెల్లడించింది. -
ఒక్క రూపాయి 20 లక్షల మంది రైతులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని గతంలో నిర్ణయించి ఇటీవల అందులో సరిగ్గా రూ. 99,999 వరకు తీసుకున్న రైతుల రుణమాఫీ సొమ్మును మాఫీ చేసింది. అలాగే రూ. 99,999 నుంచి రూ. లక్ష వరకు శ్లాబ్ అంటే కేవలం ఒక రూపాయి తేడా ఉన్న రైతు రుణాలను త్వరలో మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ ఒక్క తేడాలోనే రైతుల సంఖ్య, రుణమాఫీ సొమ్ము భారీగా ఉండటం గమనార్హం. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా అందులో ఇప్పటివరకు 16.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753.43 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించింది. ఇంకా రూ. 99,999 నుంచి రూ. లక్ష మధ్య అంటే ఒక్క రూపాయి తేడాలోనే ఏకంగా 20.02 లక్షల మంది రైతులు ఉన్నారు. వారికి ప్రభుత్వం ఇంకా రుణమాఫీ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎవరూ రూ. 99,999 లెక్కకు రుణాలు తీసుకోరు. రౌండ్ ఫిగర్ తీసుకుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 99,999 వరకు శ్లాబ్గా గుర్తించి ప్రస్తుతం రుణాలను మాఫీ చేసింది. రూ. లక్ష నుంచి రూ. 4–5 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులూ చాలా మంది ఉండగా వారికి రూ. లక్ష వరకు మాత్రమే రుణమాఫీ జరగనుంది. రూ. లక్ష అంతకుమించి రుణాలు తీసుకున్న రైతులే ఎక్కువ మంది ఉంటారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
‘రైతుబంధు పక్కదారి’ నిజమే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం సొమ్మును పక్కదారి పట్టించిన విషయంపై వ్యవసాయ శాఖ స్పందించింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో జరిగిన అక్రమాలు, మరణించిన లబ్దిదారుల పేరుతో ఇతరులు రైతుబంధు సొమ్ము తీసుకుంటున్న వైనంపై ‘రైతుబంధు పక్కదారి’శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. నల్లగొండ ఏడీఏ శ్రావణ్కుమార్ నేతృత్వంలో దేవరకొండ ఏడీఏ వీరప్పన్, ఇతర అధికారులు ముడుదండ్లలో శుక్రవారం విచారణ నిర్వ హించారు. పెరికేటి రాఘవాచారి కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నా రు. రైతుబంధు డబ్బులు రెండేళ్లుగా ఇతరుల అకౌంట్లలో జమ అవుతున్న తీరును అడిగారు. లబ్దిదారులు వాస్తవాలను అధికారులకు తెలియజేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఏడీఏ విచారణ నివేదిక ఇవ్వగానే అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత తెలిపారు. -
3 లక్షల మంది రైతుల రుణమాఫీ 'సొమ్ము వెనక్కి'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద విడుదల చేసిన సొమ్ము లక్షలాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంలేదు. ఆ సొమ్ము బ్యాంకుల నుంచి తిరిగి ట్రెజరీలకే వెళ్తోంది. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం, ఖాతాదారులు డిఫాల్టర్గా మారడం, కొందరి ఖాతాలు క్లోజ్ అవ్వడం, రుణాలు రెన్యువల్ చేసుకోవడంతో పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం, పాత ఖాతాల వివరాలే వ్యవసాయశాఖ వద్ద ఉండటం తదితర కారణాలతో లబ్దిదారులకు రుణమాఫీ సొమ్ము అందలేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ వర్గాల ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 3 లక్షల మంది రైతుల సొమ్ము వారి ఖాతాల్లో జమ కాకుండా వెనక్కు వెళ్తోంది. దీనిపై రైతులు వ్యవసాయశాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా వ్యవసాయశాఖ స్పందించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. ఈ విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా... ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా వ్యవసాయశాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముందే తెలిసినా వ్యవసాయశాఖ నిర్లక్ష్యం... రుణం తీసుకున్న రైతులు మూడు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించడం, వాటిని ఇటీవలి వరకు తీర్చకపోవడంతో రైతులు బకాయిలు చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రుణమాఫీ సొమ్ము పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో అనేక మంది రైతులకు రుణాల రెన్యువల్ సమస్య వచ్చింది. రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారతారు. దీంతో రైతులు బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. అయితే కొందరు రైతులు అలా చెల్లించగా మరికొందరు రైతులు డబ్బుల్లేక బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో సుమారు 10 లక్షల మంది వరకు రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయినట్లు అంచనా. అనేక కారణాలతో రైతుల రుణ ఖాతాలు ఫ్రీజ్ కావడమో, నిలిచిపోవడమో, డబ్బు చెల్లించిన వారి ఖాతాలు మూసేయడంతో ఈ సమస్య వచ్చిపడింది. ఈ విషయంపై వ్యవసాయశాఖ అధికారులకు స్పష్టత ఉన్నా, ఇలాంటి సమస్య తలెత్తుతుందని కొందరు హెచ్చరించినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తెలిసింది. ప్రభుత్వం రుణమాఫీ సొమ్మును జమ చేసినా, అధికారులు సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు విడతల్లో మాఫీ సొమ్ము విడుదల రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో రూ. లక్ష వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం తెలిసిందే. రూ. 50 వేలలోపు రుణాలున్న 7.19 లక్షల మంది రైతులకు సంబంధించి ప్రభుత్వం రూ. 1,943.64 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. ఈ మొత్తాన్ని రైతు రుణ మాఫీ ఖాతాల్లో సర్దుబాటు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రూ.99, 999 వరకు రుణాలున్న రైతులకు బకాయిలను విడుదల చేసింది. ఆ మేరకు 10. 79 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 6,546.05 కోట్లు విడుదల చేసింది. తాజా నిర్ణయంతో ఇప్పటివరకు మొత్తంగా 16.66 లక్షల మంది రైతులకు రూ. 7,753.43 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించినట్లయింది. -
రైతు బంధు పక్కదారి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం సొమ్ము పక్కదారి పట్టింది. చనిపోయిన రైతులకు సంబంధించిన భూముల వివరాలను మార్చేసి, వేరేవారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడేలా చేసి.. మొత్తం మింగేస్తున్న వైనం బయటపడింది. వ్యవసాయ శాఖ అధికారులు సూత్రధారులుగా, కొందరు దళారులు పాత్రధారులుగా మారి.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదంట్లలో మూడేళ్లుగా ‘రైతు బంధు’ పథకం సొమ్మును దారి మళ్లించిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలిస్తే.. ఖాతా మార్చేస్తూ.. సాధారణంగా భూములు ఎవరి పేరిట ఉంటే వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో రైతు బంధు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తుంది. కుటుంబంలో భూమి తమ పేరిట ఉన్న వ్యక్తులు చనిపోతే.. వారసులు ఆ భూమిని తమ పేరున పట్టా చేయించుకొని, రైతు బంధుకు దరఖాస్తు చేసుకుంటారు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి చనిపోయిన వ్యక్తి స్థానంలో వారసుల పేరు, బ్యాంకు ఖాతా నంబర్ను లింక్ చేస్తారు. దాంతో వారి ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుంది. కానీ చందంపేట మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు, కొందరు దళారులు కలసి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి భూముల వివరాలకు దళారుల బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం చేశారు. ఆ ఖాతాల్లో పడిన లక్షల రూపాయల సొమ్మును పంచుకున్నారు. మూడేళ్లుగా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమాల్లో కొన్ని.. ముడుదండ్ల గ్రామానికి చెందిన బొజ్జ జంగమ్మ అనే మహిళ పేరిట 4.09 ఎకరాల భూమి ఉండగా, ఆమె ఖాతాలో ఏటా రెండు పంట సీజన్లకు కలిపి రూ. 45వేల మేర రైతు బంధు సొమ్ము జమ అయ్యేది. రెండేళ్ల కింద ఆమె చనిపోయింది. అప్పటినుంచి రైతుబంధు సొమ్ము ఆగిపోయింది. కుటుంబ సభ్యులు భూమిని తమపేరిట మార్చుకోలేదు, జంగమ్మ చనిపోయిన విషయం తెలిసి ప్రభుత్వమే ఆపేసిందేమో అనుకున్నారు. కానీ అనుమానం వచ్చి పరిశీలిస్తే.. వ్యవసాయ శాఖ ఆన్లైన్ చేసిన రికార్డుల్లో బ్యాంకు ఖాతా నంబర్ మార్చేసిన విషయం బయటపడింది. ఇన్నిరోజులుగా స్టేట్బ్యాంకులో 39961058007 నంబర్ ఖాతాలో సొమ్ము జమ అవుతోంది. ఈ ఖాతాదారు పేరు కిషోర్నందయాదవ్గా ఉండటం గమనార్హం. గ్రామానికే చెందిన పెరికేటి రాఘవాచారి పేరిట 3.13 ఎకరాల భూమి ఉంది. ఏటా వచ్చే రూ.33 వేలు ఆయన చనిపోయాక జమ అవడం ఆగిపోయాయి. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. 2022లో, అంతకు ముందు రెండుసార్లు జక్కుల అలివేలు పేరిట ఉన్న ఖాతా (ఇండియన్ పోస్టల్ బ్యాంకు అకౌంట్ నంబర్ 052710108096)లో సొమ్ము జమైనట్టు గుర్తించారు. దీంతో వారసులు భూమిని తమపేరిట మారి్పంచుకుని, బ్యాంకు ఖాతాను లింక్ చేయించుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన జక్కుల రామలింగమ్మ పేరిట రెండెకరాల భూమి ఉంది. ఏటా రూ.20వేలు ఆమెకు చెందిన గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాలో జమయ్యేవి. ఆమె చనిపోయాక అక్రమార్కులు అకౌంట్ నంబరు మార్చేశారు. జక్కుల మున్నయ్య పేరిట ఉన్న ఎస్బీఐ ఖాతా (20057909146)ను లింక్ చేసి సొమ్ము కాజేశారు. అంతేకాదు బతికే ఉన్న మరో రైతుకు సంబంధించిన రైతు బంధు సొమ్మును కూడా ఇదే ఖాతాలోకి మళ్లించి స్వాహా చేసినట్టు తేలింది. ఈ ఒక్క గ్రామం, మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం బయటికి రాకుండా ‘బేరసారాలు’ రైతు బంధు సొమ్మును స్వాహా చేసిన వ్యవహారం లీకవడంతో లబ్ధిదారుల కుటుంబాలతో అక్రమార్కులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అక్రమాల విషయం బయట పెట్టకుండా ఉంటే డబ్బు ఇస్తామంటూ బేరసారాలకు దిగినట్టు స్థానికులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా సంబంధం ఉండి.. రైతు బంధు అర్హులను గుర్తించడం, వారి బ్యాంక్ ఖాతాలను నిర్ధారించడం వంటి పనులు చేసే మండల స్థాయి వ్యవసాయ అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. -
సాగుబడి లాభసాటి కావాలంటే...
న్యూఢిల్లీలోని ఆజాద్పూర్ మండిలో కూరగాయలమ్మే వ్యక్తి తాలూకు ఒక వీడియో వైరల్ అయ్యింది. దిగమింగుకోవడం కష్టమైపోయిన ఆయన కన్నీళ్లలో తన ఆర్థిక బాధ స్పష్టంగా కనిపించింది. జీవనోపాధి కోసం ఎక్కువ మంది ఆధారపడి ఉన్నందున, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే సవాలును ఆర్థికవేత్తలు స్వీకరించాలి. ఇప్పుడున్న ఆర్థిక నమూనాను ధిక్కరించయినా రైతుల చేతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించాలి. వచ్చే ఐదేళ్లను పూర్తిగా వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి కేటాయించాలి. సంస్కరణలు ప్రారంభించినప్పటి నుండి పరిశ్రమలకు ఇచ్చినన్ని వనరులు, ప్రోత్సాహకాలు, ఆర్థిక ఉద్దీపనలను ఇప్పుడు వ్యవసాయానికి అందించాలి. ప్రతి రైతు, కూలీ కన్నీళ్లు తుడవడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. కొన్నిసార్లు మాటల కంటే నిశ్శబ్దం మరింత బిగ్గరగా మాట్లాడుతుంది. న్యూఢిల్లీలోని ఆజాద్పూర్ మండిలో ఓ కూరగాయల అమ్మకందారుపై తీసిన,గుండెను పిండేసే వీడియో క్లిప్ వైరల్గా మారింది. పెరిగిన ధరలకు టమోటాలు కొనలేకపోతే ఖాళీ బండితో తిరిగి వెళతావా అని అడిగినప్పుడు, ఆయన మూగబోయాడు. అదే సమయంలో తన కన్నీళ్లను అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆయన మౌనమే శక్తిమంతమైన సమాధానం అయింది. మార్కెట్లోకి వచ్చే కొత్త కార్ మోడళ్లు, సూపర్స్టోర్లను ముంచెత్తుతున్న సరికొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వెంటపడుతున్న దేశ ప్రజల సున్నిత హృదయాలకు ఆ చిన్న వీడియో షాక్ కలిగించింది. తాజా ఆటోమొబైల్స్ గురించి, సరికొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల గురించి టీవీ షోలు నిత్యం మోతమోగిస్తున్నప్పుడు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గురించి ఎప్పటికప్పుడు నివేదికలు వెలువడుతున్న ప్పుడు, ఒక వీడియో క్లిప్... మధ్యతరగతిని మైకం నుంచి బయటకు లాగడమే కాకుండా కఠినమైన వాస్తవాలను వారి ముఖాముఖి తీసు కొచ్చింది. న్యూఢిల్లీకి చెందిన కూరగాయలమ్ముకునే రామేశ్వర్పై చిత్రించిన క్లిప్ సరిగ్గా అటువంటి ఉదాహరణే. దిగమింగుకోవడం కష్టమైపోయిన ఆయన కన్నీళ్లలో తన ఆర్థిక బాధ స్పష్టంగా కనిపించింది. ఎంత సంపాదించారని ప్రశ్నించగా, రోజుకు రూ.100–200కు మించి రావడం లేదన్నాడు. ఆయన సమాధానం భారతదేశ పేదరిక స్థాయిలనే కాకుండా, పెరుగుతున్న అసమానతల విస్ఫోటనాన్ని కూడా బయటపెట్టింది. అయితే మహారాష్ట్రలోని ఠిక్పుర్లీకి చెందిన 45 ఏళ్ల చెరకు రైతు, కూలీ గురించి చాలామందికి తెలియదు. భారతి పాటిల్ అనే ఆ రైతు, ఒక పరిశోధనా వేదికతో మాట్లాడుతూ, ‘‘గత ఐదేళ్లుగా మా కూలీలు పెద్దగా మారలేదు. నోట్ల రద్దుకు ముందు రోజుకు 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు పనిచేసినా మాకు రూ. 150 మాత్రమే చేతికి అందుతోంది’’ అని పేర్కొన్నారు. మరో మాటలో చెప్పాలంటే, ఒక సన్నకారు చెరకు రైతుకు ఒక రోజుకు దక్కుతున్న మొత్తాన్ని ఇది బయటపెడుతుండగా, మహారాష్ట్రలోని చక్కెర బెల్ట్లో రోజువారీ కూలీ గత ఐదేళ్లలో రూ.50 మాత్రమే పెరిగిందని కూడా వెల్లడవుతోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నా సన్నకారు రైతులు, రైతు కూలీలు ఏటా అదే తక్కువ కూలీ మొత్తంతో ఎలా బతుకుతున్నారనేది జీర్ణించుకోవడం కష్టం. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు నిజమైన కూలీల పెరుగుదల సున్నాకు దగ్గరగానే ఉంది. ఏరకమైన అర్థవంతమైన పెరుగుదలా కనబడలేదు. వాస్తవానికి, కొన్ని అధ్యయనాలు 2013 –17 మధ్య నిజమైన వేతనాలు తగ్గుముఖం పట్టడం లేదా స్తబ్ధుగా ఉండటాన్ని సూచించాయి. దేశంలోని 90 కోట్ల మంది కార్మికులలో చాలా మంది అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల పట్ల భ్రమలు కోల్పోయారనీ, దీంతో వారు ఉద్యోగాల కోసం వెతకడం కూడా మానేశారనీ 2022 ఏప్రిల్లో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) పేర్కొంది. ఈ కారణం వల్లే 2021–22లో దేశ ఉపాధిలో 45.5 శాతంగా ఉన్న వ్యవసాయ రంగం వాటా, మహమ్మారి ముందు స్థాయికి చేరలేదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పేర్కొంది. అప్పుడు శ్రామిక శక్తిలో 42.5 శాతంతో వ్యవసాయరంగ జనాభా వాటా సాపేక్షంగా తక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన తర్వాత వారి గ్రామాలకు తిరిగి వచ్చిన 10 కోట్ల మంది కార్మికులలో గణనీయమైన భాగం మళ్లీ నగరాలకు తిరిగి రాలేదు. అదేవిధంగా, బంగ్లాదేశ్లో కూడా ఈ సంవత్సరం వ్యవసాయంపై ఆధారపడటం పెరిగింది. బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, వ్యవసాయ రంగంలో సంవత్సర ప్రాతిపదికన చూసిన ప్పుడు 2023 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అత్యధిక ఉద్యోగాల కల్పన జరిగింది. అదే సమయంలో నగరాల్లో అధికారిక ఉపాధి అవకాశాలు లేకపోవడాన్ని సూచిస్తున్నందున ఇది మంచి సంకేతం కాదని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అసమానత ఎంత నిరుత్సాహకరంగా మారుతున్నదో ముందుగా చూద్దాం. ప్రపంచ స్థాయిలో అధ్వాన్నంగా పెరుగుతున్న అసమానతలను ‘వరల్డ్ ఇన్–ఈక్వాలిటీ రిపోర్ట్’ వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో అత్యంత సంపన్నులైన 10 శాతం మంది మొత్తం సంపదలో 76 శాతాన్ని కలిగి ఉన్నారు. అయితే దిగువ సగం మంది కేవలం 3 శాతం సంపద కలిగి ఉన్నారు. భారతదేశంలో కూడా అగ్రశ్రేణి 1 శాతం మంది, దేశ సంపదలో 40.5 శాతాన్ని కలిగి ఉన్నారని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ చెబుతోంది. ధనికులు సంపదను కూడబెట్టుకోవడం కొనసాగిస్తుండగా, పేదలు పేదరికంలోకి మగ్గిపోయేలా ఆర్థిక రూపకల్ప నను మన విధాన నిర్ణేతలు అల్లుకుంటూ వచ్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత బలంగా పాతుకుపోయిందంటే, అసమానతలను అంతం చేయడంపై పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి 500 మంది అత్యంత సంపన్నులు 2023 మొదటి ఆరు నెలల్లోనే తమ సంపదకు మరో 852 బిలియన్ డాలర్లను జోడించుకున్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం, రోజుకు నాలుగు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్న ‘బ్రిక్స్’ దేశాల జనాభాలో ఇండియా మొదటిస్థానంలో ఉంది. 91 శాతం జనాభా నిర్దేశిత ప్రమాణానికి కిందికి ఉంది. 50.3 శాతంతో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కంటే కూడా ఇది ఎంతో ఎక్కువ. వ్యవసాయాన్ని అతి పెద్ద ఉపాధి కల్పనారంగంగా పరిగణనలోకి తీసుకుంటే, అసమానతలను తగ్గించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, వనరులను అవసరం ఉన్న చోట ఉపయోగించడమే. పైనుంచి కిందికి ప్రవహించే విఫల ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక వ్యవస్థను కొనసాగించ డానికి బదులుగా– దిగువ, మధ్య స్థాయులను పైకి తేవడం మీద దృష్టి పెట్టడమే అసలైన కర్తవ్యం కావాలి. భారతదేశం, బంగ్లాదేశ్లలో జీవనోపాధి కోసం ఎక్కువ భాగం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్స హించడం ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే సవాలును ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు స్వీకరించాలి. దిగువ స్థాయి నుండి సంపదను పిండుకునే బదులు, ఇప్పుడున్న ఆర్థిక నమూనాను ధిక్క రించయినా రైతుల చేతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించాలి. సజీవ వ్యవసాయం అనేది ఈ కాలపు అవసరం. ప్రతి రైతు, కూలీ కన్నీళ్లు తుడవడానికి ఇది తప్ప మరో మార్గం లేదు. వచ్చే ఐదేళ్లను వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి కేటాయించాలని నా సూచన. సంస్కరణలు ప్రారంభించినప్పటి నుండి పరి శ్రమలకు మనం ఇచ్చినన్ని వనరులు, ప్రోత్సాహకాలు, ఆర్థిక ఉద్దీపన లను ఇప్పుడు వ్యవసాయానికి అందించాలి. ఆరోగ్యకరమైన, సంప న్నమైన, పునరుత్పత్తి చేసే తదుపరి దశ సంస్కరణలకు నాంది పలికేందుకు కేవలం ఐదేళ్ల పాటు, చిన్న తరహా వ్యవసాయాన్ని, పర్యా వరణపరంగా స్థిరమైన వ్యవసాయాన్ని పునర్నిర్మించాలి. కేవలం ఐదేళ్లు – ఇంతమాత్రమే నేను అడుగుతున్నది! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
‘ఏఐ’ పంట!.. వ్యవసాయ రంగంపై చాట్ జీపీటీ ప్రభావం ఎలా ఉండబోతుంది?
-కంచర్ల యాదగిరిరెడ్డి నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు.. యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు. ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో బాగున్నాయే అనుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం కొంత పుంజుకున్నా.. తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు. ఇలాంటి సమయంలోనే ‘చాట్ జీపీటీ’, దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా. మరి మొత్తంగా దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయానికి ఏం ఒనగూరుతుంది? అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతంపైనే. కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం రకరకాల పథకాలు, లాభాలు చేకూరుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు తక్కువే. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్కు చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సరీ్వస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘జుగల్బందీ’చాట్బోట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ అందిస్తూండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడంకోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు. 1. ప్రిడిక్టివ్ అనాలసిస్: వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వేసిన పంట ఎంత బాగా పండేది కచి్చతంగా చెప్పగలదు. దీన్నే ప్రిడిక్టివ్ అనాలసిస్ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. 2. గరిష్టంగా దిగుబడులు: పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేíÙంచడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. 3. ప్రిసిషన్ అగ్రికల్చర్: జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే.. అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి. 4. కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే.. అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపు ణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేíÙంచి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కత్రిమ మేధ సాఫ్ట్వేర్లు వేగంగా గుర్తించగలవు. చాట్బోట్లు.. కాల్సెంటర్లు భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది. కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ వాట్సాప్ ఆధారిత చాట్బోట్ ఒకదాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ (కిసాన్ జీపీటీ)’ ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు. వాధ్వానీ ఏఐ అనే స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ కూడా జనరేటివ్ ఏఐ సాయంతో రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కిసాన్ కాల్సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. వ్యవసాయ రంగ నిపుణుల అనుభవాన్ని జనరేటివ్ ఏఐతో అనుసంధానించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వాధ్వానీ ఏఐ తెలిపింది. డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్బోట్ ద్వారా అందిస్తోంది. తెలంగాణలో ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరగా మార్కెటింగ్ చేసుకోవడానికి, తగిన ధర పొందడానికి ఇది వీలు కల్పిస్తోంది. -
కోటి ఎకరాల మాగాణి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మాగాణి కోటి ఎకరాలకు చేరువలో ఉంది. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపుందుకున్నాయి. అధిక వర్షాలతో ఓవైపు పంటనష్టం జరిగినా, మరోవైపు ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సమయానికి ఆయా పంటలవారీగా అధికంగానే సాగైందని చెప్పవచ్చు. ప్రసుత్త సమయానికి 14.66 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న 59 వేల ఎకరాల్లో అధికంగా సాగైంది. అయితే పత్తిసాగులో కాస్త వెనుకబడి ఉన్నారు. గతేడాది ఇదే సమయానికి 47.27 లక్షల ఎకరాల్లో పత్తిసాగు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 44.49 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణ సాగుతో పోలిస్తే 87.96 శాతం విస్తీర్ణంలోనే పత్తి సాగైంది. వాస్తవంగా ఈ ఏడాది 65 లక్షల నుంచి 70 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయించాలని వ్యవసాయశాఖ భావించింది. ఆ మేరకు రైతులకు పిలుపునిచ్చింది. కానీ సకాలంలో రుతుపవనాలు రాకపోవడం, కీలకమైన జూన్, జూలై రెండోవారం వరకు వర్షాలు లేకపోవడంతో అదను దాటిపోయింది. దీంతో పత్తి సాగు విస్తీర్ణం అనుకున్నదానికంటే గణనీయంగా తగ్గిందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సాగు ఇలా ♦ సాధారణ సాగు విస్తీర్ణం1.24కోట్ల ఎకరాలు ♦ ఇప్పటివరకు సాగైంది 95.78 లక్షలఎకరాలు ♦ గతేడాది ఇదేసమయానికి 83.43 లక్షల ఎకరాలు నాలుగు జిల్లాల్లో 100 శాతానికిపైగా సాగు నాలుగు జిల్లాల్లో సాగు విస్తీర్ణం 100 శాతానికి పైగా పెరిగింది. ఆయా జిల్లాల వారీగా చూస్తే..మెదక్ జిల్లాలో 105.82 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 103.94 శాతం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 102.19 శాతం,నిజామాబాద్ జిల్లాలో 101.10 శాతం విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 24.97 శాతం, ఆ తర్వాత ములుగు జిల్లాలో 32.97 శాతం పంటలు సాగయ్యాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 77.07 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. 37 శాతం అధిక వర్షపాతం ఇక రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు 37 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 44 శాతం వర్షపాతం కొరత ఉండగా, జూలై నెలలో ఏకంగా 114 శాతం భారీ అధిక వర్షపాతం నమోదైంది. 8 జిల్లాల్లో భారీ అధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు అనేకచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని తేరుకోగా, మరికొన్ని చోట్ల నష్టం సంభవించిందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయాచోట్ల తిరిగి పంటలు సాగు చేసుకునేందుకు రైతులు నానాయాతన పడుతున్నారు. ఇసుక మేటలు తీయిస్తున్నారు. పంటలు కొట్టుకుపోయిన చోట్ల మళ్లీ దుక్కులు దున్ని పంటలు సాగు చేస్తున్నారు. మరోవైపు పంటలకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పప్పుధాన్యాల సాధారణ సాగువిస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.23 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగువిస్తీర్ణం 4.13 లక్షలఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.43 లక్షల ఎకరాల్లో సాగైంది. -
రుణమాఫీ సొమ్ము వెనక్కి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ సొమ్ము కొందరు రైతుల ఖాతాల్లో పడకుండా వెనక్కి వస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయా రైతుల రుణ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్లో ఉండటం లేదా డిఫాల్ట్లో ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీంతో అనేకమంది రైతులు వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు రూ.50 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి వచ్చి నట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. మూడు సీజన్లలో చెల్లించకుంటే డిఫాల్టరే... రాష్ట్రంలో ప్రతీ ఏటా సరాసరి 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూడు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే, తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించడం, వాటిని ఇటీవలి వరకు తీర్చకపోవడంతో రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని అప్పుడు టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్) హామీ ఇచ్చి న సంగతి తెలిసిందే. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత నాలుగేళ్లలో దాదాపు రూ.1,200 కోట్లకు పైగా రుణమాఫీ చేశారు. మిగిలిన మొత్తం సొమ్మును మరో నెలన్నరలో మాఫీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సొమ్మును విడతల వారీగా జమ చేస్తున్నారు. బకాయిలు చెల్లించమని సర్కారు విన్నవించినా... ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రుణమాఫీ సొమ్ము పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో అనేకమంది రైతులకు రెన్యువల్ సమస్య వచ్చి ంది. రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారుతారు. అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు గుంజుకున్నాయి. అలా రెన్యువల్ చేశాయి. రుణం పొందాలంటే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం గతంలో విన్నవించిన సంగతి తెలిసిందే. కొందరు రైతులు అలా చెల్లించగా, మరికొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో 10 లక్షల మంది వరకు రైతులు డిఫాల్టర్లుగా మిగిలినట్లు అంచనా. రుణమాఫీ అర్హులైన రైతుల సొమ్మును ఇస్తామని, వారిని ఎవరినీ డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని వ్యవసాయశాఖ బ్యాంకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. అనేక కారణాలతో రైతుల రుణ ఖాతాలు ఫ్రీజ్ కావడమో, నిలిచిపోవడమో జరగడం వల్ల ఇప్పుడు సమస్య వచ్చి పడింది. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలు ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. -
5 లక్షల ఎకరాల్లో పంటల మునక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో వివిధ పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఇప్పుడిప్పుడే వేసిన పంటలు నీటిలో మునిగిపోయాయి. వ్యవసాయశాఖ వేసిన అంచనా ప్రకారం దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు నీటముని గాయి. నిజామాబాద్ జిల్లాలో 21,500 ఎకరా ల్లో పంట నష్టం జరిగినట్లు అక్కడి వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అలాగే ఇతర ప్రాంతాల్లో సోయాబీన్, మొక్కజొన్న, పెసర సహా ఇతర పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. పత్తి కూడా చాలాచోట్ల నీటమునిగింది. మొలక స్థాయిలో ఉన్న పత్తి 10 రోజుల తర్వాత కూడా నీటిని తోడేస్తే నిలబడగలుగుతుందని... విత్తనాలు వేసిన చోట నేల మునిగితే మాత్రం అది భూమిలోనే కుళ్లిపోతుందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రాథమిక స్థాయిలో నాట్లు పడినచోట్ల, వరినారు వరదలతో కొట్టుకుపోయింది. అయితే వరదల కారణంగా పూర్తిస్థాయిలో నష్టం అంచనాకు వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లలేకపోతున్నారని అధికారులు అంటున్నారు. తెరిపినిస్తేనే వ్యవసాయానికి ఊపు... ప్రస్తుత భారీ వర్షాలతో వ్యవసాయానికి ఊపు వచ్చింది. అయితే భారీ వరదల కారణంగా పంటలకు నష్టం తప్పడంలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో 68.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా పత్తి 40.73 లక్షల ఎకరాల్లో సాగవగా 15.63 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. సోయాబీన్ 4.14 లక్షల ఎకరాల్లో, కంది 3.82 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 3.62 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తికి నష్టం జరిగితే తెరిపినిచ్చాక మరోసారి విత్తుకోవల్సి రానుంది. మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలు దెబ్బతింటే మరోసారి వేసుకొనే పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. పత్తికి ఆగస్టు 10లోగా వేసుకొనే వెసులుబాటు ఉంటుందని, కొందరు రైతులు మూడోసారి కూడా వేసుకొనే పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు. ఏదైనా ప్రస్తుత వర్షాలు ఆగిపోతేనే పంటలను కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుత వర్షాల వల్ల వరి విస్తీర్ణం మాత్రం మరింత పెరుగుతుందని... ఈసారి కూడా వరి వరిసాగు రికార్డు స్థాయిలో జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ సిబ్బంది సెలవుల రద్దు? వర్షాలు, వరదల కారణంగా జిల్లాల్లో వ్యవసాయాధికారుల సెలవులు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. -
టమోటా ధరల్లో ఓ సానుకూల కోణం
ఒకప్పుడు రెండు రూపాయలకు కిలో టమోటాలు అమ్మిన రైతులు, ఉన్నట్లుండి లక్షాధికారులుగా మారారు. ఈ సీజన్ లో టమోటా ధరలు పెరగడం వారి అదృష్టాన్ని మలుపు తిప్పింది. మండీలను తరచుగా నిలదీస్తున్నారు కానీ, సంస్కరణలు తప్పవని భావిస్తున్న ఈ వ్యవస్థలోనే రైతులకు అనూహ్యంగా అధిక ధర లభించింది. ఏ ప్రైవేట్ కంపెనీ, లేదా వ్యవస్థీకృత రిటైల్ అవుట్లెట్ కూడా టమోటా రైతులకు అధిక ధర చెల్లించలేదు. భరోసానిచ్చే, లాభదాయకమైన ధరలు వ్యవసాయాన్ని కొత్త శిఖరాలకు చేర్చగలవని ప్రస్తుత ధరల పెరుగుదల మనకు చెబుతోంది. అయితే తుది వినియోగదారు చెల్లించే ధరలో కనీసం 50 శాతం రైతు పొందేలా అధికారులు తప్పక చూడాలి. టమోటా ధరల విపరీత పెరుగుదల వినియోగదారుల్లో ఆగ్రహ ప్రతిస్పందనలను కలిగిస్తోంది. అయితే దీనికి ఒక ప్రకాశవంతమైన కోణం ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లకు చెందిన వందలాది టమోటా రైతులు లక్షాధికారులుగా మారారు. ఈ సీజన్ లో టమోటా ధరలు బాగా పెరగడం వారి అదృష్టాన్ని మలుపు తిప్పింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జున్నర్లో 12 ఎకరాల్లో టమోటా సాగు చేసిన తుకారాం భాగోజీ గాయ్కర్ అనూహ్యంగా ఆదాయం పెరిగిన వారిలో ఒకరు. ఒక నెలలో 13,000 టమోటా బుట్టలను (ఒక్కోదాన్లో 20–22 కిలోలుంటాయి) విక్రయించి, రూ.1.5 కోట్లకు పైగా సంపాదించారు. కొద్ది రోజులుగా తుకారాం మీడియాలో సంచ లనంగా మారారు. అన్నింటి కంటే మించి, కనీస జీవితావసరాలు తీరడానికి కష్టపడుతున్న ఒక వ్యవసాయ కుటుంబానికి ఇంత సౌభాగ్యం కలగడం అత్యంత ఆహ్వానించదగినది. కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన ఒక టమోటా రైతు 2,000 బుట్టల టమోటాలను విక్రయించి, ఒక రోజులో రూ. 38 లక్షలు సంపాదించాడని వార్తలు వచ్చాయి. అతని కుటుంబం కొన్ని దశాబ్దా లుగా సుమారు 40 ఎకరాల్లో టమోటాలు సాగు చేస్తోంది. అయితే ఈసారి అతను సాధించిన ధరలు మునుపటి రికార్డులను అధిగమించాయి. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ టమోటా రైతు రూ.30 లక్షలు సంపాదించాడు. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్, సిర్మోర్, కులు జిల్లాల్లో టమోటా ధరలు విపరీతంగా పెరగడం వేలాదిమంది టమోటా సాగుదారులకు ఆశీర్వాదంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. సోలన్ మార్కెట్లో, నాణ్యమైన ఆపిళ్లకు ఈ సీజన్ లో రైతులకు లభించే సగటు ధరను టమోటా ధరలు దాటేశాయి. కిలో ఆపిల్ రూ.100 ఉండగా, టమోటా రైతులకు కిలో రూ.102 వరకు పలికింది. గతేడాది కొన్ని రోజుల్లో వీటి ధర బుట్టకు రూ.5 నుంచి రూ.8 ఉండగా, ఇప్పుడు ఒక్కో బుట్ట రూ.1,875 నుంచి రూ.2,400 (కిలో రూ. 90–120) పలికింది. ఇప్పుడు, రైతులు కోటీశ్వరులు కావడం సులభమని మీరు తప్పుడు అభిప్రాయానికి వచ్చే ముందు, అధిక రిటైల్ ధరను రైతు లకు బదిలీ చేసిన అరుదైన సందర్భాలలో ఇదొకటి అని నేను స్పష్టం చేస్తున్నాను. కొన్ని నెలల క్రితమే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో టమోటాలను పశువులకు తినిపించినట్లు, లేదంటే వాగులలో పారబోసినట్లు వార్తలు వచ్చాయి. టమోటా ధరలు పెరగక ముందు, జూన్ ప్రారంభంలో కూడా మహారాష్ట్ర రైతులు కిలోకు 2 రూపాయల ధరను కూడా చూడలేకపోయారు. వ్యవసాయ రంగ దుఃస్థితి ఒక మినహాయింపుగా కాకుండా సాధారణంగా ఉంటూ వస్తోంది. హరియాణాలోని భివానీ జిల్లాలో 42 ఎకరాల్లో టమోటా సాగు చేస్తున్న ఓ ప్రగతిశీల రైతు ఈ అవకాశాన్ని కోల్పోయానని విచారం వ్యక్తం చేస్తున్నాడు. ‘నాలుగు నెలల తక్కువ ధరల తర్వాత, నేను దాదాపు రూ. 8–10 లక్షల నష్టంతో సుమారు రెండు నెలల క్రితం నా మొత్తం పంటను పీకేశాను. జూన్ మధ్య తర్వాత ధరలు విపరీతంగా పెరుగుతాయని నాకు తెలిసి ఉంటే, నేను కచ్చితంగా చాలా డబ్బు సంపాదించి ఉండేవాడిని’ అని రమేష్ పంఘాల్ నాతో అన్నారు. ‘నా అదృష్టం బాలేదు’ అని వాపోయారు. అదృష్టదేవత వరించిన కొద్ది మంది కంటే ఎక్కువ సంఖ్యలో రైతులు ఈ అపూర్వమైన టమోటా ధరలను అపనమ్మకంతో చూస్తున్నారని ఇది తెలియజేస్తోంది. ఈ అనిశ్చిత విజయాలను అలా పక్కనుంచి, విపరీతమైన ధరల పెరుగుదల నుండి కొన్ని ముఖ్యమైన పాఠాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బహుశా, ఇది ప్రధానంగా వ్యవసాయ కష్టాల తీవ్రతకు దారితీసిన ఆధిపత్య ఆర్థిక ఆలోచనను సంస్కరించడానికి సహాయపడుతుంది. వినియోగదారులకు టమోటా ధరలు స్థిరంగా పెరిగాయని మనం అంగీకరిస్తున్నప్పటికీ, తక్కువ ధరలు దశాబ్దాలుగా కోట్లాదిమంది వ్యవసాయదారుల జీవనోపాధి మీద బలమైన దెబ్బ కొట్టాయని గ్రహించాలి. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచారని నేను ఎప్పుడూ అనుకుంటాను. సాధారణంగా ముద్ర వేసిన విధంగా రైతులు అసమర్థులు కాదు కానీ వారు తప్పుడు స్థూల ఆర్థిక విధానాల బాధితులుగా ఉండిపోయారు. రైతులకు ఆర్థికంగా లాభదాయకమైన జీవనోపాధిని నిరాకరిస్తూ వచ్చారు. టమోటా సాగు విషయానికి వస్తే – రైతులు అధిక దిగుబడినిచ్చే అన్ని పద్ధతులనూ చేపట్టారు. ఇందులో భాగంగా అత్యంత ఖరీదైన హైబ్రిడ్ విత్తనాలను కొనుగోలు చేశారు. ఇవన్నీ ప్రమోట్ చేసిన సాగు ఆచరణల ప్యాకేజీలో భాగం. రైతులకు విక్రయిస్తున్న ప్రతి సాంకేతికత కూడా ఉత్పాదకతను పెంచుతుందనీ, తద్వారా అధిక ఆదాయాన్ని ఇస్తుందనీ వాగ్దానం చేస్తుంది. కానీ అది జరగలేదు. దీనికి విరుద్ధంగా రైతు సాంకేతిక ఇన్పుట్లను ఉపయోగిస్తాడు, కష్టపడి కుటుంబ శ్రమను వెచ్చించి రికార్డు స్థాయిలో పంటను పండిస్తాడు, తీరా మార్కెట్ ధరలు పడిపోయాయని తెలుసుకుంటాడు. రైతు పొందిన ధర తరచుగా పెట్టుబడి ఖర్చును కూడా తీసుకురాదు. బిజినెస్ మేనేజ్మెంట్ పాఠశాలలు తరచుగా సమర్థమైన వ్యవ సాయ సరఫరా గొలుసులలో భాగం కానందుకు రైతులను నింది స్తున్నాయి. టమోటా రైతు, ఆ మాటకొస్తే ఇతర రైతులూ విలువ జోడింపు చేస్తే తప్ప సహేతుకమైన లాభాలు పొందలేరు. అందుకే వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీలను (ఏపీఎంసీ) విస్మరించి, కార్పొరేట్ నిచ్చెన మెట్ల పైకి వెళ్లాలని అంతర్లీనంగా ఉద్ఘాటిస్తున్నారు. వ్యవసాయాన్ని సంపద్వంతం చేయడానికి వ్యవసాయాన్ని మరింత సరళీకరించడం, ప్రైవేటీకరించవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచు కుని నీతి ఆయోగ్ ఇటీవల ఒక కార్యాచరణ పత్రాన్ని విడుదల చేసింది. అయితే వ్యవసాయ విధానాలను మనం అరువుగా తెచ్చు కున్న అమెరికాలో కూడా, వ్యవసాయ కార్పొరేటీకరణ వ్యవసాయ ఆదాయాలను పెంచడంలో సహాయపడలేదని నీతి ఆయోగ్ గ్రహించడం లేదు. వ్యవసాయ సంక్షోభానికి సమాధానం ఎక్కడో ఉందని వెల్లువె త్తుతున్న టమోటా ధర చెబుతోంది. ఏపీఎంసీ – మండీ వ్యవస్థను తరచుగా నిలదీస్తున్నారు కానీ సంస్కరణలు తప్పవని భావిస్తున్న ఈ వ్యవస్థలోనే రైతులకు అనూహ్యంగా అధిక ధర లభించింది. ఏ ప్రైవేట్ కంపెనీ, లేదా వ్యవస్థీకృత రిటైల్ అవుట్లెట్ కూడా టమోటా రైతుకు అధిక ధర ఇవ్వలేదు. అదేవిధంగా, ఈ సీజన్లో లాభపడిన కొంతమంది టమోటా సాగుదారుల సంపద సమర్థమెన సరఫరా గొలుసుల ద్వారా పెరగలేదు. ఇదంతా పూర్తిగా ధరలపై ఆధారపడి ఉంది. భరోసానిచ్చే, లాభదాయకమైన ధరలు వ్యవసాయాన్ని కొత్త శిఖరాలకు చేర్చ గలవని ప్రస్తుతం టమోటా ధరల ఆకస్మిక పెరుగుదల మనకు చెబు తోంది. రెండు సీజన్లలో అటువంటి అధిక ధరలు లభించినట్లయితే, మీరు సంపన్నమైన టమోటా సాగుదారులకు చెందిన కొత్త తరగతి ఆవిర్భావాన్ని చూస్తారు. ధరలు నిర్దిష్టం కంటే తగ్గకుండా ఉండేలా కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేస్తున్నప్పుడు, తుది వినియోగదారు చెల్లించే ధరలో కనీసం 50 శాతం రైతులు పొందేలా అధికారులు తప్పక చూడాలి. రైతులను బతికించాలంటే అధిక ధర చెల్లించడం అత్యవశ్యం అని వినియోగదారులు గ్రహించాల్సిన సమయం ఇది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్ అరెస్ట్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం మహిళా ఐఏఎస్ అధికారి రానూ సాహూను అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో డైరెక్టర్గా ఉన్న రానూ సాహూకు అదనపు జిల్లా జడ్జి అజయ్ సింగ్ రాజ్పుత్ మూడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించారు. బొగ్గు కుంభకోణం కేసులో అరెస్టయిన రెండో ఐఏఎస్ అధికారి సాహు. రాయ్గఢ్, కోర్బా జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఆమె అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ లాయర్ సౌరభ పాండే తెలిపారు. ఆమె రూ.5.52 కోట్ల విలువైన చరాస్తులను పోగేశారని తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను సాహూ లాయర్ ఖండించారు. ఆమెను కల్పితమైన కారణాలతోనే అధికారులు అరెస్ట్ చేశారన్నారు. -
ఏపీలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువే
సాక్షి, అమరావతి: ధాన్యం ఉత్పత్తి వ్యయం పంజాబ్ తరువాత ఆంధ్రప్రదేశ్లోనే తక్కువగా ఉంది. దేశ సగటుతో పోల్చినా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగానే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల్లో వెల్లడించింది. పంజాబ్లో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం రూ.808 ఉండగా.. ఆంధ్రప్రదేశ్లో రూ.1,061గా నమోదైంది. దేశంలో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి సగటు వ్యయం రూ.1,360 ఉన్నట్టు తెలిపింది. వ్యవసాయ భూమి లీజుతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, కుటుంబ సభ్యుల శ్రమ, పశువుల శ్రమ, ఇరిగేషన్ చార్జీలు, పెట్టుబడి వ్యయం, వడ్డీలను కలిపి రాష్ట్రాల వారీగా 2022–23లో ధాన్యం క్వింటాల్ ఉత్పత్తి వ్యయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ చర్యలే కారణం రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి సేద్యానికి అవసరమైన అన్నిరకాల ఇన్పుట్స్ను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. సబ్సిడీపై విత్తనాలను అందించడంతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలకు పంటలు దెబ్బతింటే ఆ సీజన్ దాటకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తోంది. కూలీలకు బదులుగా వ్యవసాయ పరికరాలను వినియోగించడాన్ని ప్రోత్సహించడంతో సేద్యం వ్యయం తగ్గుతోంది. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ద్వారా 50 సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందిస్తోంది. యంత్ర పరికరాల వినియోగం కారణంగా ఉత్పత్తి వ్యయం తగ్గుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తుండటం, మెరుగైన వ్యవసాయ పద్ధతుల కారణంగా ధాన్యం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటోంది. దేశంలో ఎక్కువగా ధాన్యం పండించే రాష్ట్రాల్లో పంజాబ్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండగా మహారాష్ట్రలో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం అత్యధికంగా ఉంది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడుల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంది. వరి పండించే రాష్ట్రాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం మిగతా రాష్ట్రాల కన్నా తక్కువగా ఉంది. -
36 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్లో 36 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదికను అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 28.99 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.86 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 49.15 శాతం పత్తి సాగైందని నివేదిక వెల్లడించింది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.39 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 2.80 శాతంలో వరి సాగైందని తెలిపింది. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2 లక్షల ఎకరాల్లో (21.25%) సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.23 లక్షల ఎకరాల్లో (54.18%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, 87,179 ఎకరాల్లో సాగైందని వెల్లడించింది. ఆదిలాబాద్లో అత్యధికంగా 92 శాతం సాగు... రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాల్లో 92.05 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 82.86 శాతం విస్తీర్ణంలో, నారాయణపేట్లో 55.85 శాతం విస్తీర్ణంలో సాగ య్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 2.41 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2.27 లక్షల ఎకరాలు కాగా, కేవలం 5,474 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగ య్యాయి. కాగా, రాష్ట్రంలో 3 జిల్లాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నాయి. జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాభావం నెలకొందని వ్యవసాయశాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమో దైందని పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్ జిల్లాల్లో మాత్రం సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైంది. కాగా, మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో జూన్, జూలై నెలల్లో ఇప్పటివరకు కలిపి చూస్తే సరాసరి 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కాగా, ఈ నెల లో ఐదు రోజుల్లో 29 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల జిల్లాల్లో ఏకంగా 74 శాతం చొప్పు న లోటు వర్షపాతం నమోదుకాగా, కరీంనగర్ జిల్లాలో 73 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మూసీ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత కేతేపల్లి: నల్లగొండ జిల్లాలోనిమూసీ ప్రాజెక్ట్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో అధికారులు బుధవారం రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి పెద్దగా ఇన్ఫ్లో లేకపోయినప్పటికీ తుపాను ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రాజెక్ట్లో నీటిమట్టాన్ని తగ్గించాలని మూసీ అధికారులు నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2,466 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్లో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 641.90 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. మూసీ ప్రాజెక్టులో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.67 టీఎంసీల నీరు ఉంది. -
అధిక ఎరువులు వాడితే అనర్థమే
నవాబుపేట: రసాయన ఎరువులు అధికంగా వాడితే అనర్థమే అని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దిగుబడి తగ్గి, పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. సాధారణంగా నేల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలి. కానీ రైతులంతా ఒకే రకమైన ఎరువులను వినియోగిస్తున్నారు. వరి సాగులో ఎకరాకు 50కేజీల డీఏపీ, 100 కేజీల యూరియా వాడాలి. కానీ రైతులు ఎకరాకు రెండు బస్తాలకు తగ్గకుండా డీఏపీ వేస్తున్నారు. పైరు నాటే సమయంలో బస్తాకు అదనంగా 25 కేజీల పొటాష్ను కలిపి వేయాల్సి ఉన్నా రైతులు వేయడం లేదు. వరికి యూరియాను నాలుగు సార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల చొప్పున వాడాలి. పొట్టదశలో యూరియాకు 25 కేజీల పొటాష్ను కలిపి వాడాలి. అయితే రైతులు చాలా వరకు నాటిన 20 రోజులకు 50 కేజీలు, మధ్యలో 50 కేజీలు వాడుతున్నారు. ఇక పత్తి పంట విషయానికి వస్తే విత్తేకంటే ముందే ఎకరాకు మూడు నాలుగు అంగుళాల లోతున పడేలా 50 కేజీల డీఏపీ వాడాలి. అయితే వర్షాధారంగా సాగు చేసే పంటల్లో విత్తనాలు మొలుస్తాయో లేదోనని పత్తి విత్తేటప్పుడు ఎరువులు వేయడం లేదు. కనీసం 25సెం.మీ. లోతులో భూమిలో పదును ఉండేలా వర్షం పడినప్పుడు ఎరువుతో పాటు పత్తి గింజలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. పత్తితో పాటు అన్ని ఖరీఫ్ పంటలకు 50 కేజీల వరకు మాత్రమే డీఏపీ వాడాలి. అయితే రైతులు పైరు ఎదుగుదల దశలో రెండు మూడు బస్తాలు వరకు డీఏపీని పై పాటుగా చల్లుతున్నారు. దీని వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పోషకాలు ఉన్న కాంప్లెక్స్ ఎరువులు రెండు బస్తాలు వాడితే సరిపోతుంది. అధిక భాస్వరంతో నష్టం అధిక మోతాదులో భాస్వరం వాడడం వల్ల దిగుబడులపై క్రమంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలి రెండేళ్ల పాటు దిగుబడులు బాగా వచ్చినా ఆ తర్వాత ఎరువులు వాడినా దిగుబడులు రానంతగా నేల దెబ్బతింటుంది. భాస్వరం భూమి లోపలి పొరల్లో నిల్వ ఉండి నేల గట్టిగా మారి పంటలకు నష్టం కలిగిస్తుంది. సమతూల్యత ఏది? ప్రతి మొక్కకూ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. రైతులు అవగాహన లోపంతో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల్లో ఉండని పోషకాలను అదనంగా చేర్చి వాడాల్సిన విషయం రైతులకు తెలియదు. ఉదాహరణకు 28 – 28 – 0, డీఏపీలోను పొటాష్ ఉండదు. ఈ ఎరువులు వినియోగించినప్పుడు పైరు ఎదుగుదల దశలో పైపాటుగా యూరియాను వాడాలి. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా పైపాటుగా కూడా వాడుతుండడంతో ఎరువుల్లో పోషకాలు సరిగ్గా మొక్కకు చేరక వృథా అవుతున్నాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని రైతులు గుర్తించకపోవడంతో పంటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. సేంద్రియ ఎరువులు తప్పని సరి రైతులు రసాయన, సేంద్రియ ఎరువులు సగం మోతాదులో వాడాల్సి ఉంది. కేవలం రసాయన ఎరువులే వాడటం వల్ల భూ సారం తగ్గిపోయి నిస్సారంగా మారుతుంది. మొదట్లో బాగానే దిగుబడులు వచ్చినా క్రమంగా భూ సారం తగ్గి దిగుబడులు రావు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల బరువు నేలలు గుళ్ల బారి వేర్లు చక్కగా పెరగటానికి సహాయపడుతుంది. అవగాహన కల్పిస్తున్నాం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మోతాదుకు మించి ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తున్నాం. ఏ పంటకు ఏ సమయంలో ఎంత ఎరువు వాడాలి అనేది తెలిస్తే పంట దిగుబడిలో ప్రయోజనం కనిపిస్తుంది. ఆ దిశగా రైతులకు సూచనలు ఇస్తున్నాం. అంతేకాకుండా భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. – ప్రసన్నలక్ష్మి, ఏఓ -
రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 10,084
సాక్షి, హైదరాబాద్: దేశంలో రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.10,084 అని నాబార్డు తేల్చింది. 2012–13లో ఇది రూ.6,426 కాగా, 2018–19 నాటికి రూ.10,084కు పెరిగిందని తెలిపింది. అయితే సన్న చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతుల ఆదాయం మాత్రం అంతగా లేదని పేర్కొంది. ఈ మేరకు పరిశోధనాత్మక అధ్యయన నివేదికను తాజాగా విడుదల చేసింది. పంటలు, పశు సంపద, వ్యవసాయేతర వ్యాపారం వంటి అంశాలను కూడా అధ్యయనంలో పరిశీలించారు. ‘మొత్తంగా పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయం వాటా 38 శాతం కాగా, పశు సంపద ద్వారా వచ్చే ఆదాయం వాటా 16 శాతంగా ఉంది. వ్యవసాయేతర రంగాల ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. కాగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన పంజాబ్, హరియాణాతో పాటు జార్ఖండ్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైతుల నెలవారీ ఆదాయం అత్యధికంగా ఉంది. భూ పరిమాణం పెరిగినప్పుడు, వ్యవసాయ కార్యకలాపాల (పంటల ఉత్పత్తి, జంతువుల పెంపకం) ద్వారా రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతోంది. పెద్ద రైతులకు అంటే 25 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతులకు వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 91 శాతం, కాగా చిన్న సన్నకారు రైతులకు ఇలా వచ్చే ఆదాయం కేవలం 28 శాతమే. ఈ విధంగా రైతు భూ పరిమాణాన్ని బట్టి ఆదాయంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఓబీసీ, ఇతర వర్గాల ఆదాయంతో పోలిస్తే, ఎస్సీ, ఎస్టీ రైతు కుటుంబాల ఆదాయం తక్కువగా ఉంది..’అని నాబార్డు నివేదిక వెల్లడించింది. భవిష్యత్ తరాలు వ్యవసాయానికి దూరం ‘భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మొగ్గు చూపడం లేదు. 63 శాతం మంది రైతులు తమ భవిష్యత్ తరం వ్యవసాయంలో ఉండాలని కోరుకోవడం లేదు. వ్యవసాయం లాభసాటి వృత్తి కాదని భావిస్తున్నారు. అందుకే కొత్త తరం వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయం చేయడం రిస్్కగా వారు భావిస్తున్నారు. వ్యవసాయ భూపరిమాణం తగ్గడం, పెట్టుబడి ఖర్చులు పెరగ డం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అలాగే వ్యవసాయానికి కీలకమైన కూలీల కొరత కూడా అనాసక్తికి కారణంగా ఉంది. మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి కూడా భవిష్యత్ తరం వ్యవసాయానికి దూరంగా ఉండటానికి కారణంగా కన్పిస్తోంది. వ్యవసాయంలో సరైన ఆదాయం రాకపోవడంతో, మెరుగైన భవిష్యత్తు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. అంతేకాదు గౌరవం, సామాజిక హోదా కూడా ఉండటం లేదు..’అని పేర్కొంది. లాభదాయకం కాదనే భావన.. ‘వ్యవసాయం లాభదాయకం కాదని రైతులు భావిస్తున్నారు. మార్కెటింగ్ సహా పటిష్టమైన సేకరణ వ్యవస్థ లేకపోవడం, మద్దతు ధరలు సరిగా లేకపోవడంతో వ్యవసాయంపై అనాసక్తి చూపిస్తున్నారు. 62 శాతం మంది రైతులు ఇప్పటికీ తక్కువ ధరకు స్థానిక విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. 50 ఏళ్ల వయస్సున్న రైతుల్లో 70 శాతం మంది వరి సాగును కొనసాగిస్తున్నందున పంటల సాగులో వైవిధ్యం ఉండటం లేదు. కూరగాయలు, పండ్ల సాగు ద్వారా రైతుల్లో ఆదాయ ఉత్పత్తి గత 30 సంవత్సరాలలో తక్కువగా ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది..’అని నాబార్డు తెలిపింది. -
వరుణుడు కరుణిస్తాడని...కలవరపెడుతున్న వానాకాలం
మంచిర్యాలఅగ్రికల్చర్: జూన్ వచ్చిందంటే చాలు అన్నదాతలు వానాకాలం సాగు పనుల్లో బిజీగా కనిపిస్తారు. కానీ.. ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. తొలకరి కోసం నేటికీ రైతులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ఆలస్యమవుతుండగా అదునుదాటుతుందని ఆందోళన చెందుతున్నారు. వరుణుడు కరుణించకపోతాడా.. అని పలువురు రైతులు ఎప్పటిలాగే మృగశిరకార్తె (మిరుగుకార్తె) నుంచి పొడి దుక్కుల్లోనే విత్తనాలు వేస్తున్నారు. ఇంకా వానలు కురియ క పోవడంతో వేసిన విత్తనాలు దుక్కుల్లోనే మాడి పోతుండగా, మరోసారి విత్తనం వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని దిగులు చెందుతున్నారు. ఈ సమయానికే జిల్లాను రుతుపవనాలు తాకాల్సి ఉంది. కానీ ఇంకా ఎండలు తగ్గక రైతన్నను వానాకాలం కలవరం పెడుతోంది. వానాకాలం ఆరంభమై పక్షం రోజులు గడిచినా వర్షాలు పడలేదు. దీంతో అన్నదాత గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో ఇప్పటికే కొన్ని మండలాల్లో పత్తి విత్తనాలు వేస్తున్నారు. కాగా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి భూమిలో తేమ శాతం పెరిగితేనే విత్తనాలు వేయాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అడుగంటుతున్న జలాశయాలు జిల్లాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం ఈదురుగాలులు, మబ్బులు పడుతున్నా వర్షాలు మాత్రం కురవడం లేదు. మృగశిర కార్తె బుధవారంతో ముగుస్తుండగా గురువారం నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం కానుంది. ఈ పాటికి జోరువర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగి పొర్లుతుండాలి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో కొత్తనీరు చేరి జలమట్టం క్రమేపి పెరుగుతుండాలి. ఇందుకు భిన్నంగా ఇంకా ఎండలు మండుతుండగా జలాశయాలు అడుగంటిపోతున్నాయి. 94శాతం లోటు వర్షపాతం ఈసారి 3.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. కానీ.. ఇప్పటివరకు 7వేల ఎకరాల వరకు పత్తి విత్తుకున్నట్లు తెలుస్తోంది. ఆశించిన వర్షాలు కురిస్తే ఈ సమయానికి 50వేల ఎకరాల వరకు విత్తనాలు వేసుకోవాల్సి ంది. గతేడాది ఇదే సమయానికి 45 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ ఏడాది సాధారణ స్థాయి వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతుండగా ప్రస్తుత పరిస్థితులు రైతుల్లో గుబులు రేపుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో సగటున 119 మిల్లీమీటర్ల వర్షపాతం కురువగా, ఈ ఏడాది 07 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఈ నెల 20వరకు సాధారణ వర్షపాతం 101.7 మిల్లిమీ టర్లు కురవాల్సి ఉండగా 6.2 మిల్లిమీటర్లు మాత్రమే కురిసింది. 94 శాతం లోటు వర్షపాతం నెలకొంది. మృగశిర కార్తె ఆరంభానికి ముందే ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఆ తర్వాత చినుకు పడక విత్తనం మొలకెత్తక ఆదిలోనే నష్టాలు చవి చూశారు. తేమ లేకుంటే ప్రమాదమే.. నేలలో తేమ లేనిదే విత్తనం వేసుకోవద్దని వ్యవసాయశాఖ ఓ వైపు హెచ్చరిస్తున్నా రైతులు విత్తనాలు వేస్తూనే ఉన్నారు. రెండు, మూడు భారీ వర్షాలు కురిసి 60–70శాతం తేమ నేలలో ఉంటేనే విత్తుకోవాలంటున్నారు. పత్తి, కంది, వరి, మొక్కజొన్న పంటలు విత్తుకునేందుకు వచ్చే నెల వరకు సమయం ఉందని చెబుతున్నారు. దుక్కి వేడి తగ్గకుండానే విత్తనాలు విత్తుకోవడం మంచిది కాదని పేర్కొంటున్నారు. విత్తిన ఐదురోజుల వరకు వాన పడకుంటే విత్తనం చెడిపోతుందని చెబుతున్నారు. కొన్ని విత్తనాలు మొలకెత్తినా మొలక దశలోనే మాడిపోతాయని పేర్కొన్నారు. ఇలా.. మొలక ఎండిపోయిన స్థానంలో రెండుమూడుసార్లు విత్తుకుంటే అదనపు ఖర్చుతో పాటు మొక్కల ఎదుగుదలలో వ్యత్యాసమేర్పడి కలుపు తీయడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వానలు పడుతయనుకున్న నిరుడు మిరుగుకార్తెలోనే ప త్తి విత్తనం వేసిన. ఈసారి నాలుగురోజులు ఆలస్యంగా ఎనిమిదెకరాల్లో విత్తనాలేసి న. వారంరోజులైనా వర్షాలు పడుతలేవు. విత్తనాలు మొలకెత్తలేదు. ఎండలకు దుక్కిలోనే మాడిపోతున్నయ్. ఈ రెండుమూడ్రోజు ల్లో వాన పడకుంటే నేను పెట్టిన పెట్టుబడి రూ.35 వేల దాకా నష్టపోవుడే. – ముదరకోల సదయ్య, రైతు, నెన్నెల తొందరపడి విత్తనాలు వేయొద్దు తుఫాన్ కారణంగా రుతుపవనాల రాక కొంత ఆలస్యమైంది. ఈనెల 25నుంచి ఉ మ్మడి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రైతులు ఒకట్రెండు భారీ వర్షాలు కురిసి 60–70 శాతం తేమ ఉన్న తర్వాతే విత్తనాలు వేసుకోవాలి. పత్తి విత్తేందుకు సమయం ఉంది. తొందరపడి విత్తుకుంటే మొలక రాదు. – శ్రీధర్చౌహాన్, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త -
కౌలు రైతులకు చకచకా కార్డుల పంపిణీ
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు పెద్దఎత్తున కౌలు కార్డులు జారీ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సీసీఆర్సీ (క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్స్) మేళాలు నిర్వహిస్తోంది. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వహించేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్ల)ను ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీకేలతో అనుసంధానించింది. ప్రతి కౌలు రైతుకు రుణంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న భావనతో కౌలుదారులందరికీ పంట సాగు హక్కు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ఏడాది ఇప్పటికే 1.10 లక్షల మంది కౌలు రైతులకు కౌలు కార్డులను అధికారులు జారీ చేశారు. మిగిలిన వారికి జారీ చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారుల వివరాలను రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్లో వైఎస్సార్ రైతు భరోసా కింద ఈ ఏడాది తొలివిడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షణ కవచం సీసీఆర్సీ చట్టం రాష్ట్రంలో 76.21 లక్షల మంది రైతులు ఉండగా.. వీరిలో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారనే దానిపై వేర్వేరు అంచనాలు ఉన్నాయి. గతంలో కౌలుదారులు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ ఫలాల కోసం నానాఅగచాట్లు పడేవారు. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నా.. బ్యాంకులు నిబంధనల పేరుతో మొండిచేయి చూపేవి. ఈ నేపథ్యంలో కౌలుదారులకు మేలు చేయాలన్న సంకల్పంతో 2019లో తెచ్చిన పంట సాగుదారుల హక్కు పత్రాల (సీసీఆర్సీ) చట్టంతో 11 నెలల కాల పరిమితితో ప్రభుత్వమే కౌలు కార్డులు జారీ చేస్తోంది. వీటిద్వారా కౌలు రైతులకు నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. వీరు పండించిన పంటలను ఈ క్రాప్ ఆధారంగా ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. నూరు శాతం కౌలు కార్డుల జారీ లక్ష్యం సీసీఆర్సీ మేళాలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 1.10 లక్షల మందికి కౌలు కార్డులు జారీ చేశాం. భూ యజమానులు సహకరిస్తే మరింత మందికి మేలుచేసే అవకాశం ఉంటుంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా పంట రుణాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందచేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ