Andhra Police Rescue Puppies After Dog Seeks Help - Sakshi
Sakshi News home page

వరదలో చిక్కిన కుక్కపిల్లలు.. పోలీసుల చుట్టు తిరుగుతూ.. ఆ తల్లి ఏం చేసిందంటే..?

Published Sun, Jul 30 2023 4:13 PM | Last Updated on Sun, Jul 30 2023 4:52 PM

Andhra Police Rescue Puppies After Dog Seeks Help - Sakshi

ఆత్మీయత.. అనురాగం.. అనుబంధం.. వీటిని మించి.. అమ్మంటే అంతులేని ప్రేమ. బిడ్డలపై అమ్మ ప్రేమకు సరితూగగలదేది ఈ లోకంలో ఉండదు. తనకోసం గాక పిల్లల కోసం తమను అర్పించగల కరుణామూర్తి తల్లి. ఈ స్వభావం సృష్టిలో అన్ని జీవుల్లోనూ కనిపిస్తుంది. జంతువులు సైతం పిల్లల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.

మాతృప్రేమను చాటే ఓ ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. వరదల్లో చిక్కుకున్న తన పిల్లల కోసం ఓ కుక్క పడే యాతన ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు బీబీత్సం సృష్టించాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో వరదలు సంభవించాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యల్లో నిమగ్నమైన పోలీసుల చుట్టే ఓ కుక్క తిరిగింది. ఏదో చెప్పాలన్నట్లు ఆవేదన చెందుతూ పోలీసుల వంకే దీనంగా చూస్తూ ఏడిచింది.  దీంతో పోలీసులు కుక్క ఇంతలా వెంబడించడానికి గల కారణమేంటని ఆలోచించారు. దాన్ని అనుసరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులను ఆ కుక్క వరదల్లో మునిగిన ఓ ఇంటి వైపుకు తీసుకెళ్లింది. 

అక్కడే పోలీసులు ఆ కుక్క పిల్లలను గుర్తించారు. వరద నీటిలో బురదలో చిక్కుకున్న కుక్క పిల్లలు ఆ ఇంటిలో ఉన్నాయి. వెంటనే వాటిని బయటకు తీశారు. వాటికి అంటుకున్న బురదను శుభ్రపరిచి కుక్కకు అందించారు. పిల్లలను ముద్దాడిన తల్లి కుక్క పోలీసుల సహాయానికి కృతజ్ఞత చెప్పుకున్నట్లు సంతోషాన్ని వెలిబుచ్చింది.

దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు తల్లి ప్రేమను ప్రతిబింబించే సాంగ్‌ను జోడించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు చేసిన సహాయానికి జంతుప్రేమికులు ధన్యవాదాలు తెలిపారు. జంతువుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించిన విజయవాడ సిటీ పోలీసులను రాష్ట్ర డీజీపీ కే.వి. రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశంసించారు.  

ఇదీ చదవండి: నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement