
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకు కోవిడ్ రికవరీ రేటు పెరుగుతోంది. కరోనా బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. దీంతో రికవరీ రేటు జాతీయ సగటు కంటే.. మన రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదైంది. దేశంలో జూలై 1 నాటికి 96.95 శాతంగా ఉంటే.. మన రాష్ట్రంలో 97.31 శాతంగా రికవరీ రేటు నమోదైంది. ఒక దశలో రాష్ట్రంలో రోజుకు 24 వేల కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పుడు 3 వేల కేసులే వస్తున్నాయి. అలాగే రికవరీ రేటు కూడా 84 శాతానికి పడిపోయిన పరిస్థితి నుంచి.. ఇప్పుడు 97.31 శాతానికి చేరింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ రికవరీ రేటు నమోదు కావడం గమనార్హం.
పాజిటివ్ వచ్చిన వాళ్లు కూడా ఆస్పత్రులకు వచ్చి చికిత్స పొందాల్సిన అవసరం రాకుండానే కోలుకుంటున్నారు. ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే హోం ఐసొలేషన్ కిట్లు అందిస్తోంది. 104 కాల్ సెంటర్లో పేర్లు నమోదు చేసుకున్న డాక్టర్లు.. ఇంట్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఫోన్ చేసి సలహాలు, సచనలు ఇస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం 104కు కాల్ చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ బెడ్స్ ప్రతి జిల్లాలోన పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు ఇలా
రాష్ట్రం | రికవరీ రేటు (శాతంలో) |
ఆంధ్రప్రదేశ్ | 97.31 |
తెలంగాణ | 97.27 |
తమిళనాడు | 97.14 |
పంజాబ్ | 96.78 |
ఒడిశా | 96.13 |
కర్ణాటక | 96.08 |
కేరళ | 96.08 |
మహరాష్ట్ర | 96.02 |
దేశ సగటు | 96.95 |
Comments
Please login to add a commentAdd a comment