
సాక్షి, తిరుమల: తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. గురువారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కినట్టు తెలుస్తోంది. నడకదారిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద చిరుత బోనులో చిక్కింది. ఇక, 50 రోజుల వ్యవధిలో అధికారులు మూడు చిరుతలను బంధించడం విశేషం.
వివరాల ప్రకారం.. ఇటీవల లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాడి చేసిన ప్రాంతంలోనే అధికారులు బోన్లు పెట్టడంతో మూడు రోజుల క్రితమే ఓ చిరుత బోనులో చిక్కింది. ఇక, ఆ ప్రాంతానికి సమీపంలోనే అధికారులు చిరుతల కోసం మూడు చోట్ల బోన్ల ఏర్పాటు చేశారు. మోకాలిమెట్టు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లను పెట్టారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మరో చిరుత లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బోనులో చిక్కింది. ఇదిలా ఉండగా.. 50 రోజుల వ్యవధిలో అధికారులు మూడు చిరుతలను బంధించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్సిగ్నల్