
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహ ప్రతిష్టకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని.. కానీ ఐదుగురికి మించి వేడుకల్లో పాల్గొనకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను హైకోర్టు సమర్థించింది. (చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి)
పబ్లిక్ ప్రాంతాల్లో విగ్రహాలు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన హక్కును నిరాకరించలేమని.. అదే సమయంలో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కునూ కాదనలేమని వ్యాఖ్యానించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్టకు అనుమతి నిరాకరిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.