వెన్నుపోటుపై జనాగ్రహం! | AP People Protest Against Chandrababu Govt | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుపై జనాగ్రహం!

Jun 5 2025 11:44 AM | Updated on Jun 5 2025 11:44 AM

 AP People Protest Against Chandrababu Govt

నమ్మి ఓటేసిన ప్రజలకు వెన్ను చూపారు..  

వంచన మీ నైజం.. మిమ్మల్ని ఎలా నమ్మేది జనం! 

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం 

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీలు 

వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు

సాక్షి నెట్‌వర్క్‌: ‘కూటమి ప్రభుత్వం ఏడాది పాలనంతా నయవంచన, ద్వేషం, కక్షపూరితం. నమ్మి ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. సూపర్‌ సిక్స్‌ పథకాలని ఊదరగొట్టి.. ఉత్తచేయి చూపారు. అందుకే ఏడాదిలోనే కూటమి ప్రభుత్వాన్ని జనం ఛీ కొడుతున్నార’ని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. కూటమి ఏడాది పాలన.. ప్రజలకు చేసిన మోసంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో వేలాది మందితో ర్యాలీలు చేపట్టారు. దగా ప్రభుత్వ తీరును ఎండగడుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.   

విజయనగరం జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన గళం వినిపించారు. స్థానిక సీఎంఆర్‌ కూడలి నుంచి  తహసీల్దార్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ సాగింది. అనంతరం ఇన్‌చార్జి తహసీల్దార్‌కు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, ఎంపీపీ మామిడి.అప్పలనాయుడు, జెడ్పీటీసీ కెల్ల శ్రీనివాసరావు,  వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు  పాల్గొన్నారు.  

చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైంది. చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురం పెట్రోల్‌ బంక్‌ నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా మూడురోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు హాజరైన ర్యాలీలో  దాదాపు 5 వేల మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వ మోసపూరిత పాలన, ఇచ్చిన హామీలు అమలుచేయక పోవడం తగదంటూ తహసీల్దార్‌ ఎన్‌.రాజారావుకు వినతిపత్రం అందజేశారు.  

గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్‌ విగ్రహం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు వెన్నుపోటు దినం ర్యాలీ సాగింది. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో పార్టీ శ్రేణులు, ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తక్షణమే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ పథకం, మహిళలకు ఉచిత బస్సు వంటి హామీలు అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.  ఐదు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు,  నాయకులు పాల్గొన్నారు. 

నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ పోస్టాఫీస్‌ నుంచి ప్రారంభమైన వెన్నుపోటు దినం ర్యాలీ   తహసీల్దార్‌ కార్యాలయం వరకు సాగింది.అబద్ధపు హామీ లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. కూటమి మోసపూరిత పాలనపై తహసీల్దార్‌ తాడ్డి గోవింద్‌కు వినతిపత్రం అందజేశారు.  

రాజాం నియోజకవర్గ కేంద్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. రాజాం పట్టణ కేంద్రంలో నిర్వహించిన వెన్నుపోటుదినం కార్యక్రమానికి వేలాదిగా వైఎ స్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. పాలకొండ రోడ్డులోని సన్‌రైజ్‌ ఆస్పత్రి నుంచి శ్రీకాకుళం రోడ్డులోని తహసీల్దార్‌ కార్యాలయం వరకు  ర్యాలీ నిర్వహించారు.  అనంతరం తహసీల్దార్‌ ఎస్‌.కె.రాజుకు వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి తలే రాజేష్, విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు.  

హామీలను నమ్మి ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఏలే హక్కు లేదని, సీఎం డౌన్‌డౌన్‌ అంటూ ఎస్‌.కోట నియోజకవర్గ ప్రజలు నినదించారు. ఎస్‌.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో ఆకుల డిపో నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది.  కార్యక్రమంలో పార్టీ నేతలు శోభాహైమావతి, వేచలపు చినరామునాయుడు, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.  

టీడీపీ కూటమి పాలనలో కష్టాలు, నష్టాలు, అదనపు విద్యుత్‌ చార్జీలు, ఇంటి పన్నుల భారం తప్ప చేసినది శూన్యమని ప్రజలు విమర్శించారు. మాజీ  ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో సాగిన వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొని కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన తెలిపారు.  వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి  తహసీల్దార్‌ శ్రీనుకు వినతిపత్రం అందజేశారు.  

టీడీపీ అక్రమాలకు కొమ్ముకాస్తున్న బీజేపీ 
కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. టీడీపీ చేపడుతున్న రెడ్‌బుక్‌ పాలన వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నా, బీజేపీ నాయకులు చూసీచూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటు. సూపర్‌సిక్స్‌ హామీలు అమలు చేయకపోడంతో ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారు. 

– బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ  

నమ్మించి ‘వెన్నుపోటు’ 
ఉత్తుత్తి హామీలతో నమ్మించారు. ఓట్లు దండుకున్నారు. తీరా హామీలు అమ లు చేయమని అడి గిన జనంపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఇది అన్యాయం. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలను వెంటనే అమలుచేయాలి. ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకోవాలి.  
– కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, ఎస్‌.కోట

కూటమి పాలనలో ప్రజలకు కష్టాలే..  
అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్‌ వ్యవస్థను రద్దుచేసి వేలాది మందిని నిరుద్యోగులుగా మార్చింది. ఇప్పుడు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసింది. చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడుతోంది. ప్రజాసంక్షేమ పథకాలకు కోత పెట్టింది. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు, నష్టాలే ఎదురవుతున్నాయి. ఏడాది పాలనపై ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతోంది.  
– శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే

మేనిఫెస్టో అంటే లెక్క లేదు.. 
ఎన్నికల మేనిఫెస్టో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లెక్క లేదు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.     
– బొత్స సత్యనారాయణ,శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement